ఒంగోలు టౌన్: క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం అంత సాధ్యమవుతుందని జీజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా స్క్రీనింగ్ క్యాంపును నగర మేయర్ సుజాత, కమిషనర్ కె.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జీజీహెచ్లో పారిశుధ్య కార్మికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...ముందుగా లక్షణాలు గుర్తించడం అవసరమన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చన్నారు. జీజీహెచ్లో ప్రివెంటివ్ అంకాలజీలో నిరంతరం ఓపీ సేవలు అందిస్తుందన్నారు. సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ అంకాలజీ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. పరీక్షల కోసమే కాకుండా కౌన్సెలింగ్ కోసం కూడా జీజీహెచ్కు రావచ్చన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డా.శ్రీదేవి, గైనకాలజీ అధిపతి డాక్టర్ సంధ్యా రాణి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు.
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఆర్టీఓగా చండ్రా రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎంవీఐగా పనిచేస్తున్న ఆయనను మార్కాపురం ఇన్చార్జి ఆర్టీఓగా నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన శ్రీచందన సెలవుపై వెళ్లారు. మార్కాపురం ఎంవీఐగా కేఎల్రావును నియమించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాల డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.


