పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువులో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో నగలు, నగదు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల సమీపంలో మేడికొండ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటోంది. వెంకటేశ్వర్లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా, ఆయన భార్య అడిగొప్పలలో అమ్మవారి ఆలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు మధ్యాహ్న సమయంలో చోరీకి తెగబడ్డారు. ఇంటి యజమాని భోజనానికి రాగా తాళం పగలగొట్టి ఉండటంతో కంగుతిన్నాడు. ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు రూ.1.50 లక్షల నగదు చోరీ అయ్యాయని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ అజయికుమార్, ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు భార్య ఆలయం నుంచి తిరిగి వస్తే చోరీ అయిన సొత్తు పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.


