● కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సిటీ: పేదరిక నిర్మూలనకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ), జీరో పావర్టీ (పీ–4)పై మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ విజనరీ ప్లానింగ్ సభ్యులతో గురువారం పీజీఆర్ఎస్ హాల్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ అధికారుల వ్యక్తిగత పనితీరుకు వివిధ అంశాల్లో సాధించిన పురోగతిని తెలిపే కేపీఐ ప్రతిబింబాలుగా ఉంటాయన్నారు. ప్రతినెలా పదో తేదీతో డేటా ఎంట్రీ ఫ్రీజ్ అవుతుందని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ను జిల్లా స్థాయి ప్రణాళికతో సమన్వయం చేస్తూ అమలు చేసేలా అధికారులు పనిచేయాలన్నారు. ‘బంగారు కుటుంబా’ల అవసరాలను గుర్తించి వాటికి అండగా నిలిచేలా ‘మార్గదర్శు’లను అనుసంధానం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, సీపీఓ సుధాకర్ రెడ్డి, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


