కంభం: ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం తెల్లవారుజామున కంభంలో అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు శ్రీశైలం వెళ్తున్న క్రమంలో కంభం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. పలువురి మోచేతులు, కాళ్లకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం శ్రీశైలం వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపించారు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని కంభం పోలీసులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు దెబ్బతిన్న ట్రావెల్స్ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఇదే ఫ్లైఓవర్ పరిసరాల్లో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, నివారణకు హైవే అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
టంగుటూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్పై మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..విజయవాడ నుంచి చైన్నె పని నిమిత్తం కారులో వెళుతుండగా తూర్పునాయుడుపాలెం ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో సమయంలో ముందు వెళ్తున్న కట్టెల లోడు లారీ ఒక్కసారిగా నెమ్మదించడంతో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు వైపు కూర్చొని ఉన్న ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన షేక్ అబ్దుల్లా(27) అక్కడికక్కడే మృతి చెందగా దుర్గాప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని చరణ్, సీతారామయ్య, షఫీలటు ఎటువంటి గాయాలు కాలేదు. ఎస్సై నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కంభంలో అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై ప్రమాదం
బస్సులో 20 మంది ప్రయాణికులు.. పలువురికి స్వల్పగాయాలు
పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
ప్రథమ చికిత్స అనంతరం మరో బస్సులో శ్రీశైలం పయనం


