ఒంగోలు సబర్బన్: విద్యుత్ రంగంలో కేంద్ర, రాష్ట్ర పథకాలు సక్రమంగా అమలు చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. శుక్రవారం ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పురోగతి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వేసవిలో విద్యుత్ కోతల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వీడాలని సూచించారు. పీఎం కుసుమ్ పథకం అమలు కోసం భూ సేకరణ పూర్తి చేయాలని అదేశించారు. అనంతరం ఏపీ ట్రాన్స్ కో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొత్త ఈహెచ్టీ సబ్ స్టేషన్ ప్రతిపాదనలు, నిర్మాణ పనుల పురోగతి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్ఈ రాజగోపాల్, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ సుబ్బారావు, ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: మద్దిపాడులో హత్య కేసు చేధించినందుకు అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ అవార్డు)కు జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. ఈ అవార్డును ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి జిల్లా పోలీసులకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ హర్షవర్థన్రాజు అవార్డు అందుకున్నారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, రాష్ట్ర సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు.
ద్వితీయ స్థానంలో జీఆర్పీ పోలీసులు...
ఏబీసీడీ అవార్డుల్లో ఒంగోలు జీఆర్పీ పోలీసులు ద్వితీయ స్థానంలో నిలిచారు. గతేడాది నవంబర్ 25వ తేదీ హైదరాబాద్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిన కేకే రామిరెడ్డికి చెందిన 341 గ్రాముల బంగారు నగల బ్యాగ్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన ఒంగోలు జీఆర్పీ పోలీసులు.. కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నెల్లూరు డీఎస్ఆర్పీ జి.మురళీధర్, ఒంగోలు జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సినిమా ఫక్కీలో కేసు ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేసింది. ఈ కేసులో జీఆర్పీ పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. డీజీపీ చేతుల మీదుగా మంగళగిరిలో అవార్డు అందుకున్నారు.
విద్యుత్ అధికారులతో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి


