మార్కాపురం: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్లో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ కార్యదర్శి ఓవీ వీరారెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన యూటీఎఫ్ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికే యూటీఎఫ్ రణభేరీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని, 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయలేదన్నారు. హెల్త్కార్డుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. మార్చి 24న నియోజకవర్గ స్థాయిలో రిలే దీక్షలు, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా స్థాయిలో రిలే దీక్షలను, ఏప్రిల్ 14 నుంచి 19 వరకూ రాష్ట్ర స్థాయి రిలే దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటరీయట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు.


