అద్దంకి రూరల్: శింగరకొండ తిరునాళ్లలో సోమవారం రాత్రి పచ్చ తమ్ముళ్లు దుశ్యర్యకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్ద వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టి రాక్షసానందం పొందారు. ఈ దుశ్యర్య తాలూకూ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల జరగడం ఇష్టం లేని పచ్చ తమ్ముళ్లు వైఎస్సార్ సీపీ జెండాలను తగలబెట్టడం ద్వారా తమ బలహీనతను బయటపెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అద్దంకి ఇన్చార్జి చింతలపూడి అశోక్కుమార్ పేర్కొన్నారు. జెండాలను తగలబెట్టడం పిరికి పంద చర్య అని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను రాజకీయంగా ఎదుర్కోలేక ద్వేషం, అసహనంతో దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. పచ్చమూక దుశ్యర్యను సమర్థిస్తారా లేక ఖండిస్తారా అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ప్రశ్నించారు. జెండాలను తగలబెట్టినంత మాత్రాన పార్టీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని, సంకల్పాన్ని దహనం చేయలేరన్నారు. జెండాలు కాల్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ జెండాకు నిప్పుపెట్టిన పచ్చ తమ్ముళ్లు పిరికిపందల చర్యగా పేర్కొన్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అశోక్కుమార్


