● దర్శి నియోజకవర్గంలో మహిళల కోసం రూ.1.25 కోట్లు మంజూరు ● ఈ నిధులతో ప్రతి మండలంలో మహిళా భవన్ల నిర్మాణం
దర్శి: జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మహిళలకు పెద్ద పీట వేశారు. దర్శి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న వెంకాయమ్మ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి మహిళలపై ఉన్న తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఉమెన్ అండ్ వెల్ఫేర్ పథకం ద్వారా జిల్లా పరిషత్ నిధులతో ఒక్కో మండలానికి రూ.25 లక్షల చొప్పున దర్శి నియోజకవర్గానికి రూ.1.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రతి మండల కేంద్రంలో మహిళా భవన్లు నిర్మించనున్నారు. ఈ భవనాల ద్వారా మహిళలకు శిక్షణ తరగతులు, చేతి వృత్తులు, వంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగించనున్నాయి. మండల కేంద్రాల్లో నిర్మించే ఈ భవనాల వలన మహిళలకు ఎంతో మేలు చేకూరనుంది.
ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ భావజాలంలో పరిపాలిస్తున్న మోదీ పాలనలో హిట్లర్ను గుర్తుకు తెస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కృష్ణకాంత్ విమర్శించారు. నగరంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ మనోహర్ అధ్యక్షత వహించిన ఈ సభలో కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ సామ్రాజ్యవాద దేశాల ముందు జీ హుజూర్ అంటూ తలొగ్గుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక ఉద్యమాలను అణచివేసేందుకే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారని చెప్పారు. లేబర్ కోడ్స్ అమలుకు ముందే కార్మిక ఉద్యమాలను బలహీనపరిచే చర్యలు చేపట్టారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ పద్ధతి అమలు చేయడం వలన అవినీతి పెచ్చుమీరిపోతుందని, నిరుపేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో డా.ఏ.శ్రీనివాసరావు, రవికుమార్, ఐ.కృష్ణ మోహన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


