breaking news
annamayya district Latest News
-
కోర్టు ధిక్కరణ కేసులో రిమాండ్
పెద్దతిప్పసముద్రం : క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో న్యాయమూర్తి ఇద్దరు ముద్దాయిలకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎస్ఐ పరమేశ్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన క్రిష్ణమూర్తి (49), పోతుపేట పంచాయతీ పిడుంవారిపల్లికి చెందిన మంజునాథ్ (35)లు మూడేళ్ల క్రితం మద్యం కేసులో పట్టుబడగా వీరిపై కేసు నమోదైంది. అయితే ముద్దాయిలిద్దరూ గతంలో చాలా సార్లు వాయిదాల నిమిత్తం తంబళ్ళపల్లి కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారనే అభియోగంతో తంబళ్ళపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఏ.ఉమర్ ఫరూక్ ఇటీవల పోలీసులను ఆదేశిస్తూ ముద్దాయిలపై అరెస్టు వారంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా గాలించి వారిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, కానిస్టేబుల్ బావాజాన్ తెలిపారు. -
రంజాన్ నియమాలు.. ముక్తికి సోపానాలు
● చెడుకు దూరం, మంచి మార్గానికి దోహదపడే నెల ● పంచ సూత్రాలు పాటించాలంటున్న మత పెద్దలు ● మరికొన్ని రోజులే రంజాన్ మాసం ● అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న గురువులు రాజంపేట టౌన్ : పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. అందువల్ల అనేక మంది ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉంటున్నారు. అయితే కొంత మంది తమ విధుల నిర్వహణ వల్ల రంజాన్ మాసంలో చేపట్టే పవిత్ర కార్యక్రమాలు చేపట్ట లేకపోతున్నారు. ఇంకొంత మంది పెద్దల మాట పెడచెవిన పెట్టి ఈ పవిత్ర మాసంలో చేపట్టాల్సిన పుణ్యకార్యాలను చేయడం లేదు. అయితే పవిత్ర రంజాన్ మాసంలో కనీసం కొన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటూ అల్లాహ్ స్మరణలో ఉండాలని ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. అప్పుడే మనిషి మంచిమార్గంలో పయనించి ఇతరుల పట్ల ప్రేమ, దయ కలిగివుండటంతోపాటు పేదల ఆకలి బాధలు కూడా తెలుసుకోగలరని, తద్వారా ఆకలితో బాధపడే పేదల ఆకలి తీర్చగల గొప్ప వ్యక్తులుగా తయారవుతారని వారు చెబుతున్నారు. పవిత్ర రంజాన్ మాసం మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నందున ఇప్పటికి కూడా ఉపవాసాలు ఉండని వారు, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టని వారు.. ఉపవాసాలు ఉంటూ, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టాలని మత పెద్దలు సూచిస్తున్నారు. సర్వమానవాళి శాంతిమార్గంలో నడవాలని ఇస్లాం సూచిస్తుంది. ప్రతి ఒక్కరు చెడుకు దూరంగా, సన్మార్గంలో నడవాలని బోధిస్తుంది. అల్లాహ్ ప్రసాదించిన పవిత్ర గ్రంధం దివ్యఖురాన్. ఈ గ్రంధం అవతరించింది రంజాన్ మాసంలోనే. ఈ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికంగా గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను మహమ్మద్ ప్రవక్త సూచించారు. అవే ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. వీటిలో నమాజ్, రోజా, జకాత్ను ప్రతి ముస్లిం రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాలి. మరోవైపు మంచి విద్య నేర్చుకునేందుకు, ఇతరులకు బోధించేందుకు అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలని మతపెద్దలు చెబుతున్నారు. ఈమాన్ ఇస్లాం మత మొదటి నియమం ఈమాన్. లాయిలాహ ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం) అని కలిమా తయ్యిబా చదివి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ అందుకు కట్టుబడి ఉండాలి. అల్లాయే భగవంతుడని, ఇతరులకు దైవారాధన చేయరాదని ఈ విషయం చెబుతుంది. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాపై మాత్రమే విశ్వాసాన్ని ఉంచాలి. నమాజ్ కలిమా తయ్యిబా చదివి ఈమాన్తో ఇస్లాం స్వీకరించిన ప్రతి ముస్లిం రోజుకు ఐదు పూటలా విధిగా నమాజ్ చదవాలి. సూర్యోదయానికి ముందు ఫజర్, మధ్యాహ్నం ఒంటిగంట తరువాత జోహర్, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అసర్, సూర్యాస్తమయం తరువాత మగ్రిబ్, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇషా నమాజు చేయాలి. రోజారోజా అంటే ఉపవాస దీక్ష. మానసిక పరిపక్వత కలిగి, ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ముస్లిం రంజాన్ మాసంలో రోజా పాటించాలి. ఈమాసంలో ఉండే రోజాలను ఫజర్ రోజా అంటారు. నెలంత నియమ, నిష్టలతో ఉపవాస దీక్ష ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందు నుంచి సూర్యాస్తమయం తరువాత వరకు ఆహారం, నీరు, ఇతర ఎలాంటి తినుబండారాలు, పానీయాలను సైతం తీసుకోకుండా రోజా ఆచరించాలని ఇస్లాం చెబుతుంది. ఏడాదిలో 12 నెలల్లో ఒకనెల అల్లాకోసం ఆయన సూచించిన మార్గంలో నడిచి మిగతా నెలల్లో అదే స్ఫూర్తితో నడుచుకోవాలి. హజ్ యాత్రఆర్థిక స్థోమత కలిగిన ముస్లింలు విధిగా హజ్ యాత్ర చేయాలి. 40 రోజుల పాటు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ప్రాంతాలకు వెళ్లి, అక్కడ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. బక్రీదు పండుగ సమయంలో హజ్ జరుగుతుంది. అప్పు చేసి హజ్ యాత్ర చేయాల్సిన అవసరం లేదు. హజ్యాత్రకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు కుటుంబ పోషణకు అవసరమైన నిధులు ముందుగానే సమకూర్చుకోవాలి. అల్లాహ్ మార్గంలో నడవాలిఇస్లాం ధర్మాలు, నియమ నిబంధనలు, పాటించాల్సిన సూత్రాలు, ఆచరించాల్సిన పద్ధతులను తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని ఇళ్ల వద్ద ఉండి నేర్చుకోలేని పక్షంలో దైవమార్గంలో నడవాలి. తమ పనులు, వృత్తి, వ్యాపారం వంటి వాటికి కొంత కాలం పాటు దూరంగా ఉండి ‘అల్లాకే రాస్తేమే’ వెళ్లి విద్య నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలను ఇతరులకు పంచి అందరూ మంచి మార్గంలో నడిచేలా కృషి చేయాలని ఇస్లాం సూచిస్తుంది. -
బోయకొండలో వేలం ద్వారా రూ.24.21 లక్షల ఆదాయం
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం వివిధ హక్కుల నిర్వహణకు ఏడాది పాటు గడువు ఇస్తూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలాల ద్వారా ఆలయానికి రూ.24.21 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. కేవలం 17 మంది స్థానికులు మాత్రమే నిర్ణయించిన మేరకు ధరావత్తు డిపాజిట్టు చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. గత యేడాది వేలంలో వచ్చిన ఆదాయానికి నామమాత్రంగా పెంపు చేసి వేలంలో టార్గెట్ చేరిన వెంటనే వేలం తంతు ముగింపు చేశారని ఆరోపణలు వచ్చాయి. కోళ్లు విక్రయించుకొను హక్కు రూ.7 లక్షలకు లవకుమార్, ఆలయం వద్ద ఫొటోలు తీసుకొనే హక్కు 1.91 లక్షల రూపాయలకు కిరణ్ సొంతం చేసుకున్నారు. కొబ్బరి చిప్పలు సేకరించుకొనుటకు 7.70 లక్షలకు హెచ్చుపాటతో మల్లికార్జున నాయుడు, పేపర్ కవర్లు, బ్యాగులు విక్రయించుకొనుటకు 6.70 లక్షల రూపాయలతో హెచ్చుపాటతో గజేంద్ర దక్కించుకొన్నట్లు ఈఓ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో స్టీల్, రాగి, ఇత్తడి ప్లేట్లు తదితర పరికరాలు విక్రయించుకొను హక్కు ద్వారా రూ.90 వేలు ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శశిధర్, సూపరింటెండెంట్ రామనాథం తదితరులు పాల్గొన్నారు. కొన్ని వాయిదా కొన్ని హక్కుల వేలం పాటలో పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈఓ ఏకాంబరం వెల్లడించారు. కొండపైన క్యాంటీన్, ఐస్క్రీములు, కూల్డ్రింక్స్ విక్రయించుకొను హక్కు, కొండ కింద క్యాంటీన్, ఐస్క్రీములు, కూల్డ్రింక్స్ విక్రయించుకొను హక్కు, కొండపైన 4 దుకాణాల ద్వారా పవిత్ర దారాలు, టాయ్స్, ఫొటోలు, కలకండ వగైరా విక్రయించుకొను హక్కు, పాదరక్షలు భద్రపరుచుకొను హక్కు, కొండపైన పెద్దబోగం మొక్కుబడి రుసుం నిర్వహించుకొను హక్కు, కొండ కింద షాపు రూములపైన డార్మీటరీ హాళ్లు నిర్వహించుకొను హక్కు, రణభేరి గంగమ్మ దేవస్థానం వద్ద పవిత్ర దారాలు విక్రయించుకొను హక్కు, రణభేరి గంగమ్మ దేవస్థానం వద్ద వాహనాల పూజలు నిర్వహించుకొను హక్కులను వాయిదా వేసినట్లు ఈఓ ప్రకటించారు. వాయిదా పడిన వేలం పాటలను తిరిగి నిర్వహించేలా చర్యలు తీసుకొంటామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఈఓ చెప్పారు. -
డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం
మదనపల్లె సిటీ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు. స్థానిక పుంగనూరు రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ఏర్పాటుపై జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలు ఎవరైనా సేవిస్తే సమాచారాన్ని ఈగల్ క్లబ్ ద్వారా పోలీసులకు తెలియజేయాలన్నారు. ఇటీవల పాఠశాలలు, కాలేజీల వద్ద కూల్లిప్స్ పేరుతో డ్రగ్స్ను విద్యార్థులే టార్గెట్గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ను నిర్మూలించడంలో ప్రతి విద్యార్థి తమ వంతు కృషి చేయాలన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే దుర అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులచే డ్రగ్స్ అనర్థాల గురించి పాటలు, నాటికలు ప్రదర్శించారు. కార్యక్రమంలో మదనపల్లె డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు రెడ్డిశేఖర్, ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్, సీఐలు కళావెంకటరమణ, రవినాయక్, మోటివేషనల్ స్పీకర్ రామమూర్తి, జిల్లా లోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వరకట్న వేధింపుల కేసు
మదనపల్లెటౌన్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిపై మదనపల్లె తాలూక పోలీసులు శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి షాజీద్(28) మదనపల్లె మండలం కొత్తపల్లె గ్రామం కొత్త ఇండ్లకు చెందిన షమీంభానును పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఇటీవల షాజీద్ తన భార్యను అదనపు కట్నం తీసుకు రావాలని వేధించడంతో ఆమె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందని ఎస్ఐ తెలిపారు. విచారణ అనంతరం షాజీద్పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని యువకుడికి గాయాలు మదనపల్లెటౌన్ : కారు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థి ధనుష్ (22) స్థానిక బెంగుళూరు రోడ్డులోని జరుగుతున్న వివాహ ముహూర్తానికి చేరుకునేందుకు స్నేహితుని బైక్లో బయల్దేరాడు. మడికయల శివాలయం ఆర్చి వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. వన్టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దాడి కేసులో దంపతుల అరెస్ట్ కేవీపల్లె : ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసి గాయపరచిన కేసులో దంపతులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలా వున్నాయి. ఈ నెల 4వ తేదీన మండలంలోని శిబ్బాలవాండ్లపల్లెకు చెందిన పూజారి నాగులయ్య(76) బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలంలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మల్లెల జయన్న(63) ఆయన భార్య సుబ్బులమ్మ (55) ఇద్దరూ కలసి పాత కక్షలతో నాగులయ్యపై కొడవలితో దాడికి పాల్పడ్డారు. బాధితుడు నాగులయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను జడ్జి ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫొటో ఓటరు జాబితా సత్వరమే అప్లోడ్ చేయాలి
నిమ్మనపల్లె : గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు వెంటనే తమ గ్రామ పంచాయతీలోని ఫొటో ఓటరు సర్వే జాబితాను డీఎల్పీఓ లాగిన్లో అప్లోడ్ చేయాలని డీఎల్పీఓ నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఫొటో ఓటరు జాబితా ఆన్లైన్ కార్యక్రమాలను పరిశీలించి సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజుల్లోగా ఫొటో ఓటరు జాబితా సర్వే పూర్తి చేసి పూర్తి వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన ట్రై సైకిళ్లను పరిశీలించారు. వాటిని పంచాయతీ అభివృద్ధి అధికారులు స్థానిక గ్రీన్ అంబాసిడర్లకు అందించి ప్రతి రోజు ఇంటింటి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేకరించిన చెత్త ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలకు తరలించి వర్మీకంపోస్టు తయారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నిమ్మనపల్లెలో జరుగుతున్న పన్ను వసూళ్లు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రతి కుటుంబ యజమానితో మాట్లాడి అవగాహన కల్పించి పన్నులు 100 శాతం వసూలయ్యేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ రమేష్బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణతోనే మహిళా సాధికారత
రాయచోటి : బాల్య వివాహాల నివారణతోనే మహిళా సాధికారత సాధ్యమని జిల్లా బాల పరిరక్షణ అధికారి వినోద్ అన్నారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలో మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనలో ముందుకు రావడం ద్వారా కుటుంబం, సమాజం మరింత బలపడుతుందన్నారు. ప్రతి మహిళకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాలలో ఇంకా బాల్య వివాహాల ఘటనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుంచి 21 సంవత్సరాల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమన్నారు. బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రజలు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించేందుకు సహకరించాలని ఆయన కోరారు. మహిళల సాధికారతను ప్రోత్సహిస్తూ, బాల్య వివాహాలను నిర్మూలించడం ద్వారా ఆరోగ్యకరమైన సమానత్వ సమాజాన్ని నిర్మించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఫీమా అంజుం, లాయర్ చంద్రకళ, పారామెడికల్ మనీలా, ఔట్రీచ్ వర్కర్లు, సురేష్, సోఫీ, డైట్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో పథకాలు విజయవంతం
కురబలకోట : ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని నీతి ఆయోగ్ ఆఫీసర్ నాన్సీ నిఖిత అన్నారు. శుక్రవారం ఆమె కురబలకోటలోని అంగన్వాడీ కేంద్రం, జెడ్పీ హైస్కూల్, అంగళ్లులోని టెర్రకోట సీఎఫ్సీ సెంటర్ను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలు, పిల్లల పోషణ, విద్యా కార్యక్రమాలు, టెర్రకోట తయారీ కార్యకలాపాలపై ఈ సందర్భంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రజల సహకారం ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో వేగంగా అమలు కావడానికి ఆస్కారం ఉందన్నారు. ప్రజలతో కలసి అధికారులు పరస్పరం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. గ్రామాల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య, ఎంఈఓ ద్వారకనాథ్, సీడీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం ములకలచెరువులో జరిగిన ఈ ఘటనపై బాధితరాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములకలచెరువులో ఉంటున్న సుబ్బారెడ్డి భార్య శ్యామలమ్మ(63) భర్త చనిపోయిన కొంత కాలానికి రెండో కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి పెద్ద కుమారుని దగ్గర ఉంటున్న శ్యామలమ్మకు ఏం కష్టం వచ్చింతో ఏమో.. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించి మదనపల్లెకు వెళ్లాలని రెఫర్ చేశారు. అక్కడి నుంచి వారు ఆమెను మదనపల్లెకు తీసుకు వచ్చి జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ములకలచెరువు పోలీసులు తెలిపారు. భార్యపై ఇటుక రాళ్లతో దాడి మదనపల్లెటౌన్ : తాగిన మైకంలో భార్యపై భర్త ఇటుక రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మదనపల్లెలో వెలుగు చూసింది. బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక బెంగళూరు రోడ్డు, చిప్పిలిలో కాపురం ఉంటున్న ఉమాదేవి కుమారపురంలో ఉండే పవణ్ కళ్యాణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ బిడ్డలు జన్మించారు. ఈ క్రమంలో మాదేవి కూలి పనులకు వెళ్లి తెచ్చే డబ్బంతా పవన్ కళ్యాణ్ తాగుడుకు ఖర్చు చేస్తుండడంతో, పిల్లలను పస్తులతో ఉంచలేనని భర్తను భార్య నిలదీసింది. దీంతో మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో భార్య ఉమాదేవిని పవన్ కళ్యాణ్ ఇటుక రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచాడు. బాధితురాలిని కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్వాధీనం పీలేరు రూరల్ : సుమారు 150 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఈ ఈశ్వరయ్య తెలిపారు. పీలేరు పట్టణంలో నిల్వ ఉంచిన రేషన్ బి య్యంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని కామాటంపల్లెలో దేవేంద్ర గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన రేషన్ బియాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 9,905 బరువు ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ సిబ్బంది సురేంద్ర, ఎం.వి. ప్రతాప్, వీఆర్వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
● 800 బస్తాల రేషన్ బియ్యం సీజ్ ● మిల్లు నిర్వాహకులపై కేసులు నమోదు మదనపల్లెటౌన్ : మదనపల్లె పట్టణంలోని రైస్ మిల్లులకు రేషన్ బియ్యం అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంపై కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాలతో.. విజిలెన్స్ సీఐలు శివన్న, శ్రీనివాసులురెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. స్థానిక ఎస్టేట్లో ఉన్న రెండు రైస్ మిల్లుల్లో శుక్రవారం విస్తృతంగా సోదాలు చేశారు. మిల్లులో ఉన్న బియ్యాలపై కెమికల్స్ చల్లి పీడీఎస్ రైస్ ఉన్న ఆనవాళ్లను వెలికి తీశారు. వంశీ కృష్ణా రైస్ మిల్లులో 11 బస్తాలు బయట పడగా, మోడరన్ రైస్ మిల్లులో ఐదు బస్తాల పీడీఎస్ రైస్ బయట పడింది. వీటి విలువ సుమారు రూ.32, 000 ఉండచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. 800 కిలోల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్న మాట్లాడుతూ మదనపల్లెలోని రెండు రైస్ మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని పాలీష్ చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో సుమారు 800 కిలోల బియ్యం పట్టుకున్నామని, వీటిని పంచనామా నిమిత్తం స్థానిక సీఎస్ డీటీ ఫైరోజ్కు అప్పగిస్తున్నామన్నారు. రేషన్ బియ్యం ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తుంటే, కొందరు అక్రమార్కులు వాటిని సొమ్ము చేసుకుంటున్నారని, వీరిపై కొరడా ఝళిపిస్తామన్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని మిల్లుకు విక్రయించడానికి వచ్చిన వ్యక్తి నమోనారాయణ పైన, ఈ రైస్ కొనుగోలు చేసిన రెండు రైస్ మిల్లుల యజమానులు ధీరజ్, కిషోర్ పైన కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ దాడులు మరింతగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో డీసీటీఓ బాబుమోజస్, సీఎస్ డీటీ ఫైరోజ్, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ హౌస్లో ఆయుధాల ప్రదర్శన
మదనపల్లెటౌన్: మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఓపెన్ హౌన్ నిర్వహించారు.మహిళా దినోత్సవ వారోత్సవాలను పురష్కరించుకుని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో విద్యార్థులకు ఏర్ఆర్ పోలీసులు ఆయుధాల వాడకంపై అవగాహన కల్పించారు. పోలీసులు నిత్యం వాడే 303 తుపాకులు మొదలుకొని శక్తివంతమైన ఏకే–47, 7.62ఎంఎంసెల్ప్ లోడింగ్ రైఫిల్, 9ఎంఎం పిస్టల్స్, టియర్ గ్యాస్ను ప్రదర్శనలో ఉంచారు. ఆయుధాలు ఎలా వాడుతారో పోలీసులు ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. బుల్లెఫ్రూప్ జాకెట్లు, రైట్ గేర్ పరికరాలను విద్యార్థులు ధరించి వాటి పనితీరును తెలియజేఽశారు. -
సర్వేత్రా అవినీతి!
మదనపల్లె (సాక్షి నెట్వర్క్): సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారిక నివేదికలే ధ్రువీకరిస్తున్నాయి. ‘మేం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. పింఛన్ పంపిణీపై మీ అభిప్రాయం చెప్పండి‘ అంటూ ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అవినీతి పతాకస్థాయికి చేరిందని, లబ్ధి దారుల నుంచి అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని ఈ సర్వే అంకెలతో సహా నిగ్గుతేల్చింది. ఈ అంశాన్ని ఈనెల 2వ తేదీన మదనపల్లెలో జరిగిన జిల్లా అభివృద్ధి, సమీక్షా సమావేశానికి (డీడీఆర్సీ) రూపొందించిన ప్రగతి నివేదికలో జిల్లా ప్రభుత్వ శాఖలే స్వయంగా పొందుపరిచాయి. బట్టబయలైన అక్రమ వసూళ్లు జిల్లాలో ప్రస్తుతం 26 రకాల కేటగిరీల కింద మొత్తం 1,89,019 పింఛన్లు అమలవుతున్నాయి. వీటి పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం లబ్ధిదారుల ఫోన్లకు ఫోన్ చేసి మూడు ప్రధాన అంశాలపై ఆరా తీసింది. ఈ సర్వేలో తేలిన గణాంకాలు ఇలా ఉన్నాయి: వసూళ్ల పర్వం: పింఛన్ పంపిణీలో అధికారి డబ్బులు వసూలు చేశారా? అన్న ప్రశ్నకు 2026 జనవరిలో 87.60 శాతం మంది ’అవును’ అని సమాధానమిచ్చారు. ఫిబ్రవరి నాటికి ఈ అవినీతి ఆరోపణలు 89.50 శాతానికి పెరిగాయి. పంపిణీ తీరు: పింఛన్ ఇంటి వద్దనే ఇచ్చారా అన్న ప్రశ్నకు జనవరిలో 92.30 శాతం మంది ’లేదు’ అని సమాధానమివ్వగా, ఫిబ్రవరిలోనూ దాదాపు అదే పరిస్థితి (92.10% అవును, 7.9% లేదు) కొనసాగింది. అధికారుల ప్రవర్తన: పింఛన్ అందించే అధికారి ప్రవర్తన ఎలా ఉంది? అన్న అంశంపై కూడా లబ్ధిదారులు తమ అసంతృప్తిని ఐవీఆర్ఎస్ ద్వారా వ్యక్తపరిచినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. గతంలో ఈ అవినీతి శాతం 12 నుంచి 14 శాతం లోపు ఉండగా, గత రెండు నెలల్లో అది ఏకంగా 90 శాతానికి చేరువవ్వడం వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. సర్వేలో ఇంత భారీ ఎత్తున అవినీతి బయటపడినా, అధికారులు మాత్రం వింత వివరణ ఇస్తు న్నారు. లబ్ధిదారులకు మొబైల్ ఫోన్ల వినియోగంపై అవగాహన లేదని, పింఛన్దారులు వలసలు వెళ్తుండటం వల్ల వంద శాతం సంతృప్తిని సాధించలేకపోతున్నామని సాకులు వెతుకుతున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టాల్సింది పోయి, కేవలం అవగాహన లేదంటూ నివేదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ అధికారిక నివేదికలోనే అంకెలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పింఛన్లలో ‘చిలక్కొట్టుడు’.. నిగ్గుతేల్చిన సర్కారు సర్వే! అవినీతి అక్రమాలపై 89 శాతంమంది లబ్ధిదారుల గళం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచివెళ్లిన ఐవీఆర్ఎస్ కాల్స్లోనిజాలు బట్టబయలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెరిగిన వసూళ్ల పర్వం అవగాహన లోపమంటూతప్పించుకుంటున్న అధికారులు -
సంస్కృతి పరిరక్షణకు భాషోత్సవాలు దోహదం చేస్తాయి
రాయచోటి: సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు భాషోత్సవాలు దోహదపడతాయని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ తెలిపారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలో జిల్లాస్థాయి భాషోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనురాధ మాట్లాడుతూ భాష ద్వారా సంప్రదాయాలు, చరిత్ర, విలువలు తరతరాలకు చేరవేయవచ్చన్నారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాషోత్సవాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమ కో–ఆర్డినేటర్ ఏఏఎంఒ అసదుల్లా భాష మాట్లాడుతూ జిల్లాస్థాయిలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ట్రైబల్ బాషలలో ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు భాష పరిజ్ఞానంపై టాలెంట్ టెస్టులను నిర్వహించారు. ఇందులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతోపాటు జ్ఞాపికలను అందజేశామన్నారు. తెలుగు భాషకు సేవ చేసిన ఆర్ రెడ్డయ్య, లోక జగన్నాథ శాస్త్రి, ఇంగ్లీషు భాషకు సేవ చేసిన పద్మావతి, గంగిరెడ్డి, అలాగే ఉర్దూ భాషకు సేవలందించిన మహమ్మద్ హసీంలకు జ్ఞాపికలను ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● 500 ఎకరాలకు అందని ‘అవార్డు’
● గండికోట ముంపుబాధితులకుకూటమి ‘వంచన’! ● జగనన్న ఇచ్చిన రూ.10 లక్షలకు తోడుమరో రూ.2 లక్షలన్న ఆదినారాయణరెడ్డి ● ఎన్నికల హామీలు మర్చిపోయిన ఎమ్మెల్యే.. నిలిచిపోయిన జీవో 312 నిధులు ● 9,096 మంది బాధితుల ఆవేదన..పెంచి అనంతపురం వాసులఎదురుచూపులు జమ్మలమడుగు: రాయలసీమ ప్రయోజనాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన గండికోట ముంపు బాధితుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ విడుదల చేసిన నిధులను ఆపేయడమే కాకుండా, ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన ‘అదనపు’ హామీలు ఇప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. నమ్మించి గొంతు కోసిన ఆదినారాయణరెడ్డి: 2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రస్తుత ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి.. ముంపువాసులకు భారీ హామీలిచ్చారు. జగనన్న సర్కార్ ఇచ్చే రూ.10 లక్షల పరిహారానికి తోడు, కూటమి ప్రభుత్వం రాగానే అదనంగా మరో రూ.2 లక్షలు (మొత్తం రూ. 12 లక్షలు) ఇప్పిస్తానని బాధితులను నమ్మించారు. ఆ మాట నమ్మి ఓట్లేసిన 18,206 మంది నిర్వాసితులు ఇప్పుడు ఎమ్మెల్యే వంచనను చూసి మండిపడుతున్నారు. అధికారం వచ్చి రెండేళ్లు కావ స్తున్నా.. అటు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3.25 లక్షల బకాయిలు లేవు, ఇటు ఎమ్మెల్యే హామీ ఇచ్చిన అదనపు రూ. 2 లక్షల ఊసే లేదు. పెంచి అనంతపురం వాసుల గోస: పరిహారం కోసం ముఖ్యంగా పెంచి అనంతపురం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 525 మందికి ప్యాకేజీ అందాల్సి ఉండగా, కేవలం 148 మందికే రూ. 14.59 కోట్లు ఇవ్వాలని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. మిగిలిన వారి పరిస్థితిపై స్పష్టత లేదు. నిధుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ‘పై నుంచి ఆదేశాలు లేవు.. ఎప్పుడు ఇస్తామో చెప్పలేం‘ అంటూ అధికారులు నిర్వేదం వ్యక్తం చేస్తుండటం బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది. కొండాపురం మండల పరిధిలో ముంపునకు గురైన సుమారు 500 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ‘అవార్డు’ పాస్ చేయలేదు. ప్రస్తుతం ఆ భూముల్లో ప్రాజెక్టు నీరు నిల్వ ఉండటంతో రైతులు సాగు చేసుకోలేక, పరిహారం అందక ఆర్థికంగా చితికిపోతున్నారు. గత ప్రభుత్వం జూలై 6, 2023న జీవో నంబర్ 312 ద్వారా రూ. 296.62 కోట్లు విడుదల చేసినా, రాజకీయ కారణాలతో వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడం కూటమి నేతల ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. -
నిధుల గోల్మాల్: ఈఓ సస్పెన్షన్
చిన్నమండెం: చిన్నమండెం మండలం కొత్తపల్లి పంచాయతీ మాండవ్యానదీ తీరాన వెలసిన మల్లూరమ్మ ఆలయ ఈఓగా కొనసాగుతున్న కొండారెడ్డిపై దేవదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం, అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంల్లో కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడం, భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. విచారణ పూర్తయ్యే వరకు కొండారెడ్డిని విధులకు దూరం చేస్తూ ప్రస్తుతానికి తాత్కాలిక ఈఓగా శివయ్యను నియమించారు. మదనపల్లె సిటీ: ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం డీవైఈఓ, ఎంఈఓ, పరీక్ష కేంద్రాల ఛీప్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఓపెన్ స్కూల్క్ష పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు. మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా కేంద్రం మదనపల్లెలో ఏర్పాటుచేసిన జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ప్రారంభించారు. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కకూన్మార్ట్కు సమీపంలో అన్ని వసతులతో ఏర్పాటు చేసినట్లు డీఏఓ శివనారాయణ తెలిపారు. జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు నూతన జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి సేవలు అందిస్తామన్నారు. జిల్లా వ్యవసాయశాఖ ఏడీఏ మజీద్ అహ్మద్, మదనపల్లె ఏడీఏ రమేష్రాజు, పుంగనూరు ఏడీఏ సి.శివకుమార్ పాల్గొన్నారు. -
ప్రాధాన్యతా రంగాలకు అధిక రుణాలు
మదనపల్లె: బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎల్డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ బ్యాంకుల రుణాల మంజూరు, 2025–26 ఆర్థిక సంవత్సర లక్ష్యాలు, ప్రాధాన్యత రంగాల రుణాలు, ఆర్థిక సమ్మిళితత్వం కరువు మండలాలకు చేయూత, పీఎం స్వానిధి, పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్లపై వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యానవన పంటలకు రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు రుణాల లక్ష్యాలు సాధించడం లేదన్నారు. ముద్ర యోజన పథకం కింద 8245 లబ్ధిదారులకు రూ. 436 కోట్ల రుణాలు మంజూరు చేశామని ఎల్డిఎం అంజనేయులు వివరించగా పూర్తి లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. మహిళల నిర్వహిస్తున్న పరిశ్రమలకు రుణాలను వెంటనే అందించాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలి మదనపల్లెటౌన్: మహిళలపై నేరాలు జరగకుండా అరికట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం అవసరమన్నారు. నేరా లు జరుగుతున్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు, శక్తి టీంకు, విద్యాసంస్థల్లో హెచ్ఎంలకు సమాచారం అందించాలన్నారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మా ట్లాడుతూ యువత జెన్–జీ తరానికి చెందిన వారు.. సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వివా హం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉద్యోగం ఉందా లేదా, భవిష్యత్తులో తాను స్వతంత్రంగా నిలవగలనా లేదా, తల్లిదండ్రుల అభిప్రాయం ఏమిటి వంటి అనేక అంశాలను పరిశీలించి, సమగ్రంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఐదు పైసలు కూడా అందలేదు..
‘మా కుటుంబంలో ముగ్గురికి పరిహారం రావాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నీరు నిల్వ ఉన్నా మాకు మాత్రం ఇప్పటివరకు ఐదు పైసలు కూడా అందలేదు. ఊరు విడిచి వచ్చేశాం.. ఇక్కడ బతకడం భారమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి.‘ – పురుషోత్తం, దొరువుపల్లి, కొండాపురంభూములకు అవార్డులు ఇవ్వాలి.. ‘గండికోట ముంపు కింద 500 ఎకరాల భూమి పోయింది. అధికారులు ఇప్పటివరకు అవార్డులు పాస్ చేయలేదు. ప్రస్తుతం ఆ భూములు నీటిలో ఉండటంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం ఇవ్వాలి.‘ – హరినారాయణరెడ్డి, తాళ్లప్రొద్దుటూరుమండలిలో ప్రశ్నించాను.. ‘ముంపువాసులకు పరిహారం అంశాన్ని శాసనమండలిలో ప్రశ్నించాను. ఇళ్లు, భూములు కోల్పోయిన 14 గ్రామాల వారిక గత ప్రభుత్వం ప్రకటించిన రూ. 3.25 లక్షలతో పాటు, ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షలు కలిపి రూ. 5.25 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ -
కాషాయ కండువా కప్పుకోనున్న వీరశివా !
● రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో చేరిక ● ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ లభ్యం సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పుత్తాకు పక్కలో బల్లెం... కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం. -
ఫారెస్ట్ ఏబీఓకు వడదెబ్బ
● మంటలు ఆర్పేందుకు గ్రామస్తులతో కలిసి కొండపైకి వెళ్లిన హరి శంకర్ రెడ్డి ● అక్కడే వడదెబ్బతో తీవ్ర అస్వస్థత నిమ్మనపల్లె : అడవిలో అంటుకున్న మంటలను ఆర్పేందుకు గ్రామస్తులు, తోటి అధికారులతో వెళ్లిన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ఏబీఓ) దారి తప్పి, కొండపై వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనైన సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. రాచవేటివారిపల్లె పంచాయతీలోని నూరుకుప్పల కొండకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో, స్థానికులు బుధవారం సాయంత్రం ఫారెస్ట్ అధికారుల దష్టికి తెచ్చారు. స్పందించిన అటవీశాఖ అధికారులు బుధవారం రాత్రి అడవిలో మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. గురువారం పెద్ద కొండపై మరికొంత మేర మంటలు అలాగే ఉండడంతో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శోభారాణి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిశంకర్ రెడ్డి, స్థానికులతో కలిసి కొండపైకి మంటలు ఆర్పేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హరి శంకర్ రెడ్డి దారి తప్పి మరో ప్రదేశంలోకి వెళ్లాడు. అయితే అదే సమయానికి ఎండ అధికమై, వడ దెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. బీట్ ఆఫీసర్ శోభారాణికి ఫోన్ చేసి తన సమస్యను తెలిపాడు. దీంతో వెంటనే ఆమె ఫారెస్ట్ అధికారులకు, నిమ్మనపల్లె పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో, హరిశంకర్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఆధారంగా, కొండపై అతని ఆచూకీ గుర్తించారు. అధికారులు అక్కడికి వెళ్లేటప్పటికి హరిశంకర్ రెడ్డి అపస్మారక స్థితిలో ఉండగా, హుటాహుటిన కిందికి తీసుకువచ్చి, గ్లూకోజ్ వాటర్ అందించి సపర్యలు చేయడంతో మెలుకువలోకి వచ్చాడు. మదనపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి జయప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించి, హరి శంకర్ రెడ్డి ని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. -
● భౌతికశాస్త్రం : భావనలే ప్రాణం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించడానికి నిపుణులు అందించిన కీలక సూచనలు ఇక్కడ ఉన్నాయి: 1. సమాధానాల సరళి: ముందుగా ఎక్కువ మార్కులు వచ్చే 8 మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత 4 మార్కులు, 2 మార్కులు మరియు చివరిగా 1 మార్కు ప్రశ్నలను స్పష్టంగా రాయాలి. 2. 8 మార్కుల ప్రశ్నల విభాగం: ఈ విభాగంలో పట్టు సాధించడానికి బ్లూప్రింట్ ప్రకారం క్రింది పాఠాలను క్షుణ్ణంగా చదవాలి: ● మానవుడి కన్ను, రంగుల ప్రపంచం. ● రసాయనిక చర్యలు – రసాయనిక సమీకరణాలు. ● విద్యుత్ ప్రవాహం–అయస్కాంత ఫలి తంలేదావిద్యుత్తు. కార్బన్, దాని సమ్మేళనాలు. లోహాలు–అలోహాలు. 3. 4 మార్కుల ప్రశ్నలు – చిత్రపటాలు: ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కాంతి పరా వర్తనం , వక్రీభవనం పాఠాలను చదవాలి. ● ముఖ్యంగా చిత్రపటాలు, రేఖా చిత్రాలు ఈ పాఠాల నుంచే వచ్చే అవకాశం ఉంది. 4. 1 – 2 మార్కుల ప్రశ్నలు: విద్యుత్, కాంతి పరావర్తనం – వక్రీభవనం, ఆమ్లాలు – క్షారాలు – లవణాలు పాఠాల నుంచి చిన్న ప్రశ్నలను క్షుణ్ణంగా సిద్ధం చేసుకోవాలి. 5. ప్రాక్టీస్ పేపర్లు: ఇప్పటివరకు జరిగిన ఎఫ్.ఏ–1 ( ఊఅ–1), ఎఫ్.ఏ–2, ఎఫ్.ఏ–3, స్లిప్ టెస్టులు, ప్రీ–ఫైనల్ మరియు గ్రాండ్ టెస్ట్ పేపర్లను సేకరించి ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా విధానంపై పూర్తి అవగాహన వస్తుంది. – పి. వరప్రసాద్, స్కూల్ అసిస్టెంట్, గాంధీనగర్ స్కూల్, కడప -
టీడీపీ పాలనపై ప్రజల్లో విసుగు
సదుం: టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. మండలంలోని చీకలచేనుకు చెందిన పలువురు టీడీపీ సానుభూతి కుటుంబాలు గురువారం వైఎస్సార్ సీపీలో చేరాయి. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. రానున్న రోజులలో చేరికలు మరింత ఉంటాయని వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో నటరాజు, చంద్రశేఖర్, సిద్ధేశ్వరి, మీనా, సుహాసిని, మల్లికార్జున, కృష్ణమ్మ, చిన్నప్ప, జయసింహా, వెంకటరామయ్య, ఓబయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెడ్డెప్పరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, గణేశ్రెడ్డి, భగీరథ రెడ్డి, గుణశేఖర్, రమేశ్ రెడ్డి, మునిరాజ, చిన్నయ్య, రాజన్న, వినాయక తదితరులు పాల్గొన్నారు. -
కనుగొండ అడవికి నిప్పు
ములకలచెరువు: ములకలచెరువుకు ఆనుకొని ఉన్న కనుగొండకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాపించి చెట్లు కాలిపోయాయి. సుమారుగా వంద ఎకరాల్లో అడవి మంటలకు దహించిపోతోంది. ఎగసిపడిన మంటలు, వ్యాపించిన దట్టమైన పొగతో పెద్దపాళ్యం, అంగజాలపల్లె, పాతములకలచెరువు, వడ్డిపల్లెలకు పొగ అలు ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పే పనిలో ఫైర్, అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నూనె మీదపడి యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లిటౌన్: వంట చేస్తుండగా వేడినూనె మీదపడి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన బి కొత్తకోట మండలంలో జరిగింది. గురువారం ఉదయం బడికాయలపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు జె.కిరణ్(30) ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె మీద పడింది. కుటుంబీకులు గమనించి బాధితుడిని 108లో స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికి త్సలు చేశారు. జీపీఎస్ దారి తప్పింది – బైక్ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు మదనపల్లెటౌన్: జీపీఎస్ లోకేషన్ చూస్తూ తిరుపతి నుంచి మదనపల్లెకు బైక్లో వస్తున్న దంపతులకు జీపీఎస్ దారి తప్పించడంతో ప్రమాదానికి గురైన ఘటన గురువారం మండలంలోని శానిటోరియం వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు. తిరుపతికి చెందిన దంపతులు ఆనంద్ (25), నాగలక్ష్మి (20) కుమారుడు అభి(5)తో కలసి మదనపల్లెలో జరుగుతున్న బంధువుల పెళ్లికి బైక్లో బయలుదేరారు. వీరు మదనపల్లె సమీపంలోని శానిటోరియం వద్దకు రాగానే రోడ్డు అభివృద్ధి పనులు సాగుతున్నాయి.దీంతో రోడ్ డైవర్షన్ ఉంది. జీపీఎస్ ఈ డైవర్షన్ను చూపకపోవడంతో నేరుగా చర్చి వైపు రోడ్డులోకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. తాలూక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు మదనపల్లెటౌన్: ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లె మండలం, పిట్టావాండ్లపల్లెకు చెందిన జగదీష్(26) సొంతపనిపై బైక్లో అంగళ్లుకు బయలుదేరాడు. మదనపల్లె మండలం, సీటీఎంకు చెందిన మల్లికార్జున (30) ద్విచక్రవాహనంలో అంగళ్లు నుంచి మదనపల్లెకు వస్తుండగా, అంగళ్లు బైపాస్ రోడ్డులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు వారికి చికిత్సలు అందించారు. ముదివేడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పది పరీక్షల్లో పదికి పది
తెలుగు సబ్జెక్టులో పదికి పది మార్కులు సాధించడానికి అమూల్యమైన సూచనలు: 1. అవగాహన – ప్రతిస్పందన: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అసంపూర్తిగా కాకుండా, పూర్తి వాక్యాలలో స్పష్టంగా రాయాలి. 2. సమాధానాల సరళి: పద్యభాగం, గద్యభాగం మరియు ఉపవాచకం నుండి అడిగే లఘు, వ్యాసరూప మరియు సృజనాత్మక ప్రశ్నలకు ఆయా ప్రశ్నల స్వభావాన్ని బట్టి, అడిగిన పరిధి మేరకు సమాధానాలు రాయాలి. 3. భాషాంశాలు – వ్యాకరణం: పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. పుస్తకం చివర ఇచ్చే పదవిజ్ఞానం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, మరియు ప్రకృతి–వికృతి పదాలపై పట్టు సాధిస్తే భాషాంశాల్లో పూర్తి మార్కులు పొందవచ్చు. 4. బహుళైచ్ఛిక ప్రశ్నలు: జవాబులు రాసేటప్పుడు కేవలం ‘అ, ఆ, ఇ, ఈ’ వంటి ఐచ్ఛికాలను గుర్తించడమే కాకుండా, వాటికి సంబంధించిన పదాలను కూడా రాయడం మంచిది. 5. ప్రణాళికాబద్ధమైన సాధన: పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ‘నూరు రోజుల ప్రణాళిక’లోని ప్రశ్నలను మరియు అందులోని 3 మోడల్ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. 6. ప్రెజెంటేషన్ టిప్స్: చక్కని దస్తూరి కలిగి ఉండాలి. విరామ చిహ్నాలను పాటిస్తూ, అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. – గంగనపల్లి వెంకటరమణ, ప్రధానోపాధ్యాయులు (FAC), జడ్పీహెచ్ఎస్ నాగిరెడ్డిపల్లి, నందలూరు మండలంపది పబ్లిక్ పరీక్షల్లో సాంఘిక శాస్త్రంలో గరిష్ట మార్కులు సాధించడంపై కీలక సూచనలు 1. బ్లూ ప్రింట్ విశ్లేషణ: విద్యాశాఖ అందించిన బ్లూ ప్రింట్ ప్రకారం పాఠ్యాంశాలను మార్కుల కేటాయింపు ఆధారంగా విభజించుకోవాలి. ఎక్కువ మార్కులు వచ్చే పాఠ్యాంశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చదవాలి. 2. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు): సెక్షన్–1లోని 12 ఒక మార్కు ప్రశ్నలు, సెక్షన్–2లోని 8 రెండు మార్కుల ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఇవి నేర్చుకోవడానికి తక్కువ సమయం పడుతుంది కాబట్టి వీటిని పదే పదే పునశ్చరణ చేయాలి. 3. పట నైపుణ్యాలు : ప్రశ్నపత్రంలోని గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలు, పట నైపుణ్యాల ప్రశ్నలను తప్పులు లేకుండా రాసేలా బాగా సాధన చేయాలి. ఇవి సులభంగా మార్కులు తెచ్చిపెట్టే విభాగాలు. 4. 8 మార్కుల ప్రశ్నల వ్యూహం (40 మార్కులు): సెక్షన్–4లో ఉండే 5 ఎనిమిది మార్కుల ప్రశ్నలకు (5 ్ఠ8=40) ప్రణాళికాబద్ధంగా సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. వీటిపై పట్టు సాధిస్తే ప్రతి విద్యార్థి 60కి పైగా మార్కులు పొందవచ్చు. 5. 100/100 లక్ష్యంగా: పూర్తిగా 100 మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు సెక్షన్–3లోని 8 నాలుగు మార్కుల ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాఠ్యాంశాల వారీగా వీటిని విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండటం అదనపు ప్రయోజనం .–ఓబులేసు,జెడ్పీ హైస్కూల్, బోయినపల్లిఇంగ్లీష్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించడానికి సూచనలు 1. ప్రశ్నపత్రంపై అవగాహన: ప్రశ్నాపత్రాన్ని మొదట పూర్తిగా, నిశ్చితంగా చదవాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్: వీటిని సాధించేటప్పుడు "Interrogative Pronouns" ( What, When, Which, Why, How) యొక్క అర్థాలను సరిగ్గా అర్థం చేసుకుంటే సమాధానాలు వెతకడం సులభమవుతుంది. 2. సమాధానాల క్రమం: జవాబులు రాసేటప్పుడు ప్రశ్నల క్రమం మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. ఇది వాల్యుయేషన్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. 3. టెక్చువల్ గ్రామర్: ప్రతి పాఠం చివరలో ఉండే గ్రామర్ అంశాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఇవి చాలా కీలకం. 4. స్పెల్లింగ్ పంక్చుయేషన్: స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయాలి. సరైన విరామ చిహ్నాలను పాటించడం వల్ల ప్రెజెంటేషన్ బాగుంటుంది. 5. పాత్రల గుర్తింపు: ప్రతి పాఠంలోని ముఖ్యమైన పాత్రలను, వారి స్వభావాలను గుర్తుంచుకోవాలి. దీనివల్ల అనలిటికల్ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయవచ్చు. 6. క్రియేటివ్ రైటింగ్: డిస్కోర్సెస్ లేదా క్రియేటివ్ రైటింగ్లో గరిష్ట మార్కులు సాధించాలంటే, సమాధానం కనీసం రెండు పేజీలకు తగ్గకుండా, స్పష్టమైన ఫార్మాట్లో ఉండాలి. – గంగయ్య, ఎస్ఏ ఇంగ్లీష్, జెడ్పీ హైస్కూల్, సిద్దవరం, పోరుమామిళ్ల మండలం1. మొదటి యూనిట్ (జీవక్రియలు) – అత్యంత కీలకం: జీవక్రియల యూనిట్ నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని పూర్తిగా చదవాలి. ఈ విభాగం నుండి: ఒక 8 మార్కుల ప్రశ్న (ప్రయోగాలు). రెండు 4 మార్కుల ప్రశ్నలు. రెండు 2 మార్కుల ప్రశ్నలు. రెండు 1 మార్కు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 2. అనువంశికత: ఈ యూనిట్ నుంచి సులభంగా 10 మార్కులు సాధించవచ్చు. ఇందులో ఉన్న మూడు 8 మార్కుల ప్రశ్నల నుండి ఒకటి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే దృశ్యరూప, జన్యురూప నిష్పత్తులు మరియు సంక్షిప్త పదాల విస్తరణపై దృష్టి పెట్టాలి. 3. మన పర్యావరణం: ఈ యూనిట్ నుంచి 4 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఓజోన్ పొర క్షీణత. బయో డీగ్రేడబుల్ మరియు నాన్–బయో డీగ్రేడబుల్ అంశాలు. వీటితో పాటు ఒక 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 4. ముఖ్యమైన చిత్రాలు: పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి ఈ క్రింది చిత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి: యూనిట్ 1: విసర్జన వ్యవస్థ, నెఫ్రాన్ నిర్మాణం. యూనిట్ 3: పుష్పం నిలువు కోత, సీ్త్ర ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పుష్ప ఫలదీకరణ చిత్రం. ఎస్సిఇఆర్టి విడుదల చేసిన మోడల్ పేపర్లను పరిశీలించాలి. – శ్రీధర్రావు, జీవశాస్త్రం, ఎంసీహెచ్ఎస్, నాగరాజుపేల, కడప. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రతి సబ్జెక్టులోనూ ‘జిపిఏ 10’ సాధించవచ్చని జిల్లాలోని వివిధ పాఠశాలల నిపుణులైన ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 167 పరీక్ష కేంద్రాల్లో 28,152 మంది పరీక్షలు రాయబోతున్నారు. సబ్జెక్టుల వారీగా వారు అందించిన కీలక వ్యూహాలు ఇవే: –కడప ఎడ్యుకేషన్ -
గర్భిణీ ఆత్మహత్య
పెద్దమండ్యం: ఎనిమిది నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని కలిచెర్లలో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుర్రంవాండ్లపల్లె పంచాయతీ బత్తినిగారిపల్లెకు చెందిన వీరభద్ర మూడో కుమార్తె శ్రీలత (18)కు తంబళ్లపల్లె మండలం ఎద్దులవారికోట పంచాయతీ నాయునివారిపల్లెకు చెందిన కోటకొండ నాగరాజు కుమారుడు సోమశేఖరతో వివాహం జరిపించారు. ఇతనికి తల్లిదండ్రులు లేక పొవడంతో వివాహమైనప్పటి నుంచి దంపతులు ఇద్దరు కలిచెర్లలోని కుమ్మరవీధిలో నివాసం ఉన్న సోమశేఖర చిన్నాన్న కె. మల్లికార్జున ఇంట్లోనే ఉంటున్నారు. ఇతను గ్రామంలో భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేసుకుంటుండగా, సోమశేఖర ట్రాక్టర్ డ్రైవర్గా ఓ రైతు వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవల వేరు కాపురం పెట్టాలని భర్తను భార్య కోరింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. అయితే ప్రసం జరిగిన తరువాత వేరుకాపురం పెడతామని అల్లుడైన సోమశేఖర, భార్య తల్లిదండ్రులకు చెప్పారు. కాగా వేరు కాపురం పెట్టలేదని, తన మాట వినలేదన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పి. శ్రావణి పరిశీలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదెహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత ఆత్మహత్యాయత్నం మదనపల్లెటౌన్: కుటుంబీకులతో గొడవపడి ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిమ్మనపల్లె మండలంలో గురువారం చోటు చేసుకున్న ఘటనపై కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు. కొండయ్య గారి పల్లికి చెందిన షాహిర్ భార్య ముబీనా (28), కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో గొడవపడి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. వైద్యం అందించినా కోలుకోకపోవడంతో ఆమెను తిరుపతి తీసుకెళ్లారు. అప్పుల బాధ తాళలేక రైతు ...వేంపల్లె : మండలంలోని బక్కన్న గారి పల్లె గ్రామంలో రెడ్డిబోయిన. సూర్యనారాయణ (30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన రెడ్డి బోయిన సత్యనారాయణ కుమారుడు సూర్యనారాయణ కు 2.50 ఎకరాలు పొలం ఉంది. ఈ పొలంలో అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేసుకునేవారు. గతంలో తమ పొలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఐదు బోర్లు వేయించాడు. సుమారు 12 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేయగా దిగుబడి రాకపోవడమే కాకుండా గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు. దీంతో తెచ్చిన అప్పులు తీర్చలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీ తో ఉరి వేసుకున్నాడు. ఈయనకు భార్య కళ్యాణి ఐదు సంవత్సరాల కొడుకు భాను ప్రకాష్, మూడు సంవత్సరాల కొడుకు రుషేంద్ర లు ఉన్నారు. భార్య కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. కుటుంబ పోషకుడు మృతి చెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
జననేత రాకతో అభిమాన సాగరం ఉప్పొంగింది. పసిడిపురి జనసంద్రమైంది. వైఎస్ జగన్కు ప్రొద్దుటూరు బ్రహ్మరథం పట్టింది. అడుగడుగునా నీరాజనాలు, దారిపొడవునా పూల వర్షాల మధ్య పర్యటనంతా జన జాతరను తలపించింది. అభిమానుల కేరింతలు.. జై జగన్ నినాదాలతో రామేశ్వరం బైపాస్ రోడ్డు
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రొద్దుటూరులో జనం నీరాజనం పట్టారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి గురువారం జగన్ హాజరయ్యారు. హెలీకాప్టర్లో వచ్చిన వైఎస్ జగన్ రామేశ్వరంలో నిర్మించిన హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని రిసెప్షన్ వేదికకు చేరుకున్నారు. ఆ దారంతో జనం పోటె త్తారు. జగన్ అందరికీ చిరునవ్వుతో అభివాదం చేశారు. హెలీప్యాడ్ వద్ద జగన్ను కలిసిన నేతలు జగన్ రాక సందర్భంగా రామేశ్వరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పలువురు నేతలు ఆయనను కలిసి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, మాజీ మంత్రి అంజద్ బాషా, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మాజీ మేయర్ కె.సురేష్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోరెడ్డి నరసింహారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్ మార్తల చంద్ర ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్ జగన్ ప్లకార్డుతో ఓ అవ్వ -
● గణితం: ఫార్ములాలతో ద్విగుణీకృతం
ఈ ఏడాది గణితం ప్రశ్నపత్రంలో సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ కొన్ని మార్పులు జరిగా యి. వీటిని గమనించి చదివితే మంచి మార్కు లు సాధించవచ్చని గాంధీనగర్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు. 1. ప్రశ్నపత్రంలో కీలక మార్పులు: గతంతో పోలిస్తే ఈసారి కొన్ని అధ్యాయాల్లో మార్కుల కేటాయింపు మారింది: బహుపదులు: 1 మార్కు ప్రశ్న ఒకటి, 2 మార్కుల ప్రశ్న ఒకటి వచ్చే అవకాశం ఉంది. రేఖీయ సమీకరణాల జత: 1 మార్కు ప్రశ్న ఒకటి వస్తుంది. వృత్తాలు: 1 మార్కు ప్రశ్న ఒకటి అడుగుతారు. సంభావ్యత: ఈ విభాగం నుండి 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 2. వెనుకబడిన విద్యార్థుల కోసం ‘పాస్’ వ్యూహం: గణితంలో వెనుకబడిన విద్యార్థులు భయం వీడి, క్రింది పాఠ్యాంశాలపై దృష్టి పెడితే సులభంగా 63 మార్కుల వరకు సాధించవచ్చు: ● వాస్తవ సంఖ్యలు (చాప్టర్ 1) ● బహుపదులు (చాప్టర్ 2) ● రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత (చాప్టర్ 3) ● నిరూపక రేఖాగణితం (చాప్టర్ 7) ● సాంఖ్యక శాస్త్రం (చాప్టర్ 13) సంభావ్యత (చాప్టర్ 14) 3. స్కోరింగ్ టిప్స్: ముఖ్యంగా 1, 3, 7, 13, 14 అధ్యాయాలు మిగతా వాటితో పోలిస్తే సుల భంగా ఉండటమే కాకుండా, ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి. వీటిని ప్రాక్టీస్ చేస్తే గ్రేడ్ సాధించడం సులభమవుతుంది. – సురేష్, మ్యాథ్స్, గాంధీనగర్ హైస్కూల్, కడప -
సమష్టి కృషితో రామయ్య బ్రహ్మోత్సవాలు
● సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు ● రామయ్య కల్యాణానికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు ● కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్ ఒంటిమిట్ట: టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమిష్టి కృషితో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఎస్. నచికేత్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవాలపై గురువారం స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఈ కల్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారని వెల్లడించారు. టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అంతకుముందు జేఈవో వీరబ్రహ్మం రామయ్య కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. -
మనస్పర్థలతో బంధాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు
మదనపల్లెటౌన్: ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనిషికి కొండంత అండగా నిలిచేది కేవలం కుటుంబమే అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్శ్రీను అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత ప్రయాణంలో మనసును, ఆత్మగౌరవాన్ని, కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయకూడదని హితవు పలికారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దలను కాదని పిల్లలు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడొద్దని చెప్పారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలతో విడిపోతున్న కుటుంబాలను కలిపేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉమెన్ వింగ్ పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ వింగ్ సీఐ శంకర మల్లయ్య, రాజారెడ్డి, మహమ్మద్ రఫి, కళా వెంకటరమణ ఎస్ఐ గాయత్రి, రహీముల్లా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా చైతన్యానికే 2కే వాకథాన్ ఆడబిడ్డల రక్షణే ప్రథమ కర్తవ్యంగా, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. మహిళా భద్రతపై సమాజంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మదనపల్లె పట్టణంలో 2కే వాకథాన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలసి ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం 7గంటలకు మిషన్కాంపౌండ్ నుంచి బీటీ కళాశాల మైదానం వరకు వాకథాన్ ఉంటుందని తెలిపారు. మదనపల్లె పోలీసుల ఆధ్వర్యంలో, శక్తి టీమ్ సమన్వయంతో సాగే ఈచైతన్య యాత్రలో పాల్గొనే వారికి తాగునీరు, అల్పాహార వసతి కల్పించారు. పాల్గొన్న వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
● హిందీ : వ్యాకరణంతో మెహందీ
గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ముఖ్యమైన పాఠ్యాంశాలపై దృష్టి సారిస్తే హిందీ లో మంచి మార్కులు సాధించవచ్చు. 1. మొదటి విభాగం (35 మార్కులు): పాసేజ్లు: ప్రశ్నపత్రంలోని మొదటి భాగంలో 35 మార్కులకు ప్యాసేజ్ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల్లోని ముఖ్య పదాలను ప్యాసేజ్లో వెతకడం ద్వారా వీటికి సులభంగా సమాధానం ఇవ్వవచ్చు. కవి/రచయిత పరిచయం: కవి,రచయిత పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఇవి నేరుగా మార్కులు తెచ్చిపెడతాయి. 2. పద్యభాగం: దోహాలు: పద్యభాగంలోని 4 దోహాలను కంఠస్థం చేస్తే, ఇతర చిన్న ప్రశ్నలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యమైన సారాంశాలు: పద్యభాగం నుండి ‘బరస్తే బాదల్’ మరియు ‘కణ్–కణ్ కా అధికారి’ పాఠ్యాంశాల సారాంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. 3. గద్యభాగం – ఉపవాచకం: ముఖ్యమైన పాఠాలు: గద్యభాగం నుండి ‘ఈద్గాహ్’ మరియు ‘లోక్ గీత్’ పాఠాలపై పట్టు సాధించాలి. లఘు ప్రశ్నలు: ‘స్వరాజ్య కీ నీవ్’, ‘అంతర్జాతీయ స్థర్ పర్ హిందీ’, ‘దక్షిణీ గంగా గోదావరి’ పాఠాల నుంచి లఘు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఉపవాచకం: ఉపవాచకంలో ‘దో కళాకార్’ పాఠంలోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. లేఖలు: చుట్టీ పత్ర్ , పుస్తక విక్రేతకు లేఖ , ,పితాజీకి లేఖ నేర్చుకోవడం మంచిది. –కరీముల్లా ఖాదర్, మున్సిపల్ హైస్కూల్ మెయిన్, కడప. -
ప్రేమ వివాహం చేసుకున్నానని వెలివేశారు
అడిషనల్ ఎస్పీ ఎదుట కన్నీటి పర్యంతమైన బాధితురాలు మదనపల్లెటౌన్: తాను డిగ్రీ చదివే సమయంలో ఊర్లో ఉన్న యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నాను. తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించి ఊరి కట్టుబాట్లను పక్కన పెట్టి పెళ్లి చేశారన్న కోపంతో ఊరి పెద్దలు తనతో పాటు తల్లిదండ్రులను ఊరి నుంచి వెలిశారని గురువారం మధ్యాహ్నం సోమల మండలం, కందూరు గ్రామం, బాలం వారిపల్లి కి చెందిన సరస్వతి, వెంకటరమణ దంపతుల కుమార్తె గౌరీ మదనపల్లె అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేసింది. తాను ఆనంద్ కుమార్ను 2003లో ప్రేమ వివాహం చేసుకున్నానని పేర్కొంది. ఆరు నెలల పాటు సంసారం సజావుగా సాగిందని..ఈ క్రమంలోనే ఊరి పెద్దలు శేఖర్, రమణ, హరి, సుబ్రహ్మణ్యంలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేశారని ప్రేమ వివాహం చేసుకున్న తనతో పాటు నా తల్లిదండ్రులను ఊరి నుంచి వెలివేశారని బాధితురాలు ఆరోపించింది. రెండేళ్లుగా సోమల పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇంటికొకరిని తీసుకువచ్చి రాద్ధాంతాలు చేసి మా సంసారాన్ని కూల్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ శేఖర్ తమకు న్యాయం జరగకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఊర్లో ఉన్న వారెవరూ మాతో మాట్లాడకూడదని నిబంధనలు పెట్టినట్లు వాపోయింది. మాతో గ్రామస్తులు ఎవరైనా మాట్లాడితే రూ.5000 కట్టాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. తమకు కూడా రూ.20 వేలు వేశారని ఆ మొత్తం చెల్లిస్తే ఊర్లోకి రానిస్తాం.. లేకుంటే రానివ్వమని పెద్దలు ఊరి నుంచి వెలి వేయడంతో తన ఇంట్లో అన్నా వదినలను పెట్టి ఊరు విడచి సూరయ్యగారి పల్లికి వచ్చేశామని గౌరీ, ఆమె తల్లి దండ్రులు సరస్వతి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. కూలి పనులు చేసే తమకు రూ.20 వేలు కట్టే స్థోమత లేక రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. తనకు బాబు పుట్టాడు. తన భర్తతో కలిపి మా సంసారాన్ని నిలబెట్టాలని అడిషనల్ ఎస్పీని వేడుకున్నారు. ఊరి కట్టుబాట్ల పేరుతో వెలివేయడం తమకు శాపంగా మారిందని గౌరీ కంటతడి పెట్టింది. స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి వెంటనే చౌడేపల్లి సీఐ సాయి ప్రతాప్, సోమల ఎస్సైతో మాట్లాడారు. గ్రామస్తులు, పెద్దమనుషులతో మాట్లాడి బాధితుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. -
బోయకొండలో వేలం పాటల ఆదాయం రూ:3.08 కోట్లు
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద వివిధ రకాల వేలం పాటల లీజు ద్వారా ఆలయానికి రూ:3.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. గురువారం బోయకొండ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పర్యవేక్షణలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలకు రూ:5లక్షల ధరావత్తు చెల్లించిన 21 మంది పాటదారులు మాత్రమే పాల్గొన్నారు.గతంలో వచ్చిన వేలం పాట ఆదాయంలో నామమాత్రపు ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ ముందే నిర్ణయించిన మేరకు వేలం పాటలు ముగించేశారని ఆరోపణలు వచ్చాయి.కొండ పైన కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు ద్వారా రూ:54.70 లక్షలకు పాడి హరిప్రసాద్ సొంతం చేసుకొన్నారు. దేవస్థానం టోల్ గేటు నిర్వహణ హక్కు ద్వారా రూ:73 లక్షల హెచ్చుపాటతో రమణ కై వసం చేసుకున్నారు. పెద్దబోగం, చిన్న బోగం సేకరించుకొను హక్కు ద్వారా రూ:88.20 లక్షలతో గోపి , భక్తాధులు సమర్పించు చీరలు, రవికలు, పావడాపీసులు సేకరించుకొను హక్కు రూ:47.06 లక్షలతో గంగులప్ప సొంతం చేసుకొన్నారు. అలాగే భక్తాధులు సమర్పించు తలనీలాలు సేకరించే హక్కును రూ:27.15 లక్షల హెచ్చుపాటతో యాదగిరి కై వసం చేసుకొన్నారు. కొండపై క్లాక్ రూము నిర్వహించుకొనే హక్కుపై రూ:18.50 లక్షల హెచ్చుపాటతో కిరణ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొండపై పూల హారాలు,నిమ్మకాయ హారాలు, వడిబాల సామాగ్రి,చీరలు, జాకెట్ పీసులువిక్రయించుకొను హక్కుకు పోటీదారులనుంచి సరైన మద్దతు రాని కారణంగా వాయిదా వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ చిన్నరెడ్డెప్ప బందోబస్తును ఏర్పాటుచేశారు. -
భక్తిశ్రద్ధలతో పుష్పయాగం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పుష్పయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
బాణసంచా కేంద్రాలను మూసివేయాలి
మదనపల్లెటౌన్: బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయశాలల్లో తనిఖీలు పూర్తయ్యే వరకు వాటిని మూసివేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లా, వేట్లపాలెంలో జరిగిన ప్రమాదాన్ని దష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. జిల్లావ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. మదనపల్లె, రాయచోటి సబ్–డివిజన్ల పరిధిలో రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సమన్వయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. గోడౌన్లలో తగినంత ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ‘స్పార్క్–ప్రూఫ్’సిస్టమ్స్ ఉండాలని తెలిపారు. ప్రతి విక్రయశాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ఫీడ్ను స్థానిక పోలీస్స్టేషనన్కు అనుసంధానించాలని ఆదేశించారు. అక్రమంగా టపాసులు నిల్వ చేసినట్లు గమనిస్తే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
నేడు ప్రొద్దుటూరుకు వైఎస్ జగన్ రాక
ప్రొద్దుటూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉద యం ప్రొద్దుటూరుకు రానున్నారు. రామేశ్వరం బైపాస్ రోడ్డులోని వైవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డి రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరు నుంచి హెలీకాప్టర్లో రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 11.10 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను కలుసుకున్న అనంతరం రోడ్డు మార్గం ద్వారా వేదిక వద్దకు వెళ్తారు. దారి పొడవునా భద్రత ఏర్పాట్లను ఏఎస్పీ విభూ కృష్ణ పరిశీలించారు. ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. నల్గొండ గద్దర్ నరసన్న రాక రిసెప్షన్ కార్యక్రుమానికి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆహ్వానం మేరకు నల్గొండ గద్దర్ నరసన్న రానున్నారు. పాటలు పాడనున్నారు. -
వేతనాలకు రామ్ రామ్
● ఏప్రిల్ ఒకటి నుంచి వీబీ జీ రాం జీ పథకం ● 19 వేల పనులు రద్దయ్యే పరిస్థితులు ● జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.46.61 కోట్లు, కూలీలకు రూ.20.43 కోట్లు పెండింగ్ మదనపల్లె : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వరూపం మారిపోనుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీబీ జీ రాం జీ పథకం తీసుకురావడంతో ఉపాధి పనులకు గండం ఏర్పడింది. ఇప్పటిదాకా అన్నమయ్య జిల్లాలో మంజూరు చేసి చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. గత చట్టానికి భిన్నంగా కొత్త చట్టం ఉండడంతో మంజూరైన పనులు పూర్తిగా రద్దయ్య అవకాశం నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూలీలు చేసిన పనులకు వేతనాలు, అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మార్చి 31 నాటికి చేపట్టిన పనులు, మంజూరైన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలింది రోజులే కావడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికార యంత్రాంగం ఆందోళనలో ఉంది. 19 వేల పనులపై ప్రభావం జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఉపాధి కల్పిస్తూ 60,555 పనులు మంజూరు చేశా రు. వీటిలో ఫిబ్రవరి 28 నాటికి 40,880 పనులు పూర్తి చేశారు. ఇంకా 19,708 పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని చేపట్టి పూర్తి చేయాల్సినప్పటికీ సమయం లేదు. పథకంలో మార్పుల కారణంగా కోట్లాది నిధులను సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయకపోతే రద్దయ్యే అవకాశం ఉంది. పనులకు రూ.46 కోట్లు జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది రూ.60.08 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో గ్రామ సచివాలయాలు, భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, పల్లె పండుగ సిమెంట్ రోడ్లు, హార్టికల్చర్, గృహ నిర్మాణానికి 90 రోజుల పనులు, ఇంకుడు గుంతల తవ్వకం, కంపోస్టు ఎరువులు తయారీ ఉన్నాయి. ఇప్పటిదాకా చేపట్టిన పనుల్లో రూ.13.46 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.46.61 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పథకం అమలులోకి రానుండడంతో వీటి బిల్లుల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. కూలీలకు రూ.20 కోట్లు అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు గత నవంబర్ నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. దాంతో రూ.20.43 కోట్ల వేతనాలు పెండింగ్లో పడ్డా యి. వీటిలో అత్యధికంగా వీరబల్లిలో రూ.1.45 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పల్లె పండుగ పడకేసింది ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేసుకొని ఉపాధి నిధులతో పల్లె పండగ పేరు పెట్టి గ్రామాల్లో సిమెంట్ రోడ్లను నిర్మించింది. జిల్లాలో రూ.72.79 కోట్లతో 979 పనులను మంజూరు చేసి, 1,67,042 మీటర్ల రోడ్డు నిర్మించాలని మంజూరు చేశారు. ఇప్పటిదాకా రూ.12.29 కోట్లతో 129 పనులే పూర్తి చేసి 29,076 మీటర్ల సిమెంట్ రోడ్డు మాత్రమే నిర్మించారు. మిగిలిన పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఐరిష్ హాజరు ఉపాధి హామీ పథకం అమలులో మార్పులు తేవడంతో ఇప్పుడు ప్రతి కూలీకి ఐరిష్ ద్వారా హాజరును నమోదు చేయాల్సిన నిబంధన అమలులోకి వచ్చింది. దాంతో పనులకు హజరయ్యే కూలీల హాజరును తప్పనిసరిగా ఐరిష్ ద్వారానే నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తనున్నాయి. దాంతో కూలీల హాజరుపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్య కొనసాగితే ఉపాధి పనులు చేపట్టడంపై ప్రభావితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త పథకంపై అవగాహన వీబీజీ రాం జీ పథకంపై కూలీలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఫిబ్రవరి 28 నుంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 125 రోజులు పనిదినాలు కల్పిస్తారు. కూలీలకు చెల్లింపులు ఆలస్యం అయితే ఆలస్యపు పరిహారం ఇచ్చే విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులపై కేంద్రం నుంచి స్పష్టత లేదు. ఈ పనులు, మంజూరైన నిధులు రద్దు చేస్తారా లేదా అని తెలియడం లేదు. ప్రస్తుతానికి అమలులోకి పనులన్నింటిని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటరత్నం, డ్వామా పీడీ, మదనపల్లె -
నియామకం
సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సహదేవరెడ్డి, పీలేరుకు డి.ఉదయ్కుమార్, రాయచోటికి చొప్పా యల్లారెడ్డి, మదనపల్లెకు ఎన్.అనీషారెడ్డి, తంబళ్లపల్లెకు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాజంపేటకు పడమటికోన దేవనాథరెడ్డి నియమితులయ్యారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారు. రామసముద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ మదనపల్లెటౌన్: మదనపల్లె నియోజకవర్గంలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై బుధవారం సస్సెన్షన్ వేటు పడింది. రామసముద్రం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కిరణ్, కానిస్టేబుల్ కిరణ్ ఓ కేసు విషయంలో ఫిర్యాది దగ్గర డబ్బు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి వెళ్లిందని అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి తెలిపారు. దీనిపై విచారించిన ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారని పేర్కొన్నారు. మినరల్స్ క్వారీపై ప్రజాభిప్రాయసేకరణ రాజంపేట: తాళ్లపాక రెవెన్యూ పొలంలోని 1275 సర్వే నంబర్లో ఎంజీపురంలో ఎస్ఎల్వీమైన్స్ అండ్ మినరల్స్ దరఖాస్తు చేసుకున్న క్రమంలో బుధవారం సబ్కలెక్టర్ భావన ప్రజాభిప్రాయసేకరణ చేశారు. ఎంజీపురం పంచాయతీలోని ఇందిరాగిరిజన కాలనీ సమీపంలో క్వారీ ఏర్పాటుపై ప్రజల మనోగతాలను తెలుసుకునేందుకు గ్రామసభను నిర్వహించారు. క్వారీ ఏర్పాటు వల్ల ఎవరికై నా ఇబ్బందులు ఉంటే తెలియచేయాలన్నారు. కాలుష్య నివారణ శాఖ ఈఈ కిషోర్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం మదనపల్లె: మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని సమన్వయకర్త నిసార్ అహ్మద్ బుధవారం పరామర్శించారు. పాత కక్షలతో ప్రసాద్ (41) అనే వ్యక్తిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గొడవ జరుగుతున్న సమయంలో అరుపులు, కేకలు విని వైఎస్ఆర్సిపి నాయకుడు, మేదర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తాలే సుబ్బు అక్కడికి చేరుకోగా అతనిపై కూడా దాడికి పాల్పడి కత్తితో గాయపరిచినట్టు బాధితుడు నిసార్ అహ్మద్ కు వివరించాడు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్టు తెలిపారు. తాలే సుబ్బును నిసార్ అహ్మద్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 8న బ్యాడ్మింటన్, టెన్నిస్ జట్ల ఎంపిక మదనపల్లె సిటీ: జిల్లా స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా (మాస్టర్స్) టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడలకు సంబంధించి ఈనెల 8వతేదీన జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. బ్యాడ్మింటన్ విభాగంలో 35 సంవత్సరాలు పైబడినవారికి (పురుషులు, మహిళలు) సింగిల్స్, డబుల్స్, 45 సంవత్సరాల పైబడిన పురుషులకు సింగిల్స్,డబుల్స్ పోటీలు మదనపల్లెలోని డిఎస్కే స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అకాడమీ, నారాయణ స్కూల్ పక్కన, ప్రశాంత్నగర్ ఉదయం 8 గంటల నుంచి జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి 14,15 తేదీల్లో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతాయని తెలిపారు. టెన్నిస్ విభాగంలో 40 సంవత్సరాలు పైబడిన వారికి (పురుషులు,మహిళలు)సింగల్స్, డబుల్స్ జట్లు మదనపల్లె పట్టణం ఇండియన్ యూనియన్ క్లబ్, టెన్నీస్ కోర్టులో ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి 22,23 తేదీల్లో విజయనగరంలో జరుగుతాయన్నారు. వివరాలకు రవీంద్రనాథ్ (86399 57054), మ స్తాన్ (7386901200)ను సంప్రదించాలన్నారు. -
సోంపాళ్యం దీపస్తంభంపై తెలుగు శాసనాలు
ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యంలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ దీపస్తంభంపై తెలుగు శాసనాలు గుర్తించినట్లు చరిత్రకారుడు మైనా స్వామి వెల్లడించారు. బుధవారం ఆయన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆలయాలు శిల్ప సంపద శాసనాలపై పరిశోధనలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఆలయం ముందున్న ద్వజస్తంభాన్ని దీపస్తంభంగా వర్ణించారు. ఈ దీపస్థంభం పీఠంపై రెండు తెలుగు శాసనాలను గుర్తించినట్లు చెప్పారు.్ఙశుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుదయ్ఙ.. మరోవైపు ‘జయసంవత్సరం’అని రూపు చెదిరిన శాసనాలను గుర్తించినట్లు తెలిపారు. సంవత్సరం పేరును తెలుగు అక్షరాలను బట్టి విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయల హయాం 1529 – 1542 లో శాసనాన్ని రాశారని, శాసన కాలం సామాన్య శకం 1534 అని అన్నారు.దీపస్తంభం శాసనాన్ని బట్టి సోంపాళ్యం శ్రీ చెన్నకెశవస్వామి ఆలయ నిర్మాణం 1534 నాటికి పూర్తయిందని, దీపస్తంభాన్ని అద్భుత శిల్ప కళా సంపదతో తీర్చిదిద్దారని చిత్రకారుడు పేర్కొన్నాడు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మదనపల్లెటౌన్: కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరు కోమాలోకి వెళ్లారు. రాయల్పాడు ఎస్ఐ రామా కథనం మేరకు.. మదనపల్లె మండలం, బార్లపల్లెకు చెందిన అరుణ్ కుమార్, మనోజ్ సొంతపని మీద రాయల్పాడుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేరే ద్విచక్ర వాహనదారుడిని లిఫ్టు అడిగి బయల్దేరారు. ఇదే సమయంలో గుర్రంకొండ మండలం, మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా బెంగుళూరు నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలోని మదనపల్లి– చీకలబైలు చెక్పోస్టు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొని, ద్విచక్ర వాహనంలో వెళ్తున్న అరుణ్ కుమార్, మనోజ్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న బషీర్ బాషా మృతి చెందగా కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లాడు. ద్విచక్రవాహనంలో వెళ్తున్న అరుణ్ కుమార్ తీవ్రంగా గాయపడగా, మనోజ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ఆటోలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాయల్పాడు ఎస్ఐ రామా సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కోమాలోకి వెళ్లిన కారు డ్రైవర్ ను శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా బషీర్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చక్రస్నాన వీక్షణం..సర్వపాపహరణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన బుధవారం చక్రస్నానం నిర్వహించారు. ఉదయం తోమాలసేవ, తిరుచ్చి ఉత్సవాలు జరిపారు. అర్చకులు రంగునీళ్లు, పుసుపునీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకొంటూ కోలాహాలంగా వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం వైభవంగా జరిపించారు. స్వామివారి ఆయుధాలైన శంఖు, చక్రాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తూ చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. వాహన మండపంలో రంగురంగుల పుష్పాలతో అలంకరించిన తిరుచ్చి వాహనంలో స్వామివారిని కొలువుదీర్చి గ్రామపురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ధ్వజావరోహణం నిర్వహించారు. ఏకాంత సేవతో ఈ రోజు ఉత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గోన్నారు. ఆలయంలో నేడు : శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. తరువాత పష్పయాగం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు. -
సూర్యప్రభ వాహనంపై శ్రీనారసింహుడు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన మంగళవారం వేకువజామునే మూలవర్లకు శుద్ధితోమాల సేవ, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. స్వామివారి వాహన మండపంలో రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు దీర్చారు. మేళతాళాలతో భాజాభజంత్రీలతో గ్రామ వీధుల మీదుగా స్వామివారి ఊరేగింపు సాగింది. మధ్యాహ్నం స్వామివారి మండపంలో మూలవర్లకు ఊంజల్సేవ నిర్వహించారు. సాయంత్రం అందంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై స్వామివారు కొలువు దీరి.. గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. అనంతరం స్వామివారికి పార్వేట ఉత్సవం, దోపు తిరునాల వైభవంగా నిర్వహించారు. స్వామివారి వాహన మండపంలో అందంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామివారిని కొలువుదీర్చి గ్రామ వీధుల మీదుగా ఊరేగించారు. టీటీడీ కళాకారుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన బుధవారం వసంతోత్సవం, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ఊంజల్సేవ, తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. -
నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం
పీలేరురూరల్ : అంగన్వాడీలను నమ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్టీయూసీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నమ్మ మండిపడ్డారు. మంగళవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. గతంలోనూ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో అనేక మార్లు అంగన్వాడీలను అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం, ఇవీకాక గుర్రాలతో తొక్కించడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల సమ్మె చేయడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పలు డిమాండ్లు పరిష్కరించిందన్నారు. అలాగే డిమాండ్లను మినిట్స్లో పొందుపరిచిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా అంగన్వాడీలు ధర్నా చేస్తే అరెస్ట్ చేపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్ ఉంటుంది కానీ అరకొర జీతాలతో బతుకుతున్న అంగన్వాడీలకు జీతాలు పెంచేందుకు బడ్జెట్ లేదా అని నిలదీశారు.వైఎస్సార్టీయూసీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నమ్మ -
ఎస్ఐఆర్తో ప్రజాస్వామ్యానికి ముప్పు
రాయచోటి టౌన్ : భారతదేశంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాయచోటి ఎన్జీవో హోంలో సహారా వెల్ఫేర్, పౌరహక్కుల సంఘం నాయకులు రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎస్. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ చేపట్టిన ఓటరు సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలలో అనేక మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలలో తమ ఓటు హక్కును కోల్పోయి కోర్టుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. అనంతరం పౌరహక్కుల సంఘం నాయకులు రవిశంకర్ మాట్లాడుతూ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇలా ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఎస్ఐఆర్ జరుగుతుందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో లక్షల ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు హక్కుపై మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని ముద్రవేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మన్సూర్ ఆరోపించారు. అంబేడ్కర్ సేన నాయకులు పల్లం తాతయ్య మాట్లాడుతూ వెనుకబడిన, దళిత, గిరిజన, ముస్లిం ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఈ ఎస్ఐఆర్ నడుపుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎస్ఐఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు అస్లామ్, అప్తాబ్, రవి, న్యాయవాది హిదాయతుల్లా, రవిశంకర్, ఆవాజ్ నాయకులు గౌస్, ఎరువుల సంఘం నాయకులు మోహన్, బండపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు. -
గుట్ట తవ్వేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : సదుం మండలంలోని భట్టువారిపల్లె ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టను మట్టి కోసం కొందరు తవ్వేస్తున్నారు. కొద్ది రోజులుగా యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాల మంజూరు కోసం ప్రభుత్వ స్థలం లేకపోవడంతో గుట్టను చదును చేస్తున్నామని, ఇందుకు కలెక్టర్, రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకున్నట్లు మట్టిని తవ్విస్తున్న కూటమి పార్టీ సానుభూతిపరుడు తెలుపుతున్నారు. దీనిపై తహసీల్దారు ప్రమీలను వివరణ కోరగా ఎవరికీ మట్టిని తవ్వేందుకు అనుమతి ఇవ్వలేదని.. రెవెన్యూ అధికారులను పంపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వృద్ధురాలిపై దంపతుల దాడి
మదనపల్లెటౌన్ : మదనపల్లెలో వృద్ధురాలిపై దంపతులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మంగళవారం మదనపల్లెలో జరిగిన సంఘటనపై బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పట్టణంలోని కురవంకలో కాపురం ఉంటున్న రమణ భార్య ఎన్.భాగ్యమ్మ(60) ఉదయం నిద్దరలేచి ఇంటి ముందు నిలబడి దంతాలు తోముకుంది. అనంతరం వీధి కులాయి వద్ద నీళ్లు పట్టుకుని ముఖం కడుగుతుండగా కేకరించి ఊచింది. అదే సమయంలో అటుగా బైకులో వెళుతున్న ట్రాన్స్ కో కార్యాలయంలో పని చేసే దంపతులు ప్రకాష్, చంద్రకళలు తమను చూసి కావాలనే ఊచిందని అనుమానంతో గొడవపడ్డారు. మాటకుమాట పెరిగి ఆగ్రహంతో ఊగిపోయిన భార్యాభర్తలు వృద్ధురాలిపై కుర్చీతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్సల నిమిత్తం వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రహీముల్లా తెలిపారు. నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ రైల్వేగేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. ప్రతి మంగళవారం పలువురు భిక్షాటన కోసం నందలూరుకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో ఒక వ్యక్తి మద్యం తాగి మృతిచెందినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో అతనితోపాటు వచ్చిన వారి కోసం గాలించారు. మృతుడి వివరాల కోసం ప్రయత్నిస్తామని, దొరకని పక్షంలో దహన సంస్కారం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. -
రేపు విధాత సినిమా విడుదల
● కథానాయకుడిగా మదనపల్లె వాసి ● నటీనటులు ఇక్కడి వారేకురబలకోట : మదనపల్లె పట్టణానికి చెందిన అప్పినపల్లి భాస్కరాచారి కథానాయకుడిగా తానే స్వయంగా నిర్మించిన విధాత చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీసీ ప్రొడక్షన్స్ బ్యానర్పై విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు భాస్కరాచారి మంగళవారం అంగళ్లులో చిత్ర విశేషాలను వెల్లడించారు. మదనపల్లె ప్రాంతానికి చెందిన నటీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరిగిందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సందేశాత్మక చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. రెండు గంటలకుపైగా నిడివి గల ఈ చిత్రానికి ఒక్క రోజులోనే సెన్సార్ బోర్డు నుంచి కూడా అనుమతి రావడం విశేషమన్నారు. మదనపల్లె పేరు, ప్రతిష్టలను ఈ చిత్రం మరింత పెంచగలదని భావిస్తున్నట్లు తెలిపారు. మనిషి జీవితాన్ని విధి ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చూపించడం జరిగిందన్నారు. సాధారణ రైతు కూలీ ఇతి వృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం గ్రామీణ జీవన స్ఫూర్తిని, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, కష్ట నష్టాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. దర్శకుడిగా మణికంఠ రాజేంద్ర వ్యవహరించారన్నారు. మంచి కథ, కథనంతో వస్తున్న సందేశాత్మక చిత్రంగా విధాత చిత్రం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణ లభించగలదని చిత్ర బృందం ఆశిస్తున్నట్లు తెలిపారు. -
చదివింది ఎంటెక్.. చేసేది చైన్ స్నాచింగ్
● పోలీసులకు చిక్కిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ● రూ.40 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనంమదనపల్లెటౌన్ : చదివింది ఎంటెక్.. చేసేది చైన్స్నాచింగ్.. అడపాదడపా తాళం వేసిన ఇళ్లలో చోరీలు. ఒక మోస్ట్ వాంటెడ్, ఉన్నత విద్యావంతుడైన దొంగను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి మదనపల్లెలో మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కొరకూటి రాజేష్ (35) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసే రాజేష్.. కరోనా సమయంలో ఉద్యోగం ఊడిపోయి మదనపల్లెకి వచ్చేశాడు. మదనపల్లెలోనే కొంత కాలంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల స్థానిక అనిబిసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధిలో ఒక వృద్ధురాలి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న మళ్లీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగలించాడు. ఎలా చిక్కాడంటే.. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లి అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి పర్యవేక్షణలో అన్నమయ్య జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, 1 టౌన్ సీఐ కె.రాజారెడ్డి, ఎస్ఐ ఎస్కె. రహీముల్ల్లా, సీసీఎస్ ఎస్ఐ ఎం.కె నరసింహులు, వారి బృందం మార్చి 3న ఉదయం 8:30 గంటలకు దేవాలయం వీధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించి మొత్తం రికవరీని పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ సూచనలు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతోందని తెలిపారు. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలే తప్ప దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చౌడేపల్లె : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కాగతిపంచాయతీ పలగార్లపల్లె సమీపంలోని పొలాల్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పలగార్లపల్లెకు చెందిన వెంకటరమణ(50) గత రెండు రోజుల క్రితం తండాకు చెందిన తన స్నేహితుడు మృతి చెందడంతో బయటికి వెళ్లాడు. తిరిగి ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడం, తన తండ్రి ఎప్పుడొస్తారో అని ఎదురుచూసిన వారికి పెను విషాదం మిగిలింది. చండ్రమాకులపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో గల ట్రెంచ్ కాలువలో పశువుల కాపరులు.. మృతదేహాన్ని గుర్తించి సమాచారం రావడంతో వెంకటరమణగా నిర్ధారించారు. కాగా పంట పొలాల్లోకి వచ్చే అటవీ జంతులను వేటాడే క్రమంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి వెంకటరమణ మృతి చెందాడని, బయటకు పొక్కనీయకుండా మృతదేహాన్ని నీళ్లలో పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అతని మృతిపై పోలీసులదధర్యాప్తులో నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. -
అంతర్ రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● రూ.40 లక్షల విలువైన 24 మోటార్ సైకిళ్లు స్వాధీనం ● ముఠాలోని మరో ముగ్గురు రిసీవర్ల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : అంతర్ రాష్ట్ర బైక్ దొంగను అరెస్టు చేసి, అతని నుంచి రూ.40 లక్షల విలువైన ఖరీదైన మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాతోపాటు పక్క జిల్లాలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కిలాడీ దొంగ, అతడి వద్ద నుంచి బైకులు కొనుగోలు చేస్తున్న ముగ్గురు రిసీవర్లను పీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. రాయచోటి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఆరీఫ్ (38) 2024 చివరి నుంచి చోరీల బాట పట్టాడన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న బైకులను టార్గెట్గా చేసుకొని మాయం చేసేవాడన్నారు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో తనదైన శైలిలో దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారన్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి, పీలేరు, కలకడ, సంబేపల్లి, మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్, పలమనేరు, తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణం, వైఎస్సార్ కడప జిల్లాలో కడప టౌన్, రాజంపేట పట్టణాల్లో బైకులను అపహరిస్తూ వచ్చాడన్నారు. రికవరీ చేసిన వాహనాలు.. నిందితుడి నుంచి సుమారు రూ.40 లక్షలు విలువైన 24 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఖరీదైన వాహనాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 17 రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్), 5 బజాజ్ పల్సర్, ఒక హోండాషైన్, మరొకటి హీరో స్ల్పెండర్ ప్లస్ బైకులు ఉన్నాయన్నారు. అరెస్టు చేసిన తీరు పీలేరు మండలంలోని పొంతల చెరువు క్రాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానస్పదంగా పోలీసులను చూసి పారిపోతున్న ఆరీఫ్ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగలించిన బైకులను తక్కువ ధరకు గుర్రంకొండ మండలం బలిజగడ్డకు చెందిన షేక్ బషీర్, షేక్ సయ్యద్ ముక్తియార్, రామసముద్రం మండలం చెంబకూరు గ్రామం అలీ కోటవీధికి చెందిన షేక్ మహమ్మద్లకు విక్రయించాడని తెలిపారు. వారి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రజలు, వాహనదారులకు జిల్లా ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. వాహనదారులు తమ మోటార్ సైకిళ్లకు కేవలం హ్యాండిల్ లాక్ వేసి వదిలేస్తున్నారని, దొంగలు వీటిని సులభంగా విరగ్గొట్టి దొంగలిస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు అదనపు సెంట్రల్ లాక్ (వీల్ లాక్) లేదా డిస్క్ లాక్ అమర్చుకోవాలన్నారు. అలాగే తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి సరియైన పత్రాలు (ఆర్సీ, ఇన్సూరెన్సు) లేని సెకండ్హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయరాదని తెలిపారు. జిల్లా సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసులో సమర్థవంతంగా పని చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, పీలేరు సీఐ యుగంధర్, ఎస్ఐలు లోకేష్, రహీం, పీలేరు పోలీసు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్ రాధాకృష్ణ, ముని సుందరం, శ్రీనివాసులు, సిబ్బందిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
భూ వివాదంతో అన్నదమ్ములపై దాడి
మదనపల్లెటౌన్ : కురబలకోట మండలంలో భూ వివాదంతో అన్నదమ్ములపై కర్రలతో దాడి చేశారు. మంగళవారం ఉదయం తెట్టు గ్రామం దిగువపాళ్యంకు చెందిన శంకర (50), నరసింహులు (56)లకు అదే ఊరికి చెందిన రెడ్డెప్ప, రమేష్లకు భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భూ వివాదం తలెత్తి రాత్రి ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో నరసింహులు, శంకరపై ప్రత్యర్తులు రెడ్డెప్ప, రమేష్లు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లెటౌన్ : కడుపు నొప్పి తాళ లేక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం కర్ణాటకలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు మండలం బల్తమర్రి గ్రామానికి చెందిన మంజునాథ్ భార్య శ్రావణి(25) కడుపు నొప్పి తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల నివారణ మందు తాగింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉంది. ఘటనపై ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు రాయల్పాడు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య ములకలచెరువు : అతిగా మద్యం తాగుడు, పరాయి సీ్త్రతో సంబంధం పెట్టుకున్నావని భార్య, పిల్లలు ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని పెద్దపాళ్యంకు చెందిన ఎస్.సులేమాన్(40) భవన నిర్మాణ కార్మికుడు. ఇతనికి భార్య షాహీనా, ఇద్దరు పిల్లలు సంతానం. ఈ క్రమంలో పరాయి సీ్త్రతో సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసింది. దీనిపై ప్రశ్నించడంతో భార్య, పిల్లలతో గొడవపడేవాడు. రెండు, మూడు సార్లు ఊర్లోని పెద్ద మనుషులు పంచాయితీ చేసి సులేమాన్ను మందలించారు. ఈ ఆదివారం మరోసారి గొడవ జరగడంతో ఊరి బయట గడ్డి మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రమాదేవి హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించి అక్కడ మృత్యువాత పడ్డాడు. మృతుడి భార్య షాహీనా ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రతాప్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చిన్న క్రీట్ల విధానం అమలు చేయాలి
గుర్రంకొండ: మార్కెట్యార్డుల్లోని టమాటా మండీల్లో చిన్నక్రీట్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా మార్కెటింగ్శాఖ ఏడీఏ త్యాగరాజు అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్యార్డులోని టమాటా మండీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్బంగా 25 కేజీల క్రీట్ల స్థానంలో 15కేఈల క్రీట్ల విధానం ఎంతవరకు అమలవుతొందో పరిశీలించారు. అనంతరం వ్యాపారులతో మాట్లాడుతూ యార్డులో 58 మండీలకుగాను 39 మండీలు నిర్వహించడం లేదన్నారు. మిగిలిన 19 మండీలకుగాను ఎనిమిది మండీలలో మాత్రమే చిన్నక్రీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్తోపాటు మార్కెట్కమిటీ అధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 2 నుంచి తప్పనిసరిగా చిన్నక్రీట్లు అమలు చేయాల్సి ఉందన్నారు. అప్పట్లో వ్యాపారులు దీనికి అంగీకరించారన్నారు. అయితే ఇంకా కొంతమంది చిన్న క్రీట్ల విధానం అమలు చేయకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆరు రోజుల్లోగా మండీలలో అన్ని చిన్న క్రీట్లు ఏర్పాటు చేసుకొంటామని వ్యాపారులు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్కమిటి కార్యదర్శి సునీల్, సూపర్వైజర్ నయాబ్భాషా, వ్యాపారులు పాల్గోన్నారు. ● జిల్లా మార్కెటింగ్శాఖ ఏడీఏ త్యాగరాజు ● టమాటా మండీలలో ఆకస్మిక తనిఖీలు -
ధైర్యంగా, అప్రమత్తంగా ఉండండి
కువైట్, దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలలో ఉన్న కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రవాసాంఽధ్రులు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల కుటుంబాలు ఆందోళన పడనవసరంలేదు. భారత రాయబార కార్యాలయం అన్ని చర్యలూ తీసుకుంటోంది. తెలుగు ప్రజలకు సూచనలు ఇస్తోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగువారు సురక్షితంగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, రాజంపేట -
సీఈసీ మెంబర్గా సురేష్బాబు!
– వైస్సార్సీపీలో క్రియాశీలక భాద్యతలు సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(సీఈసీ) మెంబర్గా మాజీ మేయర్ కొత్తమద్ధి సురేష్ బాబును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. జిల్లా పరిషత్ చైర్మన్గా, రెండు సార్లు కడప మేయర్గా..పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అపార అనుభవం ఉన్న సురేష్ బాబును సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మంగళవారం నియమించారు. బీసీ నాయకుడిగా సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సురేష్ బాబు సేవలను వినియోగించుకునేందుకు అధిష్టానం క్రియాశీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం పట్ల మాజీ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. డీసీఈబీ సెక్రటరీగా చంద్రశేఖర్రావు కడప ఎడ్యుకేషన్: డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న దాయిపూలే చంద్రశేఖర్రావు నియమితులయ్యారు. గతంలో డీసీఈబీ సెక్రటరీగా పనిచేస్తున్న విజయభాస్కర్రెడ్డి గత నెల 28న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్రావును డీఈఓ నియమించారు. ఈ మేరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో డీసీఈబీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. 15 నుంచి ఆర్సీపీ యాత్రలు కడప వైఎస్ఆర్ సర్కిల్: స్థానిక సమస్యలపై ఈనెల 15 నుంచి యాత్రలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీ)రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. మంగళవా రం కడపలో ఆయన మాట్లాడుతూ అమెరికా ఆ ర్థిక ప్రయోజనాల కోసం ఇరాన్పై చేస్తున్న యు ద్ధం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
విద్యాలయంపై కాలకూట(మి) విషం
మదనపల్లె: 2019–24 మధ్యలో అప్పటి సీఎం వై.ఎస్.జగన్ చేపట్టిన విద్యారంగ సంస్కరణలు రాష్ట్ర చరిత్రలో ఎవరిపాలనలోనూ జరగలేదు. ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి పర్చడం, ఆంగ్లమాధ్యమ బోధన, పైసా భారం లేకుండా అన్నిసౌకర్యాలను కల్పించిన ఘనత గత సీఎం వై.ఎస్.జగన్కే దక్కుతుంది. అలాగే అమ్మఒడి పథకాన్ని అమలు చేసి విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి బాటలు వేశారు. అయితే కూటమిపాలన రావడంతో వై.ఎస్.జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై కాలకూట విషాన్ని చిమ్ముతోంది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన అభివృద్ధిని, ప్రధానంగా పాఠశాలల అభివృద్ధిపై కక్షగట్టడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు రెండో విడతలో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు, విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న ఈ పనులను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉన్నా కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. మొదటి విడతకు మహర్దశ వై.ఎస్.జగన్ పాలనలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు–నేడు తొలి విడత పనులకు శ్రీకారం చుట్టిన గత ప్రభుత్వం పాఠశాల వారీగా ఏఏ పనులు అవసరం, ఎంత నిధులు అవసరమో గుర్తించి ఆ మేరకు నిధులను విడుదల చేసి పనులు చేయించింది. ఏ పాఠశాల నిధులను ఆ పాఠశాల ఖాతాలకు జమ చేయడంతో పనులు పరుగుపరుగున పూర్తయ్యాయి. విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తొలి విడతలో జిల్లాలో 584 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ, గురుకుల విద్యాలయాల్లో పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ విడతలో రూ.132.23 కోట్లతో అదనపు తరగతుల నుంచి సౌకర్యాల కల్పన పనులు చేపడితే రూ.130 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయి కార్పొరేట్ స్కూళ్లుగా తయారయ్యాయి. రెండో విడతకు గ్రహణం ‘నాడు–నేడు’తో చేపట్టిన రెండో విడత పాఠశాలల అభివృద్ధికి కూటమి గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం ఈ రెండో విడతలో ఒక్కో పాఠశాలలో 10 నుంచి 40 వరకూ పనులను గుర్తించి వాటి పనులు చేపట్టింది. జిల్లాలో 1,018 పాఠశాలల్లో రూ.340.54 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా సాగిపోతున్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పనులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ప్రభుత్వం రావడానికి ముందు రూ.160 కోట్ల పనులు పూర్తికాగా, మిగిలిన అసంపూర్తి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. 20 నెలలు గడుస్తున్నా ఈ పనుల్లో చలనం లేదు. ప్రభుత్వం పట్టించుకోకుండా కోట్లతో చేపట్టిన పనులను పూర్తి చేయించాలన్న శ్రద్ధ చూపడం లేదు. రూ.20 కోట్లు మురిగిపోతున్నాయి రెండో విడతలో పాఠశాలల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల్లో రూ.20 కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని అసంపూర్తి పనులు పూర్తి చేయించే అవకాశం ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పాఠశాలల కమిటీలు, ఉపాధ్యాయ వర్గాలు అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతున్నా, వాటిని పూర్తి చేయించేందుకు ప్రభుత్వం సహకరించడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వ బడులకు మహర్దశ మొదటి విడతలో రూ.132.23 కోట్లతో సర్వాంగ సుందరంగా బడులు రెండో విడతలో రూ.340.54 కోట్లలో రూ.166.49 కోట్ల ఖర్చు కూటమిపాలన రాకతో అర్ధంతరంగా ఆగిపోయిన పనులు రూ.20 కోట్లు మురిగిపోతున్నాయి వసతులు, సౌకర్యాలు లేక విద్యార్థుల వెతలు ‘నాడు–నేడు’ రెండో విడత కింద మంజూరైన పాఠశాలల పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి లేదు. అసంపూర్తి పనుల విషయంలో నిర్ణయం రావాల్సి ఉంది. అప్పటి వరకు పనులు చేపట్టలేం. గత ప్రభుత్వంలో మంజూరైన రెండో విడత పనులకు సంబంధించి రూ.20 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. – సుధాకర్బాబు, ఈఈ, సమగ్రశిక్ష -
తెలుగువారి క్షేమానికి కృషి
గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగువారు సురక్షితంగా ఉండాలి. అక్కడి ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలను రచ్చితంగా పాటించాలి. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లారు. వారికి అత్యవసర పరిస్థితి వచ్చినా లేదా సహాయం అవసరమైనా ఏమాత్రం సంకోచించకుండా వారి బంధువులు నా కార్యాలయాన్ని వెంటనే సంప్రదిస్తే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను. తెలుగువారి క్షేమానికి కృషి చేస్తాను. – పీవీ మిథున్రెడ్డి, లోక్సభ సభ్యుడు, రాజంపేట -
చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత
కడప సెవెన్రోడ్స్/ఒంటిమిట్ట : చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో పలు ఆలయాలు మూసివేశారు. దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం, గడ్డిబజారు బాలాజీ ఆలయం, శ్రీ విజయదుర్గాదేవి ఆలయంతోపాటు పలు ఆలయాలు మూసివేశారు. అలాగే టీటీడీ పరిధిలోని నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం, ఒంటమిట్ట శ్రీ కోదండ రామాలయం, జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం వంటివి మూసివేశారు. చంద్రగ్రహణం నేపధ్యంలో ఆలయాలు మూసివేయాలంటూ తిరుమల–తిరుపతి దేవస్థానం సర్క్యులర్ జారీ చేసింది. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి 6.47 గంటల వరకు కొనసాగింది. వైకానస, పంచరాత్ర, శివ ఆగమ ఆలయాలు గ్రహణ సమయంలో మూసివేయాలంటూ సర్క్యులర్లో పేర్కొన్నారు. దీంతో దేవునికడప ఆలయం ఉదయం 9 గంటలకు మూసివేశారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేసి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేసి బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధిపరిచి 8.15 గంటలకు స్వామి వారికి నైవేద్యం అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని అక్కడి ఆలయ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
రగలిన అంగన్వేడి
● విజయవాడలో అంగన్వాడీలను అరెస్టు చేయడంపై మహిళల ఉద్యమం ● జిల్లాలో భారీ ర్యాలీ, మానవహారం, నిరసనలు సాక్షి అన్నమయ్య : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని....తాము ప్రతినిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ మహిళలు ఆందోళన బాట పట్టారు. అయితే న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలోనూ చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మహిళలు ఉద్యమబాట పట్టారు. ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు....గతంలో ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ వద్ద నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అంగన్వాడీల సమస్యల పరిష్కారంలోఎలాంటి చొరవ తీసుకోలేదు. ఒకవైపు దీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై విజయవాడలో పోలీసులు వ్యవహారించిన తీరును నిరసిస్తూ మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కొనసాగుతున్న రిలే దీక్షలు అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలోని పుంగనూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రోజూ పదుల సంఖ్యలో మహిళలు దీక్షలను సాగిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాలలో కూడా రిలే దీక్షలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం... అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేతనాల పెంపుపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోతోందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలలని, యాప్ల ద్వారా ఆన్లైన్ పనిభారాన్ని తగ్గించి రిజిష్టర్ల నిర్వహణను సరళతరం చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ సందర్బంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలన్నారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వం నిర్బంధ కాండకు ఒడిగట్టడం దారుణమంటున్నారు. విజయవాడ దమనకాండకు జిల్లాలో నిరసన అంగన్వాడీ కార్యకర్తల, హెల్పర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహారించి వారిని అడ్డుకోవడం, లాక్కెళ్లడం, దీక్షలను భగ్నం చేయడంపై జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు రగలిపోయారు. తంబళ్లపల్లె, బి.కొత్తకోట, మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఉద్యమించారు. అలాగే పుంగనూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాయచోటిలో కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి భారీ ర్యాలీతోపాటు నేతాజీ సర్కిల్ వద్ద మానవహారం నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీల పట్ల పోలీసుల తీరును ఖండించారు.అన్ని వర్గాల నాయకులు వారికి మద్దతు తెలియజేశారు. ఏది ఏమైనా అంగన్వాడీలు రోడ్డెక్కి ఉద్యమబాట చేపట్టి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
మదనపల్లెటౌన్ : పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలన్నీ తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమం జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నలు మూలల నుంచి ప్రజలు సమస్యలపై అర్జీలను తీసుకు వచ్చి నేరుగా జిల్లా ఎస్పీకి అందజేశారు. అర్జీల్లో ఎక్కువగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన వారిపై పోలీసులు సకాలంలో చర్యలు తీసుకు పోక పోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేశారు. అలాగే భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సైబర్ నేరాలు, భూ కబ్జాలు, దాడుల కేసులపై జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదుచేశారు.ఎస్పీ సంబంధింత అధికారులతో మాట్లాడారు.సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. హోంగార్డు కుటుంబానికి అండగా పోలీసు శాఖ మదనపల్లెటౌన్ : విధి నిర్వహణలో అకాల మరణం చెందిన అన్నమయ్య జిల్లా, కేవీపల్లె పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ మృతి చెందిన హోంగార్డు వేణుగోపాల్ (హెచ్జి–303) కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలచింది. సోమవారం హోంగార్డు కుటుంబాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం మదనపల్లెకు రప్పించి, వేణుగోపాల్ సతీమణి కె.చంద్రకళ కు కారుణ నియామక పత్రాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేసే పోలీస్, హోంగార్డులకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉండి అన్నివిధాల ఆదుకుంటుందని ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
ప్రియురాలి ఇంటి వద్దే.. నిప్పంటించుకున్న ప్రియుడు
మదనపల్లెటౌన్ : ప్రియురాలి ఇంటి వద్దే ప్రియుడు పెట్రోల్ పోలీసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన విజయ్ కుమారుడు ప్రదీప్(19), పదో తరగతి వరకు చదివి స్కూలు మానేశాడు. ఇనుప సామాన్లతో గుజిరి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో తనతో పాటు పదోతరగతి వరకు చదివిన, కురబలకోట మండలానికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఇష్టంగా ఉండడంతో కుటుంబీకులకు వ్యవహారం తెలిసి ప్రొద్దుటూరు నుంచి యువతిని తల్లిదండ్రులు ఇటీవల ఇంటికి తీసుకు వచ్చేశారు. అయితే అమ్మాయి తన ప్రియునికి ఆదివారం ఫోన్చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో రాత్రి కురబలకోటకు ప్రదీప్ వచ్చాడు. ఉదయం ప్రియురాలి ఇంటికి వెళ్లి తన వెంట పంపించాలని ప్రదీప్ కోరడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ముందుగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పు అంటించు కున్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించగా కోలు కుంటున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధురామచంద్రడు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడు అరెస్టు ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లెకు చెందిన పోతుల హరినాథ్(42) ఒక మైనర్ బాలికను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ కేసునమోదు చేశారు నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు.రిమాండ్ తరలించామని చెప్పారు. -
డివైడర్ను ఢీ కొని జూనియర్ ఇంజినీర్ మృతి
ములకలచెరువు : డివైడర్ను ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ములకలచెరువు ఉపాధిహామీ కార్యాలయంలో జూనియర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు విధులు ముగించుకొని తన ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా పెద్దపాళ్యం ఫ్లై ఓవర్ వద్ద డివైడర్ను ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ప్రతాప్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. మృతుడికి భార్య అములు, కుమారుడు అఖిల్, కుమార్తె పద్మావతి ఉన్నారు. ఇతని స్వస్థలం పీటీయం మండలం నిలువురాతిపల్లె. ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంరాయచోటి అర్బన్ : ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఏపీ జేఏసీ వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ కామ్రేడ్ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణ పరిధిలోని ఎన్జీవో హోం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు, కమిటీ సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో బాగంగా 35 మందితో కూడిన జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా కమిటీ చైర్మన్గా ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఏపీ ఎన్జీవోస్ అసోషియేషన్ సెక్రటరీ జనరల్గా ఏ.శివారెడ్డి, ఎస్టీయూ కోశాధికారిగా నాగేశ్వర్, ఏపీ ఎన్జీవోస్ అసోషియేషన్ కో చైర్మన్లుగా శ్రీనివాసన్, సుబ్రమణ్యం రాజు, హరిబాబు ఎంపికయ్యారు. అలాగే వైస్ చైర్మన్లుగా వీఎండీ ఇలియాస్, మహదేవ, రామాంజులు, శ్రీనివాసులు, రవిశంకర్, జాబీర్, ప్రతిభా కుమారిలను ఎంపిక చేశారు. జాయింట్ సెక్రటరీలుగా డి.వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వర్లు, మహమ్మద్ బాషా, రవీంద్ర రెడ్డి, మధుసూధన్ , లక్ష్మి నారాయణ,, పవనకుమారిలను, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 14 మందిని ఈసీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పరీక్ష రాయాల్సిన విద్యార్థి పరలోకానికి
కలకడ : ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థి, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి తిరునాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. అటు దేవుడిని చూడక, ఇటు పరీక్ష రాయక మధ్యలోనే తనువు చాలించి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. కలకడ పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం, గర్నిమిట్ట పంచాయతీ రెడ్డిమల్లువారిపల్లెకు చెందిన సుదర్శన్రెడ్డి కుమారుడు రూపానందరెడ్డి (17) శ్రీచైతన్య జూనియర్కళాశాల–పీలేరులో ఇంటర్మీడియట్ మొదటిసంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం 9గంటలకు పరీక్షలకు హాజరు కావాల్సిన ఇతను ఆదివారం రాత్రి గుర్రంకొండ మండలం, తరిగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఏపీ 03బివై4616 ద్విచక్రవాహనంలో ఇంటివద్దనుంచి బయలుదేరి వెళుతుండగా తెల్లవారు జామున సుమారు 4గంటల సమయంలో కలకడ మండలం, కదిరాయచెర్వు పంచాయతీలోని హంద్రీ–నీవా కాలువ వద్ద నిర్లక్ష్యంగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ నంబర్ :ఎపి04బికె3779ను డీ కొన్నాడు. ఈప్రమాదంలో గాయపడిన రూపానందరెడ్డి అక్కడికి అక్కడే మృతిచెందారు. మృతుని తండ్రి సుధర్శన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలకడ పోలీసులు తెలిపారు. పరీక్షకు హాజరు కావాల్సిన విధ్యార్థి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.తిరునాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి -
వైభవం. నృసింహుడి రథోత్సవం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజైన సోమవారం స్వామవారిని స్థానిక బస్టాండు కూడలిలోని స్వామివారి తేరు(రథం) వద్దకు తీసుకొచ్చి అందులో కొలువుదీర్చారు. ఆలయంలో ధూళీ ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో రథాన్ని అందంగా అలంకరించారు. అనంతరం హరినామస్మరణ నడుమ రథోత్సవం సాగింది. ఈసందర్బంగా వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. మేళతాళాలు, కోలాటాలు, టీటీడీ కళాకారుల సాంస్కృతి కార్యక్రమాలతో రథోత్సవం గ్రామపురవీధుల గుండా సాగింది. గత ఆదివారం రాత్రి స్వామివారి రాత్రి తిరునాలు ఘనంగా నిర్వహించారు. తరిగొండతోపాటు పరిసర గ్రామాల ప్రజలు చాందీనీ బండ్లు, అన్నం,టెంకాయ బండ్లు ఆలయం చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గోన్నారు. ఆలయంలో నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన మంగళవారం సూర్యప్రభవాహనం, ఊంజల్సేవ, చంద్రఫ్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వవాహనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని ఆలయఅర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. -
ఉద్యాన సాగుకు ప్రాధాన్యత
మసనపల్లె : జిల్లాలో ఉద్యానవన సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీడీఆర్సీ) ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ హార్టికల్చర్ సాగు పెంచడం కోసం కలెక్టర్కు సూచనలు చేసినట్టు చెప్పారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు, జిల్లా అధికారుల కృషితో భూగర్భజలాలు వృద్ధి చెందాయని చెప్పారు. దీనిఫలితంగా జిల్లా జీడీపీ రూ.1,100 కోట్లు పెరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. డీడీఆర్సీకి ఇన్చార్జి మంత్రి జనార్దనరెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఎమ్మెల్యేలు కిశోర్కుమార్రెడ్డి, షాజహాన్బాషా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్నిశాఖలకే పరిమితం డీడీఆర్సీ సమావేశంలో జిల్లాలోని ప్రధానశాఖలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యమైన రహదారి భవనాలు, డ్వామా, డీఆర్డీఏ, ఏపీఎంఐపీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ తదితరశాఖలపై సమీక్షగా అధికశాఖలకు సంబంధించిన అభివృద్ది, కార్యకలాపాలపై సమీక్ష జరగలేదని తెలిసింది. ఈ సమావేశం మూడు గంటలకుపైగా జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా జిల్లాశాఖల అధికారులు సమావేశానికి బయట ఉండటం కనిపించింది. ప్రజలకు మెరుగైన పాలన అందించాలి జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఎమ్మెల్యేలు కిశోర్కుమార్రెడ్డి, షాజహాన్బాషా, జిల్లా అధికారులతో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు.జిల్లాలో వేరుశెనగ, ఉలవ తదితర పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని యూరియా కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలపగా, యూరియా కొరత ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డి కోరారు.పల్లె పండుగ పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అడవిపల్లి, శ్రీనివాసపురం రిజర్వాయర్, హంద్రీ–నీవా ప్రధాన కాలువ పనులు ఝరికోన ప్రాజెక్టుపై సమీక్షించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను చేస్తే రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని గోశాలల కోసం రైతుల దరఖాస్తులను మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.ఇన్ఛార్జి మంత్రి జనార్దనరెడ్డి -
ప్రధాన అంశాలపై ప్రత్యేక ఫోకస్
ఒకప్పుడు గణితం అంటే విద్యార్థులు గాబరా పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి క్రమం తప్పకుండా సాధన చేస్తే నూటికి నూరు మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సీ,డీ గ్రేడ్ విద్యార్థులు మొదటి మూడు, చివరి రెండు అధ్యాయాలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంటే 50 మార్కుల వరకు వచ్చేస్తాయి.ఊర్థ్వకోణం,నిమ్నకోణం నిర్వచనాలు, అవసరమైన పటాలతో నేర్చుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్ కూడా నిర్ణీత సమయంలో కొట్టివేతలు లేకుండా వేయాలి. –పాలేటి సుధాకర్రెడ్డి, స్కూల్ అసిస్టెంట్, గణితం, జెడ్పీహెచ్ఎస్.మర్రిపాడు -
అక్షర దోషాలకు స్వస్తి:
జవాబులు రాసేటప్పుడు ప్రధానంగా అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. కవి పరిచయాలు, వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు ముఖ్యమైన వాక్యాలను పెన్సిల్తో కింద అండర్ లైన్ చేయాలి. అక్షరాలు గుండ్రంగా రాయాలి. అలాగే పద విరామం ఉండాలి. పద్యం ప్రశ్నలు వాక్యరూపంలో రాయాలి. బాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రతి రోజూ 15 నిమిషాలు చదవాలి,రాయాలి. అవగాహన ప్రతి స్పందనతో పాటు భాషాంశాలపై ప్రత్యేక పట్టుసాధిస్తే మంచి మార్కులు సులభంగా వస్తాయి. – బి.ఉషా సుందరి, ఎస్ఏ(తెలుగు), జెడ్పీహెచ్ఎస్.మదనపల్లె -
నా బిడ్డను క్రూరంగా చంపేశారు
మదనపల్లెటౌన్ : జిల్లాలో సంచలం రేకెత్తించిన మదనపల్లె మండలం, అరవాండ్లపల్లె దివాకర్ హత్య కేసు పై తల్లి పూల లక్ష్మీదేవి వ్యాఖ్యలు చేడం చర్చినీయాంశంగా మారింది. తన బిడ్డ దివాకర్ను అతని స్నేహితుడు గణేష్ మరికొంత మంది క్రూరంగా చంపారని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి పిర్యాదు చేయడానికి గ్రామస్తులతో కలసి వచ్చింది. మండలంలోని వలసపల్లి గ్రామం, అరవవాండ్లపల్లెకు చెందిన పూల లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు దివాకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. హత్యపై దివాకర్ తల్లి మీడియా తో మాట్లాడుతూ.. తన బిడ్డను గణేష్ మరి కొందరు చంపి, కాళ్లు, తల వేరు చేశారని పేర్కొంది. కిడ్నీలను తొలగించి కర్ణాటకకు చెంది డాక్టర్ గోపాల్ కు అమ్మేశారని తెలిపింది. అంతే కాకుండా పొట్ట పేగులు బయటకు తీసి చెట్టుపై వేలాడేశారని చెప్పడం దుమారం లేపుతోంది. పీజీఆర్ఎస్లో జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
నిత్యసాధన..టెన్షన్ ఛేదన
మదనపల్లె సిటీ: పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం. ఈ ఫలితమే చాలా వరకు వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున కుస్తీ పడుతున్నారు. మార్చి 16వతేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాద్యాయులు సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 124 పరీక్ష కేంద్రాల్లో 22,149 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఈ విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిపుణులైన ఉపాధ్యాయులు పలు సూచనలు ఇలా చేస్తున్నారు.ఒత్తిడిని అధిగమించాలని, ప్రణాళికతో చదవాలని సూచిస్తున్నారు. ప్రత్యేక సాధన అవసరం ప్రశ్నపత్రం చాలా సులభతరం చేసిన నేపథ్యంలో పేరాగ్రాఫ్ ప్రశ్నలన్నింటికీ నిదానంగా జవాబులు రాయాలి. కవి పరిచయాలు బాగా రాయడం అభ్యాసం చేయాలి. బ్లూప్రింట్ ఆధారంగా 4 మార్కుల ప్రశ్నలకు, ఉపవాచకంలోని 2 పాఠాల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.1,2,4,5 పాఠాల సారాంశాలపై ప్రత్యేక దష్టి పెట్టాలి. లేఖ, వ్యాసం బాగా నేర్చుకోవాలి. మాదిరి ప్రశ్నాపత్రంలలోని వ్యాకరణాంశాలు, విభాగాల వారీగా బాగా అభ్యాసం చేయాలి. మంచి దస్తూరి, అక్షరదోషాలు లేని జవాబులు వుండేటట్లు జాగ్రత్త పడితే మంచి మార్కులు సాధించగలరు. –ఏ.వసుధ, ఎస్ఏ, (హిందీ), ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వాల్మీకిపురంస్మార్ట్ ప్రిపరేషన్ ముఖ్యం పదో తరగతి పిల్లలు పబ్లిక్ పరీక్షలకు వెళ్లే ముందు ఫిజికల్ సైన్స్లో మంచి మార్కులు సాధించడానికి స్మార్ట్ ప్రిపరేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధానంగా పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన చిత్రపటాలు, డయాగ్రమ్స్, విద్యుత్ వలయాలు, ప్రయోగశాల పరికరాల అమరికలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ స్కోరు తెచ్చుకోవచ్చు. నిర్వచనాలు రాసేటప్పుడు కచ్చితమైన పాయింట్లను అండర్లైన్ చేయాలి. – వరప్రసాద్,ఎస్.ఏ(పీఎస్),జెడ్పీహెచ్ఎస్, ముదివేడుఇంగ్లీష్లో ప్రత్యేక జాగ్రత్తలు ఇంగ్లీష్ పరీక్షకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. ప్రధానంగా వకాబులరీ సాధన చేయాలి. గ్రామర బాగా చదువుకుంటే 40 మార్కులకు 30 మార్కులను సులభంగా పొందవచ్చు. అలాగే లెటర రైటింగ్పై ప్రత్యేక ప్రాక్టీస్ చేసి, వ్యాకరణ దోషాలు లేకుండా దస్తూరితో రాయాలి. దోషాలు లేకుండా స్పష్టంగా రైటింగ్ ఉండాలి. – అలియాబేగం, ఎస్ఏ(ఇంగ్లీష్), రెడ్డివారిపల్లె, చిన్నమండ్యం మండలం పదీ పరీక్షలకు సమీపిస్తున్న గడువు కీలక పాయింట్లు రాస్తేనే ఉత్తమ మార్కులు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సూచనలు -
‘రాజంపేట’లో బలహీనంగా ఉన్నాం
● వైఎస్సార్సీపీ బలంగా ఉందంటూ టీడీపీ నేతల అంగీకారం ● చంద్రబాబు కూడా సంతోషంగా లేరట ● ఆ కుటుంబాల బలం ఐదువేల ఓట్లేనని ఎద్దేవా ● వేదికపై ఖాన్కు అవమానంమదనపల్లె: ‘రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మనం బలహీనంగా ఉన్నాం, బలం పుంజుకోవాల్సి ఉంది’ అంటూ టీడీపీ నేతలు బహిరంగ పర్చుకున్నారు. ఈ పరిస్థితిపై చంద్రబాబు సంతోషంగా లేరంటూ బాబు అంతరంగాన్ని బయటపెట్టారు. మదనపల్లె బైపాస్రోడ్డులోని ఓ కల్యాణమండపంలో జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ఖాన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ సభలో మాట్లాడిన నేతలు పార్టీ పరిస్థితిపై చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే వైఎస్సార్సీపీ బలం ఎక్కువ జిల్లా నూతన అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాజంపేట పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్సీపీ బలం ఎక్కువగా ఉందని పరోక్షంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పార్లమెంటు స్థానం బలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ బాధ్యతల నిర్వహణ అంత సులువు కాదన్న ధోరణి ఆయనలో వ్యక్తమైంది. చంద్రబాబు సంతోషంగా లేరు తర్వాత మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. చంద్రబాబు సంతోషంగా లేరని ప్రసంగంలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి ఒక ఎత్తు అయితే రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి మరోలా ఉందన్నారు. ఇక్కడ పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని, పరోక్షంగా వైఎస్ఆర్సీపీ బలాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోనే టీడీపీకి అత్యధిక బలం కలిగిన తంబళ్లపల్లెలో టీడీపీ క్యాడర్ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి భయపడుతున్నారని మంత్రి చెప్పడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చకు దారితీసింది. పార్టీ క్యాడర్లో భయం ఉంటే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో గత టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిపై కేసు నమోదు కావడం ఎలా సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు. పార్టీ పరువు తీసిన ఈ వ్యవహారంతో ఇబ్బంది పడుతుంటే, అధికారంలో ఉండి కార్యకర్తలు భయంతో ఉన్నారని మంత్రి చెప్పడం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించిందని చర్చించుకుంటున్నారు. ఆ కుటుంబాలు వీరేనా మంత్రి మండిపల్లి ప్రసంగంలో మరో విషయం చర్చనీయాంశమైంది. ఆయన మాటల్లో టీడీపీలో ఉన్న నేతల కుటుంబాలకు ఐదు వేల ఓట్ల బలం ఉండొచ్చు, మిగతా బలమంతా చంద్రబాబుదని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాజకీయం చేస్తామని చెప్పారు. ఈ మాటలు ఎవరి ఉద్దేశించి చెప్పారోనని చర్చ మొదలైంది. సొంతంగా గెలవగలిగే సత్తా లేదన్న మంత్రి ప్రస్తావన ఎవరిని ఉద్దేశించి చేశారోనని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. కేసులు ఎత్తివేయాలట అంగళ్లు, పుంగనూరు ఘటనలపై నమోదైన కేసుల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఉపశమనం కలిగించేలా కేసులు మాఫీ చేయించాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రస్తావించగా, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ ఇన్చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి హామీ ఇచ్చారు. ఖాన్కు కుర్చీలేదు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులై, వేదికపై ప్రమాణ స్వీకారం చేసిన పఠాన్ ఖాదర్ ఖాన్ కు అవమానం జరిగింది. వేదికపై అందరూ కూర్చున్నప్పటికీ ఆయనకు కుర్చీ లేదు. జిల్లా టీడీపీలో రెండో కీలకమైన పదవిలో ఉన్న మైనార్టీ నాయకుడి ని కూర్చోవడానికి సీటు లేకపోవడం చర్చనీయాంశమైంది. తొలిసారిగా మైనార్టీవ్యక్తికి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినా ఇలా వ్యవహరిస్తారా అని పార్టీలోని ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
చెస్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
కడప వైఎస్ఆర్ సర్కిల్: బెంగళూరులో నిర్వహించిన 4వ చెస్ఫ్యూజన్ ఓపెన్ – ఏజ్ గ్రూప్ రాపిడ్ చెస్ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారుల సత్తా చాటారని, నాలుగు బహుమతులు సాధించారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ పేర్కొన్నారు. అండర్–10 బాలికల విభాగంలో కడపకు చెందిన అమీన 7 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం, అండర్–8 బాలికల విభాగంలో వినమ్రత 7 రౌండ్లలో 4 పాయింట్లు సాధించి నాలుగో స్థానం పొందినట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత ఏడో స్థానం సాధించిందన్నారు. ఓపెన్ విభాగంలో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ క్రీడాకారుడు, చెస్ కోచ్ అయిన అనీస్ దర్బారీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ఏడో స్థానం సాధించి నగదు బహుమతి పొందారన్నారు. ఓపెన్ విభాగంలో రెహాన్ 4 పాయింట్లు, అండర్–8 బాలుర విభాగంలో దేవ్ ఆర్యన్ 4, గణేష్ 2.5, అండర్–10 బాలుర విభాగంలో నిఖిలేశ్వర్ 4, అండర్–12 బాలుర విభాగంలో భావేష్ 3.5, నవాజ్ 2.5 పాయింట్లు సాధించారని తెలిపారు. ఉపాధి హామీ పోస్టర్ ఆవిష్కరణ కడప సెవెన్రోడ్స్: ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు జీవనోపాధి భద్రతను పెంచడంతో పాటు ఆర్థిక భద్రతను కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అదనంగా కూలీలకు రోజుకు కనీస వేతనం రూ.240కి పెంచినట్లు, ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించగా, ఈ నిధులను గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, నీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులకు వినియోగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, డ్వామా పీడీ అదిశేషారెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత – ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లా పోలీసుశాఖ మహిళలు, బాలికల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో వారోత్సవాల్లో భాగంగా కడపలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ సర్కిల్ వరకు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద మానవ హారం నిర్మించి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతపై గత కొన్ని నెలలుగా కాలేజీలు, పాఠశాలలు, పల్లె నిద్ర కార్యక్రమాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా డయల్ 112 నంబర్కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు. ర్యాలీలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్)బి.రమణయ్య, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, ఏఆర్ డీఎస్పీ పి. నాగేశ్వర రావు, మహిళా పీఎస్ సీఐ ఎల్లమరాజు, నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్మదనపల్లెఅర్బన్: ప్రజాసమస్యలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ నిషాంత్కుమార్ ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్డేలో పాల్గొని ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయాశాఖల పరిధిలోని పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ మొత్తం 285 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఆయాశాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కొన్ని అర్జీల వివరాలు.. మదనపల్లె మండలం సీటీఎం గ్రామానికి చెందిన సయ్యద్ఖాన్ వస్త్రవ్యాపారి. ఆయన సోదరుడు దావుద్ ఆస్తి గొడవల్లో భాగంగా గోల్మాల్ చేసేందుకు సయ్యద్ఖాన్ మరణించినట్లు గత నెలలె డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. దీంతో బాధితుడు తాను బతికుండగానే ఆస్తి కోసం డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తన తమ్ముడు దావుద్, సర్టిఫికెట్ మంజూరు చేసిన అప్పటి తహసీల్దార్, ఆర్ఐ రెడ్డెప్ప, వీఆర్వో ప్రదీప్, సెక్రటరీ పవన్కుమార్లపై కఠినచర్యలు తీసుకోవాలని కోరాడు. రామాపురం మండలం నల్లగుట్టపల్లె హరిజనవాడకు చెందిన చిన్నప్ప గ్రామస్తులతో కలసి కోదండ రామస్వామి ఆలయ స్థల వివాదంపై కలెక్టర్కు అర్జీ ఇచ్చాడు. గ్రామానికి చెందిన కదిరయ్య అనే వ్యక్తి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటూ గ్రామంలో గొడవలు పెడుతున్నాడని, చర్యలు తీసుకుని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలంటూ విన్నవించాడు. కలికిరి మండలం గుట్టపాళెం పంచాయతీ ఓడమాండ్లపల్లెకు చెందిన సాలి ఆంజనేయులు ఆటోడ్రైవర్. అతడిని ఓ కేసులో ముద్దాయిగా ఇరికించి రెండేళ్లపాటు పోలీసులు గ్రామ బహిష్కరణ చేశారు. అయితే కలికిరి సీఐ ఊరిలోకి రానీయకుండా, ప్రత్యర్థులతో కుమ్మకై ్క ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధితుడు ఆంజనేయులు తన భార్యాపిల్లలతో కలసి ఫిర్యాదు చేశాడు. మదనపల్లెలోని జగన్కాలనీకి చెందిన మస్తాన్వలీ, అజిమున్నీసాలు తమ భూములను రెవెన్యూ అధికారులు నివాస గృహాలకు తీసుకున్నారని, అయితే ఐదేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా..ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపలేదన్నారు. పైగా ఎనిమిదిమందికి మరోచోట భూమి ఇచ్చారని, తమకు ఇవ్వలేదన్నారు. తమకు న్యాయం చేయాలంటూ అర్జీ ఇచ్చారు. -
5న మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
కడప సెవెన్రోడ్స్ : మా జీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేది ప్రొద్దుటూరుకు రా నున్నారు. మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్లో ఆయన పాల్గొననున్నారు. ● గురువారం ఉదయం 9.30 గంటలకు బెంగుళూరు యలహంక నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు జక్కూరు ఏరోడ్రమ్కు చేరుకుంటారు. ● 10.00 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.10 గంటలకు ప్రొద్దుటూరులోని రామేశ్వరం బైపాస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ● 11.20 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.35 గంటలకు రైల్వేస్టేషన్లోని వైవీఆర్ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వెన్యూ వద్దకు చేరుకుంటారు. 11.50 వరకు వివాహ రిసెప్షన్లో గడుపుతారు. ● 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.00 గంటలకు రామేశ్వరం బైపాస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.20 గంటలకు బెంగుళూరులోని జక్కూరు ఏరోడ్రమ్కు చేరుకుంటారు. ● 1.30 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.50 గంటలకు యలహంక నివాసానికి చేరుకుంటారు. -
●బీజేపీని పట్టించుకునే నాథుడే లేడు
టీడీపీ X జనసేన ● జనసేన చేసే అభివృద్ధికి ‘పచ్చ’ ఆటంకాలు ● టీడీపీ ముఖ్యనేత వైఖరిపై సేనలో అసంతృప్తి ● బీజేపీని పట్టించుకునే నాథుడు కరువు ● కూటమి ధర్మానికి తూట్లు ● ఏకపక్ష నిర్ణయాలతో టీడీపీ సమీక్షలు, సమావేశాలు ● సమావేశాలకు జనసేన, బీజెపీ నేతలకు అందని పిలుపు ● నేనే బాస్ అంటూ అధికారులకు బెదిరింపులు రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత, జనసేన పార్లమెంటరీ స్థాయి ముఖ్యనేత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జనసేన ముఖ్యనేత తన అధినేత పవన్కళ్యాణ్ సిఫారసుతో అభివృద్ధి పనులు తెచ్చుకుంటే వాటిని అడ్డుకునేందుకు టీడీపీ ముఖ్యనేత విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు నేనే బాస్ అంటూ అధికారులను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క టీడీపీ ముఖ్యనేత మీద నడుస్తోందన్న విమర్శలున్నాయి. అన్ని శాఖల అధికారులు జనసేన, బీజేపీ నేతల విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు. అమలు కాని కూటమి ధర్మం కూటమిలో బీజెపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు భాగస్వాములయినా.. అన్నింటా పెత్తనం చేసేందుకు టీడీపీ ముఖ్యనేత కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రెండు పార్టీల నాయకులను పట్టించుకోకపోవడంతో వారు కినుకవహిస్తున్నారు. పాటిస్తున్నారు. దీంతో ముఖ్యనేత వైఖరిపై సేనల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. సమావేశాలకు పిలుపేదీ? కూటమి ప్రభుత్వం రాజంపేటలో టీడీపీ ఏకపక్షంగా వ్యవహారిస్తోంది. అధికారులు కూడా టీడీపీనే అధికారపార్టీగా గుర్తించారు. అందువల్ల జనసేన, బీజెపీ నేతలను పట్టించుకునే పాపన పోవడంలేదు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి సమావేశాలు, సమీక్షలకు మూడు పార్టీల నుంచి నేతలను పిలవాల్సింది పోయి, టీడీపీ ముఖ్యనేతనే ఆహ్వానిస్తున్నారు. దీంతో అన్ని సమీక్ష సమావేశాలకు ఆయనే హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించరు. అయితే టీడీపీ ఒకటే కాదు ప్రభుత్వం అంటే జనసేన, బీజెపీలు కూడా అని అధికారులకు ఆ పార్టీ నేతలు హితబోధ చేస్తున్నారు. అయితే ముఖ్యనేత మాట వినకుంటే బదిలీ చేస్తామని సందేశాలను పంపడంతో అధికారులు ఏమీ చేయలేక తలలు పట్టుకున్నారు. బీజెపీని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నా తమ పార్టీకే పరిమితమయ్యారు. తాము కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, కూటమి అధికారంలోకి రావడానికి తమ పార్టీ కీలకమనేది మరిచిపోయారని వారు వాపోతున్నారు. అధికారులు కూటమి అంటే కేవలం టీడీపీ అన్నట్లుగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని కాషాయనేతలు పెదవివిరుస్తున్నారు. -
ఆదర్శం.. ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో ఏపీ మోడల్ స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. సంబంధిత మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి పిబ్రవరి 23వ తేదీ నుంచి నెట్బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ఫీజు పేమెంట్స్కు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఆన్లైన్న్ పేమెంట్స్కు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష.... 6వ తరగతిలో ప్రవేశానికి గతేడాది మాదిరిగానే పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్లిస్టు ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్లిస్టు, ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఆయా మండలాల్లో వీటిని ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంతోపాటు విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారు. పాత ఉమ్మడి కడపజిల్లాలో పది మోడల్ స్కూళ్లు పాత ఉమ్మడి కడపజిల్లాలో వల్లూరు, ఖాజీపేట, కాశినాయన, పుల్లంపేట, పెనగలూరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, చిన్నమండెం, సుండుపల్లి మండలాల్లో మొత్తం పది మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 100 సీట్లు చొప్పున మొత్తం 1000 మందిని ఎంపిక చేస్తారు. రిజర్వేషన్లు ఇలా... 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు ( 7 శాతం బీసీ–ఎ, 10 శాతం బీసీ–బి, ఒక శాతం బీసీ– సి, 7 శాతం బీసీ–డి, 4 శాతం బీసీ–ఈ) సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. నిర్థేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపు నుంచి భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం సీట్లు ఇతర కులాలకు నిర్థేశించారు. నోటిఫికేషన్ జారీ : 16.02.26 ఆన్లైన్ దరఖాస్తు ఆమోదం: 24.02.26 ఫీజు చెల్లింపు చివరితేదీ: 31.03.26 ప్రవేశ పరీక్ష తేదీ: 12.04.26 మెరిట్ జాబితా ప్రచురణ: 27.04.26 సర్టిఫిఫెట్ పరిశీలన, కౌన్సెలింగ్: 30.04.26 సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. మోడల్ స్కూల్ అడ్మిషన్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్ స్కూళ్లను తీసుకొచ్చారు. ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతుంది. 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. – షేక్ షంషుద్దీన్, డీఈవో, వైఎస్సార్జిల్లా 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.200లు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.125 ఉంటుంది. సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో 5 తరగతుల్లో చదివి ప్రమోషన్న్కు అర్హత పొంది ఉండాలి. పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజిర్వేషన్ప్రతిపాదికన సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయవచ్చు. cse.ap.gov.in లేదా apms.ap.gov.in వెబ్పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్ స్కూళ్లలో 6వ తరగతిఅడ్మిషన్లకు అవకాశం నోటిఫికేషన్ జారీచేసిన విద్యాశాఖ మార్చి 31వ తేదీ వరకుఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ -
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి
మదనపల్లె సిటీ : ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్ఎంయూ కృషి చేస్తున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో ఆర్టీసీ ఉద్యోగులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ స్థితిగతుల గురించి వివరించారు. ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు నిత్యం అందుబాటులో ఉండి, చేయాల్సిన సంక్షేమ సర్వీసులు, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.వీ.రమణారెడ్డి వివరించారు. ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ శివారెడ్డి ఉద్యోగుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు పి.వినోద్బాబు, రాష్ట్ర నాయకులు బాబు చెంచులయ్య, మహేశ్వరి రత్నం తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు
మదనపల్లెటౌన్ : వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం రెడ్డెప్ప నాయుడు కాలనీకి చెందిన దంపతులు రిటైర్డ్ అధ్యాపకురాలు భవానీదేవి(63) రిటైర్డ్ టీచర్ ఆనంద నాయుడు(65) బీరంగి కొత్తకోట మండలంలోని చలిమామిడి వద్ద కొత్తగా నిర్మించిన సీతా రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం వారు తిరుగు ప్రయాణమై కారులో మదనపల్లెకు వస్తుండగా, మార్గంమధ్యలోని కురబలకోట మండలం చెన్నామర్రి మిట్టపై కారుకు కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి గుంతలోకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది మనోహర్, బావాజాన్లు క్షత గాత్రులను చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కారు ఢీకొని.. కారు ఢీకొని చేనేత కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు వెంకటరమణ, రమేష్ గుర్రంకొండ మండలం తరిగొండ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అక్కడ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మెక్కులు తీర్చుకున్నారు. అనంతరం తిరిగి ఇద్దరూ మదనపల్లెకు బైకులో వస్తుండగా.. మార్గంమధ్యలోని సిటిఎం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు 108 సాయంతో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బొలెరో ఢీకొని.. బొలెరో ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో వెలుగు చూసింది. ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. జాండ్ర బెలు గ్రామానికి చెందిన రైతు విశ్వనాథ నాయుడు (54) శనివారం రాత్రి సొంత పనిపై పుంగనూరుకు బైకులో వెళ్లాడు. అక్కడి పనిముగించుకుని తిరిగి అదే రోజు రాత్రే ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని వనమల దిన్నె వద్ద బొలెరో వాహనం వేగంగా వచ్చి రైతు ప్రయాణిస్తున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతుకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు వెంటనే వెళ్లి బాధితున్ని ఓ ప్రయివేట్ వాహంలో చికిత్సల కోసం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. దీంతో వారు ఆ రైతును వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూటర్ ఢీకొని.. స్కూటర్ ఢీకొని విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. రేణుమాకులపల్లె పంచాయతీ దండువారిపల్లెకు చెందిన విశ్వనాథ్ కుమారుడు జయప్రకాష్ (15) స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సొంతపనిపై రేణుమాకులపల్లె క్రాస్ వద్దకు స్నేహితులతో వెళ్లాడు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా ముదివేడు వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం విద్యార్థి జయప్రకాష్ను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదం లో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు చికిత్సల కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయారు రెఫర్ చేశారు. ఘటనపై తంబళ్లపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్తో.. మదనపల్లెటౌన్ : కరెంటు షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లెలో ఆదివారం జరిగింది. ప్రమాదానికి సంబంధించి జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె చెంబకూరు రోడ్డులో కాపురం ఉంటున్న ఎలక్ట్రీషియన్ మహబూబ్ జానీ(38) స్థానిక కొత్త ఇళ్లలోని ఓ ఇంటికి యాంటీనా అమర్చుతుండగా కరెంటు షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితున్ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి..తంబళ్లపల్లె: చెట్టుపై నుంచి పడి రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన తంబళ్లపల్లె మండలంలో ఆదివారం జరిగింది. పులసరంవాడ్లపల్లెకు చెందిన శివకుమార్నాయుడు(50) చింతకాలయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. కాయలు కోస్తుండగా ప్రమాదశాత్తు పట్టు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాయితో భార్య తలపై కొట్టిన భర్త ఎర్రగుంట్ల : మద్యం మత్తులో కోపంతో భార్య తలపై భర్త రాయితో కొట్టిన సంఘటన ఆదివారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెందిన జ్యోతి, చంటి అనే భార్యాభర్తలు కుటుంబ కలహాల వల్ల వేర్వేరుగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆదివారం చంటి కుమార్తెను చూడడానికి వెళ్లాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తర్వాత ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్కు వస్తున్న జ్యోతిని చంటి రాయితో తలపై గట్టిగా కొట్టాడు. రక్త గాయంతో జ్యోతి ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్కు వచ్చారు. వెంటనే సీఐ విశ్వనాథరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రాజారెడ్డి, హెడ్కానిస్టేబుల్ ఆల్ఫ్రేడ్తోపాటు మరి కొందరు పోలీసులు ఆటోలో చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దంపతులు భవానీదేవి, ఆనంద నాయుడు, ఆస్పత్రిలో వెంకటరమణ -
కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం వేకువ జామునే మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారిని అలంకరించి గ్రామోత్సవం చేపట్టారు. ఆలయ మండపంలో మూలవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా చేశారు. అనంతరం కల్యాణోత్సవ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగళ్యధారణ చేయించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి వారి ఎదుట యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం వాహన మండపంలో అందంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువుదీరి మేళతాళాలతో కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం రథారోహణం, రథాగమనం, ధూళీ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలాబట్టర్ తెలిపారు. గరుడ వాహనంపై స్వామి వారి ఊరేగింపుగరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామి వారు -
అత్తపై అల్లుడి దాడి
మదనపల్లెటౌన్ : బిడ్డను ఇచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబీలు తెలిపిన వివరాల మేరకు.. సీటీఎం పంచాయతీ చిలకవారిపల్లెకు చెందిన గంగులప్ప, జయమ్మ దంపతుల కుమార్తె శ్వేత ఐదేళ్ల క్రితం స్థానికంగా ఉంటున్న లక్ష్మీకాంత్ను పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొంత కాలానికే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తుండటంతో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వారం రోజుల క్రితం లక్ష్మీకాంత్ తన భార్య శ్వేతను కొట్టడంతో ఆమె అలిగి పుట్టింటికి వచ్చేసింది. తిరిగి కాపురానికి వెళ్లక పోవడంతో లక్ష్మీకాంత్ ఆదివారం అత్తగారి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. కూతుర్ని కొడుతుండగా అత్త జయమ్మ వెళ్లి అల్లుడిని అడ్డుకోవడంతో ఆమైపెనే దాడిచేసి తీవ్రంగా గాయయపరచాడు. కుటుంబీకులు బాధితురాని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తెలుగుగంగ కాలువ నీటిలో చిక్కుకున్న దుప్పి కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో ఆదివారం ఓ దుప్పి అదుపుతప్పి పడింది. స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు ఎఫ్బీఓ హసాన్బాషా అక్కడికి చేరుకున్నారు. ఆయన స్థానికుల సహకారంతో కాలువలోని దుప్పిని తాడు సాయంతో బయటికి తీసి అడవిలో వదలిపెట్టారు. దుప్పి నీటి కోసం కాలువ దగ్గరికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం
మదనపల్లెటౌన్ : మహిళలు భయాన్ని వీడి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లెలో వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన మహిళా సాధికార వారోత్సవాలను డీఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి వంటి వారిని సాటి మహిళలు, విద్యార్థినులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనేక పదవుల్లో ఉన్న మహిళలే నేటి తరం మహిళలకు స్ఫూర్తి అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను చూసి భయపడకూడదని, ఆపద సమయంలో పోలీసు శాఖ రక్షణ కవచంలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, చట్టాలపట్ల అవగాహన కల్పించడం, స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచడమే మహిళా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ వారోత్సవాలకు జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు, స్వచ్ఛంద సమస్థల వారు పాల్గొని విజయవంతం చేయాని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పురాణ ఇతిహాసాలపై పుల్లారెడ్డి కృషి అసామాన్యం
కడప ఎడ్యుకేషన్ : పురాణ ఇతిహాసాలపై పుత్తా పుల్లారెడ్డి చేసిన కృషి సామాన్యమైంది కాదని, ఆయన్ను పురాణ వాచస్పతిగా అభివర్ణించవచ్చని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కడప ఐఎంఏ హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పుత్తా పుల్లారెడ్డి సాహితీ సమాలోచన జాతీయ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ పుల్లారెడ్డి ఇప్పటికే పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన అనేక నామ సర్వస్వాలను సంతరింప చేశారని, రచయితల సంఘం వారు ఆయన్ను అభినవ వ్యాస బిరుదుతో సత్కరించడం అభినందనీయమన్నారు. ఆయన మహాభారతాన్ని పరిశీలించి, పరిశోధించి మహాభారత విజ్ఞాన సర్వస్వం రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. యోగివేమన విశ్వవిద్యాలయం కుల సచివులు ఆచార్య పుత్తా పద్మ తన సందేశంలో పుల్లారెడ్డి అకుంఠిత దీక్షతో రాసిన జై మినీ భారతం, శృంగార శాకంతల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు ఎంతో మంది పరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అలపర్తి పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మహాభారతం పై ఆసక్తి ఉన్నవాళ్లు పుల్లారెడ్డి రచించిన గ్రంథాలను చదివి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని తృప్తి పొందుతారన్నారు. బత్తల మల్లారెడ్డి తన ప్రసంగంలో పుల్లారెడ్డి వంటి మహోన్నత వ్యక్తితో తమ కుటుంబం వియ్యమందడం ఎంతో సంతోషమన్నారు. లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ తమ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పుల్లారెడ్డికి సాహిత్య రత్నాకర బిరుదునివ్వడం గర్వకారణమని ప్రకటించారు. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి రెండు రోజులు పత్ర సమర్పకులు చెప్పిన అంశాలను చర్చించారు. కే శీను సభా సమన్వయం చేయగా డాక్టర్ పుత్తా బాలిరెడ్డి వందన సమర్పణ చేశారు. భూమిరెడ్డి స్వరూపారాణి నిర్వహణలో అధ్యక్షులుగా జింకా సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా వేముల సలీం బాషా విచ్చేసిన రెండవ రోజు సదస్సులో పుల్లారెడ్డి రాసిన కథా భారతంపై ఆచార్య కొంపెల్ల సూర్యనారాయణ, శ్రీ మదాంధ్ర మహాభారత నామ సరస్వంపై డాక్టర్ చింతకుంట శివారెడ్డి, మార్కండే పురాణ నామ సర్వస్వం పై ఆచార్య ఆర్ రాజేశ్వరి, శ్రీమద్రామాయణ నామ సర్వస్వంపై డాక్టర్ పుత్తా బాలిరెడ్డి, కవిత్రయ భారత సంక్షేప వచనానుసరణంపై డాక్టర్ మల్లి పూడి రవిచంద్ర, మహాభారతం– మున్నూరు సూక్తులపై డాక్టర్ తవ్వా వెంకటయ్య పత్ర సమర్పణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి నిర్వహణలో అధ్యక్షులుగా గుర్రాల గోపాల్, ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ వీర సుదర్శన్రెడ్డి, విశిష్ట అతిథిగా సోమ కళానాథరెడ్డి, ఆత్మీయ అతిథిగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి విచ్చేసిన మూడవ సదస్సులో మహాభారతాను శీలనంపై డాక్టర్ పొదిలి నాగరాజు, సంపూర్ణ రామాయణంపై పసుపులేటి శంకర్, సూక్తి సుమహారంపై ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్ రెడ్డి, కదంబ నీతి శతకంపై డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్రెడ్డి పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సాహితీ మిత్రులు, పరిశోధకులు, పుత్తా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. -
నా కుమార్తెను అప్పగించి న్యాయం చేయాలి
కడప రూరల్ : ‘నా భర్త ఆస్తి కోసం నా కుమార్తెను నా దగ్గరి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. నా కుమార్తెను నాకు అప్పగించి న్యాయం చేయాలి’ అని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన గీతాంజలి కోరారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అరుణ్తేజ్ అనే వ్యక్తితో తనకు ప్రేమ వివాహం జరిగిందన్నారు. తమకు నాలుగేళ్ల హన్విత అనే కుమార్తె ఉందని పేర్కొన్నారు. తన భర్త 2022 సంవత్సరంలో మృతి చెందడంతో తాను అనంతపురం జిల్లా కేంద్రంలోని అమ్మగారింటిలో ఉంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కడప నగరానికి చెందిన టీడీపీ నాయకుడు చల్లా రాజశేఖర్ భార్య, కార్పొరేటర్ చల్లా స్వప్న తన భర్తకు మేనత్త అవుతుందన్నారు. వీరు 2023 జూలైలో తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతోపాటు సంరక్షణ కోసమని తన భర్త అరుణ్ తేజ్కు చెందిన దాదాపు రూ.5–6 కోట్ల ఆస్తిని రాయించుకుని తనకు, తన కుమార్తెకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే వారు ‘అధికారం మాది.. మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు’ అంటూ బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2024లో అటు అనంతపురంతోపాటు ఇటు కడపలో చీటింగ్ కేసును పెట్టినట్లుగా తెలిపారు. అలాగే న్యాయం కోసం 2025 జూన్లో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. తన కుమార్తెను తనకు ఇప్పిండంతోపాటు తమ ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. -
గాయపడిన వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని గంగనపల్లె దళిత వాడకు చెందిన కందుల దిలీప్(27) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన సంఘటనలో అతను తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి రుయా ఆస్పత్రిలో దిలీప్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై రుయా ఆస్పత్రిలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వ్యక్తిపై దాడి కడప అర్బన్ : కడప నగరం కటిక వీధికి చెందిన మహమ్మద్ ఇషాక్పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన మహమ్మద్ ఇషాక్కు ఆకులవీధికి చెందిన వ్యక్తికి మధ్య డబ్బుల విషయమై మనస్పర్థలు ఉండేవి. ఆదివారం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహమ్మద్ ఇషాక్పై ఇద్దరు దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు రిమ్స్కు తరలించారు. బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేస్తున్నారు. వివాహిత అదృశ్యం మైదుకూరు : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఖదిరూన్ అనే వివాహిత కనిపించడం లేదని అర్బన్ సీఐ రమణారెడ్డి తెలిపారు. తన భార్య శనివారం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త గౌస్ పీర్ ఆదివారం ఫిర్యాదు చేసినట్టు సీఐ పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అగ్నికి ఆహుతైన అరటి పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని వెలమవారిపల్లె పరిధిలో ఉన్న పులివెందులకు చెందిన రైతు రాజా 5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి సాగు చేస్తున్నాడు. ఆదివారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టడంతో ఆ నిప్పు రవ్వలు వచ్చి అరటి తోటలో పడటంతో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే అరటి తోట పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.15 లక్షల నష్టం వచ్చినట్లు రైతు వాపోతున్నాడు. 108 వాహనంలో ప్రసవం కాశినాయన : మండలంలోని మిద్దెల గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే గర్భిణికి శనివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్లో పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలోనే నారాయణమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రామయ్య, ఫైలెట్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. -
రాయలసీమకు జీవనాడి
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి జీవనాడి లాంటిది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3870 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి మన ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టడం దారుణం. వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు వృథా అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భగ్యం. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరందించేలా జలయజ్ఞం చేపట్టారు. దానిని కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం చేసేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చింది. –పి. రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్సార్కడప జిల్లా అధ్యక్షుడు, వైఎస్ జగన్కు మంచిపేరొస్తుందనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆపేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచిపేరు వస్తుందనే ఇలా చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు ఉన్నా, వాటిలో చంద్రబాబు 36 టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే 78 టీఎంసీలు నిల్వ చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా పొరుగు రాష్ట్రాలు అలుసుగా తీసుకొని అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తారు. – కాకాణి గోవర్థన్రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు. పరిశ్రమలను అభివృద్ధి చేయాలి రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయంతోపాటు పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి పోరాటం చేస్తున్నాం. అల్మట్టి సామర్థ్యం మొదట్లో 17 టీఎంసీలు మాత్రమే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దాని సామర్థ్యాన్ని 125 టీఎంసీలకు పెంచారు. ఇప్పుడు మళ్లీ ఆయన సీఎంగా ఉన్నప్పుడే 229 టీఎంసీలకు పెంచబోతున్నారు. – ఎ.వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రబాబు రాయలసీమ ద్రోహి చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసేలా వ్యవహరించారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా 800 అడుగుల్లోనే నీటిని తోడుకునేలా వైఎస్ జగన్ ప్రాజెక్టు చేపట్టారు. ఇది లేకపోతే సీమ ప్రయోజనాలను కాపాడుకోలేం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. –కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు -
పుష్పగిరి వద్ద పెన్నాలో ఇద్దరు గల్లంతు
వల్లూరు : పుణ్యక్షేత్రమైన పుష్పగిరి వద్ద పెన్నా నది నీటిలో మునిగి ఆదివారం ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన చైతన్య (25), కొండాపురం మండలం గండ్లూరు గ్రామానికి చెందిన శ్రీనాథ్ (23) కడపలోని అన్నమాచార్య కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ శ్రీనాథ్ సమీప బంధువు, కడప నగరంలో ముత్తూట్ ఫైనాన్స్లో పని చేస్తున్న కొండాపురం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సురేంద్రతో కలిసి ఆదివారం సరదాగా గడపడానికి వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్దకు వచ్చారు. అక్కడి నుంచి సమీపంలోని పుష్పగిరి వద్దకు వచ్చిన ముగ్గురు ఈత కోసం పెన్నా నది నీటిలోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో శ్రీనాథ్, చైతన్య నదిలో ఎక్కువ లోతు ఉన్న ప్రదేశంలో నీటిలో మునిగిపోయారు. వారితోపాటు ఉన్న సురేంద్ర అతి కష్టం మీద ఈత కొడుతూ పుష్పగిరి కొండ వైపున ఒడ్డుకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివనాగిరెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ట్యూబుల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే సమయం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడుశ్రీనాథ్ (ఫైల్) చైతన్య (ఫైల్) -
నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
రాయచోటి జగదాంబసెంటర్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రామన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సర్కిల్ స్థాయిలోనూ... డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండెంట్ ఇంజనీర్ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటన ద్వారా ఆదివారం కోరారు. ఫోన్ నంబర్లు: తిరుపతి: 8712652679, చిత్తూరు: 7993147979, అన్నమయ్య: 9440817449, కడప: 085622425457 -
రహదారి నిర్మాణం పరిశీలన
సదుం: మండలంలోని గొంగివారిపల్లె క్రాస్ నుంచి పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. పీఎం గ్రామ్ సడక్ యోజనలో భాగంగా రూ. 8.63 కోట్ల వ్యయంతో 9.97 కిలోమీటర్ల మేర పీపీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా నిర్మాణంలో జాప్యం కలుగుతుండటంతో ఆయన తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పింఛన్ పంపిణీ: గొంగివారిపల్లెలో రమేష్ అనే లబ్ధిదారునికి వికలాంగ పింఛన్ను కలెక్టర్ అందజేశారు. తాగునీటి పంపిణీ, సచివాలయ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలేమైనా ఉన్నాయా అని అడుగగా, సమస్యల పరిష్కారానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తన నిధులను పుష్కలంగా అందిస్తున్నారని మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, డీటీ ప్రకాశ్, ఏఈలు సిరాజ్, ప్రవల్లిక, ఆదినారాయణ, ప్రణయ్ కుమార్, ఎంఈఓ–2 దామోదర, ఏపీఓ శ్రీనివాసులు, ఏపీఎం హరిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. ● మండలంలోని దిగువ గొల్లపల్లెలో రైతు గంగిరెడ్డి సాగుచేస్తున్న చామంతి తోటను కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం పరిశీలించారు. పంట సాగు విధానం, దిగుబడి మార్కెంటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులతో పంటలు సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. -
కోయాలంటే భయమేస్తోంది
తోటలో టమాటాలు కోయాలంటే భయమేస్తోంది. నేను ఒకటిన్నర ఎకరాలో పంట సాగు చేశాను. మార్కెట్లో ఇప్పుడున్న ధరలు చూస్తే కూలీలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మళ్లీ ఇప్పుడు ఉన్న పంటను కాపాడుకోవాలంటే రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – లక్ష్మీనారాయణ, టమాటా రైతు, శీలంవారిపల్లె పెట్టుబడి కూడా రావడం లేదు ప్రస్తుతం టమాటా పంట సాగు చేయడం వల్ల పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మర్కెట్లలో గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. వారం రోజుల నుంచి ధరలు తగ్గిపోతున్నాయి. నెలరోజుల కిందట మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 500వరకు పలికింది. ఇప్పుడు పడిపోతున్నాయి. ఇలా ధరలు పడిపోతుండటంతో భారీగా నష్టపోతున్నాము. – రెడ్డిమోహన్, గుర్రంకొండ -
కర్ణాటక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇంట్లో సోదాలు
● 26 కేసుల్లో నిందితుడు ఉమర్ మహమ్మద్ నాసిర్ ● ఆస్తుల విలువ రూ.2 కోట్లకుపైగానే గుర్తింపు రాయచోటి : కర్ణాటక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉమర్ మహమ్మద్ నాసిర్ (40) అలియాస్ సఫా హుస్సేన్ అమబ్బకు చెందిన ఇళ్లల్లో కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళూరు పోలీసుల అదుపులో ఉన్న ఆయనను శనివారం రాయచోటికి తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో 26 కేసులలో నిందితుడిగా ఉండి పది సంవత్సరాలుగా కనిపించకుండా కర్ణాటక రాష్ట్రం మంగళూరు పోలీసులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన అతను రాయచోటిలో గుట్టుగా జీవనం సాగించాడు. మర్డర్లు, రేప్లు, కిడ్నాప్లు లాంటి 26 కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెండు కేసులలో యావజ్జీవ శిక్షను విధిస్తూ కోర్టులు తీర్పు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన అన్నమయ్య జిల్లా, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా.. రాయచోటిలో నాసిర్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళూరు జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ గ్యాంగులను ఏర్పరిచి మర్డర్లు, రేప్లు, కిడ్నాప్లతో ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడని కర్ణాటక పోలీసులు తెలిపారు. మహబూబ్ బాషా కోసం పోలీసుల వేట పదేళ్ల కిందట కనిపించకుండా పోయిన నాసిర్ రాయచోటికి చెందిన ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, గల్ఫ్ ఏజెంట్ ఎం.మహబూబ్ బాషా అండతో రాయచోటిలో జీవనం మొదలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నాసిర్ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం రాయచోటిలోని మహబూబ్ బాషా ఇంటిని రాయచోటి పోలీసులతో కలిసి చుట్టుముట్టారు. అప్పటికే విషయాన్ని పసిగట్టిన మహబూబ్ బాషా ఇంటికి తాళాలు వేసి జిల్లాను దాటి పరారైనట్లు పోలీసులకు సమాచారం అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరు ఏసీపీ సుధీర్కుమార్రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ టీమ్ల సమన్వయంతో రాయచోటి పట్టణం కొత్తపల్లిలో నాసిర్ నివసిస్తున్న ఇంటిలో సోదించారు. ఈ సోదాలో రూ.2 కోట్లకు పైగా విలువచేసే రెండు నివాస గృహాలు, కొన్ని స్థలాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్టు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ బాషా ఆశ్రమం ఇవ్వడంతోపాటు క్రిమినల్కు స్థానికంగానే ఓ మహిళతో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాసిర్ ద్వారా స్థానికంగా మహబూబ్ బాషా మరికొందరితో కలిసి జరిపిన కార్యకలాపాలపైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా విచారణ కోసం కోర్టు అనుమతితో మరొక రోజు రాయచోటిలో తనిఖీలు చేపడతామని కర్ణాటక పోలీసులు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న మహబూబ్ బాసాను తప్పకుండా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు మీడియాకు వివరించారు. -
విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
తిరుపతి క్రైం : తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో నిర్మిస్తున్న ఓ భవనంలో విద్యుత్ షాక్కు గురై ఓ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం నూతన కాలువ, దిన్నె వడ్డేపల్లికి చెందిన చెంచయ్య (40)గా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు..అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం నూతన కాలువ, దిన్నె వడ్డేపల్లికి చెందిన చెంచయ్య పెద్దకాపు లేఅవుట్లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో పనులు చేస్తున్నాడు. పనులు చేసే సమయంలో చెంచయ్య ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే సహచరులు అతడిని సంకల్ప ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి ఈస్ట్ ఎ రామస్వామి తెలిపారు. మహిళల రక్షణే లక్ష్యం – జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లెటౌన్: మహిళలకు భద్రత కల్పించడం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి పేర్కొన్నారు. శనివారం మదనపల్లెలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఏఎస్పీ వెంకటాద్రితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘శక్తి యాప్’ అందుబాటులో ్జట తెచ్చామన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మహిళా రక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యారంగంలోనూ మహిళలు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని కొనియాడారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజారెడ్డి, పీఎం రఫీ, మహిళా ఎస్ఐ గాయత్రి, డాక్టర్ అనురాధ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కారు అమ్మకం పేరుతో మోసం లబ్బీపేట(విజయవాడతూర్పు): కారు కొనుగోలు చేసేందుకు ఓఎల్ఎక్స్ను అన్వేషిస్తున్న వ్యక్తి సైబర్ మోసగాడికి చిక్కాడు. ముందుగానే ఖాతాలకు లక్షల కొద్దీ డబ్బు బదిలీ చేసిన బాధితుడు ఆనక మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆశ్రయించాడు. దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల రెడ్డినగర్కు చెందిన యేరువ గురుపూర్ణ భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. అతను ఫార్ుచ్యనర్ కారు కావాలంటూ ఓఎల్ఎక్స్లో ఉత్తమ ఆఫర్ కోసం శోధించాడు. ఈ తరుణంలో అతను ఒక ప్రకటనను గమనించి తన మొబైల్ నంబరును పంచుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఫిబ్రవరి 13న అజిత్కుమార్ పేరుతో ఫోన్ చేసి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తన సోదరుడి ఇంటి వద్ద ఇన్నోవా క్రిస్టా కారు (ఏపీ 40 సీఆర్ 0315) అమ్మకానికి ఉందని తెలిపాడు. దాని విలువ మొత్తాన్ని తనకు బదిలీ చేయాలని చెప్పి, జగ్గయ్యపేటలో వాహనాన్ని డెలివరీ తీసుకోవచ్చని తెలిపాడు. అతడి మాటలు నమ్మిన గురుపూర్ణ వేర్వేరు ఖాతాలకు రూ.15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అతను ఇచ్చిన ఫోన్ నంబరుకు రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్కి రూ.5 లక్షలు ఒకసారి, రూ.85 వేలు మరోసారి, కర్నాటక బ్యాంక్ అకౌంట్కి రూ.లక్షతో పాటు, మిగిలిన మొత్తాన్ని బెస్ట్ జ్యూవెలర్స్ ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం అజిత్కుమార్ తన ఫోన్కాల్స్కు స్పందించక పోవడంతో మోసపోయానని గ్రహించి శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.దుర్గాప్రసాద్ తెలిపారు. దువ్వూరు : దువ్వూరులో ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ తిరుమలరావు క్లినిక్ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వి.మల్లేష్ మాట్లాడుతూ క్లినిక్కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రజా ఆరోగ్యానికి విఘాతం కలిగించేలా ఆర్ఎంపీలు వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
యువకుడి దారుణ హత్య
● మాట్లాడాలని పిలిచి మట్టుబెట్టిన హంతకులు ● చిన్నారి హత్య ఘటన మరువక ముందే మరో హత్య ● వరుస హత్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం ● హత్య చేసి తన మామిడి తోటలోనే పాతేసిన స్నేహితుడు ● నెల తర్వాత వెలుగులోకి రావడంతో కలకలం మదనపల్లెటౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో మరో యువకుడు దారుణ హత్యకు గురికావడం నెలరోజుల తర్వాత బయటపడింది. మాట్లాడే పని ఉందని వెంట తీసుకెళ్లిన ప్రాణ స్నేహితుడే అతని పాలిట యముడిగా మారాడు. పూటుగా మద్యం తాపించి బండ రాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకెళ్లి, తన మామిడితోటలోనే అల్లనేరేడు చెట్టు పాదిలో పాతేసి ఏమీ తెలియనట్లు ఉండి పోయాడు. శనివారం వెలుగు చూసిన ఘటనపై మృతుడి కుటుంబీకులు, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం వలసపల్లె గ్రామం అరవవాండ్లపల్లెలో ఉంటున్న లక్ష్మినారాయణ, లక్ష్మీదేవి దంపతుల చిన్న కుమారుడు పూల దివాకర్ (26) ఏడాది క్రితం గ్రామంలో జాతర సందర్భంగా రెండు గ్రూపుల మధ్య గొడవలు తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్న కేసుల్లో ఉన్నాడు. దీంతో బెంగళూరుకు వెళ్లిపోయి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇచ్చేపని చేసేవాడు. గత ఏడాది డిసెంబర్ 28న స్వగ్రామానికి వచ్చాడు. జనవరి 4న అదే ఊరికి చెందిన గణేష్ తదితరులతో బయటికి వెళ్లి తిరిగి రాలేదని దివాకర్ తల్లి లక్ష్మీదేవి కుటుంబీకులతో వచ్చి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాలూకా సీఐకి వలసపల్లి వీఆర్ఓ నాగేశ్వర్కు స్థానికులు ఇచ్చిన సమాచారంతో 150 మైలు రాయి సమీపంలోని హంద్రీ–నీవా కాలువకు సమీపంలోని క్రిష్ణప్ప మామిడి తోటలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించి సీఐకి సమాచారం అందించారు. పీఐ వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ఎవరో హత్య చేసి పాతిపెట్టినట్లు గుర్తించాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన దివాకర్ అదృశ్యం కేసు జనవరి 10న నమోదు చేసిన పోలీసులు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసి మృతదేహం దివాకర్దిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీస్ బందోబస్తు మధ్య స్పాట్ పోస్టుమార్టం చేపట్టి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ హత్య కేసులో ఎవరెవరి పాత్ర ఉందో నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమై నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యపై పలు అనుమానాలు పూల దివాకర్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది క్రితం గ్రామంలో జరిగిన జాతరలో రెండు ఊర్ల మధ్య భారీగా గొడవలు జరిగాయి. ఆ సమయంలో రెండు గ్రామాలకు చెందిన పలువురిపై తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ గొడవల్లో దివాకర్, గణేష్ మంచి స్నేహితులుగా ఉండే వారు. ఏ సమస్య వచ్చినా ఇద్దరే ముందుండి సమస్యను పరిష్కరించుకునే వారు. గణేష్కు మద్దతుగా నిలిచిన దివాకర్కు తప్ప తక్కిన వారందరికీ గణేష్ బెయిల్ తెప్పించాడు. దీంతో విభేదాలు వచ్చినట్లు తెలసింది. దివాకర్ బెంగళూరుకు వెళ్లిపోయాడు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్లో పని చేస్తుండే వాడు. జనవరి ఫస్ట్కు వచ్చిన దివాకర్ గణేష్తో గొడవ పడ్డట్లు తెలిసింది. తనకు తప్ప అందరికీ బెయిల్ ఇప్పించి స్నేహానికి కళంకం తెచ్చావని, మాట్లాడే పనిపై జనవరి 4న గణేష్తో వెళ్లిన దివాకర్ పూటుగా మద్యం తాగి గొడవపడి గణేష్ దివాకర్ను బండరాయితో కొట్టి చంపేసి తీసుకెళ్లి తన మామిడి తోటలోనే పాతేసి మిన్నకుండి పోయినట్లు తెలుస్తోంది. కాగా హత్య కేసు వెలుగులోకి రావడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని సీఐ కళావెంకటరమణ తెలిపారు. రోజుల వ్యవధిలోనే.. మదనపల్లెలో ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఏడేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రజలు మరువక ముందే మరో యువకుడి దారుణ హత్య వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మదనపల్లెలో చిన్న చిన్న కారణాలతోనే క్షణివేశంలో యువత హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల పర్యవేక్షణ కొరవడటం, గంజాయి, కూల్ లిప్స్ వంటి వాటికి యువత బానిసలై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేసిన వైద్యులు (ఇన్సెట్) దివాకర్ (ఫైల్) హత్య జరిగిన ప్రదేశంలో పరిశీలిస్తున్న పోలీసులు -
శంకర్కు ఇన్చార్జి పదవి ఇవ్వొద్దు
మదనపల్లె అర్బన్: తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పదవి మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్కు ఇవ్వొద్దంటూ టీడీపీ నేతల ధ్వజమెత్తారు. శనివారం మదనపల్లె ప్రెస్క్లబ్లో ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.తులసీధర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. శంకర్ తంబళ్లపల్లె నియోజకవర్గానికి వలస నేత అన్నారు. అలాంటి వ్యక్తికి నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పడం బాధాకర మన్నారు. దీన్ని నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇన్చార్జిని ప్రకటించాలనుకోవడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కష్టపడిన వారిని పక్కనబెట్టి వలస నేతకు కట్టబెట్టరాదని తెలిపారు. అలా చేయడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
గజవాహనంపై లక్ష్మీనరసింహుడు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గజవాహనంపై విహరించారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన శనివారం ఉదయాన్నే మూలవర్లకు తోమాలసేవ నిర్వహించారు. తిరుచ్చి వాహనంలో స్వామి వారిని కొలువు దీర్చి మేళ తాళాలు, సాంస్కృతి కార్యక్రమాలతో ఊరేగింపు వైభవంగా సాగింది. అంతకుముందు ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంకాలం స్వామి వారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారిని గజవాహనం పై కొలువుదీర్చి గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు గోపాలాబట్టర్ తెలిపారు. సాయంకాలం సర్వభూపాల వాహనం సేవ ఉంటుందన్నారు.అనంతరం గరుడవాహనంపై స్వామివారు విహరిస్తారు. కల్యాణోత్సవం రోజే తిరునాల నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పరిసర గ్రామాల నుంచి చాందినీ బండ్లు తరలివస్తాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్: అప్పుల బాధతో రైతు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని అరికెల పంచాయతీ పేడరాసుపల్లికి చెందిన మునిస్వామి కుమారుడు రైతు ఆర్.నారాయణ(59) వ్యవసాయ పంటల సాగుకోసం సుమారు ఏడు లక్షల అప్పులు చేశాడు. టమాటాలు, ఇత్తర కూరగాయల పంటలను పండించారు. ప్రస్తుతం టమాటాలకు ధరలు తగ్గిపోవడంతో పంటలకు గిట్టు బాటు లేక తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రైతు తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని దేవులచెరువుకు చెందిన రాము బెంగళూరులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య రెడ్డెమ్మ, కుమారులు వర్షిత్, హర్ష ఉన్నారు. ఏడాదిగా ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం భార్య రెడ్డెమ్మ పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో దేవులచెరువుకు వచ్చి తల్లి రవణమ్మతో ఉంటున్నాడు. భార్య పిల్లలు తనతో లేకపోవడంతో మనస్తాపానికి చెందిన రాము(32) ఊరి బయట ఒక చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుడి అన్న మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ వివరించారు. మండుతున్న కొండలు బి.కొత్తకోట: మండలంలోని కొండలు, గుట్టలకు నిప్పు పెడుతుండటంతో మండుతున్నాయి. సాయంత్రం వేళల్లో పెడుతున్న నిప్పు రాత్రికల్లా విస్త్రృతంగా వ్యాపించి కొండల్లోని చెట్లు, పొదలను దహించి వేస్తున్నాయి. మూడు రోజులుగా కొండలు కాలిపోతున్నాయి. శుక్రవారం రాత్రి చలిమామిడి బీటులోని గట్టుకొండ, దాని అనుబంధ కొండలు మంటల్లో మాడిపోయాయి. ఎగసిపడిన మంటలు, వ్యాపించిన దట్టమైన పొగతో సూరప్పగారిపల్లె, గుమ్మసముద్రం పంచాయతీల్లోని పల్లెలకు పొగ అలుముకొంది. ఈ పొగతో ప్రజలు ఆందోళన చెందారు. శనివారం ఉదయం కూడా కొండలు మండుతూనే ఉన్నాయి. దీనిపై అటవీశాఖ అధికారులు.. ప్రజలు, సరిహద్దు గ్రామస్తులకు అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇలా నిప్పు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సిద్దవటం: మండలంలోని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ ఎస్కేఆర్ నగర్ ఎస్సీ కాలనీలో నివాసమున్న కోటపాటి బాబురాజు(48) లారీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. శుక్రవారం సాయంత్రం ఆయన అధికంగా మద్యం తాగి భార్య శాంతితో గొడవపడ్డాడు. గొడవ పడుతున్న భర్త నుంచి తప్పించుకోవడానికి రహదారిపై ఉన్న సుధాకర్ దుకాణానికి వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తానని చెప్పి.. వెళ్లొచ్చేసరికి భర్త కోటపాటి బాబురాజు ఇంటి తలుపులు మూసివేసి లోపల గదిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతిచెందాడు. మృతుడి భార్య వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తలుపులు పగలగొట్టించి, మృతి చెందిన భర్తను మంచంపై పడుకోబెట్టింది. మేనమామ అయిన పాపయ్యకు సమాచారం అందించింది. విషయాన్ని తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, సిద్దవటం ఎస్ఐ హారిక సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తమ్ముడు విజయ్బాబు ఫిర్యాదు మేరకు శనివారం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర అనుమానాస్పద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
● పశువులకు ఆహారంగా...
గుర్రంకొండ: టమాటా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామాల్లో టమాటా ధరలు గిట్టుబాటు కాక రైతులు కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. పలుచోట్ల టమాటా తోటలు పశువులకు ఆహారంగా మారిపోతున్నాయి. టమాటా ధరలు మార్కెట్లో గత ఎనిమిది రోజులుగా రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధరలు రూ.4 వరకు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 17వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వస్తోంది. టమాటా పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో గిట్టబాటు ధరలు లేక పోవడంతో రైతులు పంటసాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా రాక భారీగా నష్టపోతున్నారు. 17 వేల ఎకరాల్లో ప్రస్తుత పంట దిగుబడి జిల్లాలో ప్రస్తుతం 17వేల ఎకరాల్లో టమాటా దిగుబడి వస్తోంది. ప్రతి ఏడాది ఈసీజన్లో 22వేల నుంచి 28వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వచ్చేది. ఇటీవల కురిసిన వర్షాలకు, వాతావరణంలో సంభవించిన మార్పులతో టమాటా తోటలు కొంత వరకు దెబ్బతిన్నాయి. ఉన్నంతలో ప్రస్తుతం టమాటా పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. నెలరోజుల క్రితం వరకు వైరస్లు, రోగాలు, నల్లమచ్చలతో కుదేలైన టమాటాతోటలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. రోగాలు లేని నాణ్యమైన టమాటాలు మార్కెట్కు వస్తున్నాయి. దీంతో పంట దిగుబడి రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఆశించినంతగా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బయట రాష్ట్రాల్లో దిగుబడి జోరు బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో టమాటా దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో ఇక్కడి టమాటా ధరలు పెరగడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా బయట రాష్ట్రాల్లో టమాటా దిగుబడులు తగ్గుముఖం పడితేనే మన జిల్లా టమాటా ధరలకు రెక్కలొస్తాయి. అయితే, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో పాటు రాయలసీమ జిల్లాల్లో టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో బయట రాష్ట్రాల వ్యాపారులు మన జిల్లాకు రావడం లేదు. దీంతో ఇక్కడి టమాటాలు బయట రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడంతో ధరలు తుగ్గుముఖం పట్టాయి. స్థానిక వ్యాపారులే టమాటాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు. మార్కెట్లో టమాటా ధరలు అత్యధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గించి విక్రయించాలని మార్కెట్ అధికారులను ఆదేశించే ప్రభుత్వం నేడు తమకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతంలో 25 కేజీల టమాటా క్రీట్ ధర రూ. 2500 ఉన్నప్పుడు ప్రభుత్వం మార్కెట్లో ధరలు తగ్గించి రూ.1000కే ప్రజలకు అందించిన దాఖలాలున్నాయి. ఆదేవిధంగా నేడు ధరలు తగ్గుముఖం పడుతున్నందన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించి టమాటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఒక టమటా క్రీట్ ధర రూ. 800 కి ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులంటున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు ఆరుగాలం పండించి సాగు చేసిన టమాటాలు చివరకు పశువులకు ఆహారంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతమనమయ్యాయి. మార్కెట్కు టమాటాలు తీసుకొచ్చి విక్రయిస్తే కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు,జాక్పాట్లు లెక్కిస్తే చేతికి ఒక్క రుపాయి కూడా వచ్చే పరిస్థితి రైతులకు కనిపించడం లేదు. దీనికితోడు మార్కెట్కు తరలించాలంటే వ్యయప్రయాసలు పడాల్సి ఉంది. అలాగే మళ్లీ ఎరువుల వినియోగం, చెట్లకు జనుము దారాలు కట్టడం వంటి పనులకు ఎకరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు చూస్తే ఈ డబ్బు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఉన్న పంటను వదులుకోలేక పంటసాగుకు అదనపు ఖర్చు భరించలేక చివరకు కాయలు కోయ కుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. పలువురు సగం పంట అయిన తరువాత, రెండునుంచి మూడు కోతలు కోసిన రైతులు చేసేదిలేక గొర్రెలు, పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. కాయకష్టం చేసి సాగు చేసిన పంట గిట్టుబాటు ధరలు లేక ఇలా కళ్ల ముందే పశువులకు ఆహారంగా మారిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాతాళానికి పడిపోయిన ధరలు కోయకుండా తోటల్లోనేవదిలేస్తున్న రైతులు మార్కెట్లో కిలో టమాటా రూ.4 కొన్ని చోట్ల పశువులకు ఆహారంగామారుతున్న టమాటాలు బయటరాష్రాల్లో దిగుబడితో తుగ్గుత్ను దరలు -
ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
బి.కొత్తకోట: విద్యాహక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్న్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఒకటవ తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ శనివారం తెలిపారు. ఈ ఉచిత ప్రవేశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించామన్నారు. ఆన్న్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు సహాయంగా జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు.. వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ల సహకారంతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు, ఎయిడ్స్ బాధితుల పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీలు, ఓసీ వర్గాలకు చెంది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల పిల్లలు మార్చి 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎం పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ ఆఫీసర్గా పని చేస్తున్న ఎం.గిరిధర్నాయక్కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 16 సంవత్సరాలుగా ఎన్సీసీ ఆఫీసర్గా ఉత్తమ సేవలు అందించినందుకు ఢిల్లీలోని ఎన్సీసీ విభాగం డీజీ కమండేషన్ కార్డ్ అవార్డు విత్ బ్యాడ్జ్ను ప్రకటించారు. ఈ అవార్డును శనివారం చిత్తూరులోని 35 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ కార్యాలయంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి.మోసిస్ ప్రశంసాపత్రం అందజేశారు. ఆయన్ను పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. మదనపల్లె సిటీ: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల మన్ననలు పొందాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో హోం నందు కడప జోన్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బంది సంక్షేమం, జీఓలు లీడరల్షిప్ క్వాలిటీపై శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా డీపీటీఓ రాము జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్టీసీ అతి పెద్ద సంస్థ అన్నారు.ప్రతి రోజు ప్రయాణికులతో నిత్యం సంబంధాలు ఉంటాయన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తే సంస్థకు మరింత పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.రమణారెడ్డి, జోనల్ అధ్యక్షులు వినోద్బాబు,కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలలోనే శాస్త్రాన్ని నేర్చుకోవడం కాకుండా, తమ దైనందిన జీవితంలో శాసీ్త్రయ సూత్రాలను అమలుచేసేలా శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక బాలాజీనగర్ (తెలుగు) ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలు పరిశీలించారు. ఉత్తమ ప్రదర్శ న కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. -
అడుగడుగునా లోపాలు
జిల్లాలో ఆవులు: 251900 గేదెలు: 100500 పాల ఉత్పత్తి: 12,57,060 లీటర్లు పాలు సేకరిస్తున్న డైరీలు: దొడ్ల, విజయ, తిరుమల, శ్రీజ, సంఘం నాణ్యతప్రమాణాలు పాటించకపోతే చర్యలు జిల్లాలోని అన్ని పాల సేకరణ కేంద్రాలపై పాల నాణ్యతను తనిఖీలు చేయాలని పశువైద్యాధికారులను ఆదేశించాం. ఈనెల 25 నుంచి పరిశీలనలు కొనసాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై ల్యాబ్ పరీక్షల అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – గుణశేఖర్పిళ్లై జిల్లా పశువైద్యాధికారిరాయచోటి: ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగనిదే దినచర్య ప్రారంభించని వారు ఎందరో ఉన్నారు.. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పాల గిన్నె బయటికి తీసి బాగా మరిగించి కాఫీ, టీ, బూస్ట్, హార్లిక్స్ లాంటివి కలుపు కొని సేవిస్తారు. రుచిగా లేకున్నా వేడిగా ఉండటంతో తాగేస్తేంటారు. పసిపిల్లలకు సైతం ఆ పాలనే బుడ్డీలో పోసి తాపిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో పాల నాణ్యత గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే అదనుగా వ్యాపారులు లీటర్ పాలు మూడు లీటర్ల నీళ్లతో కలిపి విక్రయించడం, మిగిలిన వాటిని ఫ్రిజ్లలో భద్రపరచి మరుసటి రోజు.. ఆపై రోజున వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నా వారు దుకాణాలు, హోటళ్లలో తనిఖీలకు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వాటిల్లో కూడా నామమాత్రపు సోదాలతో సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రాజమహేంద్రవరంలో జరిగిన పాల సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ ఇతర అధికారులు దాడులు చేస్తున్నా.. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కొందరు పాలలో నీళ్లు కలిపితే.. మరికొందరు చిక్కదనం కోసం మైదాపిండి, గంజి కలుపుతున్నారు. మార్కెట్లో లభించే తాజా పాలు అన్నది నేతిబీర చందంగా అన్నట్లు ఉంది. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది డైరీలకు పాలు పోస్తున్నారు. కొందరు గ్రామాల్లో దుకాణాలు పెట్టుకుని పాలు విక్రయించే వారికే అమ్ముతున్నారు. మరి కొందరు ఇంటింటికీ వెళ్లి పాలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్నమయ్య జిల్లాలో 12,57,060 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి అయ్యే పాలలో 9.5 లక్షల లీటర్లు డైరీలకు పంపుతున్నారు. మిగిలిన 3.7 లక్షల పాలు గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి వెళ్లి పోస్తున్నారు. పేరున్న డైరీలకు సరఫరా చేసే పాలలో సైతం రోజుల తరబడి నిల్వ ఉండటం, ౖడైరీ నుంచి ప్యాకెట్లలో ఫ్యాట్ లేకుండా అందుతున్నాయి. ఇక ఇళ్లకు వచ్చే వ్యాపారులు నిల్వ చేసుకునేందుకు శాసీ్త్రయ అధునాతన పద్ధతులను అవలంభించడం లేదు. రైతుల నుంచి సేకరించే పాలు రెండు రోజుల పాటు నిల్వ ఉంచుకునేందుకు వంటసోడా, రసాయనాలు వాడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. పాలలో నీళ్లు కలిపినా చిక్కగా ఉండేందుకు పెరుగుగడ్డ కట్టేందుకు మైదాపిండి, గంజి, బియ్యపు పిండిని వాడుతున్నారు. సర్వం కల్తీమయం..మనిషికి ప్రధాన ఆహారాల్లో ఒకటైన పాలు కూడా కాలకూట విషంలాగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన పాలను వ్యాపారులు లాభాల కోసం సేకరించిన రోజు కాకుండా..నిల్వ చేసి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. ఇలా నిల్వ చేసే క్రమంలో శాసీ్త్రయ ప్రమాణాలను పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో విక్రయించే పాలలో 90 శాతం నిల్వ ఉంచినవే కావడం గమనార్హం. స్వచ్ఛత నేతిబీర చందం అధికార, అనధికార డైరీల్లోనూ కల్తీ.. -
పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు
ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లెకు చెందిన జనసేన కార్యకర్త పోతుల హరినాథ్పై కిడ్నాప్, పోక్సో కేసు నమోదైంది. ఆయన మైనర్ బాలికను 19వ తేదీ రాత్రి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. కానీ బాలికను కిడ్నాప్ చేసిన హరినాథ్పై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో బాలిక తండ్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ములకలచెరువు సీఐ వెంకటేషులు, ఎస్ఐ ప్రతాప్ విచారణ చేపట్టి బాలిక, నిందితుడు పోతుల హరినాథ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాలికను ఐదు రోజుల క్రితం బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ వద్ద ఉండగా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తర్వాత తిరుపతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అనంతరం బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ములకలచెరువు పోలీసులు పోతుల హరినాథ్పై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
మదనపల్లెటౌన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఘటనలపై బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. కలకడ మండలం ఎనుగొండపాళ్యం గ్రామం గొల్లపల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు ఆనంద్ (20) బైకులో సొంతపనిపై తరిగొండకు గురువారం రాత్రి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. స్కూటర్లో వస్తుండగా మార్గంమధ్యలోని గుర్రంకొండ మండలం తరిగొండ సమీపంలోని వంకాయలోళ్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వచ్చి చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఆనంద్ను తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని రెఫర్ చేశారు. బస్సు ఢీకొని.. బస్సు ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో జరిగింది. ఇందుకు సంబధించి ఒకటో పట్టణ సీఐ రాజారెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణంలోని వాల్మీకి వీధిలో కాపురం ఉంటున్న రైతు లక్ష్మీనారాయణ(57) కురబలకోట మండలం లోని చింతమాకులపల్లె వద్ద లీజుకు తీసుకున్న అల్లనేరేడు చెట్లకు నీళ్లు కట్టడానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తిగానే తిరిగి ఇంటికి బైకులో బయలు దేరాడు. స్కూటర్ మార్గం మధ్యలోని మదనపల్లె పట్టణం, కదిరి రోడ్డు, మసీదు కాంప్లెక్స్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన శ్రీవారి ప్రయివేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ తెలిపారు. -
రాయచోటిలో కొనసాగుతున్న విజిలెన్స్ దాడులు
రాయచోటి : రాయచోటిలో కూల్డ్రింక్స్, బేకరీ షాపులలో విజిలెన్స్, ఫుడ్సేఫ్టీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారు. శుక్రవారం కాలం చెల్లిన రూ.1.50 లక్షల విలువైన కూల్డ్రింక్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రెండు గోడౌన్లలో కాలం చెల్లిన కూల్డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా గడువు ముగిసిన పానియాలను నిల్వ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వీటిపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ప్రజలు ఏదైనా వస్తువు కొనే ముందు తయారీ, గడువు తేదీలను గమనించాలని అధికారులు సూచించారు. -
రైతు రిజిస్ట్రేషన్కు దూరంగా 51,072 మంది గుర్తింపు
రొంపిచెర్ల : చిత్తూరు జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్కు 51072 మంది రైతులు దూరంగా ఉన్నారని గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. అయన శుక్రవారం రొంపిచెర్ల మండలంలోని బండకిందపల్లెలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలన్నారు. రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ కింద ఏపీఎఫ్ఆర్ రిజిస్టేషన్ చేయాలని సిబ్బందిని అదేశించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న రైతులు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్, అన్నదాత సుఖీభవ, ఆర్థిక ప్రయోజనాలు, సబ్సిడీ ఎరువులు, పని ముట్లు పొందుతారన్నారు. రైతులు సాగు చేసిన పంటలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో పంట సాగు చేసిన రైతులు 3,75,010 మంది ఉండగా వారిలో ఇప్పుటి వరకు 3,57,352 మంది పంట నమోదు జరిగిందన్నారు. రైతు రిజిస్ట్రేషన్ సంఖ్య ద్వారానే అన్ని లావాదేవీలు జరుగుతాయన్నారు. ఎరువుల వాడకంపై రైతుకు అవగాహన కల్పించారు. అఽధిక ఎరువులు వేయడం వలన భూమి దెబ్బ తింటుందన్నారు. క్రిమి సంహారిక మందుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. దీని వలన భూమితోపాటు వ్యవసాయ పంటలు కూడా దెబ్బ తింటాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఏడీఏ శివకుమార్, మండల ఏవో శ్రావణి, డీఏవో కార్యాలయ ఏవో శ్రీకాంత్, ఏఈవో ఖాదర్ వల్లి, వీహెచ్ఏలు తిరుమల, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
6.26 5.13 6.28 5.10 6.28 5.12 6.27 5.10
శనిశ్రీశ్రీ ఆదిశ్రీశ్రీ నిన్ను నమ్మం ‘బాబూ’...అంటున్న తంబళ్లపల్లె టీడీపీ నేతలు అవసరం తీరగానే చంద్రబాబు వెన్నుపోట్లు సీఎం అయ్యేందుకు మద్దతిచ్చిన లక్ష్మీదేవమ్మకే టికెట్ ఇవ్వలేదు వద్దంటున్నా ఆమె తనయుడు ప్రవీణ్కు టికెట్ రాజకీయాలకు దూరంగా ఉన్న శంకర్కు టికెట్ ఇచ్చి 2019లోపగలే చుక్కలు చూపించారు 2024లో ఘోరంగా అవమానించి సాగనంపారు ఇప్పుడు తంబళ్లపల్లె టీడీపీకి దిక్కు లేదని మళ్లీ శంకర్కు గాలం గతంలో పొత్తు పేరుతో బీజేపీ నేతచల్లపల్లెకూ వెన్నుపోటు –IIలో -
గురుకులాల్లో విలువలతో కూడిన విద్య
కేవీపల్లె: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో విలువలతో కూడిన విద్య అందిస్తున్నట్లు డీఈవో సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం మండలంలోని గ్యారంపల్లె ఏపీఆర్జేసీ ఆధ్వర్యంలో మదనపల్లెలో డీఈవో చేతుల మీదుగా 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ గల గ్రామీణ పేద విద్యార్థులకు ఏపీ గురుకుల పాఠశాలలు వరంలాంటివని పేర్కొన్నారు. ఉచిత వసతి, సంరక్షణ, పోషక విలువలతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విలువలతో కూడిన విద్య తోపాటు క్రీడలు, కళలు, ఆరోగ్యం, వినోదం లభిస్తాయని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి తోపాటు 6,7,8వ తరగతిలలో మిగిలిన సీట్లకు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని తరగతులలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్యారంపల్లె ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణాంజనేయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. డీఈవో సుబ్రమణ్యం -
వైభవంగా తిరుచ్చి ఉత్సవం
స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తున్న అధికారులు, భక్తులు, స్వామివారికి శుద్ధితోమాల సేవ నిర్వహిస్తున్న అర్చకులు గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయాన్నే మూలవర్లకు శుద్ధితోమాల సేవ చేపట్టారు. ఆలయంలో స్వామి వారికి ఊంజల్సేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారికి అలంకరణ కావించారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఉత్సవం గ్రామ వీధుల మీదుగా మేళతాళాలు, జానపద కళాకారుల భజనలతో కనుల పండువగా జరిగింది. వైభవంగా స్నపన తిరమంజనం కావించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు పెద్దశేషవాహనంపై కొలువుదీరగా గ్రామ వీధులు మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తుల చేత పూజలు అందుకొన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగ ఐదవ రోజైన శనివారం తిరుచ్చి ఉత్సవం, ఊంజల్సేవ, గజవాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాల బట్టర్ తెలిపారు. -
ఎర్రగుంట్లలో భారీగా నగదు సీజ్
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో నగదు సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ విశ్వనాథరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన గగ్గటూరు ఇబ్రహీం, బోదనం అమీర్బాలు అనే స్నేహితులు ప్రొద్దుటూరులోని బంగారు వ్యాపారి మీరావలి వద్ద గుమస్తాలుగా పని చేస్తున్నారు. బంగారు వ్యాపారి మీరావలికి స్నేహితుడు శంకర్నారాయణ ఉన్నాడు. మీరావలి తన వద్ద ఉన్న 1.5 కిలోల బంగారును శంకర్నారాయణకు ఇచ్చి, తన గుమస్తాలు అమీర్బాబు, ఇబ్రహీంతో కలిసి గుంతకల్లుకు వెళ్లి అమ్మి వచ్చిన డబ్బులు తీసుకుని రావాలని చెప్పి పంపించారు. దీంతో డ్రైవర్ ఇబ్రహీం తన బావ రసూల్కు చెందిన ఏపీ 39ఎల్ఎస్ 0432 కారులో బంగారు తీసుకుని గుంతకల్లుకు ఇబ్రహీం, అమీర్బాబు, శంకర్ నారాయణ బయలు దేరారు. గుంతకల్లులో శంకర్నారాయణ బంగారు అమ్మి రూ.2.52 కోట్లు నగదు తెచ్చి కారులోని వెనుక భాగాన బండిల్స్ ఉంచారు. తర్వాత అక్కడి నుంచి కారులో వస్తుండగా గుంతకల్లు నుంచి ఐదు కిలోమీటర్లు రాగానే శంకర్నారాయణ కారు దిగి వెళ్లారు. అక్కడి నుంచి అమీర్బాబు, ఇబ్రహీం కారులో నగుదు తీసుకుని వస్తున్నారు. ఎర్రగుంట్ల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో వాహనాలు సీఐ, ఎస్ఐ నాగమురళి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారును వారు వెనక్కి తిప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా రూ.500 నోట్ల కట్టలు ఐదు బండిల్స్, రూ.200 నోట్ల కట్టలు ఒక బండిల్ బయటపడింది. ఈ మొత్తాన్ని పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో మిషన్ ద్వారా లెక్కించగా మొత్తం రూ.2.52 కోట్లుగా తేలింది. ఇందుకు సంబంధించిన లావాదేవీలకు ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో నగదుతోపాటు కారును సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
పింఛన్ అందించి ఆదుకోవాలి
నాకు కాళ్లు, చేతులు పనిచేయవు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాను.పెన్షన్ కోసం రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వం తనకు పింఛన్ అందించి ఆదుకోవాలి. –భూమిరెడ్డి, మట్టివారిపల్లె, కురుబలకోట మండలం సదరం సర్టిఫికెట్ ఉన్నా.. మూడేళ్ల క్రితం ప్రమాదంలో గాయపడ్డాను. సద రం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అధికారులు పెన్షన్ మంజూరు చేయడం లేదు. భార్య అలివేలు కష్టంతో ఇంటిని పోషించుకుంటూ వస్తోంది. అధికారులు వెబ్సైట్ ఓపెన్ కాలేదని, వచ్చాక చూద్దాం అంటున్నారు. అప్పటిదాకా ఎలా బతకాలో అర్థం కావడం లేదు. –బాబు, భవన నిర్మాణ కార్మికుడు, రాయచోటి -
ఆస్తి కోసం ఘర్షణ
మదనపల్లెటౌన్: మదనపల్లెలోని ఇందిరా నగర్లో ఆస్తి కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు పాల్పడ్డాయి. శుక్రవారం జరిగిన ఘటనపై బాధితులు టూ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ఇందిరా నగర్కు చెందిన వేములయ్యకు కుమారులు సత్యనారాయణ, రామనారాయణ ఉన్నారు. వేములయ్య రామనారాయణ వద్ద ఉండగా ఆయన భార్య సిద్దమ్మ మరో కుమారుడి దగ్గర ఉంటోంది. దంపతుల మధ్య వివాదం ఉండడంతో ఆస్తుల విషయమై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సిద్దమ్మ ఓ ఊరికి వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన వేములయ్య, రామనారాయణ ఇందిరానగర్లో ఉన్న సోదరుడి ఇంటిపైకి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని గొడవకు దిగారు. గడ్డపార్లతో ఇల్లు ధ్వంసం చేసే యత్నం చేయగా బాధితులు 112కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని తెలుసుకున్న టూటౌన్ పోలీసులు వచ్చి వారందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. – ఆధార్ పేరుతో బంగారంతో ఉడాయింపు బి.కొత్తకోట: మోసాలు చేసేందుకు దొంగలు కొత్త ఎత్తుగడలను ఎంచుకుంటున్నారు. ఇందులో నిత్యవసరాలు అందుతున్నాయా, దీనికి ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పి మోసగించిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు.. ఇందిరమ్మ కాలనీలో ఆదిలక్ష్మి(70), కృష్ణారెడ్డి దంపతులు కాపురం ఉంటున్నారు. కష్ణారెడ్డి ఆవులు మేపేందుకు వెళ్లగా ఆదిలక్ష్మి ఇంటి వద్దనే ఉంది. శుక్రవారం ఉదయం ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వచ్చారు. ఇంటి వద్ద నిలబడి ఉన్న ఆదిలక్ష్మితో ఆమె పేరు అడిగి, బియ్యం వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్పి, వేలిముద్రలు తీసుకోవాలని చెప్పగా ఆమె ఆధార్ కార్డు కోసం ఇంటి లోపలికి వెళ్లింది. ఆమెతోపాటే ఇంటిలోకి వెళ్లి ఫొటో తీసుకోవాలని చెప్పగా వారు మోసగాళ్లని తెలియక అంగీకరించింది. దాంతో దుండగులు ఫొటోకి మెడలోని తాళిబొట్టు ఉంటే బియ్యం ఇవ్వరని, మెడలోంచి తీసేయాలని చెప్పగా ఆమె తీసి ఒక కవర్లో పక్కన పెట్టింది. ఇద్దరిలో ఒకరు ఫొటో తీస్తుండగా మరొకొరు కవర్లో పెట్టిన బంగారు గొలుసును ఆమెకు తెలియకుండా తీసుకొని పరారయ్యారు. మోసపోయినట్టు గుర్తించిన ఆదిలక్ష్మి కోడలు, కొడుకుకు, కాలనీ వాసులకు చెప్పడంతో అందరూ కలిసి దుండగులు కోసం గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 45 గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన వారిపై బాధితురాలు ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పులికోన వంక వద్ద క్షుద్రపూజ కలకలం చౌడేపల్లె : మండలంలోని ఆమినిగుంట పంచాయతీ పులికోనవంక గ్రామానికి వెళ్లే మార్గంలో క్షుద్రపూజ కలకలం రేపింది. రోడ్డు మధ్యలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గుపోసి, పూలు చల్లి, నిమ్మపండుకోసి, తాంబూలం పెట్టి అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లి తాంత్రిక శక్తి పూజలు చేసినట్లు ప్రజలు శుక్రవారం గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడూ లేని విధంగా రోడ్డుపై క్షుద్ర పూజ చేయడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రులకు ఆందోళనకు గురవుతున్నారు. అటువైపు వెళ్లేందుకు సైతం జనం భయపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి, బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘా పెంచండి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లెటౌన్: మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, జీరో టోలరెన్స్తో కలిపి వినియోగించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ ధీరజ్తో కలసి పోలీస్, రెవిన్యూ, విద్య, వైద్య, ఎకై ్సజ్ అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ కమిటితో సమావేశశం జరిగింది. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలపై చేపడుతున్న కార్యక్రమాలు, డ్రోన్లను వినియోగించి చేపట్టిన దాడులు, నమోదైన కేసులు, ఆరువందలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 1972 టోల్ ఫ్రీ నంబర్కు గంజా, కూల్ లిప్స్, మాదక ద్రావ్యాల వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే సమాచారం ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక జిల్లా ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని ఎస్హెచ్ఓలు ఈగల్ క్లబ్ సభ్యులు, ఎన్జీవోలు, పోలీస్ శాఖతో కలసి డ్రగ్స్ వద్దుబ్రో..కార్యక్రమంపై గోడపత్రికలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆవిష్కరించారు. దేశ అభివృద్ధికి జనగణన గణాంకాలు బలమైన పునాది మదనపల్లె రూరల్: దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది అని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన 2026 జనగణన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులకు జనగణన దశ–1, గృహ జాబితా, గృహగణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు, కచ్చితమైన,పారదర్శక సమాచార సేకరణ అవసరమన్నారు. వీటితోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ భరత్కుమార్, డీపీఓ రాధమ్మ పాల్గొన్నారు. -
కోతల నాయుడు
చేతుల్లో మోసకొస్తున్న యువతి పేరు అస్మా. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. పింఛన్కు అన్ని విధా ల అర్హురా లిగా ఉన్నప్పటికీ అందడం లేదు. పలుమార్లు ప్రభుత్వ అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. ప్రభుత్వం తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత యువతి కోరుతోంది. వృద్ధాప్య పింఛన్లు – 1,03,276 వితంతువు పింఛన్లు – 44,677 దివ్యాంగ పింఛన్లు – 22,857 అభయహస్తం పింఛన్లు – 6,024 చేనేత పింఛన్లు – 2,999 డప్పు కళాకారుల పింఛన్లు – 2,356 ఒంటరి మహిళల పింఛన్లు – 4,465 పెరాలసిస్ పింఛన్లు – 1,002 ట్రాన్స్జెండర్ల పింఛన్లు – 74 సీఎం చంద్రబాబునాయుడువి అన్నీ కోతలే. మాటల్లో కోతలు... చేతల్లో కోతలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛనూ మంజూరు చేయకపోగా.. ఉన్నవికూడా కోత కోసి కోతల‘నాయుడ’ని నిరూపించారు. దివ్యాంగులపై దయ లేదు. వృద్ధులపై కనికరమన్నదే లేదు..అవును.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుకు‘పింఛన్’ఇద్దామనే ‘సామాజిక’స్పృహే లేదు.. బాబు సర్కారు కొలువుదీరాక ఒక్క పింఛన్ ఇవ్వక పోవడమే దీనికి నిదర్శనం. సాక్షి అన్నమయ్య: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. బాబు సర్కార్ కొలువుదీరి 20 నెలలు దాటినా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకే మోక్షం దక్కలేదు. జిల్లాలో 1,94,168 పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వంలో మంజూరైనవే. కొత్తగా అర్హత కలిగిన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితోపాటు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పింఛన్ల కోసం ఆశగా చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అర్హులైన పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం వెబ్సైట్ తెరవకపోవడంతో అర్హులైన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తెరుచుకోని వెబ్సైట్ చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి జూన్కు సరిగ్గా రెండేళ్లు అవుతుంది. అయితే ఇప్పటివరకు పింఛన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు తెరుచుకోలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్నా వీలు పడటం లేదు. ఇప్పటికే జిల్లాలో సుమారు 10 వేల మంది వరకు దరఖాస్తు దారులు ఎదురుచూస్తున్నారు. ఏదీ మానవత్వం జిల్లాలో ప్రతి సోమవారం మదనపల్లెలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పండుటాకులు, దివ్యాంగులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీకొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. సదరం సర్టిఫికెట్లు చేతబూని పదేపదే తిరుగుతున్నా అయ్యో పాపం అనేవారు లేరు. పండుటాకులు కూడా మాకు పింఛన్ ఇవ్వండి మహాప్రభో అంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులు అప్పటికప్పుడు ఓదార్చి పంపుతున్నారు తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పండుటాకులు, దివ్యాంగుల పట్ల అప్పటికప్పుడు మానవత్వంతో కొత్త పింఛన్ రూపంలో సాయం చేసే పరిస్థితి లేకపోవడం బాఽధితులను కృంగ దీస్తోంది. జిల్లాలో పింఛన్ల వివరాలు ఒక్క కొత్త పింఛనూ ఇవ్వని కూటమి సర్కారు..పైగా పింఛన్ల కోతలు నేటికి అందుబాటులోకి రానిప్రభుత్వ వెబ్సైట్ అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులు టీడీపీ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మదనపల్లె రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యం అందించే వైద్యులు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్.వెంకటలక్ష్మయ్య తెలిపారు. గురువారం మదనపల్లె డివిజన్ పరిధిలోని అంగళ్లు, సీటీఎం పశువైద్యశాలను డీడీ రసూల్, ఏడీ రోహిణితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మదనపల్లె డీడీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంగళ్లు పశువైద్యులు సెలవులో ఉన్నట్లు డీడీ రసూల్ తెలిపారన్నారు. తర్వాత సీటీఎం పశువైద్యశాలను పరిశీలిస్తే నిర్వహణ లోపాలు కనిపించాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్కు లేఖ రాశామన్నారు. సీటీఎం డాక్టర్పై ఏడాదికాలంగా వస్తున్న ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపామన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు డాక్టర్ గౌరవ కరస్పాండెంట్గా పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో వైద్యుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీడీ రసూల్కు సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ఇతరత్రా ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. డివిజన్లోని అన్ని పశువైద్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో పాడి రైతులకు సేవలు అందించాలన్నారు. -
ఘర్షణలో గాయపడిన వృద్ధుడు మృతి
మదనపల్లిటౌన్ : బి కొత్తకోట మండలం రంగనాథపురంలో ఈనెల 21రాత్రి జరిగిన ఘర్షణలో గాయపడిన వృద్ధుడు కృష్ణప్ప గురువారం రాత్రి మృతి చెందాడు. బి కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని గోళ్ళతోపు పంచాయతీ రంగనాథపురానికి చెందిన వేడుక కృష్ణప్ప (70) అతని భార్య కృష్ణమ్మ (65) లు గొర్రెలు తోలుకొని వీధి గుండా వెళుతుండగా తిమ్మారెడ్డి, బాబురెడ్డి, అనసూయ, అరుణ, నారాయణమ్మ తదితరులు కర్రలతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణప్పకు మదనపల్లెలో చికిత్స చేయించి, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు. -
కల్పవృక్ష వాహనంపై నారసింహుడి రాజసం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్పవృక్ష వాహనంపై విహరించారు. స్వామి వారి బ్రహోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం వేకువ జామున మూలవర్లకు తోమాల సేవ నిర్వహించారు. వాహనమండపంలో వాహనాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి గ్రామపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. బ్రహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన శుక్రవారం పెద్దశేషవాహన సేవ ఉంటుందని ఆలయఅర్చకలు గోపాలభట్టర్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్కు తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : విద్యుదాఘాతంలో ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం, బురకాయలకోట గ్రామానికి చెందిన షేక్ షావల్లి (25), బి.కొత్తకోట మండలంలోని మద్దూరువాండ్లపల్లెలో ఓ ఇంటికి వైరింగ్ చేయడానికి గురువారం ఉదయం వెళ్లాడు. బిల్డింగ్ వద్ద పనులు చేసే క్రమంలో మూత్ర విచర్జన కోసం, ఇంటికి సమీపంలోని చెట్ల చాటకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ వైర్లు షేక్ షావల్లి తలకు తగలడంతో షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కేకలు విన్న ఇంటి యజమాని చౌడప్ప వెంటనే వెళ్లి విద్యుత్ వైర్లను తప్పించాడు. మంటలు వ్యాపిస్తుండగా చల్లార్చి కారులో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లాని సలహా ఇచ్చారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగిస్తాం
మదనపల్లె రూరల్ : పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే డిమాండ్తో అంగన్వాడీలు చేస్తున్న రిలేదీక్షలు గురువారానికి నాలుగోరోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని అమ్మచెరువుమిట్ట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. వేతనం పెంచే వరకు పోరాటం కొనసాగిస్తామని, అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అన్నమయ్యజిల్లా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు మధురవాణి మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని ప్రతిపక్షనాయకుడి హోదాలో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆరేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు అలాగే ఉన్నాయని, దీంతో తాము కష్టాలు పడుతున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై ఉదాసీనంగా ఉండటం వల్లే రిలే నిరాహారదీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ అమలుకు నిబంధనలు రూపొందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. మేనెల అంతా వేసవి సెలవుల జీఓ ఇస్తూ, లబ్దిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలన్నారు. మెనూ చార్జీలు పెంచి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేసి, పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి గంగాదేవి, సభ్యులు శ్యామల, విజయలక్ష్మి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.నాలుగోరోజుకు చేరుకున్న అంగన్వాడీల రిలేదీక్షలు -
హత్యకేసులో నిందితులు అరెస్టు
రాయచోటి టౌన్ : గాలివీడులో జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్సీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు. గురువారం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలివీడు మండలం వడిశలంకపల్లె గ్రామం గోరా న్ చెరువుకు చెందిన గుర్రం రామకృష్ణారెడ్డి (డీలర్ రామకృష్ణారెడ్డి) ఈ నెల 17న మామిడి తోటలో హత్యకు గురయ్యాడు.ఈ కేసులో నిందితులు గుర్రం మహేశ్వరరెడ్డి, తెల్లాకుల కుళాయప్ప, కర్ణ బ్రహ్మ పెద్దారెడ్డి, యక్కంటి తిరుపతిరెడ్డి, గుర్రం విశ్వనాథరెడ్డిలను డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు రాయచోటి : అన్నమయ్య జిల్లా, రాయచోటి పరిధిలోని మిల్క్ ప్రొడక్ట్ కేంద్రాలపై రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేప్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. గురువారం కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు కడప విజిలెన్స్, ఫుడ్ సేప్టీ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. విజయ మిల్క్ చిల్లింగ్ సెంటర్, శ్రీ లక్ష్మీ వెంకటేస్వర మిల్క్ కలెక్షన్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ విభాగం ఇన్స్పెక్టర్లు శివన్న, శ్రీనివాసులు రెడ్డి, డీసీటీఓలు గీతావాణి, బాబు మోసెస్, రాయచోటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం చైన్నెలోని ప్రయోగశాలకు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చిన అనంతరం కల్తీలాంటి నమూనాలు రుజువైతే తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. రాయచోటి పట్టణంలో పలు ప్రాంతాలలో జరుగుతున్న పాల విక్రయాలపై ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు చేశారు. వేగవంతంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడంతో ఏర్పాట్లలో వేగం పెంచాలని టీటీడీ సివిల్ విభాగం ఈఈ సుమతి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట రామాలయం, సీతారాముల కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ సివిల్ విభా గం అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయం ఆవరణలో జరుగుతున్న తాత్కాలిక నిత్యాన్నదానం ఏర్పాట్లు, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. మహిళ ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం : పేడ రంగు దావ్రణం తాగి కరుమురు సుబ్బలక్షుమ్మ (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన సుబ్బరాయుడు, సుబ్బలక్షుమ్మ దంపతులు బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం కిడ్నీ దెబ్బతినడంతో సుబ్బరాయుడు పనికి వెళ్లడం లేదు. ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆయన భార్య సుబ్బలక్షుమ్మ మోకాళ్ల నొప్పులు, గ్యాస్ ట్రబుల్, ఆయాసం సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూపించినా ఆమెకు ఉపశమనం లభించలేదు. ఆ క్రమంలో 25న అర్దరాత్రి దాటిన తర్వాత సుబ్బలక్షుమ్మ పేడ రంగు పొడిని నీళ్లలో కలుపుకొని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం మృతి చెందింది. -
సంప్రదాయ బద్ధ్దంగా పెద్దూరు దేవరెద్దు ఎంపిక
● కాపువాని కుంటలో ఎంపిక పూజలు చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం చెంత పూజలందుకొనేందుకు సాంప్రదాయబద్ధంగా గురువారం దేవరెద్దు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గతనెల 23వ తేదీన పెద్దూరుకు చెందిన దేవరెద్దు అనారోగ్యానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్థానంలోకి కొత్త దేవరెద్దు ఎంపిక ప్రక్రియను కాపువానికుంట చెర్వులో హిందూ సాంప్రదాయ రీతిలో చేపట్టారు. ముందుగానే గ్రామస్తుల తీర్మానం మేరకు నిర్ణీత సమయానికి దిగువపల్లె పంచాయతీ పరిధిలోని పెద్దూరు, గాజులవారిపల్లె, మోట్లపల్లె, దేవిరెడ్డి చెరువు గ్రామాల్లో గల ఆవులు, కోడె దూడలను తోలుకొచ్చారు. అక్కడ గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు కలిసి అరటిఆకులో బియ్యం, బెల్లం, పప్పులు, సర్వశుద్ధి వేసి పళ్లెంను పెట్టి ఆవులు, దూడల మందను తోలడం ఆనవాయితీ , ఆ పళ్ళెంలోని పదార్థములను ఆవు, దూడ తింటే ఆ దూడను దేవరెద్దుగా ఎంపిక చేస్తూ తీర్మానించడం సంప్రదాయం. అదే తరహాలో మోట్లపల్లెకు చెందిన రెడ్డివారి కృష్ణప్ప ఆవు, దూడ పళ్లెంలోని పదార్థములు తినడంతో ఆ దూడను పెద్దూరు దేవరెద్దుగా ప్రకటించి పూజలు చేశారు. -
సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి
నిమ్మనపల్లె : స్వర్ణ గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా అధికారి లక్ష్మీపతి అన్నారు. గురువారం ఆయన మండలంలోని రెడ్డివారిపల్లె సచివాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న వివిధ రకాల సర్వేల కు సంబంధించిన ప్రగతి వివరాలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సచివాలయ ఉద్యోగుల పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. చెత్త సేకరణతో పాటు, స్వర్ణ గ్రామ సచివాలయాల పనితీరుపై వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్ లో మెరుగైన పనితీరు కనపరచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే తగిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మీపతి యాదవ్, పంచాయతీ అభివృద్ధి అధికారి గాయత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సైక్లింగ్ పోటీలు వాయిదామదనపల్లె సిటీ : రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ సైక్లింగ్ పోటీలు వాయిదా వేసినట్లు డీఎస్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. రాస్ట్ర స్థాయి పోటీలు ఈనెల 28 నుంచి మార్చి 1వతేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించాల్సి ఉండగా వార్షిక పబ్లిక్ పరీక్షల దృష్ట్యా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పోటీలు ఏప్రిల్ 4,5 తేదీల్లో జరుగుతాయన్నారు. క్రీడాకారులు, కోచ్లు, సంబంధిత ఽఅధికారులు గమనించి సవరించిన తేదీల ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
ఆపరేషన్ వజ్రపహార్ విస్పోటనం
● చౌడేపల్లెలో రూ.24లక్షల కూల్ లిప్స్ సీజ్ ● రికార్డులు లేని 28 బైకులు సీజ్మదనపల్లెటౌన్: అన్నమయ్య జిల్లా పోలీసులు వజ్రపహార్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ అడ్మిన్ వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా చౌడేపల్లెలో రూ.24లక్షల ఖరీదు చేసే కూల్ లిప్స్ దుకాణాల్లో పట్టుబడినట్లు తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనుక ఉన్న నెట్ వర్క్ను ఛేదించడానికి ఇది ఒక కీలక ముందడుగు అన్నారు. మదనపల్లెలో కార్డన్ అండ్ సర్చ్ మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెలోని కాట్లాటపల్లిరోడ్డు, రామిరెడ్డి లే ఔట్ ప్రాంతాల్లో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో 150మంది పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సరిగాలేని 28వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. స్థానికంగా వివిధ కేసుల్లో ఉండే రౌడీషీటర్లు, సస్పెక్టులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్, నిషేధిత పొగాకు ఉత్పత్తుల సరఫరాలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల సమీపంలో ఉన్న దుకాణాలపై నిఘా పెట్టామన్నారు. ప్రజలు సమాచారం ఇస్తే వారి విరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు. నాలుగు కూల్ లిప్స్ కేసులు నమోదు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వాల్మీకీపురం, రాయచోటి, చౌడేపల్లెలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.24లక్షల విలువచేసే కూల్ లిప్ .. టొబాకో ప్రోడక్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. కూల్ లిప్ ప్యాకెట్లు చిన్నవిగా ఉండి నోట్లో పెట్టుకుంటే నిమిషాల్గో కరిగిపోయి మత్తు ఇస్తాయని తెలిపారు. యువత కూల్ లిప్ కు అలవాటుపడిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నట్లు చెప్పారు. అందుకే హర్యానా ప్రభుత్వానికి కూడా ఈగల్ టీం సహకారంతో లేఖ రాశామన్నారు. కూల్ లిప్ వ్యాపారులపై 7,8 రెడ్విత్20 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన, మదనపల్లె, చౌడేపల్లె, ఈగల్ టీం సీఐ రాజారెడ్డి, మహ్మద్ రఫీ, ఎస్లు నరసింహుడు, నాగేశ్వరరావు, రహీముల్లాలను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. -
బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10న చలో ఢిల్లీ
మదనపల్లె రూరల్ : మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణ కోసం మార్చి 10 చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బిక్ఖు సంఘం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ఉమ్మడి కమిటీ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమ ప్రచారంలో భాగంగా గురువారం మదనపల్లెకు వచ్చిన ఆయన ప్రైవేట్ గెస్ట్హౌస్లో బౌద్ధసంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారతీయ అంబేడ్కర్ సేన(బాస్) వ్యవస్థాపకులు పీటీఎం.శివప్రసాద్తో కలిసి చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మదనపల్లె బుద్ధునికొండలో కొందరు దుండగులు బుద్ధుని విగ్రహాలకు తలలు ధ్వంసం చేస్తుంటే ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. బుద్ధ విగ్రహాల విధ్వంసం, బౌద్ధులపై వేధింపులు, బుద్ధునికొండపై నిషేధాజ్ఞలను తీవ్రంగా ఖండించారు. బుద్ధునికొండ అమానుషంపై ఢిల్లీ వేదికగా తీవ్రంగా నిరసన తెలిపేందుకు బౌద్ధులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. బౌద్ధ ఉపాసక పీటీయం.శివప్రసాద్ మాట్లాడుతూ...రాష్ట్రంలో బౌద్ధంపై ద్వేషం ఎక్కువైందని, బుద్ధ విహారాలకు, బౌద్ధ విశ్వాసులకు రక్షణ కరువైందని ఆరోపించారు. 21 సంవత్సరాలుగా బుద్ధునికొండలో బుద్ధవిహార నిర్వహిస్తున్నామని, నాలుగేళ్లుగా మూడు విగ్రహాలకు తలలు తొలగించి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ఘటనపై గత ఏడాది జూలై 2న తాము ఫిర్యాదుచేస్తే, బాధితులమైన తమతో అధికారులకు నిర్దయగా ప్రవర్తిస్తూ, నిందితులకు కొమ్ముకాస్తూ, తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేశారన్నారు. తమ ఆవేదన తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోగా, బెదిరింపులకు పాల్పడుతూ, అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చామని, అక్కడ నిరసన తెలపడం ద్వారా బౌద్ధుల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో వీసీకే, బాస్ ప్రతినిధులు వై.గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, సొన్నికంటి రెడ్డెప్ప, జీ.వి.రమణ, జి.గంగులప్ప, జనార్ధన్, రవిశంకర్, నారాయణ, శ్రీనివాసులు, మోహన తదితరులు పాల్గొన్నారు. -
చింత చెట్టుపై నుంచి పడి కార్మికుడు మృతి
మదనపల్లెటౌన్ : చింత చెట్టుపై నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎరబల్లి పంచాయతి, సిగన్నగారిపల్లెకు చెందిన పూజారి శ్రీనివాసులు కుమారుడు రామచంద్ర, అలియాన్ చంద్రు (35)భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ..తల్లిదండ్రులు, భార్య ఇద్దరు పిల్లలను ఫోషించుకుంటున్నాడు. ఉదయం ఊరికి సమంలోని చింత చెట్టెక్కి చింత కాయలు కోస్తుండగా, ప్రమాద వశాత్తు చెట్టుపై నుంచి కింద పడి అక్కడి కక్కడే మృతి చెందాడు. ముదివేడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంగజాతరకు ఏర్పాట్లుపుంగనూరు: జమీందారుల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మార్చి 10, 11 తేదీల్లో జరగనుంది. ఇందు కోసం గురువారం మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కమిషనర్ మధుసూదన్రెడ్డి, సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్యాలెస్ ప్రాంతాన్ని పరిశీలించారు.భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు జాతర ఏర్పాట్ల కోసం రూ.10లక్షలను కేటాయించినట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పండ్లతోటల పెంపకంపై ఆసక్తి చూపాలి కేవీపల్లె : జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల పెంపకంపై రైతులు ఆసక్తి చూపాలని పీడీ వెంకటరత్నం అన్నారు. గురువారం మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఉపాధిలో సాగు చేసిన మామిడి చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే మినీ గోకులం షెడ్లు ఉపాధిలో నిర్మించుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉపాధి సిబ్బంది రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ ఉపాధిలో పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో నాగరాజ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ప్రేమికుడి ఆత్మహత్యచంద్రగిరి : తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఆర్ఆఫ్ రోడ్డులో విషాదం నెలకొంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సాధిక్(25) అనే యువకుడు గురువారం తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది. ఈ మూడు రోజులలో వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆయన కలిశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ‘నేనున్నా’నంటూ కార్యకర్తలకు ధైర్యం కల్పించారు. రాబోయే రోజులలో మన ప్రభుత్వం ఏర్పడి మరలా మంచి రోజులు వస్తాయని పార్టీ కేడర్లో ధైర్యం నింపారు.నెల్లూరుకు పయనం: పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో భాకరాపురంలోని హెలీఫ్యాడ్ నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు వీడ్కోలు పలికారు.పర్యటన విజయవంతం: మూడు రోజుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. రెండో రోజు బుదవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. -
ముత్యాల పందిరిలో మురిపించిన నృసింహుడు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనృరసింహస్వామి ముత్యపు పందిరి వాహనంపై విహరించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయాన్నే స్వామివార్లకు తిరుచ్చి, శుద్ధి తోమాలసేవ, ఏకాంతసేవలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం కావించి ఊంజల్సేవ జరిపారు. వాహన మండపంలో వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి గ్రామపుర వీధుల్లో విహరించారు. అనంతరం హనుమంత వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో కేరళ వాయిద్యాలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. వీటితోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భజన కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకొన్నాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ, సాయంత్రం సింహవాహనం సేవ జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. -
ఎఫ్పీఓల బలోపేతానికి నైపుణ్య శిక్షణ
సమావేశంలో మాట్లాడుతున్న మహితశిక్షణలో పాల్గొన్న జిల్లాల డిపిఎంలు, ఎంపీఎంలుబి.కొత్తకోట: రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తమంతట తాము ఏ విధంగా సుస్థిరత సాధించాలి, ఆర్థికంగా ఎలా బలోపేతం కావాలన్న లక్ష్యంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సెర్ప్ అదనపు డైరెక్టర్ మహిత అన్నారు. బుధవారం మండలంలోని హార్సిలీహిల్స్పై తొలిరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా రైతుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రైతులంతా సంఘటితమై, తమసంస్థలను తామే నడుపుకునే స్థాయికి రావాలన్నారు. ఇందులో భాగంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను మెరుగు పరచడానికి సెర్ప్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు మాట్లడుతూ శిక్షణా కార్యక్రమం లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఎఫ్ పీఓలను బలోపేతం చేసేలా సెర్ఫ్ సిబ్బంది సహకరించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాని నిర్వహించిన డిజిటల్ గ్రీన్ ప్రతినిఽధి సురేందర్ శిక్షణా కార్యక్రమంలో రైతుల అవసరాలను ఎలా గుర్తించాలి, వ్యాపార ప్రణాళికలు ఏవిధంగా రూపొందించుకోవాలి, దాని అమలు చేసే విధానాలు, వివిధరకాల వ్యాపార నమూనాల గురించి చర్చించి అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకోవాలని వివరించారు. ఎఫ్ పీఓల అభివృద్దికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారీపై సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని సెర్ప్ డిజిటల్ గ్రీన్, వాసన్ సంస్థల ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి అన్నిజిల్లాల డీపీఎ(జీవనోపాధులు), ఎంపీఎం ఫార్మ్లు పాల్గొని ఎఫ్ పీఓలను బలోపేతం చేయడానికి కల మార్గాలపై చర్చించారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసులు, సెర్ఫ్ ఏడీ లైవ్ స్టాక్ శ్రీ కులశేఖర్ , డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రతినిధి సురేందర్ పాల్గొన్నారు.సెర్ప్ అదనపు డైరెక్టర్ మహిత -
వాహనం ఢీకొని జింక మృతి
మదనపల్లెటౌన్ : స్థానిక బెంగళూరు రోడ్డులోని రెడీ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఓ వాహనం ఢీకొనడంతో జింక మృతిచెందింది. కళేబరాన్ని స్థానిక పశు వైద్య కేంద్రానికి తీసుకు రాగా ఏడీ రోహిణి పోస్టుమార్టం నిర్వహించారు. జింక కళేబరాన్ని మాదినికొండ అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు తెలిపారు. విష ప్రయోగం : 20కోళ్లు మృతి చౌడేపల్లె : మండలంలోని చారాల కు చెందిన కుళ్లాయి వెంకటరమణ కు చెందిన పెంపుడుకోళ్లపై బుధవారం విషప్రయోగం చేయడంతో 20 కోళ్లు మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. తనపై వ్యక్తిగత కక్షల కారణంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కొందరిపై ఆరోపించారు. మృతిచెందిన కోళ్ల విలువ సుమారు రూ:8 వేలు ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాధు చేసినట్లు చెప్పారు. నిషేధిత గుట్కా స్వాధీనం చౌడేపల్లె: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలైన గుట్కా,హాన్స్ బయ్యపల్లెకు చెందిన ఓ వ్యక్తి దర్జాగా విక్రయిస్తున్నాడు. స్టాకు నిల్వకోసం ఏకంగా గ్రామీణ ప్రాంతంలో గోదాం ఏర్పాటు చేసిన ఘటన మండలంలోని 29ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యపల్లెలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈప్రాంతంనుంచి పలు ప్రాంతాలకు నిషేధిత వస్తువులను ఆర్డర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. గోదాంలో గుట్కా ఉన్నట్లు గుర్తించారు. నిషేధిత గుట్కాను, దీనిని తరలించే టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐ చిన్నరెడ్డప్పను వివరణ కోరగా స్టాకు విక్రయించరాదని నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. కేసు నమోదు అంశంపై ఆరా తీయగా విచారణ చేస్తున్నామని, వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. నీటి తొట్టెలో పడిపోయిన ఆవు పుంగనూరు: పట్టణంలోని కోనేటిపాళెంలో బుధవారం పాడి ఆవు 15 అడుగుల లోతు గల నీటి సంపులో పడిపోయింది. గమనించిన యజమాని మనోజ్కుమార్ వెంటనే అగ్నిమాపకశాఖాధికారి సుబ్బరాజుకు ఫిర్యాదు చేశారు. ఆయన సిబ్బందితో వెళ్లి పాడి ఆవును బయటకు తీశారు. -
డెయిరీలపై అధికారుల దాడులు
మదనపల్లెటౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని డెయిరీలపై ఆహార భద్రత అధికారులు బుధవారం దాడులు జరిపారు. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీపాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇక్కడ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక బెంగుళూరు రోడ్డు, సీటీఎం రోడ్డు, ఇసుకనూతిపల్లెల వద్ద ఉన్న పాల డెయిరీలపై దాడులు జరిపి పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్కు పంపించామని అన్నమయ్య జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐదుగురు కోడిపందెం రాయుళ్ల అరెస్టు మదనపల్లెటౌన్ : కోడి పందెం ఆడుతున్న ఐదుగురిని మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టుచేశారు.బుధవారం ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని సీటీఎం గ్రామం, ఆంజనేయ స్వామి గుడికి సమీపంలో కోడి పందెం ఆడుతున్నట్లు సీఐ కళా వెంకటరమణకు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి కోడి పందెం స్థావరంపై దాడులు జరపగా.. ఐదుగురు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు పందెం కోళ్లు, రూ.4 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ బదిలీ కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్ సీఈఓ సి.ఓబుళమ్మను బదిలీ చేస్తూ బుధవారం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ జీఓఆర్టీ నం.118 విడుదల చేసింది. డీడీఓ హోదా కలిగిన ఆమె ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. ఆమెను అనంతపురం యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్టుమెంట్ రీజినల్ డైరెక్టర్గా డిప్యూటేషన్పైన నియమించారు. బద్వేలులో చోరీబద్వేలు అర్బన్ : పట్టణంలోని రిక్షాకాలనీలో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3 వేలు నగదు చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన బోవిళ్ళగోపాల్రెడ్డి కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. పిల్లల చదువు కోసం గత కొన్నేళ్లుగా పట్టణంలోని రిక్షాకాలనీలో నివసిస్తున్నారు. గోపాల్రెడ్డి కాంట్రాక్టు పనుల నిమిత్తం వైజాగ్కు వెళ్లగా ఇంటి వద్ద ఆయన భార్య ప్రభావతి, పిల్లలు ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రభావతి పిల్లలకు భోజనం ఇచ్చేందుకు పాఠశాల వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యం
మదనపల్లె రూరల్ : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు రిలే దీక్షలు నిర్వహిస్తుంటే, కూటమిప్రభుత్వం పట్టించుకోకపోగా, నిర్లక్ష్యం కనపరుస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధురవాణి, రాజేశ్వరి అన్నారు. బుధవారం అంగన్వాడీ రిలేదీక్షల్లో భాగంగా ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటూ పొర్లు దండాలతో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా అంగన్వాడీలు రెండురోజులుగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా తమ సమస్యలను గుర్తించి, సానుకూలంగా వ్యవహరించాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన వారికి రూ.10వేల పెన్షన్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ మంజూరుచేయాలన్నారు. మినీ వర్కర్లకు విద్యార్హత లేదనే చిన్నసాకుతో 1,810 మంది పోస్టులను నిలిపివేయడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కనపరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకుంటామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే, మరో సమ్మెకు పిలుపునిచ్చేందుకు వెనుకాడమని హెచ్చరించారు. అంగన్వాడీల రిలేదీక్షలకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఐద్వా భాగ్యమ్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి గంగాదేవి, సభ్యులు శ్యామల, విజయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని పొర్లు దండాలతో నిరసన -
ఇరువర్గాల ఘర్షణ: ఇద్దరికి గాయాలు
మదనపల్లెటౌన్: మదనపల్లిలో బుధవారం రాత్రి రెండు వర్గాల యువకులు ఘర్షణ పడ్డారు. కర్రలతో దాడులు చేసు కోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు .. చంద్రకాలనీకి చెందిన రమణ కొడుకు ప్రదీప్ (32), సీటీఎం రోడ్డు, బాలాజీ నగర్లో ఉండే బాలకృష్ణ అలియాస్ బాలు, నీరుగట్టువారిపల్లె రాజానగర్ కు చెందిన నరేష్, సోము, మణి కలసి మద్యం తాగుతుండగా కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన బ్రహ్మ తేజ బ్రదర్స్ తో గొడవ పడినట్లు తెలిసింది. వారు అక్కడ నుంచి వెళ్లిపోయి, తిరిగి రెండు బైకుల్లో ఆరుగురిని పిలుచుకొని మద్యం షాపు వద్దకు వచ్చారు. అదే సమయంలో ప్రదీప్ను చంద్ర కాలనీలో వదిలి పెట్టేందుకు బాలు, నరేష్లు బైకులో చంద్ర కాలనీకి వెళుతుండగా రాజరాజేశ్వరి గుడి వద్ద దారి కాచిన అంగళ్లుకు చెందిన బ్రహ్మ తేజ వర్గీయులు ప్రదీప్, బాలు నరేష్ లపై మూకుమ్మడిగా దాడి చేసి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్, బాలులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలు తేరుకోగా, ప్రదీప్ కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ప్రదీప్ ను వెంటనే బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ వెంకటరమణ, జిల్లా ఆస్పత్రికి చేరుకుని ఘటనకు కారణాలపై ఆరాతీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనార్టీలకు కుచ్చుటోపీ
బడ్జెట్లో ఎక్కడా మైనార్టీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు. దుల్హన్ పథకం, విదేశీ విద్య, మైనార్టీల స్కాలర్షిప్లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. మైనార్టీలు వ్యాపారం చేసుకునేందుకు రూ.5లక్షల రుణాలు ఇస్తామన్న చంద్రబాబు దాని కోసం ఎన్ని కోట్లు కేటాయించారో.. చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో ఎక్కడ కూడా రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతు కోసం నిధులు కేటాయింపు లేదు. మరోసారి మైనార్టీలను నిలువునా వంచించారు. – అబ్దుల్ కలీమ్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, వాల్మీకిపురం -
అగ్ని ప్రమాదంలో టమాట పంట దగ్ధం
మదనపల్లెటౌన్ : మదనపల్లె మండలంలో టమాటా పంట దగ్ధమైన సంఘటన బుధవారం సీటీఎం క్రాస్ రోడ్డులో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు..మిట్టపల్లె గ్రామానికి చెందిన రైతు పూల వెంకటప్ప తన వ్యవసాయ బోరు వద్ద రెండన్నర ఎకరాల్లో టమాట, ఇతర కూరగాయల పంటలను సాగుచేశాడు. టమాట పంట కోత దశలో ఉండగా, వ్యవసాయ పొలానికి సమీంలో గుర్తు తెలియని వ్యక్తులు పచ్చిక బైళ్లకు మధ్యాహ్నం నిప్పింటించారు. దీంతో టమాటా పంటతో పాటు, డ్రిప్పు, పైపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిళ్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పంచింది ఆదుకోవాని కోరుతున్నాడు. -
స్పీడ్ బ్రేకర్ తెచ్చిన అనర్థం..
రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు మదనపల్లెటౌన్ : స్పీడు బ్రేకర్ తెచ్చిన అనర్థానికి ఓ కార్మికుడు బైకు అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై స్థానిక జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురానికి చెందిన శివయ్య కుటుంబంలోని ఏడుగురు రెండేళ్ల క్రితం, మదనపల్లె మండలంలోని సీటీఎం గ్రామానికి వచ్చారు. స్థానింగా ఉన్న ఓ వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శివయ్య కొడుకు వెంకటేష్(22) ఇటుకల బట్టీలో సహచర కార్మికులతో కలసి పనిచేశాడు. చీకటి పడగానే బైకులో ఇంటికి బయలు దేరాడు. సీటీఎం రైల్వే గేటు వద్దకు రాగానే, అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా బైకును నడిపి అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.వారు ఘటనాస్థలానికి వచ్చి, బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్పై నుంచి కిందపడి.. పుంగనూరు/ మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. ఘటనపై బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .. పుంగనూరు మండలంలోని పెద్ద అలసాపురానికి చెందిన సుధాకర్ కొడుకు హేమంత్ పలమనేరులో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరాగానే విధులకు వెళ్లాడు. రాత్రి 10.30 గటల ప్రాంతంలో విధులు ముగించుకుని బైకులో ఇంటికి బయలు దేరాడు. మొరవపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికికి సైడు ఇవ్వబోయి అదుపు తప్పి బైకుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బొలెరో ఢీకొని.. మదనపల్లెటౌన్: బొలెరే ఢీకొని స్కూటిరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బుధవారం రాత్రి ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పుంగనూరు – చౌడేపల్లె మార్గంలోని పెట్రోల్ బంకు వద్ద బొలెరో వచ్చి స్కూటర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా, గంగవరం మండలం, గుండుగల్లుకు చెందిన ఆనంద్(40) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని కుటుంబీకులు చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించారు. బాధితునికి కన్ను పూర్తిగా డ్యామేజ్ కావడంతో డాక్టర్ల సలహా మేరకు కుటుంబీకులు ఆనంద్ను తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. -
రైతులు ఉద్యాన పంటలపై మొగ్గుచూపాలి
లక్కిరెడ్డిపల్లి: రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలవైపు మొగ్గుచూపాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం లక్కిరెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. అప్పకొండయ్యగారిపల్లిలో ఒక మామిడితోటలో జరిగిన ఉపాధిహామీ పనులను పరిశీలించారు. పంటకు నీటి సౌకర్యం, ఆదాయంపై మామిడి తోట రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం కరువు ప్రాంతంగా ఉండటం వల్ల భూగర్భజలాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నీటి యాజమాన్య సంస్థ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సహజ వ్యవసాయ పద్దతులను రైతులంద రూ అవలంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దిన్నెపాడు గ్రామంలోని కోమటివాని వంక వాటర్ షెడ్డును, రామరాజు వంక వాటర్ షెడ్డును పరిశీలించిన కలెక్టర్ వరిపంట కాకుండా రైతులకు ఆదాయాన్ని ఎక్కువగా ఇచ్చే ఉద్యాన పంటలను పండించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడుతూ వరిపంట కాకుండా ఉద్యాన పంటలవైపు మొగ్గుచూపితే మంచి ఆదాయం వస్తుందని, నీటి వినియోగం తగ్గుతుందని, భూగర్భజలాలను బాగా వినియోగించుకో వచ్చని సూచించారు. లక్కిరెడ్డిపల్లిలోని దొర్రిచెరువును పరిశీలిస్తూ వర్షాకాలంలో పడే ప్రతి బొట్టును చెరువులోకి చేరేలా కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలం, కోనంపేట గ్రాంమలోని అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ను సందర్శించి .. అక్కడి వసతులను స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే లక్కిరెడ్డిపల్లిలోని ముప్పయి పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరువు ప్రాంతమైన లక్కిరెడ్డిపల్లి మండలంలో ప్రాజెక్టు జలధార ద్వారా భూగర్భజలాలు పెరిగాయని, వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా మరిన్ని నీటి వసతులు పెరుగుతాయని, త్వరలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. తహసీల్దార్ క్రాంతి కుమార్, ఎంపీడీఓ రెడ్డయ్య, ఆర్డబ్ల్యుఎస్ ఎస్డీఈ విద్య, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ విష్ణు, ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలి కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఉగాదికి 16వేల గృహ ప్రవేశాలు
పీలేరురూరల్: జిల్లాలో ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.73 లక్షలు, జిల్లాలో 16,800.. పీలేరు నియోజకవర్గంలో 2,048 గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు హౌసింగ్ నిర్మాణంపై చైతన్యం కల్పించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని తొమ్మిది లే అవుట్లలో విద్యుత్ సౌకర్యం ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.47 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మదనపల్లె సిటీ: దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్ సూచించారు. స్థానిక అనపగుట్ట శ్రీవారినగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో భారీ ఎత్తున దొంగతనం జరిగిన నేపథ్యంలో కమిటీ సభ్యులతో బుధవారం మాట్లాడారు. భద్రత దృష్ట్యా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వెబ్ల్యాండ్లో పొందుపరచాలి రామసముద్రం: దేవాలయ భూములు రెవిన్యూ వెబ్ ల్యాండ్ లో పొందుపరచాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం రామసముద్రం తహసీల్దార్ అజారుద్దీన్తో దేవాలయ భూముల విషయమై సమీక్షించారు. మండలంలోని పలు ఆలయాలకు సంబంధించి భూములు ఇతరుల పేరుపై ఉన్నాయని, వాటిని వెంటనే రెవిన్యూ వెబ్ ల్యాండ్లో దేవాలయాల పేరు మీద మార్చాలని కోరారు. -
నువ్వే నా ప్రాణం
కలకడ: కలకాలం తోడు నీడగా ఉంటానని పెళ్లిలో అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త మరణించడంతో తట్టుకోలేని భార్య అసువులు బాసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ బాకివానివడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. బాకివానివడ్డిపల్లెకు చెందిన ఆవులకుంట నాగులు (80) వ్యవసాయం, కూలిపనులు చేసుకుంటూ భార్య నారాయణమ్మ(75) తో పాటు కుమారుడు, కుమార్తె, కోడలు, మనవళ్లతో జీవించేవారు. వృద్ధులయినా రోజువారి కష్టార్జితంతో ముందుకు సాగేవారు. నాగులు కాలికి రక్త సరఫరా సక్రమంగా కావడం లేదని వారం క్రితం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భర్త ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేవరకూ అన్నం కూడా ముట్టుకోకుండా నారాయణమ్మ నిరీక్షించింది. భర్త ఇంటికి చేరుకున్నాక అన్ని సేవలు చేసింది. కాలికి ఆపరేషన్ చేయించినా నాగులు శరీరం చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలపడంతో మంగళవారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9.40 గంటలకు నాగులు మృతిచెందాడు. భర్త మృతిని తట్టుకోలేని భార్య అపస్మాకర స్థితిలోకి చేరుకోవడంతో బంధువులు, కుమారుడు గంగాధర కలిసి తండ్రి మృతదేహాన్ని ఇంటిముందు పెట్టుకుని తల్లికి చికిత్స చేయించడానికి మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నారాయణమ్మను పీలేరుకు తరలించగా, చికిత్స పూర్తిగా అందకనే 11.40 గంటలకే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరి అంత్య క్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త మరణ వార్త విన్న భార్య మృతి -
‘బస్తా’ మే సవాల్!
చౌడేపల్లె: మండలంలోని చారాల సచివాలయం, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు మంగళవారం యూరియా కోసం ‘బస్తా’ మే సవాల్ అంటూ కుస్తీ పట్టాల్సి వచ్చింది.. ఎలాగైనా యూరియా బస్తాను చేజిక్కించుకోవాలనే ఆత్రుత ప్రతి రైతులోనూ కనిపించింది. అధికారులు ఎప్పుడు టోకెన్లు జారీచేస్తారా..ఎప్పుడు బస్తా చేతికొస్తుందోనంటూ ఉత్కంఠగా పోటీపడ్డారు. చారాల, శెట్టిపేట గ్రామపంచాయతీల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలిరావడంతో గందరగోళం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే సచివాలయం వద్ద రైతులు చేరుకొన్నారు. రైతుసేవా కేంద్రంలో 300 బస్తాల యూరియా స్టాకు ఉన్నప్పటికీ ఒక్కసారిగా రైతుల సంఖ్య పెరగడంతో సమాచారం అందుకొన్న ఏఓ మోహన్కుమార్ అదనపు సిబ్బందిని సచివాలయం వద్దకు రప్పించారు. రైతులందరూ ఒక్కసారిగా టోకన్లకోసం సచివాలయంలోకి చొరబడటంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, పోలీసుల సహకారంతో యూరియా బస్తాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. యూరియా కోసం రైతుల కుస్తీ తోపులాటలతో ఇబ్బందిపడ్డ వృద్ధులు -
తరిగొండలో వైభవంగా ధ్వజారోహణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన మంగళవారం ఉదయాన్నే మూలవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. తోమాలసేవ, ఏకాంత సేవలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహోత్సవాలు జరిగే పది రోజుల పాటు ఆలయానికి, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు సంరక్షణగా ముక్కోటి దేవతలు ఉండాలని కోరుతూ.. వారిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భేరితాండవం నిర్వహించి దేవతాహ్వానం చేశారు. ఈ సందర్భంగా గరుత్మంతునికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. నైవేద్యంగా ఉంచిన ప్రసాదాలను సంతానం లేని మహిళలు స్వీకరిస్తే.. గరుత్మంతుని కృపతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కొంతమంది మహిళలు ఆలయానికి చేరుకొని సంతాన ప్రాప్తి కలిగించే ధ్వజారోహణ ప్రసాదాన్ని స్వీకరించారు. ఊంజల్ సేవ చేసి వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామి వారు హంసవాహనంపై కొలువు దీరి గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. బ్రహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అఽధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం హనుమంత వాహనంలో స్వామి వారు కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరిస్తారని అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. అదే రోజు ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలకు గరుత్మంతుని ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్న వేదపండితులు -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
కడప సెవెన్రోడ్స్: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. కడపలోని జిల్లా పరిషత్లో మంగళవారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో వివిధ అంశాలను ఆయన సమీక్షించారు. చక్రాయపేట మండలంలోని సురభి, కల్లూరిపల్లె తదితర గ్రామాలతో పాటు వీఎన్ పల్లె, చాపాడు మండలాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యుఎస్ పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. మరో ఆర్డబ్ల్యుఎస్ అధికారి మాట్లాడుతూ రాజంపేట మండలం ఊటుకూరులోని సీపీడబ్ల్యుఎస్ స్కీమ్ రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నాబార్డు రుణంతో చేపట్టామన్నారు. చెయ్యేరు నుంచి 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఈ పథకం గ్రాంట్స్ లేక అర్ధంతరంగా పనులు ఆగిపోయాయన్నారు. పనులన్నీ పూర్తి చేసేందుకు రూ.కోటి 50 లక్షలు అవసరం అవుతాయని తెలిపారు. అయితే, తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు రూ.25 లక్షలు అవసరమని తెలిపారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ జెడ్పీ జనరల్ ఫండ్ నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఆర్డబ్ల్యుఎస్ ఏఈని నియమించాలని ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోరారు. జెడ్పీచైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో బోర్లలో నీరు తగ్గిపోతే డీపెనింగ్ చేయాలన్నారు. అవసరమైన చోట్ల మాత్రం కొత్త బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కడప నగరంలోని లక్ష్మిరంగ హాలు సమీపంలోని జెడ్పీ స్థలంలో చేపట్టిన భవన నిర్మాణాలకు జనరల్ ఫండ్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం ఏమైందని ప్రశ్నించారు. కొత్త పెన్షన్ల మాటేమిటని నిలదీశారు. ఇందుకు డీఆర్డీఏ అధికారి బదులిస్తూ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎస్ఓపీ రావాల్సి ఉందన్నారు. స్పౌజ్ పెన్షన్లు పెండింగ్ ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. హౌసింగ్ పనులకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉందని పీడీ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పెద్దముడియం జెడ్పీ హైస్కూలు భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని, నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ హిమజ కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ రూ.20 లక్షలు జెడ్పీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి, ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. రాజంపేట సీపీడబ్ల్యు స్కీమ్కురూ.25 లక్షలు పెద్దముడియం హైస్కూలుకురూ.20 లక్షలు జెడ్పీ చైర్మన్ ముత్యాలరామగోవిందరెడ్డి -
వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు
కడప రూరల్: వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం హెల్త్ అసిస్టెంట్ నుంచి హెల్త్ ఎడ్యుకేటర్గా పదోన్నతుల కౌన్సెలింగ్ను నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం 9 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం పదోన్నతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్లో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వోబీ పనుల పురోగతిపై డీఈ, సీఐ మధ్య వాగ్వాదం
పీలేరు రూరల్ : పీలేరు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనుల పురోగతి విషయంలో చిత్తూరు ఎన్హెచ్ డీఈ జి.సుజాత, పీలేరు సీఐ యుగంధర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మంగళవారం స్థానిక మదనపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ యుగందర్ మాట్లాడుతూ ఆర్వోబీ పనులు ఆలస్యం అవుతున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పనులు వేగవంతానికి జాతీయ రహదారుల శాఖ బాధ్యత తీసుకోవాలంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ప్రత్నామ్నాయ మార్గం చూపకుండా పనుల ఆలస్యంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఎవరికై నా ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టరు తోపాటు అధికారులపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎన్ఎహెచ్ డీఈ సుజాత కంటతడి పెట్టుకున్నారు. నలుగురి మధ్య ఓ మహిళా ఉద్యోగితో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ వ్యవహార శైలిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామంటూ అక్కడి నుంచి ఆమె వెళ్లి పోయారు. స్థానిక టీడీపీ నాయకులు డీఈని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆర్వోబీ పనుల ఆలస్యం కారణంగా జరుగుతున్న వరుస ప్రమాదాలతో సీఐ అలా మాట్లాడారంటూ, జరిగిన సంఘటన పక్కన పెట్టి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు. సీఐ దురుసుగా మాట్లాడారంటూ కన్నీళ్లు పెట్టుకున్న డీఈ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్న మహిళా ఉద్యోగి డీఈని బుజ్జగించిన టీడీపీ నాయకులు -
అడ్డుకుంటే.. అంతు తేలుస్తాం !
కురబలకోట : కురబలకోట మండలం నార్లపల్లి చెరువు నుంచి టిప్పర్లతో మట్టి తోలుతున్న టీడీపీ వర్గాన్ని.. అదే పార్టీ వారు గ్రామస్తులతో కలసి అడ్డుకున్న ఆసక్తికర సంఘటన మంగళవారం సాయంత్రం కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య చెరువు మట్టి వివాదం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతమాకులపల్లి సచివాలయ పరిధిలో నార్లపల్లి చెరువు ఉంది. ఎవరికి మట్టి కావాలన్నా మొదట ఈ చెరువు గుర్తుకు వస్తుంది. అధికార పార్టీ నాయకులు కూడా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చెరువు నుంచి మట్టి తోలుకోవడానికి రైతుల పేరుతో అనుమతి తీసుకున్నట్లు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అయితే నాలుగు టిప్పర్లతో రెండు రోజులుగా మట్టి తోలుతున్నారు. ఈ మట్టిని సరాసరి సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ భూమి చదునుకు తోలుతున్నారు. దీనిని గ్రహించిన చెరువు పక్కనున్న పుల్లగూరవాండ్లపల్లి గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం మట్టి లోడుతో వస్తున్న టిప్పర్లను పల్లె వద్ద నిలిపివేశారు. చినబాబు పేరుతో బెదిరింపులు ఈ విషయాన్ని డ్రైవర్లు మదనపల్లిలో తమ నాయకులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రెండు కార్లలో కొందరు యువకులు వచ్చి గ్రామస్థులపై రౌడీ యిజం చేశారు. ‘మట్టి తోలేదే మీవల్ల ఏమవుతుంది.. అడ్డుకోండి చూద్దాం.. మీ సంగతి తేలుస్తాం’ అంటూ గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులను బెదిరించారు. ఏమవుతుంది మీవల్ల అంటూ.. బెదిరింపులకు దిగారు. అంతేగాకుండా చినబాబు పేరుతో ఫోన్ చేయించి మరీ బెదిరించారు. ఎవరు అడ్డు వస్తారో చూస్తా.. అంటూ చినబాబు పేరుతో హెచ్చరికలు ఇచ్చినటు్ల్ గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పక్కనే ఉన్న గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రౌడీయిజం చేస్తున్న మట్టి మాఫియాపై ఎదురు తిరిగారు. ప్రతిఘటించారు. పరిస్థితి తారుమారు కావడంతో రౌడీలు అక్కడి నుంచి వచ్చిన కార్లలోనే మెల్లగా జారుకున్నారు. మట్టి తోలితే సహించేది లేదని గ్రామస్తులు గట్టిగా హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతి ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాదాగిరి చేసిన రౌడీ మూకలు వారి వెనుక నుంచి నడిపిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు, రైతులు తెలిపారు. కాగా మట్టి మాఫియా బెదిరింపు దోరణులకు దిగడం అధికార పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. మట్టి మాఫియాకు చెందిన అధికార పార్టీ మద్దతుదారులే ఆ గ్రామంలోని టీడీపీ నాయకుడు సదాశివపై దౌర్జన్యానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తనపై రౌడీయిజం చేశారని సదాశివ తదితరులు కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఉన్నతాధికారులు వీరి ఆగడాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకే పార్టీకి చెందిన వారి మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకోవడం అటు పార్టీలోనూ ఇటు అధికార యంత్రాంగంలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని బరితెగిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. మట్టి మాఫియా రౌడీలను నిలదీస్తున్న పుల్లగూరవాండ్లపల్లి గ్రామస్తులు చెరువు మట్టి తోలుతున్న టిప్పర్లను నిలిపేసిన గ్రామస్తులు గ్రామస్తులపై మట్టి మాఫియా దాదాగిరి ప్రతిఘటనతో వెనుదిరిగిన రౌడీలు రైతుల పేరుతో రియల్ ఎస్టేట్కు చెరువు మట్టి అధికార పార్టీ మధ్య రగిలిన వివాదం -
శ్రీకృష్ణుడి ఆలయంలో భారీ చోరీ
● కట్టర్లతో గేట్లు, తలుపులు ధ్వంసం ● రూ.25 లక్షల విలువైన నగదు, ఆభరణాలు అపహరణ మదనపల్లెటౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా దేవుని గుడినే కొల్లగొట్టారు. అనపగుట్టలోని శ్రీకృష్ణుని ఆలయం తలుపులు, గేట్లను కట్టర్లతో ధ్వంసం చేసి రెండు హుండీలలోని నగదు, దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్లు, శంకు చక్రాలు, శటారి, పంచపాత్ర, నామాలు, కన్నులు, ఇతర నగలు, నగదును చోరీ చేశారు. మంగళవారం ఉదయం శ్రీకష్ణుని ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన పూజారి చోరీ జరిగిందని గుర్తించి.. ఆలయ చైర్మన్ గురుశంకర్ యాదవ్తోపాటు కమిటీ వారికి సమాచారం అందించారు. వారు రెండవ పట్టణ పోలీసులకు చెప్పడంతో సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రహీముల్ల, శ్రీరాములు, సిబ్బంది అనపగుట్టకు చేరుకున్నారు. కృష్ణుడి ఆలయంలో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను మదనపల్లెకి పంపించారు. ఆలయం వద్దకు చేరుకున్న జాగిలాలు, క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు లోపల, బయట క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి, అణువణువునా గాలించారు. జాగిలం వాసన పడుతూ సమీపంలోని సంతాన వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు వెళ్లింది. జాగిలం తిరిగిన ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీన్నిబట్టి దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోందని పలువురు అంటున్నారు. ఆలయంలో ఉన్న వాచ్మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగ లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లడం గమనించి దొంగతనానికి పాల్పడ్డారు. గుడిలో ఉన్న రెండు పెద్ద సైజు హుండీలను ధ్వంసం చేసి, అందులోని నగదును పెద్ద మొత్తంలో అపహరించారు. అలాగే దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలతోపాటు ఇతర ఆభరణాలను అపహరించుకు పోయారు. సుమారు రూ.25 లక్షల విలువైన నగలు, నగదు చోరీ చేశారని ఆలయ చైర్మన్ ఫిర్యాదు చేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరికి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న శ్రీకష్ణుని ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడడంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. జాగిలంతో పరిశీలిస్తున్న పోలీసులు హుండీని ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ధ్వంసం చేసిన దృశ్యం -
అంగన్వాడీల జోలికొస్తే పతనం తప్పదు
– సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మదనపల్లెఅర్బన్ : అంగన్వాడీల జోలికొస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈక్రమంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు, న్యాయమైన కోర్కెల సాధనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇందులో భాగంగానే అనుబంధ సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నట్లు చెప్పారు. ముఖ్యంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీ మంజూరు, మినీసెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. అయితే వర్కర్స్ సమస్యలు, డిమాండ్లపై కొద్ది రోజులుగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదన్నారు. పైగా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఇదే జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేశ్వరీ, కోశాధికారి హరిశర్మ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మధురవాణి, కార్యదర్శి గంగాదేవి, సభ్యులు విజయ, శ్యామల, జయలక్ష్మీ, శివలక్ష్మీ, ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్డీఎసీల నియామకం
మదనపల్లె: జిల్లాకు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ల (ఎస్డీసీ)ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె ఎస్డీసీగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి, పీలేరు హంద్రీ–నీవా ప్రాజెక్టు భూసేకరణ యూనిట్–2 ఎస్డీసీగా ఎంవీఎస్ నారాయణరెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఎస్డీసీగా కె.మాధవకృష్ణారెడ్డిలు నియమితులయాయ్యారు. మదనపల్లెరూరల్: అన్నమయ్య జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో మార్చి 10వతేదీ లోపు నివాస, నివాసేతర పన్నుల వసూళ్లు పూర్తిచేయాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలతో కలిసి పంచాయతీరాజ్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సంబంధించి రూ.27.29 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 15.05 కోట్లు వసూలైందన్నారు.. మిగిలిన బకాయిలను మార్చి 10లోపు వసూలు చేసేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు విధిగా పన్నుల వసూళ్లను స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే జరపాలన్నారు. కార్యక్రమంలో జీఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, డీఎల్డీఓ అమరనాథరెడ్డి, డీఎల్పీఓ నాగరాజ, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మదనపల్లె పట్టణంలో 11 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో జనరల్ 12480 మంది విద్యార్థులకు గాను 12107 మంది హాజరయ్యారు. 373 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 968 మంది విద్యార్థులకుగాను 919 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవి తెలిపారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లి, రాయచోటిలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మదనపల్లెఅర్బన్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం స్థానిక జడ్పీహైస్కూల్లో జిల్లా సైక్లింగ్ అండర్–18 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ జట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలికల విభాగంలో పి.నిహారిక, ఎమ్.తనూష, ఎస్.సరిత, కె.పవిత్ర, ఎమ్.మేఘన, ఎస్.ఉమ్మేజైనబ్, ఎల్.శరణ్యలు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో టి.మధుసూదన్, పి.చరణ్కుమార్, జి.మహ్మద్అనీస్, ఎ.సంజయ్ధర్రెడ్డి, పి.పూర్ణేంద్, టి.జ్యోతీష్, జి.లోహిత్, పతుగ్రంజన్లు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 28, మార్చి ఒకటో తేదీన ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయన్నారు. -
ఇసుక తవ్వుతున్న జేసీబీ స్వాధీనం
నిమ్మనపల్లె : మండలంలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మంగళవారం నిమ్మనపల్లె సమీపంలోని అగ్రహారం రోడ్డులో బహుదా పరీవాహక ప్రాంతంలోని కట్ట సమీపంలో ముష్టూరుకు చెందిన జేసీబీ ఇసుక తవ్వుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం వాహన యజమాని బాబును స్టేషన్కు పిలిపించి హెచ్చరించి బైండోవర్ కేసు నమోదు చేశామన్నారు. కాగా, మండలంలో ఇసుకాసురులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ముందుగా జేసీబీ వాహనాలతో ఇసుకను తవ్వి కుప్పలుగా వేస్తారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కూలీలతో ట్రాక్టర్లకు నింపుకొని మదనపల్లె పరిసర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. -
వేడి నీళ్లు మీద పడి బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : వేడి నీళ్లు మీద పడి బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల కథనం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలంలోని సుబ్బిరెడ్డిగారిపల్లికి చెందిన ఆనంద్ కుమారుడు అనిరుద్(5) ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో గ్యాస్ స్టవ్పై కాలుతున్న నీటిపాత్రను తాకాడు. ప్రమాదవశాత్తు ఆ నీళ్లు బాలుడిపై పడడంతో కాలి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం.. రూ.3 లక్షల నష్టం మదనపల్లెటౌన్ : కాఫీ పొడి తయారీ షాపులో షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బెంగళూరు బస్టాండ్ సమీపంలో ఉన్న కిరణ్ కాఫీ వర్క్స్ దుకాణంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో దుకాణంలో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలను అదుపు చేసి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. అప్పటికే సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్ బి.కొత్తకోట : మండలంలోని రఘనాధపురానికి చెందిన కృష్ణప్ప(70)పై ఈ నెల 21న జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ గోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితులైన వారిలో తిమ్మారెడ్డి (75), అనసూయమ్మ (65), సరస్వతమ్మ (55)లను కాండ్లమడుగు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. -
●కీలక పాత్ర... పెద్ద తలకాయదే !
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా పోలీస్శాఖపై వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు.. న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమంది ఖాకీల పనితీరుకు అద్దంపడుతున్నాయి. ఏ క్షణంలో కూటమి కొలువుదీరిందోగానీ ..ఆ మరుక్షణం నుంచే ఖాకీలు అవినీతి ఊబిలోకి జారుకున్నారు. ప్రజల మాన, ప్రాణ, ఆస్తులు కాపాడడం కంటే వ్యక్తిగత ఎజెండా కోసమే కొందరు పోలీసు అధికారులు అత్యధిక ప్రాధ్యానత ఇస్తున్నారు. ముఖ్యంగా అసాంఘిక శక్తులపై కరుకుదనం తగ్గించి.. సివిల్ పంచాయతీలు, భూ తగాదా సెటిల్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. పైగా ప్రశ్నించే వారిపై ఎదురుదాడికి దిగుతూ చట్ట ప్రయోగాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. ఛాలెంజింగ్ కేసులు చేధించడంలోనూ విఫలమవుతున్నారు. గండికోటలో బాలిక హత్య కేసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏకపక్ష చర్యల్లో పులివెందుల సబ్ డివిజన్.... జిల్లాలో ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. ప్రత్యేకించి పులివెందుల సబ్ డివిజన్ పోలీసులపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. ఆ మధ్య టీడీపీ మహానాడు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్సార్ కూడళ్లకు టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారు. ఇది మంచి పద్ధతి కాదు, వైఎస్ విగ్రహాలకు ఉన్న టీడీపీ తోరణాలు తొలగించాలంటూ అధికారులతోపాటు పులివెందుల డీఎస్పీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఆయా సర్కిళ్లల్లో టీడీపీ జెండాలు తొలగించాలి. అలా చేయకపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొంతమంది వైఎస్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు మాత్రమే తొలగించారు. అదే అదునుగా భావించి టీడీపీ నేత విజయ్కుమార్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. పులివెందులలో క్రియాశీలకంగా ఉన్న వైఎస్సార్సీపీ నేతల్ని కేసులో చేర్చారు. అంతటితో ఆగకుండా ముగ్గురు మైనర్ బాలురులను కూడా కేసులో చేర్చారు. ఇదే విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా జెండాలు తొలగిస్తే హత్యాయత్నం కేసు ఎలా అవుతుందని హైకోర్టు సైతం ప్రశ్నించింది. ● అదృశ్యమైన బాలిక కుటుంబ సభ్యులు భావోద్వేగంతో పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేస్తే పోలీసుస్టేషన్ డ్యూటీ కానిస్టేబుల్పై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 190 తొలగించాలని ఉత్తర్వులివ్వడం విశేషం. ఇవన్నీ మచ్చుకు మాత్రమే.. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రక్షాళనపై ప్రత్యేక శ్రద్ధ ఏదీ పోలీసుశాఖలో కొంతమంది అధికారులపై నిత్యం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమంది అధికారులు చట్టాన్ని విస్మరించి, ఏకపక్ష చర్యలే ఏకై క అజెండాగా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తదనకుగుణంగా చర్యలకు దిగుతున్నారు. పోలీసుశాఖలో అంతర్గతంగా అనేక అనైతిక చర్యలు తెరపైకి వస్తున్నా యి. గతంలో కడప టూటౌన్, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన నాగార్జున, గోపాల్రెడ్డిపై లైంగిక వేధింపులు ఆరోపణలు సైతం వచ్చాయి. ఇలా ఇరోపణలు తెరపైకి రాగానే ప్రక్షాళన దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు. ● కడప సబ్ డివిజన్ పరిధిలోని ‘చిన్న’స్టేషనే అయినా సెటిల్మెంట్లకు ‘చౌక్’గా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పైసలివ్వందే ఏ ఫైలూ కదలదని పలువురు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల తగాదా విషయమై స్టేషన్ మెట్లెక్కినా ముక్కుపిండి లంచం వసూ లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ బాస్ స్పందించి ప్రక్షాళన చేపడితే ఖాకీ లు దారిలోకి వస్తారు.. లేకుంటే అవినీతి ఊబిలోకి జారిపోవడం ఖాయమని పలువురు విశ్లేషిస్తున్నారు. శభాష్ ఏసీబీ... కడప ఏసీబీ డీఎస్పీగా సీతారామరావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. వెంటనే తనదైన శైలిలో చర్యలకు సిద్ధమయ్యారు. కడప రిమ్స్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. తాజాగా పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్కుమార్లను రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండడగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈఘటనతో ఒక్కమారుగా పోలీసుశాఖ ఉలిక్కిపడింది. ఉన్నతస్థాయి అధికారుల ప్రోత్సాహంతో రూరల్ సీఐ వెంకటరమణ చట్టాన్ని ఏకపక్షంగా నడిపించడంలో క్రియాశీలకంగా వ్యవహారించేవారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఏసీబీ డీఎస్పీ సీతారామారావు చట్టాన్ని పరిరక్షించడంలో తనవంతు పాత్ర నిర్వహించడంతో ప్రజానీకం నుంచి శభాష్ అన్పించుకుంటున్నారు. ఉన్నతాధికారులు చట్టాన్ని రక్షిస్తూ అవినీతికి అస్కారం లేని పోలీసు వ్యవస్థ కోసం ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని పలువురు కోరుతున్నారు. ‘పచ్చ’పాలనలో పోలీస్ వ్యవస్థపై అవినీతి మరక! ప్రక్షాళన దిశగా అడుగులు వేయని యంత్రాంగం జూదం, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర ఎస్ఐ, సీఐలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వైనం ఏసీబీపై ప్రశంశలు కురిపిస్తున్న ప్రజానీకంసాక్షి టాస్క్ఫోర్స్ : పులివెందుల పట్టణ సీఐ, ఎస్ఐలు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. వీరి వెనుకే ఉంటూ.. వారి అవినీతిలో పాలుపంచుకుంటూ.. వారిని నిత్యం అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న‘పెద్ద’ తిమింగళంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారని ప్రజలు కోరుతున్నారు. పులివెందులలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులివెందుల డివిజనల్ స్థాయి అధికారి, రూరల్ సీఐలు ఏరికోరి పోస్టింగ్ వేసుకున్నారు. అప్పటి నుంచి వీరి అవినీతికి అంతు లేకుండా పోయింది. డివిజనల్ స్థాయి అధికారికి సాక్షాత్తూ ఎస్పీతో సంబంధం లేకుండా రాయలసీమ రేంజ్ అధికారి అండదండలు ఉండటంతో తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా అక్రమ కార్యకలాపాలు కొనసాగించారు. ఇతని అక్రమ కార్యకలాపాలకు టీడీపీ అధినాయకుల మద్దతు పూర్తిగా ఉంది. టీడీపీ నాయకులు చేసే అక్రమ కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్న డివిజనల్ స్థాయి అధికారికి టీడీపీ నాయకులతోపాటు ప్రతి వ్యవస్థలో నెల నెలా మామూళ్లు వస్తున్నాయి. దీనికి ప్రస్తుతం ఏసీబీ అధికారులకు చిక్కిన సీఐ మధ్యవర్తిత్వం వ్యవహరించి అన్ని తానై వ్యవహరించాడన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ బియ్యం రవాణా.. పులివెందుల తాలుకాలో నిత్యం అక్రమ బియ్యం రవాణా జరుగుతోంది. అంకాలమ్మగూడూరు మండల కేంద్రంగా టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి దాదాపు కొన్ని వందల క్వింటాళ్ల బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక టీడీపీ నాయకులతోపాటు పులివెందుల డివిజనల్స్థాయి అధికారికి, సీఐకి, ఎస్ఐకి నిత్యం మూమాళ్లూ అందుతున్నాయి. ఇటీవల అంకాలమ్మగూడూరు ప్రాంతంలో ఉన్న వీరి షెల్టర్కు బియ్యం సరఫరా చేయని వ్యక్తులను సదరు టీడీపీ నాయకులు పోలీసులతో పట్టించారు.. అందుకు సంబంధించిన బియ్యం సరఫరా ఆటో ఇప్పటికీ సింహాద్రిపురం పోలీస్స్టేషన్లో ఉంది. ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇటీవల పులివెందుల డివిజనల్ స్థాయి అధికారి వేముల మండలంలో జరుగుతున్న పలు మైనింగ్ నిర్వాహకులను పిలిపించుకుని భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ నిర్వాహకులు ప్రతి నెలా టీడీపీ నాయకులతోపాటు తమకూ మా మూళ్లు ఇవ్వాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలి సింది. పులివెందుల నియోజకవర్గంలో జరుగుతు న్న ప్రతి అసాంఘిక కార్యకలాపానికి డివిజనల్ స్థాయి అధికారి పూర్తి అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తే ఇక్కడి డివిజనల్ స్థాయి అధికారి అక్రమాలు పూర్తిగా బయట పడే అవకాశం ఉంది. ఆ విధంగా ఏసీబీ అధికారులు దృష్టి సారించి దాడులు చేయా లని పలువురు ప్రజలు కోరుతున్నారు. సీఐ రమణ ఇళ్లల్లో ఏసీబీ అధికారుల సోదాలు పులివెందుల రూరల్ : పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పులివెందులలోని స్థానిక నారాయణ పాఠశాల, కూరగాయల మార్కెట్ సమీపాలలో ఉన్న సీఐ వెంకటరమణ ఇళ్లల్లో ఏసీబీ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 7.30గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఇంటిలోని బంగారు, డబ్బు, పత్రాలను బ్యాగ్లో వేసుకుని బయటకు పోతున్న హోంగార్డు ప్రసాద్రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకుని ఇంటి ఆవరణలో విచారిస్తున్నారు. రూరల్ సీఐ వెంకట రమణకు ఇద్దరు భార్యలు కావడంతో నారాయణ పాఠశాల వద్ద ఉన్న ఇంటిని సోమవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న మరో ఇంటిని ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. పిల్లలనుంచి పెద్దల వరకు ఎవరిని బయటకుపోకుండా ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు. అప్పటికే ఒక ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోవడంతో ఇంటిలో ఉన్న హోంగార్డ్ ప్రసాద్ రెడ్డి 20 కిలోల బంగారు, నగదు, ఇంటి పత్రాలకు సంబంధించిన వాటిని బ్యాగులో వేసుకొని బయటికి వస్తుండగా.. బయటే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉంచడంతో సీఐ భార్యను పిలిపించి తాళాలు తీసిన అనంతరం ఇంటిలో సోదాలు నిర్వహిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు నారాయణ పాఠశాల సమీపంలో ఉన్న సీఐ ఇంటి వద్దకు రావడంతో అర్బన్ సీతారామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఏసీబీ అధికారులతో మాట్లాడారు. పోలీసుశాఖలో అవినీతి అధికారులు కొనసాగుతున్నారు. డైరెక్టుగా డీఎస్పీలు అయినోళ్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రొద్దుటూరులో గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నతాధికారి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – గతంలో అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యాఖ్యలు. జమ్మలమడుగు కేంద్రంగా విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారు. దేవగుడికి చెందిన వ్యక్తులు లక్షలల్లో జూదం ఆడిస్తున్నారు. కుటుంబాలు సర్వనాశనం అవుతోన్నాయి. వైఎస్సార్ జిల్లా ఎస్పీ స్పందించి జూదం క్లబ్లను కట్టడి చేయండి. – బీజేపీ ఎంపీ రమేష్నాయుడు బహిరంగ లేఖ. భావోద్వేగంతో ఉత్పన్నమైన ఘటనలో పోలీసుస్టేషన్లో పూలకుండీలు పగిలిపోతే హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేస్తారు. బీఎన్ఎస్ సెక్షన్ 190 తొలగించండి, అండర్ సెక్షన్ 35(3)ద్వారా నోటీసు జారీ చేసి విచారించండి. క్రైమ్ నెంబర్ 254/2025 కేసులో పులివెందుల పోలీసులపై హైకోర్టు సీరియస్. – 7241/2025 రిట్ పిటిషన్లో హైకోర్టు ఆగ్రహం -
నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
● రెండు రోజుల పాటు పర్యటన ● మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరిక.. ప్రజలతో మమేకం ● 25వ తేదీ నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్టలో పాల్గొననున్న మాజీ సీఎం పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీ నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని యలహంకలో ఉన్న తన నివాసం నుంచి జక్కూర్ ఎయిరోడ్రోమ్కు బయలుదేరుతారు. 2.50గంటలకు అక్కడికి చేరుకుంటారు. 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరారు. 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 3.55గంటలకు రోడ్డు మార్గాన పులివెందుల క్యాంప్ ఆఫీస్కు బయలుదేరుతారు. 4గంటలకు క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకం కానున్నారు. 7.05గంటలకు క్యాంపు ఆఫీస్ నుంచి తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. 25వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేంపల్లె మండలం నందిపల్లె శివాలయం టెంపుల్కు బయలుదేరుతారు. 10.30గంటలకు శివాలయం వద్దకు చేరుకుంటారు. 10.30గంటల నుంచి 11.30గంటల వరకు నందిపల్లె శివాలయం విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. 11.30గంటలకు తన క్యాంపు ఆఫీస్కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 12.30 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 12.30గంటల నుంచి 2.25గంటల వరకు ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. 2.25గంటలకు బయలుదేరి 2.30గంటలకు క్యాంపు ఆఫీస్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 6.25గంటలకు తన క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి తన నివాసానికి బయలుదేరుతారు. 6.30గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. -
బోయకొండ హుండీ రాబడి రూ:59.69లక్షలు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.59.69లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.59,35,839 రూపాయలు, బంగారం 38గ్రాములు , వెండిి 155 గ్రాములు సమకూరినట్లు తెలిపారు.. వీదేశీ కరెన్సీ నోట్లతో పాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ:34,024, ఉచిత అన్నదాన పథకం నిర్వహణ కోసంఏర్పాటుచేసిన ప్రత్యేక హుండీ ద్వారా రూ.13,495 సమకూరినట్లు చెప్పారు. ఈ ఆదాయం 45 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఎస్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల అంకురార్పణ సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ నిర్వహించారు. ఆలయంలో కలశస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వస్తివచనం, పుణ్యాహవచనం కావించారు. అనంతరం రక్షాబంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణ వైభవంంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవాల కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
మదనపల్లె సిటీ/రాయచోటి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవి రాయచోటిలోని పోలీసుస్టేషన్ చేరుకుని ప్రశ్నపత్రాలు పరిశీలించి చీప్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు ఆఫీసర్ల ద్వారా పంపారు. రాయచోటిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తొలి రోజు జిల్లాలో జనరల్ విభాగంలో 14012 మంది విద్యార్థులకు గాను 13420 మంది, ఒకేషనల్ 1191 విద్యార్థులకుగాను 1022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ రవి తెలిపారు. మదనపల్లెలో 11 పరీక్షా కేంద్రాలోల పరీక్షలు జరిగాయి. పలువురు తల్లిదండ్రులతో విద్యార్థులతో కలిసి పరీక్షా కేంద్రానికి వచ్చారు. విద్యార్థులను హాల్టిక్కెట్లు పరిశీలించి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పరీక్ష కేంద్రం వద్ద వివాదం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె గురుకుల పాఠశాల వద్ద సోమవారం ఉదయం పరీక్షలు రాయడానికి వచ్చిన ఇంటర్ విద్యార్థిని బురఖా తొలగించి చెక్ చేయడం వివాదాస్పదమైంది. పరీక్ష రాసే విద్యార్థినా కాదా అని తనిఖీ చేయడానికి ఇన్విజిలెటర్ మేనక ఆదేశాలతో సిబ్బంది బురఖా తీయాలని విద్యార్థినిని కోరారు. విద్యార్థిని ముఖం కనిపించేలా బురఖా తీసింది. ఆ తర్వాత బురఖా మొత్తం తొలగించాలని కోరడంతో వివాదమైంది. కుటుంబసభ్యులు ఈ విషయమై ప్రశ్నించడంతో వివాదంగా మారింది. అధికారులు, సీఐలు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించడంతో పొరపాటుగా జరిగిన ఘటనగా సిబ్బంది క్షమాపణలు చెప్పడంతో వివాదం సమసింది. -
పొలాలపై ఏనుగుల గుంపుదాడి
పులిచెర్ల(కల్లూరు) : చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని గడ్డంవారి పల్లె, పాతపేట పంచాయతీలలో సోమవారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాల్లో ప్రవేశించి భారీగా పంట నాశనం చేసాయి .గత మూడు నెలలుగా మండలం విడిచి వెళ్లిన 15 ఏనుగులు గుంపుగా తిరిగి సోమవారం రాత్రి మండలానికి వచ్చాయి. ఒంటరి ఏనుగు మాత్రం గత కొన్ని నెలలుగా ఇక్కడే తిరుగుతూ రోజూ ఎక్కడో ఒకచోట పంటలను నాశనం చేస్తున్నది. తాజాగా ఈ ఒంటరి ఏనుగు పాతపేట పంచాయతీలో వేరుశనగ, టమోటా, పూల తోటలను నాశనం చేసింది. అదే సమయంలో ఏనుగుల గుంపు మండలంలోని తూర్పు ప్రాంతంలో తొలిసారిగా గడ్డంవారిపల్లె, పగడాలవారిపల్లె గ్రామాల్లో వరి పైరును తొక్కి నాశనం చేసింది. భాకరాపేట రిజర్వు ఫారెస్టులోకి ఎప్పుడో వెళ్ళి పోయిన ఏనుగులు మళ్ళీ రావడంతో ఫారెస్టు అధికారులు సైతం బిత్తరపోయారు. దీనితో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట పొలాలవద్దకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. -
విన్నపాలు వినవలె..సమస్యలు తీర్చవలె !
వాట్సాప్ సేవలపై ప్రజలలో అవగాహన ● పీజీఆర్ఎస్లో పరిష్కారానికి అర్జీదారుల వేడుకోలు ● వివిధ ఇబ్బందులపై 348 అర్జీల నమోదు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె రూరల్ : ‘ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా మాకు న్యాయం చేయండయ్యా’ అంటూ అర్జీదారులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు ప్రజలు పోటెత్తారు. పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, సర్వే ఏడీ భరత్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీకి న్యాయం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 348 అర్జీలు అందాయి. అర్జీదారులు విన్నవించిన కొన్ని సమస్యలు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం కష్టపడి సంపాదించిన సొమ్మును పరిచయస్తులని నమ్మి ఇస్తే, డబ్బును కాజేయడమే కాకుండా తనపైనే దాడికి పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని హిజ్రా ఇంజరపు స్వాతి ఫిర్యాదు చేశారు. మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న చిరుద్యోగి, అతడి భార్య తనతో సన్నిహితంగా ఉంటూ, పార్టనర్షిప్లో స్కూల్ పెడదామని నమ్మించి విడతలవారీగా రూ.కోటికి పైగా తీసుకున్నారన్నారు. ఎన్నిరోజులైనా తీసుకున్న నగదు ఇవ్వకపోవడం, స్కూల్ పెట్టకపోవడంతో వారిని ప్రశ్నిస్తే.. తమకున్న రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై పలుసార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, అధికారులు వారికే మద్దతుగా మాట్లాడుతున్నారని, తనకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బాధితురాలికి మద్దతుగా దాదాపు పదిమందికి పైగా హిజ్రాలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా పరిహారం కోసం ప్రదక్షిణలు హంద్రీ–నీవా కాలువ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు సంబంధించి పరిహారం కోసం 11 ఏళ్లుగా సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని పీటీయం మండలం కందూరుకు చెందిన రైతులు సాబ్జాన్, వెంకటరమణ, ఈశ్వరయ్య ఫిర్యాదుచేశారు. పలుమార్లు పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని, ఇప్పటికే పరిహారం కోసం ఎదురుచూసి తమలో ముగ్గురు రైతులు మరణించారని, తాము చచ్చాక పరిహారం ఇస్తే ఉపయోగం ఉండదని వాపోయారు. కోర్టులో కేసు ఉన్నా ఆగని ఆక్రమణ చౌడేపల్లె మండలం చారాల కురప్పల్లెలో సర్వే నం.71/14లో 0.28 సెంట్ల భూమికి సంబంధించి కోర్టులో వివాదం ఉన్నప్పటికీ, అదే గ్రామానికి చెందిన జె.సుబ్రహ్మణ్యం దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెంగప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని, ఉన్న విస్తీర్ణం కన్నా అధికంగా భూమిని పాసుపుస్తకాల్లోకి ఎక్కించుకుని ఇతరుల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. మదనపల్లె : వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన పెంచాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలపై భూసేకరణ, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర, పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలు, వాట్సాప్ ద్వారా సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హౌసింగ్– ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను పూర్తి చేయాలన్నారు. -
ఆందోళనలపై నమోదైన కేసుల్లోపోలీసుల కౌన్సెలింగ్
మదనపల్లె : ఏడేళ్ల బాలిక హత్యాచార ఘటనపై మంగళవారం మదనపల్లెలో జరిగిన ఆందోళనలపై నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో నమోదైన వారిపై చర్యల్లో భాగంగా సోమవారం వారిని పోలీస్స్టేషన్ రప్పించారు. అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి శాంతి భద్రతల సమస్యగా మారింది. అలాగే నీరుగట్టువారిపల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించారు. దీనిపై వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఆందోళనలకు డ్రోన్లతో చిత్రీకరించారు. దీనికి ప్రధాన కారకులుగా గుర్తించిన 30 మందిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ చేసిన సీఐలు కే.రాజారెడ్డి, మహమ్మద్ రఫీలు వారిని తిరిగి పంపేశారు. మల్లయ్యకొండ అడవికి నిప్పు తంబళ్లపల్లె : తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండ అడవికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సుమారు 500 ఎకరాలకు పైగా అడవి బుగ్గిపాలైంది. ములకలచెరువు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా ఆలస్యంగా వచ్చారు. మంటలు ఎగసిపడుతుండటంతో ఆర్పేందుకు కుదరక వారు వెనుదిరిగారు. వ్యక్తి ఆత్మహత్య చౌడేపల్లె : కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. మండలంలోని పెద్దయల్లకుంట్లకు చెందిన గణపతిరెడ్డి(52)కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడు. నొప్పి తీవ్రం కావడంతో భరించలేక మద్యం తాగి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతిచెందాడు. మృతుడుకి భార్య పిల్లలు ఉన్నారు. -
సైనిక పాఠశాలలో తనిఖీలు
కలికిరి : దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలలతో పాటు ఇతర ప్రధాన ప్రదేశాలకు ఖలిస్థాని గ్రూప్ పేరుతో ఈ–మెయిల్ ద్వారా పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కలికిరి సీఐ అనీల్కుమార్ ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు కలికిరి సైనిక పాఠశాలను జల్లెడ పట్టాయి. పాఠశాల ఆవరణలోని ఆడిటోరియం, విద్యార్థుల వసతిగృహాలు, సిబ్బంది గదులు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కార్యాలయాలు, విద్యార్థుల తరగతి గదులు, పరిపాలన భవనం, మెస్, క్వార్టర్స్లలో తనిఖీ చేశారు. తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు, సైనిక పాఠశాల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ–మెయిల్ కేవలం బెదిరింపు మాత్రమే అని నిర్ధారిస్తూ, సైనిక పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది, అధికారులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైనిక పాఠశాల వద్ద భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే ప్రజలు వెంటనే 112 డయల్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.


