పోలేరమ్మ ఆలయ భూమి కబ్జా చేస్తున్న టీడీపీ నేతలు రూ.3 కోట్ల విలువైన దేవుడి మాన్యం భూమిలో గోడ నిర్మాణం చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ముండ్లమూరు: అధికార టీడీపీ నాయకుల అక్రమాలు, దందాలకు రోజురోజుకూ అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చివరకు దేవుడి మాన్యం భూములను సైతం వదలకుండా ఆక్రమిస్తున్నారు. బహిరంగంగా బరితెగిస్తున్నప్పటికీ అధికార పార్టీ కావడంతో పోలీసులు, అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ముండ్లమూరు మండల కేంద్రంలో జరుగుతున్న దేవుడి మాన్యం భూముల ఆక్రమణలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. స్థానిక పోలేరమ్మ దేవస్థానానికి సర్వే నంబర్ 75/15లో 1.16 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో గ్రామ ప్రజలు, ఎండోమెంట్ సహకారంతో పోలేరమ్మ దేవస్థానం నిర్మించారు. అయితే, ఆ భూమి అద్దంకి – దర్శి ప్రధాన రోడ్డు పక్కన ముండ్లమూరులోని మెయిన్ సెంటర్లో ఉండటంతో దానిపై కబ్జాదారుల కన్ను పడింది. రేషన్ డీలర్ అయిన టీడీపీ మండల నాయకుడు వీరపనేని నాగేశ్వరరావు 20 సెంట్ల భూమిని కబ్జా చేసి గోడ నిర్మిస్తున్నాడు. దానిపై గ్రామస్తులు ప్రశ్నించగా, ఇది మా భూమి అంటూ దౌర్జన్యం చేస్తున్నాడు. ఆ భూమి ఎప్పటి నుంచో ఎండోమెంట్ పరిధిలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ, సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి మాన్యం భూమిని కబ్జా చేస్తూ అధికార పార్టీ అనే అహంకారంతో గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడి హస్తముందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కొలతలు వేయించి చర్యలు తీసుకుంటాం
గోడ కడుతున్న భూమి దేవుడి మాన్యమే. భూమి కబ్జాకు గురైన విషయం తెలిసి కొలతల కోసం మండల తహసీల్దార్కు అర్జీ అందజేశాం. కొలతలు వేసిన తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ గోడలు తొలగిస్తాం.
కార్తీక్, ఎండోమెంట్ ఈవో


