● ఆలయం వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడంతో బహిష్కరించామంటున్న గ్రామస్తులు
మార్కాపురం రూరల్: మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో నివసిస్తున్న ఎస్టీ కులానికి చెందిన కుటుంబాలను గ్రామస్తులు బహిష్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మార్కాపురం మండలంలోని మిట్టమీదపల్లె గ్రామంలో కొందరు ఎస్టీలు గ్రామంలోని ఆలయాల వద్ద మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అయితే గ్రామస్తుల మాటలు వారు వినకపోవడంతో గ్రామంలోని మిగతా కులాలకు చెందిన వారు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ శివారులో ఎస్టీలు నివసిస్తున్నారు. గ్రామ బహిష్కరణతో ఎస్టీలు గ్రామంలోకి నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలుకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి వస్తువులు అమ్మరాదని మైకుల ద్వారా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వారికి అవసరమైన వస్తువులను అమ్మితే షాపు యజమానులకు ఫైన్ వేస్తామని హెచ్చరించారు. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన ఎస్టీలు తహశీల్దార్కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీంతో తహశీల్దారుతో పాటు రూరల్ ఎస్సై మంగళవారం సాయంత్రం గ్రామానికి చేరుకొని ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించి రాజీ చేశారు.


