● హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య
ఒంగోలు టౌన్: ఎంత మంది పిల్లలను కనాలో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం మహిళల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని మల్లయ్యలింగం భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే అత్యధిక జనాభాతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న మనదేశంలో ప్రజలకు సరైన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో పాలకులు వెనకబడ్డారని తెలిపారు. ఒకరిద్దరినే పోషించలేక ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. చేయడానికి పనులు లేవని, చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలో అధికంగా పిల్లలను కనాల్సిందిగా చంద్రబాబు చెప్పడం తగదన్నారు. ఆర్ధిక వనరులను బట్టి భార్యాభర్తలు ఎంతమందిని కనాలో నిర్ణయించుకుంటారని, ముఖ్యమంత్రి ఇచ్చే రూ.25 వేల కోసం పిల్లలను కనమని చెప్పడం దారుణమన్నారు. దళిత పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం మాట్లాడుతూ ఉత్తర భారతంలో ఎక్కువ జనాభా ఉండడం వలన ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, దక్షిణ భారతంలో తక్కువగా జనాభా ఉండడం వలన తక్కువ పార్లమెంటు సీట్లు ఉన్నాయని, ఈ కారణంతోనే చంద్రబాబు అధికంగా పిల్లలను కనమని చెబుతున్నారని వివరించారు. కేవలం పార్లమెంటు సీట్ల కోసమే పిల్లలను కనమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో హేతువాద నాయకులు ఎంకే బేగ్, షేక్ నజీర్ బాషా, గోరంట్ల పిచ్చయ్య, సుబానీ, ఎస్వీ రంగారెడ్డి, గుమ్మళ్ల నరసింహారావు పాల్గొన్నారు.


