ఒంగోలు: జిల్లా న్యాయమూర్తుల సమావేశానికి శనివారం ఒంగోలు వచ్చిన జిల్లా పోర్టు ఫోలియో జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. వారితో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పోర్టు ఫోలియో జడ్జిని కలిశారు.
ఒంగోలు సబర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్థన్రాజుతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఈ నెల 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. సంబంధిత అధికారులు ఒక వారం ముందుగానే ఆయా కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డీఈఓ సి.వి.రేణుక, ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీటీసీ సుశీల, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


