మార్కాపురం: మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు శుక్రవారం చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక దశాబ్ధాలుగా అన్ని రంగాల్లో వెనుకబడి ఇటీవలే జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కురిచేడు, దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాగా నేటికీ కలెక్టర్, ఎస్పీ, రెవిన్యూ ఆఫీసరు లాంటి కీలక పోస్టులను భర్తీ చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇన్ఛార్జిలతో ఎంతకాలం పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్, ఎస్పీ పోస్టులను భర్తీ చేసి ఇక్కడే ఉండి పాలన చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈశ్వరయ్య కోరారు. 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు అందించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేయగా, బడ్జెట్లో రూ.490 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాటాలు చేసిన పూల సుబ్బయ్య పేరును నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రాజెక్టు పేరుకు ముందు పూలసుబ్బయ్య పేరు చేర్చారని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం బహిరంగ సభలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం బాధాకరమని, తక్షణమే విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎంపికై న ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు తక్షణమే ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి 3 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు అందె నాసరయ్య, కేవీ కృష్ణ గౌడ్, రైతు సంఘం నాయకులు డి శ్రీనివాస్, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందె నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్


