మార్కాపురం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ అదాలత్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం మార్కాపురంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్ అదాలత్లు నిర్వహించి, వినియోగదారుల సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. ఒంగోలు సర్కిల్ పరిధిలో 26 అదాలత్లు, మార్కాపురంలో 6 అదాలత్లు నిర్వహించినట్లు వెల్లడించారు. తమ పరిధిలో 7 విద్యుత్ సర్కిల్స్ ఉండగా, ప్రతి నెలా 5 సర్కిళ్లలో అదాలత్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లుల చెల్లింపులో సమస్యలు, స్తంభాల ఏర్పాటులో జాప్యం లాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని వినియోగదారులకు సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలను తమ వద్దకు తీసుకురావద్దని, అవి తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. అనంతరం 26 మంది విద్యుత్ వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డి.కృష్ణనాయక్, కె.కృష్ణ, కె.వెంకటేశ్వర్లు, ఎ.సునీత, ఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సియానాయక్, జిల్లా పరిధిలోని ఏఈలు పాల్గొన్నారు.


