ఒంగోలు టౌన్: వేసవి ప్రభావంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు చెప్పారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆస్పత్రులు, అపార్ట్మెంట్లలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్, ఏసీ మెషిన్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి నీరు, ఫోమ్, సీఓ2, పౌడర్లను ఉపయోగించే విధానాలను తెలిపారు. జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ అద్దెయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ఆస్పత్రి సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యుత్ పరికరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీఎస్ఆర్ఎంఓ మాధవీలత, అసిస్టెంట్ డైరక్టర్ అనిల్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎం.విజయలలిత, సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.


