ఒంగోలు సబర్బన్: ఆరుగురు చిన్నారులకు దత్తత స్వీకార ప్రక్రియను కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ చాంబర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు అనాథ బాలలుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆరుగురు చిన్నారులకు పలువురు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాంనగర్లోని శిశు గృహలో ఇప్పటి వరకు ఆ చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వారిని కలెక్టర్ అధ్యక్షతన దత్తత ఇచ్చారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దంపతులు కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలను స్వీకరించారు. వారంతా పోలీసు శాఖ, బ్యాంకు, సాఫ్ట్వేర్, బిజినెస్ రంగాల్లో స్థిరపడినవారు కాగా, వారితో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పిల్లలు మీకు దేవుడిచ్చిన వరమని, మీ కడుపున పుట్టిన బిడ్డలుగా భావించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులకు దత్తత ఆర్డర్స్ను కలెక్టర్ అందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత జిల్లా అధికారిణి ఎం.నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు నీలిమ వంశీలత, శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.


