Politics
-
‘పచ్చ’డైపోతున్నాం!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కబంధహస్తాల్లో జనసేన నలిగిపోతోందని.. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారని, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, పనులూ కావడం లేదని పార్టీ అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ ఎదుట జనసేన ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్కళ్యాణ్ మంగళవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడంతోపాటు నాయకుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో జనసేన గెలిచిన నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందని పవన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఎంఓలో తమ నియోజకవర్గం నుంచి వచ్చే వినతులు తొందరగా పరిష్కారానికి నోచుకోవడం లేదని, అదే సహచర టీడీపీ ఎమ్మెల్యేలకు వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించినట్టు సమాచారం. జనసేనతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వాఫీసుల్లో స్థానిక టీడీపీ నేతలు చెప్పే పనులు వేగంగా జరుగుతాయని చెప్పినట్టు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ఇకపై నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తన కార్యాలయానికే నేరుగా వినతులు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. పునర్విభజనపై పార్టీ వ్యూహానికి కమిటీ.. నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్) అంశంలో పార్టీ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది. యువతే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం కొనసాగాలని వివరించినట్టు సమాచారం. -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?
ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే (ఎన్టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.డబుల్ ఇంజిన్ సర్కార్పై వ్యతిరేకత?హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.సంక్షేమం వెర్సస్ అవినీతిగత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.2026 పొత్తుల చదరంగంప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.నిర్ణయాత్మక శక్తి ఎవరు?తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పారీ్టలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్కు తృణమూల్కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కారి్మకుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచి్చంది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సౌమన్ రాయ్తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్కు చెందిన పులోక్ రాయ్తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్రెడ్డితో చర్చించారు. వారు జీవన్రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్తో చేతులు కలపడంతో జీవన్రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్రెడ్డి జీవన్రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జీవన్రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్కుమార్గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీటు పేరిట మళ్లీ తెరపైకి ఫార్ములా–ఈ తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన తొలి సంతకానికి సంబంధించిన ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. గతంలో తాను చెప్పినట్టు ఫార్ములా–ఈ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని చెప్పారు. శాసనసభ లాబీల్లోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో మంగళవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఫార్ములా–ఈ అంశాన్ని గోరంతను కొండంతగా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడి నుంచి పంపిన నిధులు రూ.45 కోట్లు అయితే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ నుంచి పంపిన రూ.45 కోట్లు ఫార్ములా–ఈ బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఆ నిధులను ప్రభుత్వం ఎందుకు వెనక్కి రప్పించడం లేదు. ఈ కేసులో అనుచిత లబ్ధి జరిగిందని చెబుతున్న వారి పేరు చార్జిషీటులో లేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘అందాల పోటీల వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం లేకపోగా తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. ఇంత దారుణం జరిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసు నమోదు కాలేదు. సీఎం సరదా కోసం రూ.100 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసినా కేసు నమోదు కాలేదు. ఫార్ములా–ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ను వదిలిపెట్టేది లేదు’అని కేటీఆర్ చెప్పారు. మూసీపై ప్రణాళిక లేకుండానే.. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూపాయి లేకున్నా ఏడీబీ అప్పు ఇస్తుందనే ఉద్దేశంతో డీపీఆర్ లేకుండానే మూసీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతోంది. మూసీ ప్రాజెక్టుపై ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా మూసీ బాధితులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మేధా పాట్కర్ వంటి మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు’అని కేటీఆర్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ ‘2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే స్వాగతిస్తాం. జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న నిష్పత్తిలో పునర్విభజన జరగాలి. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24శాతం ప్రాతినిథ్యం ఉంది. అదే నిష్పత్తిలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రం చూడాలి. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. టీడీఆర్ స్కామ్ ‘‘ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కచ్చితంగా టీడీఆర్లు కొనుగోలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ కుంభకోణంపై విచారణ జరిపిస్తాం. నిర్వాసితుల నుంచి అతి తక్కువ ధరకు టీడీఆర్ కొనుగోలు చేసి వాటిని అడ్డగోలు ధరలకు తిరిగి అమ్ముకుంటున్న రేవంత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతాం. రేవంత్ పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్’గా మారిపోయాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ కుటుంబం టీడీఆర్లను ఏటీఎంగా మార్చుకున్న తీరును బయటపెడతాం’అని కేటీఆర్ చెప్పారు. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే..60 స్థానాలు పెరిగితే 179 కావాలి..కానీ ప్రతి లోక్సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో 6 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!
తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.స్వాతంత్య్రానంతరం వేగంగా అభివృద్ధి రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ప్రతికూల అంశాలు ఇవే.. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది. -వెబ్డెస్క్ -
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది."పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం" రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలుఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటనమహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు -
ఒవైసీ మూడో ఫ్రంట్.. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోరు!
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్లో పత్తర్గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్లో ముక్కోణపు పోరు మొదలైంది.ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్కు ప్రతికూలాంశంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
ఆలాంటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అనుకోను: కేటీఆర్
హైదరాబాద్: నియోజకవర్గాల డిలిమిటేనేషన్ను స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిలిమిటేషన్ అనేది ఎప్పుడో జరగాలని, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉందన్నారు కేటీఆర్. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ పార్లమెంట్లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్తో ఈ వ్యత్యాసం పోతుంది’ అని అన్నారు కేటీఆర్ఇక ఫార్ములా రేస్ కేసు గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల డైవర్షన్ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్షీట్. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్షీట్ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్ కేసు లొట్టపీస్ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్కు పంపేది కోర్టులు.. రేవంత్ రెడ్డి కాదు’ అని పేర్కొన్నారు. -
అన్నింటిలోనూ జనసేనకు తీవ్ర అన్యాయం: బొలిశెట్టి శ్రీనివాస్
విజయవాడ: తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. -
బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అఫిడవిట్లో రాజీవ్ చంద్రశేఖర్ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. Dear @Ceokerala,BJP candidate from Nemom constituency, Rajeev Chandrasekhar, has not disclosed his residence, a 49,000 sq.ft mansion in Koramangala 3rd Block, Bengaluru, in his affidavit.This is a 1.07 acre property in one of the most expensive locations in the country, where… pic.twitter.com/pyyzD5Sft7— Congress Kerala (@INCKerala) March 23, 2026 -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా?
ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేదుటీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మెనూలోంచి దోశ, బోండా ఔట్మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్ పరిధిలో ఉన్న మావూర్ రోడ్లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - వెబ్డెస్క్ -
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మరోసారి నిసిగ్గుగా క్రెడిట్ చోరీ: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్ మిట్టల్ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్ జగన్ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ:మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ టేకోవర్ చేసుకున్న ఎస్ఆర్ ప్లాంట్ విస్తరణ కోసం దావోస్లో జగన్గారితో లక్ష్మీ మిట్టల్ కుమారుడు ఆదిత్యమిట్టల్ ఒప్పందం చేసుకున్నారు.దీంతో పాటు కర్నూలులో గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్ ప్రాజెక్టులో ఆర్సెలార్ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్గారు కోరడంతో మిట్టల్ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్ సంస్థకు భూమి కేటాయించాలని జగన్ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ సంగతేంటో చెప్పండి?:అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్డ్రగ్ ముందుకు సాగలేదు.ఇంకా బల్డ్ డ్రగ్ పార్క్ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ స్లీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎందుకు శ్రద్ధ లేదు?:అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్ అండ్ టీ, భారతీ సిమెంట్స్.. ఇలా రాయలసీమలో ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్ సంస్ధ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్గారి హయాంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.పరిశ్రమలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారాలు:విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్ మాల్కు నాడు జగన్ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్మెంట్. విశాఖకు ఇనార్పిట్ మాల్ ఓ ల్యాండ్ మార్క్. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్ మాల్ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
షర్మిలపై రాచమల్లు సీరియస్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు.. అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. షర్మిల ఎల్లో మీడియా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు. దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశంపై అన్ని మీడియా చానల్స్లోనూ వచ్చింది. ఎల్లో మీడియాలో కూడా గుండె పోటు అనే వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడం లేదు?. వివేకా మరణం గురించి ముందుగా ఆయన బావమరది శివప్రకాష్ రెడ్డే అందరికీ సమాచారం అందించారు. సంస్కారం, కుటుంబ గౌరవంతో వైఎస్ జగన్ ఈ అంశంపై స్పందించడం లేదు. మీరు తప్పుడు విమర్శలు చేస్తే మేం స్పందించకూడదా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. -
సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్లాల్?
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ల మధ్య సాగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. ‘కందుం మిండియుం ఇరువర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ. 11.21 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చర్చ అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేసిన దరఖాస్తుతో ఈ ఖర్చుల వివరాలు బయటపడ్డాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.రెండు రోజుల షూటింగ్ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’లో రెండు రోజుల పాటు ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం దీనిని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలతో రూపొందిన ఈ ఇంటర్వ్యూ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తిరువనంతపురంలో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేయగా, మోహన్లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.విపక్షాల ధ్వజంప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పినరయి విజయన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా మోహన్లాల్ 2011 ఎన్నికల సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు. అయితేఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
‘రాధాకృష్ణను పథకం ప్రకారం కేసు నుంచి తప్పించారు’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు, లోకేష్ల చేతికి వచ్చాక తెలుగు దొంగల పార్టీగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు సోమిరెడ్డి ప్రేరణ అయి ఉంటుంది. రాధాకృష్ణమ నాయుడు చేతి వేలుకు ఉన్న ఉంగరంతో సహా జనం గుర్తు పెట్టారు. రాధాకృష్ణ దొరికినట్లు కనిపించినా.. టీడీపీ నేత లేడని చెప్పడం హాస్యాస్పదం. ఏ హోమియో వైద్యానికి రాధాకృష్ణ వచ్చాడో పోలీసులు చెప్పగలరా?. పోలీస్ వ్యవస్థకు ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘టీడీపీ పేరు తెలుగు దొంగలు, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వ్యవస్థలని తారుమారు చేస్తోంది. కూటమి నేతలు అవినీతి, అక్రమాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టల్ని ఉల్లంఘిస్తున్నారు. టీడీపీ నేత రాధాకృష్ణమ నాయుడు వ్యభిచార కేసులో పట్టుబడ్డాడు. రాధాకృష్ణమ నాయుడిని పథకం ప్రకారం ఆ కేసులోంచి పోలీసులు తప్పించారు. రాధాకృష్ణ హాస్పిటల్కి వచ్చాడంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. పోలీసులు దారుణమైన అబద్దాలు చెబుతూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?..రాధాకృష్ణతో ఉన్న మహిళని ఏమో ఇబ్బంది పెట్టారు. అమాయకులని, విద్యార్థులని ఇరికించి అసలైన దోషుల్ని విడిచిపెట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు చేస్తుంటే అతన్ని వదిలేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లాడ్జిలో ఉంటే పోలీసులు ఆయన్ని చీకట్లో పంపించేసి సీసీ పుటేజీలు తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆరవ శ్రీధర్, నషీర్ అహ్మద్, కోన రవికుమార్లు రాసలీలలు చేస్తుంటే వదిలేశారు. పోలీసుల సహకారంతో కూటమి నేతలు కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారు. నెల్లూరు లాడ్జిల్లో దాడి చేసిన సమయంలో సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. అసలైన దోషుల్ని వదిలేసి నిర్ధోధులని పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారు...సోమిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి దోషుల్ని వదిలేస్తున్నారు.. సోమిరెడ్డి ఎన్నోసార్లు మహిళల చేతుల్లో తన్నులు తిన్నాడు.. సోమిరెడ్డి కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మహిళల్ని సోమిరెడ్డి సిబ్బంది లోబరుచుకుంటున్నారు. రాధాకృష్ణ నాయుడిని అర్ధరాత్రి లైట్లు ఆపేసి డిఎస్పీ ఆఫీస్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో తప్పించారు. ఈ ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏ శిక్షకి అయినా నేను సిద్ధమే. మా ప్రభుత్వం వచ్చాక ఈ ఘటనపై విచారణ చేపడతాం’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి చెప్పారు. -
మహేష్ కుమార్తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. సంచలన ప్రకటన
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై ఉన్న “ఇందిరా భవన్” ఫ్లెక్సీని తొలగించడం గమనార్హం.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. ఈ క్రమంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అనంతరం, మహేష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్..‘పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని పనులు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. అదే జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు ఉంది. జీవన్ రెడ్డితో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారవద్దని చెప్పి వచ్చాం. మొన్ననే నేను శ్రీధర్ బాబుతో కలిసి రావాల్సింది. మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడించాం. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నాం. ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లో ఆయన అనుభవానికి తగిన న్యాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలగించారు. అయితే, ఇందిరా గాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్బై చెబుతున్నట్టు అనుచరులు సంకేతాలు ఇచ్చారు. -
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడైంది.2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్, యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.అయితే, ఈ ఎన్నికల్లో ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా, ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని ఇస్తోంది.అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి. సిబ్సాగర్లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్కి అవకాశాలు కల్పిస్తోంది.దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా, ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల కాంగ్రెస్–రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు.అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం. సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి.మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో... అవి ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్ చేశారు.మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!- ఆర్. దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
కాంగ్రెస్కు జీవన్రెడ్డి రాజీనామా వేళ బిగ్ ట్విస్ట్!
సాక్షి,జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, అవమానాలు భరించలేక మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రంగంలోకి దిగింది. మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఆయనను కాంగ్రెస్లో కొనసాగాలని కోరనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా, రాజీనామా ప్రకటించే కొన్ని గంటల ముందు పీసీసీ చీఫ్ రాకతో జీవన్ రెడ్డి నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు..గత ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవమానం భరించలేక కాంగ్రెస్ను వీడనున్నట్లు జీవన్రెడ్డి తెలిపారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జీవన్రెడ్డి ప్రకటన అనంతరం, ఆయన ఇంటి వద్ద ఓ పోస్టర్ వెలసింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? విఫలమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీలోని 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 180 వరకు సీట్లు గెల్చుకుంటుందని సర్వే చేపట్టిన అగ్ని న్యూస్ సరీ్వస్(ఏఎన్ఎస్) సీఈవో ఆర్.సురేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44.9 శాతం వరకు ఓట్లు పోలవుతాయి. ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి 38.5 శాతం ఓట్లతో 54 సీట్లు వస్తాయి’అని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుందని, ఒక్క సీటూ గెల్చుకునే అవకాశాలు లేవని చెప్పారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగా వెట్రి కళగం(టీవీకే)కు 9.7 శాతం ఓట్లు, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి 4.8 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. -
మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ సర్కార్పై గట్టిగా పోరాడండి.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలు, గ్యారంటీలపై అధికార పార్టీని, నేతలను నిలదీయండి’అని బీజేపీ ముఖ్య నేతలు, నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ బీజేపీలో కొందరు ముఖ్యనేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో ‘కాంప్రమైజ్ పాలిటిక్స్’నెరుపుతున్నారనే ఆరో పణల మధ్య.. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ద్వారా నాయకులకు గట్టి వార్నింగ్ పంపించినట్టుగా పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కేడర్ కష్టపడు తుంటే.. కొందరు ముఖ్యనేతలు, నాయకులు మాత్రం ఇతర పార్టీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యసాధనకు పార్టీలో అన్ని స్థాయిల నాయకులపై అధిష్టానం కన్ను ఉందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని హైకమాండ్ సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై కొందరు నేతలు మెతక ధోరణిని అవలంబిస్తూ అంత తీవ్రస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శల మధ్య తాజాగా అభయ్పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇటీ వల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పలు నియో జకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతు లు కలిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామా లపై సీరియస్గా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకుంటే సహించేది లేదని పాటిల్ హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాల (పార్టీ యూని ట్లు) జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకు ల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలదళంలో కలకలం రేపుతున్నాయి.తమతమ నియోజకవర్గాల్లో పట్టు కోసం లేదా కాంట్రాక్టులు, ఇతర వ్యక్తిగత ప్రయోజ నాల కోసం కొందరు నేతలు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించాక...త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తాచాటడం అనేది కొందరు నేతల తీరు వల్ల బీజేపీకి అగ్నిపరీక్షగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏర్పడిన లోపాలు, కొందరు నేతల కుమ్మక్కు రాజకీయాలు, ఇతర సమస్యలను సరిదిద్దడమే లక్ష్యంగా అభయ్పాటిల్ రంగంలోకి దిగినట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నారు. హైకమాండ్ వార్నింగ్తోనైనా కొందరు నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్ చేశారు. బడ్జెట్పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. ‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్ బోగస్ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులకూ దగా.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న సర్కార్ బడ్జెట్లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్నగర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్ కవిత చదివారు)..’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాగునీటిపై నిర్లక్ష్యం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్రావు విమర్శించారు. -
‘చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి’
తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దీనికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జిల్లాల స్ధాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలి. వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం, పది రోజులకోసారి జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్ధి, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలి. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై వివరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్లలో కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్ళాలి. అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, రైతాంగానికి వచ్చే సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
‘వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి’
విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు. ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. వైఎస్ జగన్ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని ప్రశ్నించారు.వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి.. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్ జగన్ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్ జగన్పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు. -
‘రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం?’
తాడేపల్లి : రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాధ్. రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందకంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘ వైఎస్ జగన్ రూ. 900 కోట్లతో 90 శాతం ఆల్రెడీ పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. తెలంగాణాకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆల్మట్టి నిర్మాణంతో ఇప్పటికే ఏపీకి, రాయలసీమకు అన్యాయం జరిగింది. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారు. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడుబోతోంది. రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. ఏయిమ్స్, గ్రామీణ బ్యాంకు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ చంద్రబాబు తరలించుకుపోయారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ప్రేమ లేదనటానికి ఇదే నిదర్శనం. అసలు చంద్రబాబు రాయలసీమకు ఏం న్యాయం చేశారో చెప్పాలి?, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రైతులన్నా ప్రాజెక్టులన్నా ఎందుకంత ద్వేషం?, పొరుగు రాష్ట్ర సీఎం వద్దన్నారని రాయలసీమ లిఫ్టును ఆపటం ఏంటి?, తెలంగాణ, కర్నాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలి’ అని డిమాండ్ చేశారు. -
'చివరి ఎత్తుగడ.. కేరళలో సీపీఎం–బీజేపీ పొత్తు'
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదని, కానీ ఈసారి ఆ పొత్తు విజయం సాధించదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, సీపీఎం, ఎల్డీఎఫ్లకు అర్థమైందని, అందుకే వారు తమ చివరి ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.ఆదివారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న లావ్లిన్ కేసు వాయిదా పడటం, కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం, పీఎం–శ్రీ వంటి అంశాలు.. కేంద్ర ప్రభుత్వం, వామపక్ష పార్టీ సంబంధాలేంటో స్పష్టమవుతున్నాయని కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాల్లోనూ ఇదే సంబంధం ప్రతిబింబించిందని, ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వేణుగోపాల్ ఆరోపించారు. కానీ ఈ ఒప్పందాన్ని పార్టీ కార్యకర్తలు తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో మేనిఫెస్టో... రాష్ట్రం కోసం నిర్దిష్ట ప్రాజెక్టులు, ప్రణాళికలతో మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. కొబ్బరి పీచు, జీడిపప్పు, మత్స్య, చేనేత రంగాల్లో, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ, పూటగడవడమే ఇబ్బందిగా ఉన్న మహిళల జీవితాల్లో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఇవే..ఈ పథకం కేఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం మోపుతుందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని వేణుగోపాల్ పేర్కొన్నారు. రవాణా సంస్థలోని సమస్యలను పరిష్కరించడానికి యూడీఎఫ్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ వంద స్థానాలను గెలుచుకుంటుందననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
రేవంత్ను సీఎం చేసింది నేనే: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది తానేనని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ లాబీలో సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ తప్ప పవర్ఫుల్ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం మీటింగ్లో నేనే చెప్పాను. ఎవరు అవునన్నా కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేన''ని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ క్యారెక్టర్ తనదేనని మల్లారెడ్డి వెల్లడించారు. దర్శకుడు హరీష్ శంకర్ విలన్ పాత్ర చేయమని తనను అడిగితే నో చెప్పానని అన్నారు. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు.విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువమల్లారెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సరదాగా స్పందించారు. ''మల్లారెడ్డి నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ'' అంటూ తలసాని హాస్యమాడారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. కాగా, ఇటీవల 50వ పెళ్లిరోజు మల్లారెడ్డి ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. చదవండి: దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు -
ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం తాజాగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో ఇంటర్వ్యూ: చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్.ఎస్.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ సెల్వరాజ్ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే సీన్ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. కమల్ ఖాతాలో పడేనా.. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.టికెట్ దక్కకపోవడమే కారణమా?2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహంనందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.సీఎం చర్చలు విఫలం?నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది. -
అవగాహనలేమితో తెలంగాణ పరువు తీస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు. -
ప్రభుత్వాలు లేకున్నా పార్టీ ఉంటుంది
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది..కార్యకర్తలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వాలు ఉండవు.. పార్టీయే శాశ్వతం.. ఎందరో ప్రాణ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ కాంగ్రెస్.. ఇది ప్రజల పార్టీ.. పార్టీ కోసం మనం కష్టపడితే ఫలితాలు దక్కుతాయి’అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడారు.ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ గెలవదని, ఏదైనా పోటీ ఉంటుందంటే అది బీజేపీతోనే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని, డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఏప్రిల్ చివరి లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ చైర్మన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీకనీకి వచ్చిండ్రా.. కార్యకర్తలపై ఎంపీ చామల ఫైర్భువనగిరి ఎంపీ చామల కాంగ్రెస్ పార్టీ కేడ ర్పై సీరియస్ అయ్యారు. సభలో ఎంపీ మా ట్లాడుతున్న సమయంలో కొందరు కార్యక ర్తలు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆగ్ర హించిన ఎంపీ ఏయ్ మాట్లాడకండయ్యా. మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లా డుకోండి.. ఇక్కడ సీరియస్గా మాట్లాడు తుంటే పీకనీకి వచ్చిండ్రా ఈడ అని అన్నా రు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. -
25న రాజీనామా చేస్తున్నా..
జగిత్యాల టౌన్: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కూడా ఒక కారణమన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు. నేను ఒక్కసారి చెబితే..!జీవన్రెడ్డి, రజినీకాంత్తో పోస్టర్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి’
నర్మెట్ట: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా ఆయిల్ఫామ్ ప్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం. 2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్.. ‘రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తుపాన్కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.సీఎం రేవంత్ పర్యటనపై బీఆర్ఎస్వీ నిరసనసీఎం రేవంత్ నర్మెట్ట పర్యటనపై బీఆర్ఎస్వీ(బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అంటూ ఫ్లకార్డులను బీఆర్ఎస్వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. -
‘బీఆర్ నాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు’
సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చంద్రబాబు నియమించారు. బీఆర్ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు. -
రాజీనామాపై జీవన్రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: రాజీనామాపై మాజీ మంత్రి జీవన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్లో కొనసాగలేనని.. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో రాజీనామాను ప్రకటించిన జీవన్రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్రెడ్డి లేఖ విడుదల చేశారు.కాంగ్రెస్లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జీవన్రెడ్డి.. 40 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 25న సమావేశంలో చర్చించేందుకు కలుద్దామన్న జీవన్రెడ్డి.. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించారన్నారు.ఇదిలా ఉండగా, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ బుజ్జగింపులు ఫలించలేదు. శనివారం జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్రెడ్డి నుంచి మొదట నుంచి బలమైన సంకేతాలు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలు ఇప్పటికే జీవన్రెడ్డితో ఫోన్లో మాట్లాడగా, రెండురోజుల క్రితం పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాజాగా మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అయినా కూడా జీవన్రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. -
‘పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు’
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్కు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయిలతో కేసీఆర్ కాళేశ్వరం అంటే,.. ఇప్పుడు రేవంత్ మూసేశ్వరం అంటున్నారని సెటైర్లు వేశారు.ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు అంశంపై రాంచందర్ రావు అధ్యక్షతను చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే నిధులు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి మూసీ ప్రక్షాళనకు ినిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అని ప్రశ్నించారు. -
ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదు: సీపీఐ నారాయణ
సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదంటూ మండిపడ్డారు.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు...కోటి మంది భారతీయులు గల్ప్ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు -
రాజకీయ ఒత్తిళ్లతోనే బోట్లు వదిలిపెట్టారు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మత్స్యకారులు నిర్బంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదలిపెట్టేశారన్నారు ఆరోజు( ఆదివారం) నెల్లూరులో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలను ఎండగట్టారు.తమిళనాడు నుంచి బోట్లు వచ్చి రాష్ట్ర మత్స్య సంపదని అక్రమంగా దోచుకుంటున్నాయని దీంతో రాష్ట్ర మత్స్యకారులు ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లు పట్టుకున్నారన్నారు. అంత కష్టపడి వాటిని పట్టుకుంటే మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో వాటిని వదిలిపెట్టారని తెలిపారు. బీదా మస్తాన్ రావ్, కావలి సీఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారు. మత్స్యకార గ్రామ పెద్దకాపు తాతయ్య వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్ వీరి పాత్ర కనబడుతుందన్నారు.తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లతోనే చంద్రబాబు, లోకేష్ ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. పోలీసులను ఉపయోగించి పక్క ప్లాన్ అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన దారుణంతో మత్స్యకారులు ఆవేశంతో రగిలిపోతున్నారని ఈ ఘటనపై గళం విప్పుతున్న మత్స్యకారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక హర్బర్ నిర్మాణాలు చేపట్టారన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాటిని సైతం ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.పోలీస్ మార్క్ రాజకీయాలు నెల్లూరు జిల్లాలో రాజ్యమేలుతున్నాయని మంత్రి లోకేష్ పర్యటనకు మత్స్యకారుడు అయిన సర్పంచ్ కు ఆహ్వానం లేదని దుయ్యబట్టారు. శిలాఫలకంలో మత్స్యకార సామాజిక వర్గాలను చెందిన సర్పంచ్ పేరు వేయడానికి ప్రభుత్వానికి నామోషీగా ఉందన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు అండగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఏదేమైనా అపహరించుకపోయిన బోట్లను యధాస్థానంలో పెట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి కాకాణి స్పష్టం చేశారు. -
బీఆర్ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్ నాయుడుకు అటెండర్ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.కీలక సమావేశంలోనే బీఆర్ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.బీఆర్ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్ ఐదో తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9న జరగనున్న ఒకే దశ పోలింగ్ కోసం రాష్ట్రంలో సన్నాహాలు సాగుతున్నాయి. 126 స్థానాల కోసం జరుగుతున్న ఈ సమరంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. అస్తిత్వం, సామాజిక న్యాయం, వివాదాస్పద ‘ఎవిక్షన్’ డ్రైవ్లు.. మొదలైనవి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాలు ఈసారి ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతున్నాయి.1. జుబీన్ గార్గ్ సెంటిమెంట్అస్సాం సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ 2025 సెప్టెంబర్లో సింగపూర్లో మృతిచెందడం రాష్ట్ర ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఈ కేసును హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం స్పెషల్ కోర్టుకు అప్పగించినప్పటికీ, విచారణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువతలో ‘వాయిస్ ఆఫ్ జనరేషన్’గా పేరొందిన జుబీన్ ప్రభావం ‘సైలెంట్ ఓటర్ల’ రూపంలో తీర్పును మార్చే అవకాశం ఉంది.2. ఎవిక్షన్ డ్రైవ్లు (ఆక్రమణల తొలగింపు)అటవీ భూములు, ఆలయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేశామని బీజేపీ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్ మాత్రం దీనిని మైనారిటీలను లక్ష్యం చేసుకుని చేసిన మానవతా సంక్షోభంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ అంశం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకం కానుంది.3. చొరబాటు - సీఏఏ/ఎన్ఆర్సీ చర్చఅక్రమ వలసల అంశం అస్సాం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పీడిత మైనారిటీలకు రక్షణగా సీఏఏను బీజేపీ సమర్థిస్తుంటే, అస్సాం ఒప్పందాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఎన్ఏఆర్సీ ద్వారా అసలైన భారతీయులను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.4. బాల్య వివాహాలపై ఉక్కుపాదం‘పాక్సో’ చట్టం కింద ప్రభుత్వం చేపట్టిన సామూహిక అరెస్టులను ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రక సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తోంది. అయితే ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉన్న మహిళా ఓటర్ల తీర్పుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.5. సంక్షేమం - నిరుద్యోగంనెలకు ₹1,250 అందించే ‘అరుణోదయ్ పథకం, టీ-వర్కర్ల సంక్షేమం, 1.6 లక్షల ఉద్యోగాల కల్పనపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అయితే పెరిగిన అప్పులు, నిరుద్యోగం, భూసేకరణ సమస్యలను ఎత్తిచూపుతూ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దీటుగా బదులిస్తోంది.అస్సాం ఎన్నికల కీలక తేదీలునామినేషన్ల గడువు: మార్చి 23, 2026పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026 (ఒకే దశ)ఫలితాల విడుదల: మే 4, 2026ఇది కూడా చదవండి: Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’ -
Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’
తిరువనంతపురం: కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే 600 కిలోమీటర్ల పొడవైన కేరళ తీరంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏ పార్టీ గెలిచినా తమ బతుకులు మారడం లేదని ఇక్కడ ఉంటున్న మత్స్యకారులు నేతలను నిలదీస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ, కేవలం ‘ఓటు బ్యాంకు’గా మాత్రమే తమను వాడుకుంటున్నారన్న కోపం ఇప్పుడు వారి గళంలో స్పష్టంగా వినిపిస్తోంది.నిర్ణయాత్మక శక్తిగా..ఈ ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది జనాభా కలిగిన లాటిన్ కాథలిక్ కమ్యూనిటీ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. తిరువనంతపురం లాటిన్ ఆర్చ్డయోసీస్ వికార్ జనరల్ ఫాదర్ యూజీన్ పెరీరా మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ సమస్యలకు మేనిఫెస్టోలో ఇచ్చే ప్రాధాన్యతను బట్టే మద్దతు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇది అన్ని పార్టీలకు ఒక హెచ్చరికలా మారింది.విజింజం కల.. జాలర్ల కన్నీరుఒకప్పుడు గర్వకారణంగా భావించిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం, నేడు స్థానిక మత్స్యకారుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోర్టు నిర్మాణంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, అంతర్జాతీయ పోర్టుకు ఆనుకుని ఉన్న కోవలం తదితర నియోజకవర్గాల్లో ప్రజలు నేటికీ తాగే నీటిని బిందె రూ. 7 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నీటి కష్టాలు రాబోయే ఎన్నికల్లో పాలకులకు గట్టి దెబ్బే తగిలేలా ఉన్నాయి.కబళిస్తున్న సముద్రం.. కనుమరుగవుతున్న ఇళ్లుతీరప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘సముద్ర కోత’. అలల ఉధృతికి ఇళ్లు జలసమాధి అవుతుంటే, పునరావాసం కోసం మత్స్యకారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బ్లూ ఎకానమీ’ విధానాలు, సముద్ర భాగాలను మైనింగ్ కోసం లీజుకు ఇవ్వడం వంటి నిర్ణయాలపై జాలర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సముద్రమే తమ తల్లి అని నమ్ముకున్న వారు, ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు.పెండింగ్ డిమాండ్లు.. అప్పుల ఊబిచిరయింకీజులో సముద్రపు గోడ నిర్మాణం, ముతలపొళి వద్ద పూడికతీత పనులు వంటి మౌలిక వసతుల డిమాండ్లు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు, వాతావరణ మార్పుల వల్ల వేట తగ్గి, ఆదాయం పడిపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. రాజకీయ నేతల ఆర్భాటపు ప్రసంగాలు తమ ఆకలిని తీర్చవని, తమ సమస్యలను పరిష్కరించే వారికే ఈసారి ఓటు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.జాలర్ల ఆగ్రహం..కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత్స్యకారులందరిదీ ఇప్పుడు ఒకటే గోడు. ఈ ‘తీరప్రాంత ఓటు’ కేరళ రాజకీయాల్లో ఏ పార్టీని ముంచుతుందో, ఎవరిని గట్టెక్కిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓట్ల పండగ వస్తోంది కానీ, ఆ ఇళ్లలో వెలుగులు నింపే నేత ఎవరో తేలాల్సి ఉంది. జాలర్ల ఆగ్రహం ఈసారి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
‘జీవన్రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నా’
కరీంనగర్ : జీవన్రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్థాపం చెంది ఉండవచ్చని, ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. ఈ మేరకు జీవన్రెడ్డి రాజీనామా చేస్తారని నిర్ణయంపై సాక్షీ టీవీతో శ్రీధర్బాబు మాట్లాడారు. జీవన్ రెడ్డికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారని, పార్టీ ఆదేశం మేరకే ఆయనతో చర్చలు జరిపామన్నారు. తప్పకుండా జీవన్రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నానన్నారు. కాగా, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. -
బీఆర్ఎస్లో కలకలం.. కౌశిక్రెడ్డిపై తిరుగుబాటు?
సాక్షి, కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ బీఆర్ఎస్లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో రహస్య సమావేశం సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామాలు చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే భేటీ అంటూ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది.సీనియర్ నాయకులు, మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే చర్చ సాగుతోంది. పార్టీ మార్పా? బీఆర్ఎస్లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్పై పోరాటమా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్లు, ఇతర నాయకులంతా వందమంది దాకా రహస్య భేటీకి హాజరయినట్లు తెలుస్తోంది. -
తిరుమలలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ.. భక్తుల ఆశ్చర్యం
సాక్షి, తిరుపతి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చంద్రబాబు.. టీటీడీలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ల్యాబ్ని బాబు తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2023లో ల్యాబ్ ఏర్పాటుకు సీఈఓ కమలవర్థన్ చర్చలు జరిపారు. అనంతరం, 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటుకు వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. నాటి నిర్ణయం మేరకు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. వైఎస్ జగన్ హయాంలోనే ల్యాబ్ బలోపేతమైంది.ఇంత జరిగినా బిల్డప్ బాబు చంద్రబాబు మాత్రం ప్రసాదం నాణ్యతకు తానే దృష్టిపెట్టినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. అయితే, వైఎస్ జగన్ గతంలోనే తిరుమలలో ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, తాజాగా చంద్రబాబు క్రెడిట్ చోరీని చూసిన శ్రీవారి భక్తులు నివ్వెరపోతున్నరు. -
కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా.. ముహూర్తం ఫిక్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. -
త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. రానున్న పది, పదిహేను రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మోదీ పర్యటన, జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.వివరాల మేరకు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ.. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ తెలంగాణలో కూడా పర్యటించేలా స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక, ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే నేడు సికింద్రాబాద్ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగే అవకాశం ఉంది. -
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్కుమార్రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
ఇంత అన్యాయమా తల్లీ!
ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్ను మాత్రం టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?మంగళవారం ఎన్సీఎల్టీలో కౌంటర్ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?జగన్ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.ఎన్సీఎల్టీ తీర్పు అర్థమేమిటి?న్యాయాన్యాయాలు తేల్చమని జగన్ ఎన్సీఎల్టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? మీరు ఒక సైడ్ తీసుకోవడం న్యాయమా?చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అటాక్ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? సరస్వతీ పవర్, ఈడీ అటాచ్మెంట్లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్తో షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది. చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్ బెయిల్ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్సైడ్ తీసుకున్నారనేగా తల్లీ. కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్ భరించారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. విజయవాడ యువరాజ్ సినిమా «థియేటర్ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్కు కూడా ఇచ్చారని చెప్పారు. మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు. 2019 ఆగస్టులో జగన్ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్ మెంట్ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?వైఎస్సార్గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. అవి జగన్ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్ కమిషన్కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కంపెనీ షేర్స్ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్ దగ్గరే ఉన్న షేర్స్ సర్టిఫికెట్స్ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ షేర్స్ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?మీరు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎన్సీఎల్టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్సైడ్ తీసుకున్నారు. షర్మిల సైడ్ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్ తప్పులు, బీఆర్ నాయుడు తప్పులు, పుట్టా మహేష్ డ్రగ్స్ విషయం నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్ మీరు రిలీజ్ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్లోని వెబ్సైట్లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? -
‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు. ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. -
మహారాష్ట్రలో మరో రాజకీయ దుమారం..!
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్ ఖారత్తో ఆ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది. మహిళా చైర్పర్సన్స్ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. చైర్పర్సన్ పదవికి చకాంకర్ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రుపాలి చకాంకర్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు. మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే), అజిత్ పవార్ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్డ్రైవ్లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.అయితే ఇప్పుడు మహిళా చైర్పర్సన్ రూపాలి .. ‘కెప్టెన్’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్ అశోక్తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. -
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఉగాది రోజు కూడా చంద్రబాబు అబద్ధాలు’
తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్ సిక్స్తో సూపర్ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గులేని బీఆర్ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్.. బీఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్కే రోజా విమర్శించారు. -
బీజేపీ టికెట్ అడిగా: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.కచ్చితంగా టికెట్ వస్తుందిబాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు. 112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్గంజ్లో రేఖా పాత్రాను, సోనార్పూర్ దక్షిణ్లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్లో సబితా బర్మన్, నబగ్రామ్లో దిలీప్ సాహా, ఖర్గ్రామ్లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్ ఘోష్ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.భరత్పూర్ నుంచి అనామికా ఘోష్, బొంగావ్ దక్షిణ్ నుంచి స్వపన్ మజూందర్, కమర్హాతిమ్ నుంచి అరూప్ చౌదరీ, సందేశ్ఖాలీ నుంచి సనత్ సర్దార్, మందిర్బజార్ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్ నుంచి సుమనా సర్కార్ పోటీకి నిలబడుతున్నారు. చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
శశికళ వెన్నుపోటు.. ‘నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్’!
తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్బీ ఉదయ్కుమార్ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్బీ ఉదయ్కుమార్ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్కుమార్కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
జలుక్బరి నుంచి హిమంత బిశ్వ శర్మ పోటీ
న్యూఢిల్లీ: అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం 88 మంది అభ్యర్థులతో కూడిన తన తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు కూడా ఉంది. జలుక్బరి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు.బుధవారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ను దిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరిన భూపేన్ కుమార్ బోరా, బిహ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ తముల్పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జోర్హాట్ స్థానంలో మాజీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, గౌరవ్ గోగోయ్తో తలపడనున్నారు. రాష్ట్ర మంత్రులు పిజూష్ హజారికా, జయంత మల్లా బారుహ్, అశోక్ సింఘాల్, అజంతా నియోగ్, చంద్రమోహన్ పట్వారీ, రూపేష్ గోవాలా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. హఫ్లాంగ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందితా గర్లోసా ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగడం లేదు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సిద్ధార్థ భట్టాచార్యకు ఆయన ప్రస్తుత స్థానమైన గౌహతి తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమియా కుమార్ భూయాన్ (బిహ్పురియా), అతుల్ బోరా (దిస్పూర్)లకు మొండిచేయి చూపారు. ఈ రెండు స్థానాల నుంచి ఫిరాయింపుదారులు బోరా, బోర్డోలోయ్లకు టికెట్ ఇచ్చారు. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఎంతో తెలుసా? -
కేరళ కాంగ్రెస్లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
దురంధర్గా ఇళయ దళపతి విజయ్?
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందే తడవుగా తమిళనాట రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండోసారి విజయం కోసం డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతుండగా.. ఎన్డీయేతో పొత్తు ఉన్నప్పటికీ అన్నాడీఎంకే తడబడుతోంది. జయలలిత మరణానంతరం ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే నేత లేరనే అపవాదును పళనిస్వామి కొంత వరకు దూరం చేస్తున్నా.. పొత్తు ధర్మంలో స్వతంత్ర నిర్ణయాలు పనికి రావనే విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో డీఎంకే ఆయనను పది ఓటముల పళనిస్వామి అని హేళన చేస్తుండగా.. అన్నాడీఎంకే నేతలు మాత్రం అధికార పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు తప్పనిసరి. పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అన్నాడీఎంకే పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకి సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందా? తలనొప్పిని తెచ్చిపెడుతుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అదే సమయంలో సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో పొత్తుకోసం బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దక్షిణాదిలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ.. విజయ్కి పెద్దపీట వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఆ పరిణామం అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దళపతి విజయ్ రాజకీయ దురంధురుడుప్రస్తుతానికి విజయ్ మాత్రం తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. అయితే.. రాజకీయాల్లో చివరి క్షణం వరకు సమీకరణాలు ఎలామారిపోతాయో పసిగట్టడం కష్టమే..! ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్లాలని టీవీకే భావిస్తే.. అన్నాడీఎంకే పొత్తుధర్మంలో భాగంగా పలు స్థానాలను మిత్రపక్షాలకు వదిలేయాల్సి ఉంటుంది. దాంతో.. పార్టీలో రెబెల్స్ పుట్టుకొచ్చి, మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు బీజేపీ మాత్రం తమిళనాట పాగా వేయడమే పరమావధిగా భావిస్తూ.. దళపతి విజయ్ని తమిళ రాజకీయ దురంధరుడిగా భావిస్తోంది. అంటే.. పొత్తు కుదిరితే.. ఎన్డీయే ఘనవిజయం సాధిస్తే.. కింగ్ మేకర్ విజయ్ అవుతారన్నమాట..!సామ, దాన, బేధ, దండోపాయాలతో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తే.. రాజనీతిని ప్రయోగిస్తుంది. రాజనీతిలో అత్యంత కీలకమైన నియమం.. సామ, దాన, బేధ, దండోపాయాలను అందిపుచ్చుకుంటుందని సమాచారం. నామినేషన్ల తేదీ సమీపిస్తున్నా.. అన్నాడీఎంకే తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు తమిళనాట విజయం అనేది అన్నాడీఎంకేకు సీట్ల కేటాయింపు సమస్యే కాదు.. ఒకవేళ మళ్లీ ఓటమిపాలైతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు.ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్?ఒకవేళ ఎన్డీయే కూటమిలో దళపతి విజయ్ చేరితే.. అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు తమిళ తంబీలను వేధిస్తోంది. అటు డీఎంకే కూడా ఈ పరిణామాలను అత్యంత సమీపం నుంచి పరిశీలిస్తోంది. అయితే.. అన్నాడీఎంకే వర్గాల మేరకు.. ఆ పార్టీ కచ్చితంగా తమకు 130 సీట్లు కావాలనే డిమాండ్ను బీజేపీ ముందు పెడుతుంది. పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ కొద్దోగొప్పో పుంజుకుంటోంది. టీవీకే విజయ్కి కూడా అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. అందుకే.. పళనిస్వామి తనకు పట్టున్న ప్రాంతాలను కోరే అవకాశాలున్నాయి.అగమ్య గోచరంగా అన్నాడీఎంకే అవి.. అన్నాడీఎంకేకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న కొంగు ప్రాంతం. అంటే పశ్చిమ తమిళనాడులోని నియోజకవర్గాలు. అదేవిధంగా దక్షిణ జిల్లాల్లోనూ అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ.. మదురై, ఈరోడ్, దిండిగల్, థేని వంటి ప్రాంతాల్లో టీవీకేకు ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పరిమిత సీట్లే దక్కే అవకాశాలున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ అన్నాడీఎంకేకు కంచుకోటల్లాంటివి. ఇప్పటికీ అక్కడ సంప్రదాయ ఓటర్లున్నా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాలను కోల్పోతే.. పార్టీ ఆదరణ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.మొత్తానికి ఇప్పుడు టీవీకే తమిళనాడులో అన్నాడీఎంకే పాలిట శరాఘాతంగా మారుతోంది. టీకప్పులో తుఫానును పుట్టిస్తోంది. పొత్తు ఉన్నా.. లేకున్నా.. అన్నాడీఎంకే పట్టున్న ప్రాంతాల్లో పాగావేసి, పెను విధ్వంసం సృష్టించేలా ఎదిగే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. -
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్ కుమార్తె, జగన్కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది. మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్ 2004లో అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు...విజయవాడ యువరాజ్ థియేటర్లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్ అండ్ మినరల్స్ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్ జగన్ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు...అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు...నువ్వు కొంగుపట్టుకుని జగన్కి, అవినాష్కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు...అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది...జగన్పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్లో పెట్టాలనుకుంది. వైఎస్ జగన్ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్ జగన్ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు...వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు...మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్ను టార్గెట్ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు...తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి...5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు...నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్ సైన్యం కానే కాము. జగన్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్మీట్ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. -
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్ తగులుతోంది. మొదట కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్బై చెప్పారు. అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...” అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి. -
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబుదే: సతీష్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శిస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్ చేస్తోందన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్ జగన్ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడుఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.यूपी – जिला महराजगंज में BJP के कार्यक्रम में एक महिला कार्यकर्ता ने पुरुष कार्यकर्ता का कॉलर पकड़ लिया, हाथापाई की, उसे चप्पल दिखाई। महिला कार्यकर्ता का आरोप था कि LIC पॉलिसी के नाम पर साढ़े 4 लाख रुपए लिए, लेकिन इस व्यक्ति ने वो पैसे खाते में जमा .!#UttarPradesh #Maharganj pic.twitter.com/IzETG53KxF— Anil Yadav (Journalist) (@AnillYadavIN) March 19, 2026రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.పోలీసుల జోక్యంసమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.పార్టీ స్పందనఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
‘నవ కేరళ సర్వే’ టార్గెట్.. బీజేపీ ప్లాన్ ఫలించిందా?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే, ఎన్నికల వేళ కేరళలోని పినరయి విజయన్ సర్కార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నవ కేరళ సర్వే’ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించి “నవ కేరళ సర్వే” అనే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కేరళలో దాదాపు 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సర్వేలో భాగంగా కేవలం 49.42 లక్షలు మాత్రమే సేకరించినట్టు సమాచారం. కాగా, సర్వేల సందర్బంగా ప్రభుత్వ పెద్దల ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. సర్వే అసలు ఉద్దేశ్యం ఎల్డీఎఫ్ను తిరిగి అధికారంలోకి తేవడమే అని బయటపడింది. దీంతో, కేరళ బీజేపీ నేతలు రంగంలోకి దిగి తీవ్ర ఆరోపణలు చేశారు.రాజకీయ ఉద్దేశంతోనే నవ కేరళ సర్వేను చేపట్టినట్టు ఆరోపించారు. అనంతరం, కాషాయ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను వాడటం అన్యాయమని పేర్కొంటూ సర్వేను రద్దు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సర్వేను చేపట్టినట్టు తెలిపింది. అనంతరం, హైకోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పబ్లిక్ అవుట్రీచ్ & డెవలప్మెంట్ ఫీడ్బ్యాక్ ఇనిషియేటివ్ మాత్రమే, ఎన్నికల ప్రచారం కాదని తెలిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. సర్వే కొనసాగించడానికి అనుమతించింది. ఇదే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అని తెలుసుకోవడంలో తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే, ఈ సర్వేలో ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న నెంబర్ కంటే తక్కువ సంఖ్యలో సర్వే జరగడం, పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకంగా కనిపించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సర్వేలో తక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల సర్వే విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.సర్వే ముఖ్యాంశాలుసర్వే లక్ష్యం: 95 లక్షల ఇళ్లలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం.నిజంగా చేరుకున్న ఇళ్లు: 49.42 లక్షలు.సేకరించిన అభిప్రాయాలు: కేవలం 4.5 లక్షలు.ఫోకస్ గ్రూప్ చర్చలు: కుడుంబశ్రీ వంటి సంఘాల ద్వారా 46,000 అభిప్రాయాలు మాత్రమే సేకరించబడ్డాయి.వాలంటీర్లు: 96,200 మంది నమోదు చేసుకున్నా, శిక్షణకు హాజరైన వారు చాలా తక్కువ.ఆర్థిక వ్యయాలుస్టేషనరీ, బ్రోచర్లు, పుస్తకాలు: సర్వే కోసం రూ.8 కోట్లు ఖర్చు చేశారు.85,000 బుక్లెట్లు ముద్రించబడ్డాయి.ఫారమ్లు, ఫీడ్బ్యాక్ ప్యాడ్లు, నోటు బుక్స్ కోసం భారీగా ఖర్చు జరిగింది.ఇక, నవ కేరళ సర్వేలో ప్రజలు ప్రధానంగా ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, రహదారులు–నీటి సరఫరా, మహిళా సాధికారత, రైతు సహాయం వంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.ప్రజలు ఇచ్చిన ప్రత్యేక సూచనలు1. ఉద్యోగాలు & ఉపాధికొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు పెంచాలని సూచించారు.ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు.2. ఆరోగ్యంగ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఔషధాలు, అత్యవసర సేవలు పెంచాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.3. విద్యపాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు.స్కాలర్షిప్లు మరియు ఆర్థిక సహాయం విస్తరించాలని సూచించారు.గ్రామీణ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు.4. మౌలిక సదుపాయాలురహదారులు, నీటి సరఫరా, గృహ నిర్మాణం, శుద్ధి వ్యవస్థలు మెరుగుపరచాలని సూచించారు.పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెంచాలని కోరారు.5. సంక్షేమ పథకాలుకుడుంబశ్రీ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.పింఛన్లు, రైతు సహాయం, గృహ పథకాలు మరింత పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.సామాజిక భద్రతా పథకాలు విస్తరించాలని అభిప్రాయపడ్డారు. -
బిహార్ సీఎంగా ‘సామ్రాట్’.. నితీష్ వ్యాఖ్యలకు మంత్రి క్లారిటీ!
పట్నా: బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే చర్చ.. సీఎం నితీష్ కుమార్ వారసుడు ఎవరు? ఆయన తన వారసుడిగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి బ్రేక్ వేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, మీడియా కేవలం ఊహాగానాలతో వార్తలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.అసలేం జరిగింది?ఇటీవల జముయి జిల్లాలో జరిగిన ‘సమృద్ధి యాత్ర’లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న సామ్రాట్ చౌదరీని చూపిస్తూ.. ‘ఇకపై ఈయనే బీహార్ బాధ్యతలను చూసుకుంటారు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు. నితీష్ రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపాయి. సామ్రాట్ చౌదరిని నితీష్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించేశారని అంతా భావించారు.మంత్రి క్లారిటీ ఇదీ..ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఇఫ్తార్ వేడుక అనంతరం మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడారు. నితీష్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ‘ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. నితీష్ కుమార్ ఎప్పుడూ తన కేబినెట్ సహచరులను ఇలాగే ప్రోత్సహిస్తుంటారు. బాధ్యతలు చూసుకోమని చెప్పడం ఆయనకు అలవాటే. ఇందులో కొత్త సిగ్నల్స్ ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.మారుతున్న రాజకీయ సమీకరణలునితీష్ కుమార్ తన పదవిని వదులుకున్నాక, బీహార్లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలో చేరారు. కొత్త ప్రభుత్వంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, మైనారిటీల పట్ల నితీష్కు ఉన్న అంకితభావాన్ని మంత్రి కొనియాడారు. రాజకీయం అనేది భావోద్వేగాలతో కాకుండా సమీకరణలతో నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీయూలో కీలక నేత కేసీ త్యాగి రాజీనామా చేయడంతో బిహార్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.ఇది కూడా చదవండి: నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు -
అసెంబ్లీలో పాడి వేడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్ కమిషనరేట్కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.దొంగ ఆఫీసర్లు.. డ్రగ్స్ తీసుకున్నారా? అంటూ..సభ అనంతరం పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్ ఆలం లీవ్లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్ లెటర్పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్ వేయాలని కోరారు.ఈనెల 30వ తేదీ వరకే డెడ్లైన్సీపీ పవిత్ర రంజాన్మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్మీట్లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. -
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఐప్యాక్ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో సోదాలు చేపట్టడానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోవడం, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిస్సహాయంగా వదిలివేయలేమని, ఏదో ఒక పరిష్కారం కావాల్సిందేనని పేర్కొంది.జనవరి 8న కోల్కతాలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా, మమతా బెనర్జీ అక్కడకి దూసుకొచ్చారు. సోదాలకు అడ్డు తగలడంతోపాటు అక్కడున్న ల్యాప్టాప్, ఫోన్, కొన్ని ఫైళ్లు బలవంంతంగా లాక్కొని వెళ్లిపోయా రు. తర్వాత ఐప్యాక్ కార్యాలయంలోనూ హల్చల్ చేశారు. ఈడీ బృందం పట్ల దురుసు గా ప్రవర్తిస్తూ కొన్ని పత్రాలు తీసుకెళ్లారు. తమ దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.‘‘ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇలాగైతే ఏం చేయాలి? రేపు మరో ముఖ్యమంత్రి కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాటికి ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందే’’ అని ధర్మాసనం పేర్కొంది. అనుచిత, అభ్యంతరకర పరిణామాలు పునరావృతం కాకుండా ప్రామాణిక కార్యాచరణ నియమావళి(ఎస్ఓపీ)ని రూపొందించాలని తేలి్చచెప్పింది. ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా వేయాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదావేసింది. -
కాంగ్రెస్తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్కు ముస్లిం మతపెద్దలు, నేతలు చౌకత్తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి వైఎస్ జగన్ ప్రార్థనలు (నమాజ్) నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపజేస్తూ వైఎస్ జగన్ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయంగా ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం సోదరులు జగన్ సీఎం కావాలంటూ ‘దువా..’మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా, వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్బాషా, ఎంఎస్ మక్బూల్, పలు జమాత్ల పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్ జగన్ చేయిపట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అంటూ దువా (ప్రార్థన) చేశారు.ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు హోరెత్తిన అభిమానం..వైఎస్ జగన్ను చూసేందుకు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇఫ్తార్ విందుకు అభిమాన జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇస్సాక్ బాషా, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, రమేష్యాదవ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, అత్తర్ చాంద్బాషా, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పి.గౌతంరెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, ముస్లిం నేతలు మక్బుల్, నదీమ్ అహ్మద్, అసిఫ్, అహ్మద్ అలీ, ఫారుఖీ, షేక్ మునీర్ అహ్మద్ తదితర జమాత్ల పెద్దలు పాల్గొన్నారు. -
విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారని, కానీ తమ అధ్యక్షుడు విజయ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని అర్జున వెల్లడించారు. ‘పదవి కోసం ఢిల్లీ పెద్దల ముందు తలవంచే వ్యక్తి విజయ్ కాదు. వారు మాకు 50 నుంచి 90 సీట్ల వరకు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం తనకు ముఖ్యమంత్రి పదవి కాదు, తమిళనాడు ప్రజల నమ్మకం మాత్రమే కావాలని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. అయితే ఆఫర్ ఇచ్చిన పార్టీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని, రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో టీవీకే ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. పొత్తులపై ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పొత్తుల కోసం తమ పార్టీ టీవీకేతో చర్చలు జరపలేదన్నారు. టీవీకేతో పొత్తు కోసం బీజేపీ సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్పై చేసిన వ్యాఖ్యలకు అధవ్ అర్జున క్షమాపణలు చెప్పారు. -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్బాబు, ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్ జోన్ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్బాబు కేటీఆర్ మాటలపై మంత్రి శ్రీధర్బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్ ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. బీఆర్ఎస్కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
‘దివ్యాంగులకు 16 సర్వీసుల్లో ఫ్రీ బస్సు వర్తింపచేయాలి’
సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్మీట్లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ప్రచార ఆర్భాటంతో సరి:కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.2016 నాటి చట్టం అమలు చేయాలి:ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేసేవారు.కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియరింగ్ యంత్రాలు, బ్లైండ్ పర్సన్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్షిప్స్ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు?:వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఎన్నికల వేళ పొత్తులపై కుండబద్దలు కొట్టిన విజయ్
చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని చెప్పారు.తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. -
రాహుల్పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం
సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.Delhi: On Leader of Opposition Rahul Gandhi, BJP MP Kangana Ranaut says, "Hum mahilaon ko bahut zyada unko dekhkar uncomfortable feel hota hai, Kyunki ekdum jaise tapori ki tarah wo aate hain aur kisi ko bhi 'aae tu aise karke, tu tadak kar' kehte hain...'' pic.twitter.com/XzZ62MmLbg— IANS (@ians_india) March 18, 2026ప్రియాంకతో పోలికఅయితే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.#WATCH | Delhi | Over Kangana Ranaut's comments on Rahul Gandhi, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "There could be personal or political disagreements, but saying something like this for Rahul ji is wrong. I have seen Rahul ji's commitment towards the upliftment of… pic.twitter.com/w5tzBvsjax— ANI (@ANI) March 18, 2026 -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
‘ముస్లింలను చంద్రబాబు మోసం చేశారు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్లకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ది’’ అని అంజాద్ బాషా గుర్తు చేశారు.‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్ బాషా నిలదీశారు.‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304 కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
‘నేను భోజనం చేస్తున్నాను.. ప్రస్తుతం పాయసం తింటున్నాను’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే.. ఐతే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులుంటాయి. ఈ రెండు పార్టీలు మినహా.. మరో పార్టీ పాగా వేసే అవకాశాలే ఉండవంటే.. అక్కడి పరిస్థితులను, ఓటర్ల విస్పష్ట తీర్పును అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న డీఎంకే.. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ను కరుణానిధి అణచివేయడంతో అన్నాడీఎంకేగా చీలిపోయింది. ఒక్క మంత్రి పదవి విషయంలో కరుణానిధి మంకుపట్టు.. తమిళనాట మరో ద్రావిడ పార్టీ పుట్టుకకు కారణమైంది. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్ను దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు ఎన్నికలపై ఇప్పుడు దేశమంతా దృష్టిసారించింది. ఒకప్పుడు తమిళగళాన్ని దేశానికి వినిపించేందుకు ఒక్క డీఎంకే పార్టీ ఉండేది. ద్రావిడ వాదంతో ఆ పార్టీ ముందుకు సాగేది. అలనాటి మేటి నటుడు ఎంజీఆర్ తోడవ్వడంతో... కరుణానిధి దూసుకుపోయారు. అయితే.. ఒక్క మంత్రి పదవి విషయంలో ఎంజీఆర్ను పక్కన పెట్టడమే కాకుండా.. కరుణానిధి ఆయనను రాజకీయంగా సినిమాలపరంగా అణచివేయడం.. పార్టీ నుంచి బహిష్కరించినా.. పరోక్ష టార్చర్ను నిలిపివేయకపోవడం వంటి పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా పరిస్థితులు మారడమే కాకుండా.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రత్యర్థులపై కక్షసాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయి.ఎంజీఆర్ క్రేజ్.. అక్కసు వెళ్లగక్కిన కరుణానిధిఅది 1971.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించింది. కరుణానిధికి ఇది రెండోసారి వరుస విజయం. రాజాజీ నేతృత్వంలోని కూటమి ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ సర్కారుకు డీఎంకే దన్నుగా నిలిచింది. నిజానికి అప్పటి డీఎంకే సారధి కరుణానిధే అయినప్పటికీ.. ఆ పార్టీ అభివృద్ధికి ఎంజీఆర్ ఎనలేని సేవ చేశారు. ఆయనకున్న ఫేమ్.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ పార్టీని విజయాల బాట పట్టించింది. ఆ తర్వాత.. పార్టీలో ఎంజీఆర్కు క్రమంగా పెరుగుతున్న ఆదరణను గుర్తించిన కరుణానిధి.. అణచివేత ధోరణిని ప్రారంభించారు. ఎంజీఆర్ తనకు ఆరోగ్యశాఖ కావాలని కోరుతూ.. మంత్రిపదవిని ఆశించారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ శ్రీలంకను సందర్శించడం డీఎంకేకు ససేమిరా నచ్చలేదు. ఆయన శ్రీలంకలో తమిళుల కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారు. ఈ పరిణామాలన్నీ.. డీఎంకేలో చీలిక వస్తుందనే సందేశాలకు దారితీశాయి.సినిమా వర్సెస్ రాజకీయం.. ఏదో ఒకటే కరుణానిధి మంత్రిపదవుల విషయంలో తన మంకుపట్టును వదల్లేదు. ఎంజీఆర్ను ఈ విషయంలో పక్కనబెట్టారు. ఆ సమయంలో జమ్మూకశ్మీర్లో ఓ చిత్ర షూటింగ్లో ఉన్న ఎంజీఆర్.. స్వయంగా కరుణానిధికి ఫోన్ చేశారు. తనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశమివ్వాలని కోరారు. అయితే.. నటనకు దూరమైతేనే మంత్రిగా ప్రజాసేవకు అవకాశమిస్తానని కరుణానిధి తేల్చిచెప్పారు. ఎందుకంటే.. అప్పటికే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్షన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించే పార్టీగా డీఎంకేకు పేరుంది. జోడుపదవులు తగదనేది కరుణానిధి ఆలోచన. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’అయినప్పటికీ ఆయన ఎంజీఆర్కు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ.. రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు పథకానికి చైర్మన్గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కరుణానిధితో ఎంజీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. 1971 అక్టోబరులో ఎంజీఆర్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే కరుణానిధి అమెరికా వెళ్లారు. అదే సమయంలో.. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి డిసెంబరు 3న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాంతో అమెరికా పర్యటనలో ఉన్న కరుణానిధి డిసెంబరు 5న ఆగమేఘాల మీద చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పరిణామాలకు సంబంధించి అప్పట్లో ’ద హిందూ‘ విలేకరి సత్య స్టూడియోలో షూటింగ్లో ఉన్న ఎంజీఆర్ స్పందన కోసం ఫోన్ చేశారు. ఆ ఫోన్ను లిఫ్ట్ చేసిన ఎంజీఆర్ అసిస్టెంట్ మహాలింగం.. విషయాన్ని ఎంజీఆర్కు చేరవేశారు. దానికి ఎంజీఆర్ స్పందిస్తూ.. ‘నేను భోజనం చేస్తున్నాను. ప్రస్తుతం పాయసం తింటున్నాను’ అని సమాధానమిచ్చారు. అప్పట్లో ఆ మాట పతాకశీర్షికలకెక్కింది.కరుణానిధిలో భయం పుట్టించిన ఎంజీఆర్?వేగంగా మారుతున్న పరిణామాలు కరుణానిధికి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దాంతో ఆయన ఎంజీఆర్కు పోటీగా తన కుమారుడు ఎంకే ముత్తును వెండితెరకు పరిచయం చేశారు. ఎంజీఆర్కు సినిమా అవకాశాలు రాకుండా తెరవెనక మంత్రాంగం నెరిపారు. కరుణానిధి ఆదేశాలతో.. పోలీసులు కూడా ఎంజీఆర్ అభిమాన సంఘాలపై అణచివేత ధోరణిని కొనసాగించారు. ఎంకే ముత్తు అభిమాన సంఘాలు పెరిగేందుకు చర్యలు ప్రారంభించారు. ఎంజీఆర్ను అభిమానించే 700 ఫ్యాన్స్ క్లబ్ నేతలపై ఒత్తిడి మొదలైంది. ఈ పరిణామాలన్నీ ఎంజీఆర్కు మరింత చిరాకు పుట్టించాయి. దాంతో.. ఎంజీఆర్ వేరుకుంపటి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనతో వెనక్కి తగ్గిన కరుణానిధి ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఎంకే ముత్తు ఫ్యాన్స్ క్లబ్లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఒక్క ఆదేశంతో డీఎంకేలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరుణానిధి భయపడ్డారనే ప్రతికూల సందేశం దేశంలో వ్యాపించింది.పురుడు పోసుకున్న అన్నాడీఎంకేఎంజీఆర్ అంతటితో ఆగలేదు. డీఎంకే పరిపాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి పాతుకుపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మద్యపానం కారణంగా ప్రాణాలు పోతున్నాయంటూ సమాజానికి చాటిచెప్పారు. నిజానికి ఎంజీఆర్ను డీఎంకే నుంచి బహిష్కరించడం వల్ల ఆయనకు జరిగిన నష్టం లేదు కానీ.. డీఎంకే పార్టీ ఎంతగానో ప్రజాదరణను కోల్పోవడానికి కారణమైంది. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఏడాది కాలంలోనే.. అంటే.. 1972 అక్టోబరు 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. 1986లో ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ పార్టీకి విరాళంగా చెన్నైలోని రాయపేటలో ఉన్న తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా తమిళ రాజకీయాలు కొనసాగాయి. ఎంజీఆర్ వారసురాలిగా 1989 నుంచి 2016 వరకు అన్నాడీఎంకేను జయలలిత నడిపించారు. -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్గా, సీఎంగా విజయన్కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్కు బిగ్ షాక్
గువాహటి: అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విపక్ష కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు.ఈ సందర్భంగా లేఖలో..‘తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నా’ అని ప్రద్యుత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా ప్రద్యుత్ను రాజకీయంగా మభ్యపెట్టారు. అదీ కాకుండా ఆయనకు కుటుంబ విబేధాలు ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ ఏప్రిల్ 9న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మార్గేరీటీ స్థానం కాంగ్రెస్ తరఫున పోటీపడుతున్నారు. కాగా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్': వైఎస్ జగన్
దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఖజానాకు రానివ్వకుండా.. మీ సొంత జేబులు నింపుకొంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? అందుకే మీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారింది. – బాబు పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ఒకవైపు జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తూ, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కోవిడ్ లాంటి పరిస్థితుల్లోనూ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలన్నీ అమలు చేసినప్పుడు.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తే.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్’..! మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షనే..!’ అంటూ ధ్వజమెత్తారు. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో అందరినీ కూడగట్టి ముందుకు సాగుతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నరగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో విశిష్టతను చాటాం... మన హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని మంచి చేశాం. మేనిఫెస్టో విశిష్టతను చాటి చెప్పాం. మేనిఫెస్టో అంటే ఏదో ప్రజలను నమ్మించడానికి కాదు. అదో చెత్త పేపర్ అన్న ముద్ర నుంచి దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించేలా పని చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏడాది కాలంలోనే 99 శాతం హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తుండిపోయేలా మంచి పరిపాలన చేశాం. అందుకే ఈరోజుకీ గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరగ్గలం. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు..రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మనది సుపరిపాలన అయితే.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ప్రజలకు మేలు చేయడం లేదు. నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీ (ఖజానా)లో రూ.100 కోట్లు కూడా లేవు. రెండేళ్లు కోవిడ్తో అంతా అతలాకుతలం. ఒకవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైఎస్సార్సీపీ పాలన సాగింది. అయినా కూడా ఏనాడూ ఆ సాకు చూపలేదు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాం. హామీలన్నీ అమలు చేశాం.రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు..మన ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆ వివరాలన్నీ ఆధార్తో సహా చెప్పగలం. అదే ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. అయినా కూడా హామీల అమలు లేదు. మనం ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు.. ప్రజలకు ఇచ్చిందీ లేదు..! మనం ఐదేళ్లలో చేసిన అప్పులు.. చంద్రబాబు రెండేళ్లలోనే దాటేశారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ప్రజలంతా దీన్నే చర్చించుకుంటున్నారు. అంతా జేబులు నింపుకొంటున్నారు..దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలూ రావడం లేదు. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్.. అన్ని వనరులూ దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటున్నారు. అమరావతిలో చదరపు అడుగు రూ.10 – 12 వేల చొప్పున నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలురానివ్వకుండా, మీ సొంత జేబులు నింపుకుంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే..ఈ ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే.. విద్యా రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. పిల్లలకు ట్యాబ్లు లేవు. టోఫెల్ శిక్షణ లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు లేరు. విద్యాదీవెన, వసతి దీవెన లేవు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పేదలకు ఉచిత వైద్యం లేదు. ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయింది. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. వీరి మైండ్సెట్.. పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదు. చివరకు మహిళలకు సున్నా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టాడు. మనం అమలు చేసిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు... ఇవాళ ఏదీ కనిపించడం లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇళ్ల మంజూరు... 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం... ఇప్పుడు ఏవీ లేవు. పాలనపై ధ్యాస లేదు. అంతా దోచుకో.. పంచుకో...తినుకో.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ!హాజరైన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలుజగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటా. మన కార్యకర్తలంతా ప్రజలకు తోడుగా నిలబడి వారి సమస్యలపై పోరాడాలి. లీగల్ సెల్ను పటిష్టం చేశాం. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తాం.ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..?టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో ఇలాంటివి ఎన్నడూ లేవు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే ఎక్కడా డ్రగ్స్ను నియంత్రించలేదు. ఒక పాలకుడు, నాయకుడికి ఉండాల్సిన గుణాలు చంద్రబాబులో ఎక్కడా కనిపించవు. అందుకే విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశాడని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా... నో యాక్షన్...! కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..? నో యాక్షన్...! మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మీద ఏం చర్యలు తీసుకున్నావు..? నో యాక్షన్...! టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? నో యాక్షన్! మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ! అక్కడా నో యాక్షన్! పైగా బాధితురాలి మీద తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు. ఎమ్మెల్యేలు, లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు..? నో యాక్షన్...! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్లో పట్టుబడితే నో యాక్షన్... చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్పూల్ వద్ద తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్స్.. నో యాక్షన్..! ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు...? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి... లేదా ముద్దు అయినా పెట్టాలి...అని! ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా! అని నవ్వుతారు. వీటన్నింటి మీదా చర్యలు తీసుకోని చంద్రబాబు ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే అంతకంటే బాగా చేశానని చెప్పుకొచ్చారు!గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్విలువలు, విశ్వసనీయతే మన పార్టీ పునాదులు‘‘మనమంతా కలసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ జగన్ ఒక్కడిదే కాదు.. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై, మనమంతా కలసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. విలువలు, విశ్వసనీయత అన్న రెండు పదాల మీదే మన పార్టీ పుట్టింది, నడుస్తోంది. మన పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్. మన పార్టీ చరిత్ర, 15 ఏళ్ల ప్రయాణం చూస్తే.. కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి...’’ -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్డ్యామ్ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
మమత Vs సువెందు : రసవత్తరంగా బెంగాల్ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.సై అంటే సై అంటున్న దీదీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 2021లో ఇలా2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. -
రైతు సమస్యలపై చంద్రబాబు సర్కార్ స్పందించాలి: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు...మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారు: భూమన
సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్తో మొదలై... పుట్టా మహేష్తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
వైఎస్సార్సీపీ నేతల నిరసనలు అప్డేట్స్..అనంతపురం..అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహంచంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులునంద్యాల జిల్లా...నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహంబీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.తిరుపతితో పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్ చేశారు. -
జీవన్రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమిళనాడులో నలుగురు పోలీసు సూపరింటెండెంట్ల(ఎస్పీ)ను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలతో కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలు తక్షణ బదిలీ అవుతారు. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్తో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈసీఐ కరూర్ ఎస్పీగా హరికిరణ్ ప్రసాద్, కిరణ్ శ్రుతిని ఈరోడ్, సుజిత్ కుమార్ను నాగపట్నం, శ్రీనాథను విరుదునగర్ ఎస్పీగా నియమించారు. ఈ జిల్లాల ఎస్పీలు అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.మరోవైపు, పశ్చిమ బెంగాల్లోనూ కీలక అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన అధికారి నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం అండ్ హిల్ అఫైర్స్ జగదీశ్ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
దీదీకి ఝలక్ : 144 రేసు గుర్రాలు రెడీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో 144 మందితో తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.BJP announces first list of 144 candidates for the upcoming West Bengal Assembly Elections pic.twitter.com/QHLfHAUNFF— ANI (@ANI) March 16, 2026 "లాజికల్ డిస్క్రెపెన్సీ" విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.(అట్టుడుకుతున్న దుబాయ్ : విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి)ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.కాగా పశ్చిమ బెంగాల్తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ తొలి జాబితా సిద్ధం కావడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.కేరళలో కూడాకేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం. ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్ : ఎమోషనల్ వీడియో -
తీవ్ర ఉత్కంఠ మధ్య రాజ్యసభ ఎన్నికలు
దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది.ఇప్పటికే 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బిహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, హరియాణా నుంచి 2 స్థానాలు ఉన్నాయి.ఏకగ్రీవంగా గెలిచిన 26 మందిలో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, క్రాస్ ఓటింగ్ భయంతో తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికలు జరున్నాయి.హరియాణాలో 2 స్థానాలకు ముగ్గురి పోటీహర్యానా అసెంబ్లీ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయం కోసం 31 ఓట్లు అవసరం. భారతీయ జనతా పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం ఖాయమైంది. 17 ఓట్లు మిగులుతాయి. అవి స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్కు పడతాయి. ముగ్గురు స్వతంత్రులు తప్ప ఇనెలో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సంఖ్య 22 అవుతుంది. అంటే విజయవానడికి తొమ్మిది ఓట్లు తక్కువ అవుతాయి. కాంగ్రెస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐక్యంగా ఉంటే పార్టీ అభ్యర్థి కర్మవీర్ బౌద్ధకు 31 కంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా అభ్యర్థి ఓడిపోయారు. 2016, 2022లో ఇలా జరిగింది.బిహార్లో 4 స్థానాలకు ఓటింగ్బిహార్ అసెంబ్లీ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఎన్డీఏకు 202 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాఘట్బంధన్కు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎన్డీఏకు 4 స్థానాలు సులభంగా వస్తాయి. ఒక్కో స్థానానికి 41 ఓట్ల లెక్కలో నాలుగు స్థానాలు గెలవడానికి 164 మంది ఎమ్మెల్యేలు అవసరం. తర్వాత ఎన్డీఏ వద్ద 38 ఎమ్మెల్యేలు మిగులుతారు. 5వ స్థానానికి గెలవడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. ఒడిశాలో 4 స్థానాలకు 5 అభ్యర్థుల మధ్య పోటీఒడిశా అసెంబ్లీ 147 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ 4 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ 5 అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానానికి విజయం కోసం 30 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. భారతీయ జనతా పార్టీ రెండు అభ్యర్థులు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ విజయం ఖాయం. బీజేడీ వద్ద 48 ఓట్లు ఉన్నాయి. రెండు అభ్యర్థులు నిలబెట్టింది — సంత్రుప్త మిశ్రా, దత్తేశ్వర్ హోతా. మిశ్రా విజయం ఖాయం. చిక్కు నాలుగో స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దిలీప్ రాయ్కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ 14 ఎమ్మెల్యేలు, మాకపా ఒక ఎమ్మెల్యే హోతా వద్ద ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు.ముఖ్యాంశాలుబిహార్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు, ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు.హరియాణా, బిహార్, ఒడిశా నుంచి 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ భయం ఉంది.తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ ఒక ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తోంది. ఆయన కూడా ఇప్పటివరకు ఓటు వేయడానికి రాలేదు.బిహార్లో ఇప్పటివరకు ఎన్డీఏ తరఫున 201 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహాఘట్బంధన్ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికల్లో 70 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ కసౌలి నుంచి బయలుదేరి చండీగఢ్లో భూపేందర్ హుడ్డా ఇంటి వద్ద చేరారు. తర్వాత అందరూ కలిసి బస్సులో అసెంబ్లీకి వద్దకు చేరుకున్నారు. -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్ను ఆటపట్టించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్ వేశారు.బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్లోకి రండి అంటూ కేటీఆర్ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రం అబద్దాలు చెబుతోంది : మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ఇరాన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్ బుకింగ్పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్పిజి కొరత లేదని లోక్సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు కమ్యూనిటీ కిచెన్లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.దేశంలో 60 శాతం ఎల్పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.అలాగే సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు. ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.నడ్డా కౌంటర్ ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా స్పందించారు. జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల ఆందోళన అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. -
బెంగాల్ ఎన్నికలు.. సీఎస్, హోం సెక్రటరీపై వేటు
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్లను నియామకం చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం చేసింది. తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, అధికారులు విధుల్లో చేరిన వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక, ఇప్పటివరకు నందిని చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. Following the announcement of the West Bengal Assembly Elections 2026 schedule on 15 March 2026, the Election Commission of India announced the transfer of senior officers. Dushyant Nariala (IAS-1993) appointed Chief Secretary, Govt. of West Bengal, and Sanghamitra Ghosh… pic.twitter.com/pqXt0fWD8b— ANI (@ANI) March 15, 2026 -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
పుట్టా మహేష్ ఇష్యూ: షోకాజ్ నోటీసుతో సరిపెట్టిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీలో డ్రగ్స్ కలకలం చెలరేగుతోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. ఇవీ చదవండి: పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్రెడ్డి, నితిన్ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రైడ్స్ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’
తిరుపతి: డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్రెడ్డి. టీడీపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయిటిటిడి చైర్మన్గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం హేయమైన చర్యవిజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి ఈ తరహా పనులు చేయడమేంటి?, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది. టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. -
చంద్రబాబు, రేవంత్కు హాట్లైన్ సంబంధాలు: మార్గాని భరత్
తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్లైన్ సంబంధాలు ఉన్నాయి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. ఇదీ చదవండి: పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
‘పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’ పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.బంపర్ ఆఫర్.. కానీ మెలిక!ఈ పొత్తులో భాగంగా విజయ్కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..విజయ్ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.విజయ్ క్యాంపులో అంతర్మథనంమరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు.. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
‘చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు...చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. -
నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం..!
రాజమహేంద్రవరం సిటీ: మీ స్కామ్లు, దందాల వ్యవహారాన్ని ప్రెస్మీట్ పెట్టి చెబుతానన్న ఒక వ్యక్తితో ‘నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫోన్చేసి మరీ బెదిరించిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఆడియోలో అప్పారావు అటువైపు వ్యక్తిని దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలిపించిన తమకు శ్రీనివాస్ ఏమీ చేయలేదని, ఆయన చేయలేని పనులు తాము చేస్తున్నామని అవతలి వ్యక్తి చెబుతుండగా అప్పారావు ఎదురుదాడికి దిగి తిట్టడానికి యత్నించారు. దీంతో ‘తాను లీగల్గా చర్యలు చేపడతా’ అని ఆ వ్యక్తి అప్పారావుకు సమాధానమిచ్చారు. కొద్దిసేపు వాగ్వాదం సాగిన అనంతరం.. ఆ వ్యక్తి ‘మీ అబ్బాయిని ఎంచుకుని తప్పు చేశాం. ప్రెస్మీట్ పెట్టి మీ స్కామ్లు, దందాలు బయటపెడతా’ అని చెప్పాడు. దీనికి అప్పారావు బదులిస్తూ ‘నీకు నచ్చిన పని చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, వివాదం ఏమిటి? బెదిరింపులకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
పోలీసుల ఓవరాక్షన్.. పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరినీ రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం ఉండగా.. పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు.పేర్ని నాని ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందంటూ పోలీసులు వింత సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30.. తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.దీదీకే జై కొడుతున్న జనం!తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందనమమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.ఎన్నికల నగారాకు అంతా సిద్ధంవచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’ -
‘చంద్రబాబు.. ఇరాన్లో మాత్రమే ఆ పదవి ఖాళీ ఉంది’
విస్సన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ధ్వజమెత్తారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్. ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు. చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది..చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు. -
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఇరవై నెలల కూటమి పాలనలో కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పులే చేశామని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగమించలేదని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇవే మాటలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుదల చేసే దమ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్ని నాని కాగ్ లెక్కలతో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయలేదని పయ్యావుల పచ్చి అబద్దం చెప్పాడని కాగ్ వెబ్సైట్ సాక్షిగా ఆయన నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినట్టు కూటమి అప్పులు రూ. 1.05 లక్షల కోట్లని వారం రోజుల్లో నిరూపించలేకపోతే అబద్ధాల కేశవ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ, మండలిలో తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. చంద్రగిరిలో ఉన్న చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ యూనిట్లో మెషినరీ అప్గ్రడేషన్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అప్పుల మంత్రి, అబద్ధాల కేశవ్రాష్ట్ర అప్పులపై పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ మీద మరోసారి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాటలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన, తాను చేసిన ఆరోపణలు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయలేదు. ఈ అబద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్కరోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనడానికి ఆయన దగ్గరున్న ఆధారాలుంటే చూపించాలి కదా. వైఎస్ జగన్ ప్రెస్మీట్లో చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చేసిన పయ్యావుల.. ఏయే అంశాలు అబద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గరుంటే బయటపెట్టాలి.మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో20 నెలల పాలనలో మా ప్రభుత్వం చేసింది కేవలం రూ.1.05 లక్షల కోట్ల అప్పేనని, కానీ వైయస్ జగన్ గారు రూ. 3.20 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు చెప్పారని పయ్యావుల చెబుతున్నాడు. కానీ కరెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 లక్షల కోట్లు). కాగ్ లెక్కల ప్రకారం 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దానికి పయ్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేనని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31నాటికి బడ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్సైట్ చెబుతోంది.అంటే, ప్రత్యక్షంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 లక్షల కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మరో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్రవరి 2026, మార్చిలో ఎస్డీఎల్ బాండ్స్ ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.అప్పులు రూ.1.05 లక్షల కోట్లేనని లేఖ ఇప్పించు..వైయస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని చెబుతున్న పయ్యావుల కేశవ్.. ఇదే మాటను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో రాయించి స్టేట్మెంట్ రిలీజ్ చేసే దమ్ముందా? మంత్రి మాట్లాడింది అబద్ధం కాదని, రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 1.05 లక్షల కోట్లేనని వారం రోజుల్లో రాయించి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే పయ్యావుల కేశవ్ ఛాంబర్ బయట అబద్దాల కేశవ్ అని పేరు మార్చుకోవాలని ఛాలెంజ్ విసురుతున్నా.నెట్ బారోయింగ్ ఎక్కడా మా ప్రభుత్వం అధిగమించలేదని పయ్యావుల మరో అబద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసినట్టు కాగ్ వెబ్సైట్లో చెప్పింది. ఏపీ ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎక్కడా నెట్ బారోయింగ్ అధిగమించలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావులకు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్లో అప్పులపై తప్పుడు లెక్కలు రాసి ఇచ్చారో ఆ అధికారులందరిపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జరిగిందా?నిందితులను బాధితులుగా చేర్చడమే వైయస్ జగన్ పరిపాలన అంటాడు.. కూటమి ప్రభుత్వంలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి వేధించి పలుమార్లు అబార్షన్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదే పదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశాడు? మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి, మీ మంత్రి లోకేష్లను కలిసి మొర పెట్టుకుంటే ఆమె జరిగిన న్యాయం ఏంటి? ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? ఆ కేసులను చూసి హైకోర్టు చీవాట్లు పెట్టలేదా? బాధితులను వేధించింది మీరు కాదా?హెరిటేజ్ మెషినరీ అప్గ్రేడ్ కోసం రూ.200 కోట్లు హెరిటేజ్ వ్యాపారం తన కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నారని, వారు ఏనాడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండర్లలో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండర్లలో ఏవేవీ సప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వచ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు సప్లై చేశారు వంటి అన్ని వివరాలు ఆయన మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అబద్ధం చెప్పాడని ప్రజలే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవడానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వచ్చాయి. ఇదంతా దేవుడి మహిమ. చంద్రబాబు పాపాలను దేవుడే దగ్గరుండి బయటపెట్టిస్తున్నాడు.ఇది కాకుండా ఈరోజు కేబినెట్లో చంద్రగిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్లతో మిషనరీ అప్గ్రేడ్ కోసం ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్తగా 35 మందికి ఉద్యోగాలిస్తారట. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే చంద్రబాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిపెట్టారు? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏమిటని అడిగితే ఫ్లేవర్డ్ పాలు 131 శాతం అదనంగా ఉత్పత్తి జరుగుతుందని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అదనంగా వస్తుందట. వాటి వల్ల ప్రయోజనం ప్రజలకా? లేక హెరిటేజ్కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 పేరుతో హెరిటేజ్కి భారీ రాయితీలు ప్రకటించారు. కరెంట్ యూనిట్కి రూపాయి తగ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు.బీఆర్ నాయుడితో రాజీనామా చేయించలేరా?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బయటకొచ్చినా ఆయనతో ఇప్పటివరకు రాజీనామా చేయించని చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉందని ఎలా అనుకోవాలి? వీడియో బయటకొచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం చెందకుండా అంతలా బరితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం సిగ్గుచేటు. టీటీడీ చైర్మన్కి ఉన్న పాత బాగోతాలను ఆపాదించవచ్చా అని ప్రశ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న.. అలాంటి బాగోతాలున్న వ్యక్తిని దేవుడి సేవకు వాడటం కరెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి తెలిసే టీటీడీ చైర్మన్గా నియామకం జరిగిందని బాధితురాలి లేఖల ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఆయన్ను చైర్మన్గా నియమించారు. వీడియోలు బయటకొచ్చినప్పుడైనా నిఆయనతో రాజీనామా చేయించి టీటీడీ ప్రతిష్ట కాపాడాలని అనిపించలేదా? లోకేష్ పాపానికి హెడ్ మాస్టర్ బలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని రోజూ పేపర్ల నిండా వార్తలు, సోషల్ మీడియా నిండా వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఉన్నా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడానికి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పిల్లల ఆవేదన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్లు చూడటంపైన ఆయనకున్న శ్రద్ధ పిల్లలకు మంచి భోజనం పెట్టడం పైన లేదు.మధ్యాహ్న భోజనం బాగోలేదని మైలవరం తారకరామ నగర్ పాఠశాల హెచ్ఎం డ్రామా చేశాడని ఆంధ్రజ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్యత లేకుండా ప్రవర్తించాడన్న కారణంతో డీఈవో ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్తవానికి వంట బాగోలేదని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్నట్టు హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఎంక్వయిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండటం లేదని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాటలను కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు? సోషల్ మీడియా దెబ్బకి నారా లోకేష్ వైఫల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో హెడ్ మాస్టర్ను బలి తీసుకున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖను నిర్వహించడం చేతకానప్పుడు ఏశాఖా లేని మంత్రి పదవి తీసుకుని లోకేష్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థులకు మేలు చేసిన వాడవుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
మచిలీపట్నంలో మరోమారు ఉధ్రిక్తత
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేత బొర్రా విఠల్ను బలవంతంగా పోలీస్ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’
కాకినాడ: ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారని కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు. పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షలమందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.*కోవిడ్లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. -
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా, తన సోషల్ మీడియా అకౌంట్ను మూడేళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్లో ఇప్పుడు ‘దళపతి’ విజయ్ రూపంలో ఒక పెను తుపాను ముంచుకొస్తోంది. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పారావీల్’ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకులనే కాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాష్ట్రంలో మూడో ప్రధాన శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.నిర్ణయాత్మక శక్తిగా 13.6 శాతం ఓట్లుపారావీల్ సీఈఓ కిరణ్ కొండేటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. విజయ్ పార్టీ ఏకంగా 13.6 శాతం ఓట్ల వాటాను కొల్లగొట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో సుమారు 70.2 లక్షల మంది ఓటర్ల నాడిని సంగ్రహించిన ఈ సర్వేలో తమిళనాట ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టం అయ్యింది. అధికార డీఎంకే 41.5 శాతం, ఏఐఏడీఎంకే 36.2 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ, టీవీకే సాధిస్తున్న ఈ ఓట్ల శాతం షాకిచ్చేలా ఉంది. ఈ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటును శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి విజయ్ చేరుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.నవతరం ఓటర్లంతా..ఈ సర్వేలో వెల్లడైన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. యువత, తొలిసారి ఓటు వేస్తున్న నవతరం ఓటర్లంతా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. కేవలం సినిమా అభిమానులే కాకుండా, సాంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన విద్యావంతులు, మార్పును కోరుకుంటున్న యువత టీవీకేను తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని తేలింది. ముఖ్యంగా చెన్నై లాంటి పట్టణ ప్రాంతాల్లో విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే, కొన్ని సెగ్మెంట్లలో ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీని వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని తెలుస్తోంది.పక్కా వ్యూహం.. క్షేత్రస్థాయి విశ్లేషణకేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో కుల సమీకరణలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతను లోతుగా విశ్లేషించారు. దీనిలో దక్షిణాది జిల్లాల నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేలింది. సినిమా గ్లామర్ను పొలిటికల్ పవర్గా మార్చడంలో టీవీకే కేడర్ సక్సెస్ అవుతోందని ఈ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతుండటం, స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకే పుంజుకోవడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.వార్ రూమ్ టెక్నాలజీతో..ఎన్నికల కురుక్షేత్రంలో విజయ్ సరికొత్త సాంకేతికతను జోడించబోతున్నారు. పారావీల్ సంస్థ పరిచయం చేస్తున్న ‘వన్ క్యాండిడేట్ - వన్ వార్ రూమ్’ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతి అభ్యర్థికి క్షేత్రస్థాయి డేటా విశ్లేషణను అందిస్తూ, గెలుపు గుర్రాలను సిద్ధం చేసే ఈ వ్యూహం పాత తరం రాజకీయ నాయకులకు సవాల్ విసురుతోంది. సంప్రదాయ ప్రచార శైలిని పక్కన పెట్టి, డేటా ఆధారిత వ్యూహాలతో విజయ్ అడుగులు వేస్తుండటం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది.ద్రవిడ గడ్డపై సరికొత్త చరిత్ర?కరుణానిధి, జయలలిత తదితర రాజకీయ దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే సత్తా విజయ్లో ఉందని ఈ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13.6 శాతం ఓట్ల వాటా అంటే అది కేవలం సంఖ్య కాదు, తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయగల ఒక బలమైన శక్తి అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ద్రవిడ కోటలో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు -
వైఎస్సార్సీపీ.. 'కోట్లాది మంది అభిమానులది': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు.. కొన్ని కోట్ల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులది.. వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నా..’’ అని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలిరావడంతో పార్టీ కేంద్ర కార్యాలయం జనసంద్రంగా మారింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులనుద్దేశించి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నల్లకాలువలో ఇచ్చిన మాటతో..మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తయింది. 2011 మార్చి 12న పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక మార్క్గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితుల్ని మార్చింది. రాష్ట్రం దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుంది..ఆరోజు జగన్ అనే వాడు ఒకే ఒక్కడు... కానీ జగన్ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, దేశంలోనూ అధికారంలో ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతా. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందని మరొక్కసారి మీ అందరికీ వినమ్రంగా, వినయపూర్వకంగా చెబుతున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వైఎస్సార్ను అభిమానించే ప్రతి గుండెకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆ ప్రతి గుండెకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. -
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభంతో దేశం అల్లాడిపోతోందంటూ ఆరోపించారు. దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని మంత్రి అన్నారు. గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని, హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్కు బదులుగా నార్వే కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్ కారణంగా ఉందని పూరి అన్నారు.LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని, సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ, ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.కాగా గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. -
‘చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో స్పందన లేదు.శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ‘అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుందని’ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం (మార్చి 12) వైఎస్సార్సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించిన వైఎస్ జగన్ పార్టీ భవిష్యత్తుపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘2011 మార్చి 12న పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లోనే మార్పు కనిపించింది. నల్లకాల్వలో ఇచ్చిన మాట వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర దశ, దిశను మార్చింది. వైఎస్సార్సీపీ పార్టీ కోట్లాది మంది ప్రజలది. మొదట్నుంచీ ప్రజలు,దేవుడినే నమ్ముకున్నా. విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వైఎస్సార్సీపీ అభిమాని కాలర్ ఎగరేసేలా పార్టీ ఉంటుంది. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ అభిమానించే ప్రతి గుండెకు శుభాకాంక్షలు’ తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా... వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్కు ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి... టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ను మహానేత ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా 2004 మే 14న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్... రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. జనరంజక పాలనను మెచ్చిన ప్రజలు వైఎస్ నాయకత్వానికి దన్నుగా 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండోసారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక... అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాద వార్తకు తాళలేక వందలాది మంది మరణించడం జగన్ ను కలిచి వేసింది. ప్రమాదం చోటుచేసుకున్న కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ... మరణించిన వారి కుటుంబాలను పరామ ర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి జగన్ కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ, కడప లోక్సభ స్థానాలకు రాజీనామాలు చేశారు. వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్ సమాధి వద్ద పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. -
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్కుమార్ పిటిషన్లు డిస్మిస్ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్పై రాహుల్గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపించిందని, స్పీకర్ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్గాంధీ అని కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసేంత సాహసం స్పీకర్ చేయలేరన్నారు. మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్ ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ జోకర్గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, రాహుల్నుసన్మానించాలి‘ఒక పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్ను, ఆయన వెనుక ఉన్న రాహుల్గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్గాం«దీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్ విమర్శించారు. -
పార్టీ మారలేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్ చేసిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ ఎం.సంజయ్కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్చెరు) వీరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టుల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ న్యాయపోరాటం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ 2024 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్ చేశారు. -
లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అయిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్ర బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘మా తమ్ముడు కృష్ణ దేవరాయలు మంచిగా మాట్లాడాలని కోరుతున్నా. తెలంగాణపై ఏడుపు బంద్ చేయాలి’ అని అన్నారు. కాగా, లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అనడంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు?తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. ఆయన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? స్పీకర్ కార్యాలయం ఆర్డర్ కాపీ ఇవ్వడానికి భయపడుతోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ అద్భుతంగా పని చేసి ఉంటే ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయం? రాహుల్ గాంధీ ఎలా చెప్తే అలా స్పీకర్ నడుస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారే, ఆయనపై మాకు గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై స్పందించాలి. కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబును సీఎంగానే భరించకపోతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్ జగన్ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. -
బీఆర్ నాయుడు, జనసేన శ్రీధర్పై చర్యలేవి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్యలేవి? అని నిలదీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.లిస్ట్ ఇదే.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్మీద ఏం చర్యలు తీసుకున్నారు?టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లీనిక్లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్ఐ, పాస్బుక్ క్యూఆర్ కోడ్ భూమలు జియో ట్యాగింగ్ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బాబు, లోకేష్ కోసం పవన్ జాకీలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్ కోసం పవన్ కల్యాణ్ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించడం ఏంటని శాసనమండలిలో మా సభ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏయే పంటలు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. శనగ ఎంఎస్పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతులకు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అరటి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.కేంద్రానికి లేఖ రాస్తాం..బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్ మాత్రమే. 2024-25 కాగ్ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్, ఫైనాన్స్ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. -
స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణ స్పీకర గడ్డం ప్రసాద్ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచి.. పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు అంటూ పోస్టు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్…— KTR (@KTRBRS) March 11, 2026ఇది కూడా చదవండి: తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు..


