● రెవెన్యూ అధికారుల సమావేశంలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో సాగదీత ధోరణి సరికాదని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో మంగళవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా దిశగా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 22ఏ కేసులపై మరింత దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి అవసరమైన ఈ–కేవైసీ ప్రక్రియను లోపాలు లేకుండా చేయాలన్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందికే అప్పగించకుండా తహసీల్దార్లు కూడా రెగ్యులరుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి ముందుగా సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువైన నాలుగు వారాల్లోగా 22(ఏ) కేసులను పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ బి.ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ ఇతర అధికారులు పాల్గొన్నారు.


