ఒంగోలు టౌన్: దళితులు ఎదుర్కొంటున్న పలు దైనిందిన సమస్యలపై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి రాబోయే రోజుల్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రఘురాం తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో గురువారం కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జువ్వాజి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, వివిధ రూపాల్లో కొనసాగుతున్న కులవివక్ష, శ్మశానాలకు సంబంధించిన సమస్యలపై దళిత వాడల్లో అధ్యయనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే అంశాలపై దళితులను చైతన్యం చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తామన్నారు. దళితుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఘటనా పోరాటాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సమస్యల సుడిగుండంలోనే దళితులు జీవితాలను గడుపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దళితుల సమస్యల పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అట్లూరి రాఘవులు, వి.మోజేష్, పరదేశి రాజశేఖర్, దిడ్ల నారాయణ, కొలనీడి నరేష్, కాకుమాను సుబ్బారావు, మెడిబలిమి ప్రసాద్, జువ్విగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


