న్యూస్రీల్
పశ్చిమాన బియ్యం ధరలు ఆకాశానికి.. తూర్పున ధాన్యం ధరల నేల చూపులు మార్కాపురం జిల్లాలో వరిసాగు విస్తీర్ణం ప్రకాశం జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం రెండు ప్రాంతాల్లో రైతు కంట కన్నీరే లబ్ధిపొందుతున్న ధాన్యం బ్రోకర్లు, వ్యాపారులు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
వరిసాగుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో తూర్పు ప్రాంతంలో విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో సాగైంది. పశ్చిమాన సాధారణ విస్తీర్ణం కంటే సుమారు 600 హెక్టార్లు తక్కువగా సాగైంది. ఫలితంగా మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండగా ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41,467 మంది వరిసాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 12,826 హెక్టార్లలో వరిసాగు లక్ష్యం కాగా 16,704 హెక్టార్లలో, రబీలో 19,144 హెక్టార్లు లక్ష్యం కాగా 24,647 హెక్టార్లలో వరిసాగు జరిగింది. మార్కాపురం జిల్లాలో 4219 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 3623 హెక్టార్లలో సాగైంది. సాగు తగ్గడంతో మార్కాపురం జిల్లాలో బియ్యం ధరలు క్వింటాకు రూ.400 పెరిగింది. ప్రకాశం జిల్లాలో మాత్రం ధాన్యం ధరలు క్వింటాకు రూ.200 తగ్గాయి. ఎటుచూసినా అన్నదాత నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు పశ్చిమాన బియ్యం ధరలు అమాంతం పెంచేసి జనాన్ని దోచేస్తున్నారు. తూర్పున ధాన్యం ధరలు తగ్గించేసి రైతులు నిండా ముంచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా..క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులపై రైతులు మండిపడుతున్నారు.
ధాన్యం ధరల పతనం ఇలా..
ప్రకాశం జిల్లాలో ధాన్యం ధరలు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. నిన్నటి వరకు బీపీటీ రకం రూ.1,670 లు ఉండగా ప్రస్తుతం రూ.1,600 లకు దిగువన ధర పలుకుతోంది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు ధాన్యం కోతలు జరగనంతసేపు మంచి రేటు ఇస్తానని నమ్మబలికి తీరా ధాన్యం కోతలు జరిగిన తరువాత మాట మార్చేశారు. 76 కేజీల ధాన్యం బస్తాధర రూ.1,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 76 కేజీల ధాన్యం ధర రూ.2,400 నుంచి రూ.2,600 వరకు ధర పలికింది. నేడు పరిస్థితి విరుద్దంగా ఉంది. నిన్నటి వరకు కేఎన్ఎం రకం 76 కేజీలు ధాన్యం బస్తా పాతవి రూ.1,800 లు ఉండగా నేడు రూ.1,700లు, బీపీటీ రకం కొత్తవి రూ.1,600లు ఉండగా నేడు రూ.1,500 లు మాత్రమే ధర పలుకుతోంది.
పెరిగిన బియ్యం ధరలు
మార్కాపురం జిల్లాలో వరిసాగు తగ్గటంతో ధాన్యానికి డిమాండ్ ఏర్పడింది. పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలువురు వ్యాపారులు లారీల్లో బియ్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. కొరతను ఆసరా చేసుకుని వ్యాపారులు బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెంచి విక్రయిస్తున్నారు. గత నెలాఖరులో బీపీటీ రకం రూ.6 వేలు ఉండగా పదిరోజుల వ్యవధిలోనే బస్తా ధర రూ.200 పెరిగింది. గత 15 రోజుల నుంచి మరో రూ.100 పెంచి విక్రయిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో సుమారు 25 మందికిపైగా బియ్యం హోల్సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరు కర్నూల్ సోనా, బీిపీటీ, నెంబర్లు తదితర రకాల బియ్యాన్ని అమ్ముతుండటంతోపాటు స్థానికంగా బియ్యాన్ని సేకరించి ఏదో బ్రాండ్ నేమ్ బస్తాలపై వేసి సూపర్ క్వాలిటీ అంటూ పాతిక కిలోల టిక్కీ రూ.1400 నుంచి రూ.1600కు విక్రయిస్తున్నారు. అంటే బస్తాకు రూ.5600 నుంచి రూ.6400 వరకూ విక్రయిస్తున్నారు.
కొంటే మంట..
అమ్మితే చింత..!
బియ్యం ధరలు పెరిగాయి
గత నెల కంటే ఈనెలలో బియ్యం ధరలు పెరిగాయి. టిక్కీ (25 కిలోలు) 1350 నుంచి 1500 కు పెరిగింది. రాబోయే నాలుగైదు నెలల వరకూ కొత్త బియ్యం వచ్చే పరిస్థితి లేదు. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో బియ్యం కొనిపెట్టుకుంటే మేలన్న అభిప్రాయం ఏర్పడింది. ధరలు పెరగకుండా అధికారులు చూడాలి.
– సీఎం ఖాసీం, 17వ బ్లాకు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మార్కాపురం
ఈ మండలాల్లో వరిసాగు నిల్...
మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, తర్లుపాడు, దోర్నాల, అర్ధవీడు, యర్రగొండపాలెం, గిద్దలూరు మండలాల్లో వరిసాగు పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు బియ్యాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని మండలాల్లో నామమాత్రంగా వరిసాగు చేపట్టారు. వర్షాలు లేకపోవడంతో రైతులు వరిపంట సాగు చేపట్టలేదు.


