ఉద్యాన సాగుకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన సాగుకు ప్రాధాన్యత

Mar 3 2026 8:06 AM | Updated on Mar 3 2026 8:06 AM

మసనపల్లె : జిల్లాలో ఉద్యానవన సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం (డీడీఆర్‌సీ) ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ హార్టికల్చర్‌ సాగు పెంచడం కోసం కలెక్టర్‌కు సూచనలు చేసినట్టు చెప్పారు. రూ.300 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు, జిల్లా అధికారుల కృషితో భూగర్భజలాలు వృద్ధి చెందాయని చెప్పారు. దీనిఫలితంగా జిల్లా జీడీపీ రూ.1,100 కోట్లు పెరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. డీడీఆర్‌సీకి ఇన్‌చార్జి మంత్రి జనార్దనరెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్‌బాషా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కొన్నిశాఖలకే పరిమితం

డీడీఆర్‌సీ సమావేశంలో జిల్లాలోని ప్రధానశాఖలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యమైన రహదారి భవనాలు, డ్వామా, డీఆర్‌డీఏ, ఏపీఎంఐపీ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితరశాఖలపై సమీక్షగా అధికశాఖలకు సంబంధించిన అభివృద్ది, కార్యకలాపాలపై సమీక్ష జరగలేదని తెలిసింది. ఈ సమావేశం మూడు గంటలకుపైగా జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా జిల్లాశాఖల అధికారులు సమావేశానికి బయట ఉండటం కనిపించింది.

ప్రజలకు మెరుగైన పాలన అందించాలి

జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ భవనంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్‌బాషా, జిల్లా అధికారులతో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు.జిల్లాలో వేరుశెనగ, ఉలవ తదితర పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని యూరియా కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలపగా, యూరియా కొరత ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌ రెడ్డి కోరారు.పల్లె పండుగ పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అడవిపల్లి, శ్రీనివాసపురం రిజర్వాయర్‌, హంద్రీ–నీవా ప్రధాన కాలువ పనులు ఝరికోన ప్రాజెక్టుపై సమీక్షించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పనులను చేస్తే రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని గోశాలల కోసం రైతుల దరఖాస్తులను మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.

ఇన్‌ఛార్జి మంత్రి జనార్దనరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement