● కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఒంగోలు వన్టౌన్: మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ కాటమరాజు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టారని తెలిపారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ప్రస్తుత మార్కాపురం ప్రాంతానికి, కనిగిరిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన యాదవుల ఆరాధ్యదైవం కాటమరాజు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, అఖిల భారత యాదవ మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి చల్లా హరినారాయణ మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో ప్రజల ఆరాధనతో నిలిచిన కాటమరాజు గుడి ఆయన త్యాగాలు, పోరాటాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఆ ప్రాంత చరిత్ర, విశ్వాసం కాటమరాజుతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నందున మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కాటమరాజు ప్రాముఖ్యత ఎంతో ఉందని, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను కొనియాడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో యాదవుల హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మార్కాపురానికి కాటమరాజు జిల్లా నామకరణం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది చల్లారాజాధనవర్మ, బీసీ సంక్షేమ సంఘం బంకా చిరంజీవి, యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపికృష్ణ యాదవ్, బొడ్డు వెంకటేశ్వర్లు, దూళ్ల అప్పారావు, జడ బాలనాగేంద్ర, మిరియం అంజిబాబు, నాగం శేషయ్య, పెద్దన్న, కుట్టుబోయిన కోటేశ్వరరావు, మందపల్లి శ్రీనివాసరావు, శివాజీ, కోళ్లిబోయిన నాగేశ్వరరావు, దాసరి సుందరం, బత్తుల ప్రసాద్, ఠాగూర్, బాలకోటయ్య, ఆవుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రీవెన్స్లో డీఆర్ఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.


