పొదిలి రూరల్: పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి గ్రామంలో ఉన్న శంకర విద్యాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సోమవారం సందర్శించారు. ముందుగా దర్శి నుంచి పొదిలికి వచ్చిన స్వామికి స్థానికులు పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓబులక్కపల్లి వేదపాఠశాలను సందర్శించారు. కొంతమంది భక్తులు స్వామి వారికి తమ ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ బాధితులు ఉన్నారని, ఫ్లోరైడ్ ప్రాంతం కావడంతో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్వామి వారు ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. కిడ్నీ బాధితుల కోసం మంచి ఆస్పత్రి ఏర్పాటు చేయాలని విన్నవించారు.


