సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.
కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్నాథ్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్ కాలేజీల రూపంలో జగన్ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్ బ్యాక్ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.
జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.
కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.
ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్కుమార్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ గారు నాడు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్ జగన్ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు.


