దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలా..?
పవిత్రమైన వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు చంద్రబాబు మోసాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే టీటీడీ లడ్డూతో రాజకీయం చివరకు పెట్రో బాంబుల సంస్కృతికి కూడా తెరలేపిన చంద్రబాబు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
చీమకుర్తి: భక్తిశ్రద్ధలతో తిరుపతి వెంకటేశ్వరస్వామిని కొలుచుకునే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చీమకుర్తిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలతో రాజకీయాలు చేయొచ్చుగానీ.. పవిత్రమైన దేవదేవుడిని రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం దారుణమన్నారు. ఎన్డీడీబీ, సిట్ సంస్థలు లడ్డూలో కల్తీ లేదని ధ్రువీకరించినప్పటికీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైఎస్సార్ సీపీపై బురద చల్లేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ప్రజలు చీత్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు చంద్రబాబు అమలు చేయకపోగా, ఎన్నికలప్పుడు అతను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. లడ్డూ మీద భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా వాల్పోస్టర్లు వేయించటం, చివరకు పెట్రో బాంబుల సంస్కృతిని కూడా తీసుకురావడం చంద్రబాబుకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని ఎల్లకాలం మోసపూరిత రాజకీయాలు చేయలేరని, చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని వైఎస్సార్ సీపీ నాయకులు ఆలయాలలో పూజలు చేస్తుంటే కూడా తప్పుడు కేసులు పెట్టడం అతని కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.


