గిద్దలూరు రూరల్: మండలంలోని తిమ్మాపురం గ్రామశివారులోని పంట పొలాల్లో ఆదివారం చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందారు. గుండ్లకమ్మరేంజి రాచర్ల బీటు పరిధిలోని తిమ్మాపురం సమీపంలోని అటవీప్రాంతంలో నుంచి ఓ చిరుతపులి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లోకి రావడంతో రైతులు భయాందోళన చెందారు. రైతుల సమాచారం మేరకు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి, రేంజ్ ఆఫీసర్ పీవీ నరసింహారావు, డీఆర్ఓ వంశీక్రిష్ణ వారి సిబ్బందితో సహా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అప్రమత్తం చేశారు. చిరుత పులికి సుమారు రెండు నుంచి మూడేళ్ల వయసు ఉంటుందని రైతులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అటు వైపు ఎవ్వరిని వెళ్లనివ్వకుండా డ్రోన్ కెమెరాల సహాయంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.


