సంతమాగులూరు(అద్దంకి): బైక్పై వెళ్తున్న యువకుడు లారీని దాటవేసే క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడటంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నార్కెట్పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏల్చూరుకు చెందిన కొండి వెంకట ఆంజనేయులు(19) బైక్పై స్వగ్రామానికి వస్తున్నాడు. హిందూ శ్మశానవాటిక వద్ద ముందు వెళ్తున్న లారీని దాటవేసే క్రమంలో అదుపుతప్పి లారీ ముందు టైరు కింద పడిపోయాడు. చేయి నుజ్జునుజ్జు కాగా తల, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుని తండ్రి వెంకట్రావు ఏడు నెలల క్రితం కన్నుమూశారు. ఇంతలోనే కొడుకు చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఒంగోలు సిటీ: జాతీయ స్థాయిలో నిర్వహించిన పారఖ్ సర్వేక్షణ ఫలితాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు మెరుగుపరచాలని డీఈఓ రేణుక సూచించారు. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పారఖ్ జాతీయ సర్వేక్షణ–2024 ఫలితాలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని క్విస్ కళాశాలలో శుక్రవారం ప్రారంభించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. డీసీఈబీ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఏఎంఓ నాగేంద్ర నాయక్, మార్కాపురం డీవైఈఓ మావిళ్లపల్లి శ్రీను పాల్గొని ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లుగా డైట్ సీనియర్ లెక్చరర్లు విజయకృష్ణ, సర్దార్ పాపారాయుడు శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు రిసోర్స్ పర్సన్లుగా సోమశేఖర్, యామిని, పద్మశ్రీ పాల్గొని వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి మాండలిక విద్యాధికారులు, క్లస్టర్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పాల్గొన్నారు. పారఖ్ జాతీయ సర్వేక్షణలో గుర్తించిన విద్యార్థుల అభ్యాస స్థాయిలు, లోపాల ఆధారంగా పాఠశాలల్లో తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణలో చర్చించారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులంతా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను విశ్లేషించి బోధన విధానాలను మెరుగుపరచడానికి అవసరమైన అవగాహన పొందుతారని నిర్వాహకులు తెలిపారు.


