అబద్ధాలు, మోసాలే
కురిచేడు: చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలే అజెండాగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసన సభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని బోధనంపాడులో వేంచేసి ఉన్న శ్రీవీరాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన స్వామి వారిని దర్శించుకుని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ప్రసంగించారు. ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ ఎండలు మండుతున్న నేపథ్యంలో గ్రామాలు తాగునీరు లేక గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఓట్ల తొలగింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పనులకు ఆటంకాలు కలిగించటం, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, జగనన్న పాలనలో మంజూరై పూర్తయిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం అంగన్వాడీలు జీతాలు పెంచమంటే వారిని నిర్ధాక్షిణంగా పోలీసులతో కొట్టించి స్టేషన్లకు తరలించటం మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పింఛన్లు రద్దు చేసి ఎందరో వృద్ధులను అనాథలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల తొలగింపులో కుట్ర
రాబోవు ఎన్నికల్లో గెలవలేమని గ్రహించిన తెలుగుదేశం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఓట్లను అన్యాయంగా తొలగించేందుకు కుట్రపన్నుతున్నారని బూచేపల్లి మండిపడ్డారు. ఇసుక, మట్టి అమ్ముకోవడమే కాకుండా కమీషన్ల పర్వం కొనసాగిస్తున్న వారు ప్రజల యోగక్షేమాలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకుని జనరంజక పరిపాలన కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు పోతిరెడ్డి నాగిరెడ్డి, గ్రామ నాయకులు వేమా వెంకటేశ్వర్లు, పవన్కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రెండేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు
జగనన్నదే జనరంజక పాలన
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి


