సింగరాయకొండ:
మండల కేంద్రంలోని బాలయోగినగర్లో నివసిస్తూ కనిగిరిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పోట్లూరి హరిబాబు నివాసంలో, కందుకూరు రోడ్డులోని దేవరపల్లి రాఘవయ్య కాలనీ 3వ లైనులో నివసిస్తూ ఒంగోలు జీజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సివిల్ సర్జన్ దువ్వూరి అనిల్కుమార్ నివాసంలో దొంగలు పడ్డారు. సుమారు రూ.14 లక్షల విలువైన 91 గ్రాముల బంగారు నగలు, రూ.2.50 లక్షల విలువైన కేజీ వెండి వస్తువులు, రూ.1.40 లక్షల నగదు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దేవరపల్లి రాఘవయ్య కాలనీలో నివసిస్తున్న డాక్టర్ అనిల్కుమార్ ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బెంగళూరులోని చెల్లెలు వద్దకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపునకు ఉన్న తాళం కోసి ఉంది. దొంగలు లోపలికి ప్రవేశించి ప్రొఫెషనల్ దొంగల్లా బీరువాను ఇనుప రాడ్డుతో తెరిచి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీ జరిగిందని బాధితుడి బంధువులు తెలిపారు. అంతేగాకుండా అతను ఎప్పటి నుంచో దాచుకున్న సుమారు రూ.50 వేల విలువైన 7 విదేశీ మద్యం బాటిళ్లను కూడా చోరీ చేసినట్లు తెలిపారు. మరో చోరీ ఘటనలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు ఉద్యోగరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నాడు. సింగరాయకొండలోని బాలయోగినగర్లోని ఇంటిలో సామగ్రి మినహా విలువైన వస్తువులేమీ లేవు. దీంతో విలువైన వస్తువులు పోనప్పటికీ.. దొంగ ఇంటి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోని బీరువా తలుపులు ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని సీక్రెట్ లాకర్లు కూడా ధ్వంసం చేశాడు. వారం క్రితం ఈ ప్రాంతంలో ఒక కుర్రాడు రెక్కీ నిర్వహించాడని, అతడిని అనుమానించి ప్రశ్నించగా.. నేను దొంగను అని చెప్పడంతో పట్టుకునే ప్రయత్నం చేశామని, కానీ, పారిపోయాడని స్థానికులు తెలిపారు. అతని వద్ద పదునైన ఇనుప వస్తువు ఉందని తెలిపారు. ఒకే రోజు రెండు దొంగతనాలు జరగడంతో పాటు భారీగా బంగారం, వెండి, నగదు చోరీ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటన స్థలాలను సీఐ హజరత్తయ్య పరిశీలించారు.
రూ.18 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరణ
డాక్టర్ ఇంట్లో బంగారం, వెండి, నగదు చోరీ
పోలీసు ఇంట్లో డోర్లు, బీరువా, లాకర్లు ధ్వంసం


