ఒంగోలు సబర్బన్: వడగాలులకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లాలోని పరిస్థితిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధిక ఉష్ణోగ్రతలతో చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలన్నారు. రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళల్లో ఎండలో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాల్లో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షెడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి వి.అనిత జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్సు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్తో పాటు డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ డీపీఎం మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఈఓ రేణుక, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ. నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్, భూగర్భ జల వనరులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు


