పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ముండ్లమూరు: భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఉల్లగల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని బసాపురం గ్రామానికి చెందిన మోత్కూరి సుబ్బారావు (47) 20 సంవత్సరాల క్రితం ఉల్లగల్లుకు చెందిన సుభాషిణిని వివాహం చేసుకుని ఉల్లగల్లులోనే కాపురం ఉంటున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్తతో భార్య సుభాషిని మద్యం మానుకోమని చెప్పింది. వరి పొలంలో మందు పిచికారీ చేయడానికి వెళ్లిన భర్త.. భార్య నీరు తీసుకొచ్చేలోపు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు సుబ్బారావును దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించేలోపే సుబ్బారావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


