మదనపల్లెటౌన్ : ప్రియురాలి ఇంటి వద్దే ప్రియుడు పెట్రోల్ పోలీసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన విజయ్ కుమారుడు ప్రదీప్(19), పదో తరగతి వరకు చదివి స్కూలు మానేశాడు. ఇనుప సామాన్లతో గుజిరి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో తనతో పాటు పదోతరగతి వరకు చదివిన, కురబలకోట మండలానికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఇష్టంగా ఉండడంతో కుటుంబీకులకు వ్యవహారం తెలిసి ప్రొద్దుటూరు నుంచి యువతిని తల్లిదండ్రులు ఇటీవల ఇంటికి తీసుకు వచ్చేశారు.
అయితే అమ్మాయి తన ప్రియునికి ఆదివారం ఫోన్చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో రాత్రి కురబలకోటకు ప్రదీప్ వచ్చాడు. ఉదయం ప్రియురాలి ఇంటికి వెళ్లి తన వెంట పంపించాలని ప్రదీప్ కోరడంతో తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ముందుగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పు అంటించు కున్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించగా కోలు కుంటున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధురామచంద్రడు తెలిపారు.
పోక్సో కేసులో
నిందితుడు అరెస్టు
ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లెకు చెందిన పోతుల హరినాథ్(42) ఒక మైనర్ బాలికను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ కేసునమోదు చేశారు నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు.రిమాండ్ తరలించామని చెప్పారు.


