ఒంగోలు టౌన్: ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న యుద్ధోన్మాది ట్రంప్ దుర్నీతికి ప్రధానమంత్రి మోదీ కొమ్ముకాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిర్వహించిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ అమెరికా విధానాలను నిర్ద్వందంగా తిరస్కరించగా.. నేటి ప్రధానమంత్రి ట్రంపు విధానాలకు తలూపుతున్నారని మండిపడ్డారు. చిన్న దేశాలపై అమెరికా చేస్తున్న యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణానికి ముప్పుగా పరిణమించాయని చెప్పారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల పేరుతో ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ విధానాలని, దీని వలన దేశ ప్రగతి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ కాలయాపన చేస్తోందన్నారు. 1996లో వెలిగొండకు పునాదిరాయి వేసి 30 సంవత్సరాలు అవుతోందని, నేటికీ ఆ ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చంద్రబాబు అధికారంలో కొనసాగేంత వరకు సాగదీస్తారని వా్య్ఖ్యానించారు. ప్రజల సమస్యలను మరుగున పడేసేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకు ఇవ్వడం సరికాదని, లోకేష్ కుటుంబ ఆస్తి ఇచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి జంగాల అజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్.వెంకటరావు, అరిగెల సాయి, తన్నీర సింగరకొండ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శ


