సర్పంచ్‌లపై కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లపై కక్ష సాధింపు

Mar 18 2026 7:39 AM | Updated on Mar 18 2026 7:39 AM

సర్పంచ్‌లపై కక్ష సాధింపు

బిల్లుల పెండింగ్‌తో

గిద్దలూరు(బేస్తవారిపేట): రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న సర్పంచ్‌లపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భూమా గెస్ట్‌హౌస్‌లో నియోజకవర్గంలోని సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేపీ మాట్లాడారు. సర్పంచ్‌ల హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాస్తోందని, ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు, అంతర్గరోడ్లు, ప్రభుత్వ భవనాల కాంపౌండ్‌లు, పారిశుధ్య పనుల కోసం సర్పంచ్‌లు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లు 15 రోజుల్లోపు తమ తీర్మానాలను అధికారులకు సమర్పించి, ఎంబుక్‌ల రశీదులను తీసుకుని వస్తే చట్టపరంగా తగు చర్యలు తీసుకుందామని చెప్పారు. బకాయిలు వచ్చే వరకు పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బిల్లుల మంజూరుపై సర్పంచ్‌ల

ఆవేదన

పిటికాయగుళ్ల సర్పంచ్‌ నర్రా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌లు భయపడాల్సిన పనిలేదని చట్టపరంగా ముందుకెళ్లి బిల్లులు సాధించుకుందామన్నారు. కందులాపురం సర్పంచ్‌ బత్తుల సూర్యప్రకాష్‌ దాదాపు రూ.కోటి విలువైన పనులు చేస్తే రూ.60 లక్షల వరకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కందులాపురం సెంటర్‌లో అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారని, వైఎస్సార్‌ సీపీ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే దుర్మార్గంగా అడ్డు తగులుతున్నారన్నారు. అర్ధవీడు సర్పంచ్‌ మునగాల వసంత మాట్లాడుతూ.. సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చు చేసి రోడ్ల పనులు చేశామని, రూ.40 లక్షల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధవీడు మండలంలో సర్పంచ్‌లకు తెలియకుండానే, ఎటువంటి తీర్మానాలు తీసుకోకుండానే పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు సర్పంచ్‌లు సమావేశంలో తాము ఎదుక్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే కేపీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే కేపీ ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీలు వేగినాటి ఓసూరారెడ్డి, ఎం వెంకట్రావ్‌, కడప లక్ష్మీదేవి, జెడ్పీటీసీలు సారె వెంకటనాయుడు, పగడాల శ్రీరంగం, బీవీ రాజయ్య, మాజీ ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, రవికుమార్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు బి.ఓబులరావు, ఆవుల శ్రీధర్‌రెడ్డి, సీఆర్‌ఐ మురళి, గొంగటి చెన్నారెడ్డి, నాయకులు దొడ్డంపల్లి కృష్ణారెడ్డి, మానం బాలిరెడ్డి, డాక్టర్‌ బ్రహ్మారెడ్డి, నెమిలిదిన్నె చెన్నారెడ్డి, దప్పిలి వెంకట్రామిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధుల హక్కులకు బాబు సర్కారు తూట్లు

గ్రామాల్లో చేసిన పనుల బిల్లులు రెండేళ్లుగా నిలిపేయడం దుర్మార్గం

రూ.కోట్లలో బకాయిలు పెట్టి అధికారుల చుట్టూ తిప్పుతారా?

తీర్మానాలు లేకుండా టీడీపీ నేతలు పనులు చేస్తే బిల్లులెలా ఇచ్చారు?

వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement