ఒంగోలు: రాష్ట్ర స్థాయి ఓపెన్ ఛాలెంజ్ లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు ఈనెల 7, 8 తేదీల్లో స్థానిక హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు లాన్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మోహన్రెడ్డి, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.రాఘవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెన్ ఓపెన్, 40 ప్లస్, 50 ప్లస్, 60 ప్లస్, 70 ప్లస్ విభాగాల్లో జరిగే ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటారని, విజేతలకు విలువైన నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఉప విద్యాశాఖాధికారులకు ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా నోడల్ ఆఫీసర్ ఏ.సుబ్బారెడ్డి, మార్కాపురం జిల్లా పరిశీలకులు ఎన్.గీత, పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులు బి.లింగేశ్వరరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులందరూ నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
ఒంగోలు సిటీ: జిల్లాలో గురువారం నిర్వహించిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ తెలుగు పరీక్షలో 2518 మంది విద్యార్థులకు గాను 2133 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ పరీక్షలో 27 మంది విద్యార్థులకు గాను 23 మంది, ఉర్దూ పరీక్షలో 10 మంది విద్యార్థులకు గాను 10 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు గీత అకస్మాత్తుగా మార్కాపురం, గిద్దలూరు లోని ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తక్షణమే ఆర్జేడీ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్ల నుంచి విద్యార్థులు లేక వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ, జీవో నంబర్ వన్ ప్రకారం మిగులుగా ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 108 మంది, స్కూల్ అసిస్టెంట్ గణితం 8 మంది, సోషల్ ఆరుగురు, సైన్స్ నలుగురు, తెలుగు పండితులు ఆరుగురు, హిందీ పండిట్లు ఐదుగురు, పీఈటీలు ఐదుగురు, క్రాఫ్ట్ డ్రాయింగ్ ముగ్గురు, నాన్ టీచింగ్ స్టాఫ్ 20 మంది అదనంగా ఉన్నారన్నారు. వీరికి సీనియార్టీ లిస్టు రూపొందించి ఆర్జేడీ బీ లింగేశ్వర్ రెడ్డి ఏప్రిల్ చివరిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.
మార్కాపురం: మార్కాపురం జిల్లా హౌసింగ్ పీడీగా ఎంవీ మోహన్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు హౌసింగ్ ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై మార్కాపురం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టరుగా వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి కలెక్టర్ రాజాబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న గృహాలను త్వరగా పూర్తిచేయిస్తానని తెలిపారు. హౌసింగ్ డీఈ పవన్కుమార్, ఏఈలు సిబ్బంది ఆయనను కలిశారు.


