మిస్సింగ్ కేసులను సీరియస్గా తీసుకోవాలి సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలి ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశం ఉమ్మడి జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్
మార్కాపురం: కాకినాడలో ఈనెల 11న నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మురారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు టీజేఆర్ సుధాకర్బాబు ఆధ్వర్యంలో కాకినాడలో ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, నియోజకవర్గాల నాయకులు హాజరుకావాలని కోరారు.
కేసులను మిస్సింగ్ చేయొద్దు
ఒంగోలు టౌన్: మిస్సింగ్ కేసులను అలక్ష్యం చేస్తే సహించేది లేదని, వీలైనంత త్వరగా విచారణ మొదలు పెట్టి ట్రేస్ చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్ నుంచి ఉమ్మడి జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా తప్పిపోయారని, కనిపించడం లేదని ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తి ఫొటోలను అన్నీ పోలీసు స్టేషన్లకు పంపించి మెరుపు వేగంతో ట్రేస్ చేయడానికి ప్రయత్నించాలని చెప్పారు. మిస్సింగ్ కేసులను విభజించాలని, మతిస్థిమితంలేనివారు, చిన్నారులు, వృద్ధులు, బాలికలు, యువతులు, మహిళలు, పురుషులు తదితర కేటగిరీలుగా విభజించి విచారణ ప్రారంభించాలన్నారు. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, అన్నీ కోణాల్లోనూ కేసును అధ్యయనం చేయాలని చెప్పారు. మిస్సింగ్ కేసుల్లో ఎంత త్వరగా స్పందించామన్నదే ముఖ్యమని, అప్పుడే కేసును ట్రేస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, సంబంధిత వ్యక్తులకు సకాలంలో సమన్స్ అందజేయాలని, మహిళలకు సంబంధించిన కేసుల్లో త్వరగా స్పందించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.


