మర్రిపూడి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిలంకూరు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిలంకూరు గ్రామానికి చెందిన డాలు ఏడుకొండలు తన చిన్నాన్న డాలు నరసయ్య(62)లు కలిసి ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఎదురుగా గురునాథం, యోహోషువాలు వస్తున్నారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో నలుగురూ చెల్లాచెదరుగా పడిపోయారు. పచ్చాకు మేసీ్త్రగా పనిచేసే నరసయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుకొండలు, యెహోషువాలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రగాయాలైన ఏడుకొండలు, యెహోషువాలను వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం కోసం నరసయ్య మృతదేహాన్ని కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు.


