ఇటుకరాయి తలపై పడి మహిళ మృతి
సీఎస్పురం(పామూరు): తిరుపతిలో గృహ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో మహిళా కూలీ తలపై ఇటుకరాయి పడటంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా క్షతగాత్రురాలు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాలు.. మండల కేంద్రమైన సీఎస్పురం వడ్డెపాలేనికి చెందిన బండారు అంజలి, ఆమె భర్త అంకాలు తిరుపతిలో భవన నిర్మాణ పనులకు వెళ్లారు. సోమవారం సాయంత్రం పని చేస్తున్న సమయంలో అంజలి తలపై ఇటుక పడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని తిరుపతిలోని ఓ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంజలి మృతితో వడ్డెపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇటుకరాయి తలపై పడి మహిళ మృతి


