ఒంగోలు టౌన్: ఊహించని రీతిలో వలలోని చేప జాలరీ నోట్లోకి దూరింది. ఊపిరాడక గిలగిలలాడుతున్న సదరు జాలరీని ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన జీజీహెచ్ వైద్యులు జాలరీ ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన సుబ్రమణ్యం గురువారం చేపలవేటకు వెళ్లారు. చేపలు పట్టుకొని ఇంటికి వచ్చిన ఆయన నోట్లో వలను పట్టుకొని చేపలను బయటకు తీస్తున్నారు.
ఆ సమయంలో అనుకోకుండా ఒక చేప సుబ్రమణ్యం నోట్లోకి వెళ్లింది. గొంతుకు అడ్డంపడి గిలగిలా కొట్టుకోసాగింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ ప్రభాకర్ గొంతులో చేప ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి చెప్పారు. ట్రాకియాక్టమి పద్ధతిలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.
సుమారు గంటకు పైగా ఆపరేషన్ చేసి సకాలంలో చేపను బయటకు తీయడంతో సుబ్రహ్మణ్యం ప్రాణాలతో బయట పడ్డారు. ఆపరేషన్ బృందంలో డాక్టర్ రాంబాబు, డాక్టర్ కవిత, డాక్టర్ అర్జున్, డాక్టర లాలస పాల్గొన్నారు. క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు ప్రశంసించారు.


