ముండ్లమూరు: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో భద్రపరిచిన 11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు, రూ.20 వేల నగదు అపహరించారు. ముండ్లమూరు మండలంలోని పెదఉల్లగల్లులో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ భారీ చోరీ వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సికాకొల్లి శంకరరావు తన భార్యాపిల్లలతో కలిసి సోమవారం రాత్రి 8 గంటలకు శింగరకొండ తిరునాళ్లకు వెళ్లారు. మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్న శంకరరావు దంపతులు.. తలుపులు తెరిచి ఉండటంతో కంగుతిన్నారు. బీరువా తెరిచి ఉండటంతోపాటు దుస్తులు, వస్తువులు మంచంపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు లేకపోవడాన్ని గుర్తించి, వెంటనే ముండ్లమూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు క్లూస్ టీం సీఐ కె.రవీంద్రారెడ్డి, దర్శి సీఐతోపాటు ఎస్సై కమలాకర్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. బంగారు నల్లపూసల దండ, ఫ్యాన్సీ పూసల దండ, గుండ్లు పుస్తెల దండ, చెవి కమ్మలు, ఒక జత చెంప సవరాలు, ఒక జత మాటీలు, ఒక జత చిన్న కమ్మలు, వెండి అరకిలో, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు శంకరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ అయిన సొత్తు విలువ రూ.17 లక్షలు ఉంటుందని తెలిపారు.
సీసీ కెమెరాలు తప్పించి చోరీ
శంకరరావు ఇంట్లో ముందు వైపు కిరాణా షాపు, ఇంటి పక్కన ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తుండటంతో భద్రత కోసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దొంగలు ఇంటి వెనుక వైపున సీసీ కెమెరాను పైకి తిప్పి లోపలికి ప్రవేశించి, మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టారు.
11 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి, 20 వేల నగదు అపహరణ
శింగరకొండ తిరునాళ్లకు వెళ్లి వచ్చేలోగా ఇల్లు లూటీ
సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగపడని వైనం


