ఒంగోలు సబర్బన్: సాహిత్యరంగంపై మొల్లమాంబ తనదైన ముద్ర వేశారని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు కొనియాడారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం ప్రకాశం భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నిర్మలజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, పలువురు కవయిత్రులు, శాలివాహన సంఘ ప్రతినిధులు పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ మొల్లమాంబ విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘ గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, జిల్లా అధ్యక్షురాలు పరాంకుశం కృష్ణవేణి, గాయని చల్లా నాగేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. శాలివాహన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులైన ఐలాపురం వెంకయ్య, శ్రీవిక్కీశ్రీ నాగేశ్వరరావు మృతికి సంతాపంగా ఈ కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
వర్ణ దురంహకారంపై సంధించిన బాణం మొల్ల
ఒంగోలు టౌన్: వర్ణ దురంహాకారాన్ని ఎదుర్కొన్న కవయిత్రి మొల్ల నేటి తరానికి ఆదర్శనీయమని ఆర్ఐ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ తీవ్రమైన వివక్షను తిప్పికొడుతూ రామాయణ మహాగ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లను తెలుగుజాతి ఎన్నటికీ మరచిపోదన్నారు. సీ్త్రలు వంటింటికే పరిమితం కావాలని ఆంక్షలు విధించిన రోజుల్లో సీ్త్రలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై పోరాటం చేసి చరిత్రలో వీరవనితగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఏఆర్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
మొల్లమాంబ జీవితం ఆదర్శం
మార్కాపురం: రామాయనాన్ని సరళమైన శైలిలో రాసి ప్రజలకు అందించిన తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శమని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా స్ధానిక తర్లుపాడు రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ.. కడప జిల్లా గోపవరంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన మొల్ల తన సహజ పాండిత్యంతో రామాయణాన్ని తెలుగులో రచించి తొలి తెలుగు మహిళా కవిగా నిలిచారని కొనియాడారు. తాను రాసిన రామాయణాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని, తెలుగు సాహిత్యంలో ఆమె స్థానం అమూల్యమైనదన్నారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురలీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం శాలివాహన సత్రం అధ్యక్షుడు సీహెచ్ మోహన్, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బొగ్గరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి బి.చినఓబులేసు
ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు
జేసీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు


