కురిచేడు: గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు ఎలాగైనా తొలగించాలని కుయుక్తులు పన్నుతున్నారు. విచారణ పేరుతో ఓటర్ల నుంచి తాము గ్రామంలో లేమని చెప్పించే యత్నాలు చేస్తున్నారు. ఓటర్లు తమకు స్వగ్రామంలో ఓట్లు ఉండాలని, కేవలం బతుకుదెరువు కోసమే వలసలు వెళ్తున్నామని చెబుతున్నా వినకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రస్తుతం ఉంటున్న చోట్లకు వెళ్లి ఓట్లు తొలగించినట్లు రసీదులు తేవాలని టీడీపీ నాయకుల ఎదుట ఓటర్లకు హుకుం జారీ చేస్తున్నారు. మండలంలోని నమశ్శివాయపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఓట్లు తొలగించాలని, వారంతా గ్రామంలో లేరని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, వీఆర్వో హనుమంతురావు, బీఎల్వోలు శేషగిరిరావు, కృష్ణతో కలిసి పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. విచారణలో ఓటర్లు తాము బతుకుదెరువు కోసం వెళ్లామని, ఇళ్లు, పొలాలు ఇక్కడే ఉన్నాయని, ఓటు ఇక్కడే కావాలని కోరుతున్నా వారి మాటలు పెడచెవిన పెట్టి.. మీరు ప్రతి నెలా ఇక్కడే రేషన్ తీసుకుంటున్నారా? విద్యుత్ బిల్లులు ఇక్కడే కడుతున్నారా? ప్రతి రోజు ఇక్కడే ఉంటున్నారా? అంటూ ప్రశ్నలు వేసి వారితో చివరకు తమకు ఇక్కడ ఓటు వద్దు అని చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన వారు అక్కడే రేషన్ తీసుకోవచ్చని అవకాశంశ ఇచ్చింది. ఓట్లు రెండు చోట్ల నమోదైతే దానిని ఫారం–7 ద్వారా వారికి ఇష్టం వచ్చిన చోట ఓటు ఉంచేకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చింది. కానీ విచారణ అధికారులు అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉంటున్న చోటుకు వెళ్లి ఓటు రద్దు చేయించుకున్నట్లు రశీదు తీసుకురావాలని, గ్రామంలోనే రేషన్ తీసుకోవాలని అధికారులు చెప్పడం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గారని స్పష్టంగా అర్థమవుతోంది. అంతే కాకుండా తాము ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా రోజూ తమ స్వగ్రామంలోని ఇంటికి వెళ్లి వస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండి ప్రజలకు సేవ చేయాల్సి ఉందన్న నిబంధనను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, ఎన్నికల కమిషన్ ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆలోచించి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఓట్ల తొలగింపు కార్యక్రమం నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరగాలని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యం
అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు
గ్రామాల్లో టీడీపీ నాయకుల సమక్షంలో ఓటర్ల విచారణ


