ఒంగోలు వన్టౌన్: ప్రస్తుత సమాజంలో మానవత్వం లేని మనుషుల కంటే మూగజీవాలే నయం అని నిరూపించే ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు కుక్కకు ఓ వీధి కుక్క రక్తం దానం చేసి సాటి మూగజీవి ప్రాణం కాపాడింది. మనుషుల హృదయాలను కదలించే ఈ ఘటన బుధవారం ఒంగోలులో వెలుగు చూసింది. ఒంగోలులోని అంజయ్య రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంట్లో రూబీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. అది అనారోగ్యం బారిన పడడంతో అతను పశువైద్యులను సంప్రదించాడు. వారు కుక్కను పరిశీలించి రక్తం ఎక్కించాలని చెప్పడంతో రూబీ యజమాని సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్ నిర్వాహకురాలు తాటిపర్తి దివ్యను సంప్రదించాడు. ఇటీవల ప్రమాదంలో గాయపడి సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్లో కోలుకున్న వీధి శునకం రక్తాన్ని సేకరించారు. ఒంగోలు పశువైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఎన్ జగత్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పశువైద్యులు 3 గంటలు శ్రమించి రక్తం రూబీకి ఎక్కించారు.


