ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
● టీచర్స్ గిల్డ్ డిమాండ్
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 136 ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 10,500 మంది పేద విద్యార్థులకు సంబంధించి బెంచీలు, ప్యానల్ బోర్డులు, స్పోర్ట్స్ మెటీరియల్, ఎఫ్ఎల్ఎన్ కిట్లు ఇంత వరకు ప్రభుత్వం సప్లై చేయలేదన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే 593 మంది ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించి ఇంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ఆరోగ్య కార్డులు మంజూరు కాలేదన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ సర్వీసులో మరణించిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల జీవో విడుదల చేయలేదని, ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పూర్తి సర్వీస్ను, ప్రస్తుతం పని చేస్తున్న తెలుగు, హిందీ సంస్కృత, పీఈటీలకు పదోన్నతి సౌకర్యం కల్పించకపోవడం, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.
ఒంగోలు టౌన్: దేశం కోసం త్యాగాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సీనియర్ కమాండెంట్ సంజీత్ కుమార్ పిలుపునిచ్చారు. తీరం, తీర ప్రాంతాల పరిరక్షణతో పాటుగా మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్–2026 పేరిట చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరింది. జిల్లా పోలీసు అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు సీఐఎస్ఎఫ్ జవాన్లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాండర్ సంజీత్ కుమార్ మాట్లాడుతూ జనవరి 28వ తేదీ కోల్కతా నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఈ నెల 23వ తేదీ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ముగిస్తుందని తెలిపారు. 100 మందికి పైగా సైకిలిస్టులతో నిర్వహిస్తున్న ఈ సైకిల్ ర్యాలీ ప్రతి రోజూ 150 నుంచి 160 కిలోమీటర్ల వరకు కొనసాగుతుందని వివరించారు. మొత్తం 6500 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో మహిళా జవాన్లు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలకు తీర భద్రత ప్రాధాన్యత, దేశ రక్షణలో వారి పాత్ర, భద్రతా దళాలకు తీర ప్రజల సహకారం ర్యాలీ ద్వారా వివరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండర్ విక్రమ్ సింగ్, ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ కృష్ణ, ట్రాఫిక్ సీఐ జగదీష్, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణా రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.


