breaking news
Annamayya District News
-
ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా పనిభారం
నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వరకు ఏ కమిషనైనా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని చెప్పినా ప్రభుత్వం మారడం లేదు. ఉపాధ్యాయులను రకరకాల యాప్లతో, వెబ్ కాన్ఫరెన్స్లతో, రిపోర్టులతో ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఒత్తిడి పెంచి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇప్పటికై నా ఉపాధ్యాయులను ప్రశాంత వాతావరణంలో విద్యార్థులతో మమేకమై బోధించే వాతావరణాన్ని కల్పించాలి. అలాగే బోధనేతర పనులకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. – లెక్కల జమాల్ రెడ్డి, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. -
రంగ రంగ..వైభవంగా..
● కదిలింది శ్రీరంగనాథుని బ్రహ్మరథం ● దారిపొడవునా గోవింద నామస్మరణలు, భజనలు ● ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజాద్రవ్యాలు సమర్పించారు. ఆ దేవదేవుడిని దర్శించి తరించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అక్కడక్కడా భక్తులకు ప్రసాదాలు, శీతల పానీయాలను పంపిణీ చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కో–ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి పాల్గొన్నారు. -
డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు
– జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కురబలకోట : యువత, విద్యార్థులు డ్రగ్స్ మత్తులో పడకుండా డ్రీమ్స్ నెరవేర్చుకోవడంపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శనివారం ఉదయం అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ సహకారంతో అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్–ఎస్ టు లైఫ్ నినాదంతో త్రీకే రన్ నిర్వహించారు. కురబలకోట మండలంలోని రిషివ్యాలీ క్రాస్ నుంచి అంగళ్లు సర్కిల్ వరకు ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ రన్ నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అంటే ఆనందం కాదన్నారు. అది భవిష్యత్తును విచ్ఛిన్నం చేసే మరణ శాసనం లాంటిదన్నారు. వివిధ అనర్థాలకు దారి తీస్తుందన్నారు. తద్వారా జీవితం నాశనం అవుతుందన్నారు. కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆరోగ్యకర జీవితం, ఆపై ఉజ్వల భవిత కోసం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చదువులో రాణించి, క్రీడలు, వ్యాయామం, సానుకూల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు సాగించాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారుంటే సమాచారం ఇస్తే గోప్యంగా ఉంచుతామన్నారు. వారికి తగిన కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీరిచ్చే సమాచారం ఓ కుటుంబానికి కొత్త వెలుగును ఇస్తుందన్నారు. డ్రగ్స్ సరఫరా విక్రయదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మిట్స్ ఏంఎస్ఆర్ క్లబ్ డ్రగ్స్పై నిర్వహించిన స్కిట్ ఆలోచింపజేసింది. హృదయాన్ని కదిలించింది. పలువురు కంటతడి పెట్టారు. విద్యార్థుల్లో నూతన చైతన్యాన్ని నింపిన ఈ కార్యక్రమంలో వీసీ యువరాజ్, ప్రదీప్, రామనాథన్, డాక్టర్ తులసీ రామ్నాయుడు, మారుతీ ప్రసాద్, శ్రీనివాసులు, ముస్తఫా, యుగంధర్, పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీవ్ర మానసిక ఒత్తిడి
కూటమి ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూనే.. నిరంతరం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయలేక, మరో పక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు బోధనేతర కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తోంది. –విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె అర్బన్ : తీవ్రమైన కడుపునొప్పి భరించలేక మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లెకు చెందిన నాగరత్నమ్మ(44) కూలీ పనులు చేస్తుండేది. ఈ నేపథ్యంలో ఈమె కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే శనివారం నొప్పి అధికం కావడంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కోడి పందెం స్థావరంపై దాడులు వాల్మీకిపురం : మండల పరిధిలోని తాటిగుంటపల్లి సమీపంలో కోడి పందెం స్థావరంపై పోలీసు లు శనివారం దాడులు నిర్వహించారు. ఓ మామి డి తోటలో కోడి పందెం ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,80,270 నగదు, 14 సెల్ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎస్ఐ తిప్పేస్వామితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. యువతి అదృశ్యం బి.కొత్తకోట : స్థానిక బీసీ కాలనీకి చెందిన యువతి అదృశ్యమైందని తండ్రి ఫి ర్యాదుపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీసులు తెలిపారు. కూలీ పనులతో జీవిస్తున్న మహ్మద్ హుస్సే న్ సాబ్ కుమార్తె అర్షియా (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లిన అర్షియా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూతో జీవన ప్రమాణాలు పెంపు
మదనపల్లె రూరల్: మహిళా స్వయంసహాయక బృందాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దీనదయాళ్ అంత్యో దయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే ఆహారం, పోషణ, ఆరోగ్యం, వాష్ (ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ) అని డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం మదనపల్లె మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో 15 మండలాలకు చెందిన వెలుగు ఏపీఎం, సీసీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ ద్వారా కేవలం జీవనోపాధి కల్పన మాత్రమే కాకుండా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన పెంచి, కుటుంబాల ఆరోగ్యాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాల సభ్యు లు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ వెళ్లి గ్రామ సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు వేయి రోజుల కార్యక్రమం, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, సేంద్రియ వ్యవసాయం పథకాల్లో మహిళల పాత్రపై వివరించారు. సీడీపీఓ నాగవేణి, డీపీఎం ధర్మరాజు, ఏపీఎం ఖిజర్ హయత్ ఖాన్ పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు -
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ జెడ్పీహైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన బయాలజీ ఉపాధ్యాయుడు జాకీర్ను డీఈవో సుబ్రమణ్యం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు హెడ్మాస్టర్ రామచంద్ర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయుడిపై తీరుపై విద్యార్థినిలు ఫిర్యాదు చేశారన్నారు. ఈసంఘటనపై రెండు రోజుల క్రితం మదనపల్లె డీవైఈవో లోకేశ్వరరెడ్డి విచారణ జరిపారన్నారు. ఈనేపథ్యంలో శనివారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణా లు, సృజనాత్మకత, వికసిత్ భారత్కు అవసరమైన దృక్పఽథాన్ని పెంపొందించేందుకు ప్రేరణ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోను తప్పకుండా నిర్వహించాలన్నారు. సీబీఎస్సీ, కేవీకే, జేఎన్వీ పాఠశాలలో పాటు అన్ని పాఠశాలలు స్కూల్ లెవల్ ప్రేరణ ఉత్సవ్లో పాల్గొనాలన్నారు. ఈనెల 10న పాఠశాల స్థాయిలో 8,9,11 తరగతుల విద్యార్థులకు వికసిత్ భారత్, సమాజం, దేశం కోసం నా భాగస్వామ్యం అంశాలపై తమ ప్రతిభను ప్రదర్శించేలా పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకత వంటి ప్రమాణాల ఆధారంగా పాఠశాలకు ఇద్దరిని ఎంపిక చేస్తామని వివరించారు. పీలేరు రూరల్: పీలేరులో ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పరిపాలన గదులను సందర్శించి, కేటాయించిన సిబ్బంది, పరిధిలోని మండలాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. రికార్డులను పరిశీలించి, కార్యాలయ ఆవరణలో పచ్చదనం పెంచాలన్నారు. అనంతరం తిరుపతి మార్గంలోని ఆయిల్ సీడ్స్ను సందర్శించి, దానికి కేటాయించిన భూమి వంటి వివరాలను తహసీల్దార్ శివకుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
మదనపల్లె అర్బన్ : జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన వెంకటరమణ(45)వ్యవసాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. దారిలో సర్కార్తోపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆటోలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొని మదనపల్లె టౌన్ : ద్విచక్రవాహనం ఢీకొని రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. బాలినాయునిపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులు(70) సొంత పని మీద బైకుపై సోమల మండలంలోని కందూరుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని మఠంతోపు వద్ద మరో బైకు ఢీకొని కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని స్థానికులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు వైద్యం అందించారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులు ఢీకొని.. పుంగనూరు : మండలంలోని కృష్ణదేవరాయ సర్కిల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనా లు ఢీకొనడంతో ఒక వ్యక్తి గాయపడిన సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లె మండలం బాపలనత్తంకు చెందిన వెంకటేష్(30) ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగింది. బా ధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆటో– కారు ఢీ.. వాల్మీకిపురం : ఆటో – కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని హైవేపై చోటు చేసుకొంది. తిరుపతి నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ నగేష్కు కుడి కాలు విరిగిపోయింది. దీంతో హైవే అంబులెన్స్లో నగేష్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగేష్ను మదనపల్లికి రెఫర్ చేశారు. ఈ మేరకు ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న శ్రీనివాసులు గాయపడిన నగేష్ -
సిండికేటా.. పరోక్ష ఒత్తిళ్లా?
మదనపల్లె: మదనపల్లె దినసరి, వారపు సంత మార్కెట్ల గుత్తల అప్పగింత టెండర్లను శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే.ప్రమీల నిర్వహించారు. దీనికి కేవలం ఇద్దరే హాజరయ్యారు. క్రితం సారి వేలంలో పలికిన ధరకు అనుగుణంగా మరుసటి ఏడాది గుత్తలకు ధర నిర్ణయించి వేలంపాటల ద్వారా అప్పగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుత్తల వ్యవహరం గందరగోళానికి దారితీసిన విషయం విదితమే. 2024–25లో దినసరి మార్కెట్ రూ.1.18 కోట్లు, వారపుసంత రూ.42 లక్షలు పలికింది. దీనికి అనుగుణంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి వారపుసంతకు రూ.45 లక్షలు, దినసరి మార్కెట్కు రూ.1.20 కోట్లుగా నిర్ణయించి వేలంపాటను ప్రారంభించారు. కమిషనర్ నిర్వహించిన ఈ వేలంపాటలో ఇద్దరు మాత్రమే పాల్గొనడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నిర్ణయిచిన ధర అధికమని హాజరైన ఇద్దరు కమిషనర్ దృష్టికి తెచ్చారు. నిర్ణయించిన ధరకు అదనంగా 18శాతం జీఎస్టీ చెల్లించాలని కమిషనర్ చెప్పగా ఆ మొత్తం చెల్లించలేమని పాటదారులైన ఆ ఇద్దరు పేర్కొన్నారు. గతంలోనూ ప్రతి వేలానికి సంబంధించిన గుత్తకు 18శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నామని, ఇది జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి అమలవుతోందని కమిషనర్ వారికి వివరించారు. అయినప్పటికీ ఈ నిర్ణీత ధరను తగ్గించాలన్న ప్రతిపాదన చేయగా... ఇది సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీంతో ఆ ఇద్దరు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొదటి వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో మరోసారి వేలంపాటలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. మదనపల్లె సంత, డైలీ మార్కెట్ వేలానికి ఇద్దరే హాజరు ఽఆపై ధర భరించలేమంటూ వెనక్కు.. -
విచారణకు పిలిచి.. చేతి వేళ్లు విరిచి..
● ఓ వృద్ధుడిపై ఖాకీల ప్రతాపం ● మదనపల్లె పోలీసులపై సీఐ విచారణ మదనపల్లె టౌన్ : భార్య ఫిర్యాదు చేసిందని పోలీస్స్టేషన్కు రప్పించిన పోలీసులు.. భర్త చేతి వేళ్లను విరిగేలా కొట్టిన ఉదంతం శనివారం మదనపల్లెలో జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం కొండకింద గొల్లపల్లెకు చెందిన ముద్దలమేని వెంకటరమణ(57) భార్య నరసమ్మ(47)గత కొంత కాలంగా మానసిక స్థితి బాగలేక తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో నరసమ్మ పలు విధాలుగా ప్రవర్తించేది. గ్రామంలో స్థానికులతో గొడవలకు దిగేది. ఇందులో భాగంగానే భర్త, బిడ్డలతో ఇబ్బందికరంగా వ్యవహరించేది. గతంలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో భర్త వెంకటరమణ తన భార్య పిల్లలతో మదనపల్లెలోని అనపగుట్టకు వచ్చి నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ నరసమ్మ మానసికస్థితిలో మార్పు రాలేదని వెంకటరమణ పేర్కొన్నాడు. ఈ పరిస్థితిలో నరసమ్మ రెండు రోజుల క్రితం కలకడలోని గొల్లపల్లెకు వెళ్లి స్థానికులతో గొడవ పడి, బసినికొండలోని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం టూటౌన్లో తన భర్త ఓ మహిళతో వివాహేతర బంధంతో తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన టూటౌన్ పోలీసులు వెంకటరమణను స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ఏమి జరిగిందో కానీ చితకబాది, చేతివేళ్లు విరిగేలా గాయపరిచారు. తర్వాత బాధితున్ని పోలీసులే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎడమ చేయి వేలు విరిగిందని, దానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. అలాగే పెదవి లోపల అయిన గాయానికి ఆరు కుట్లు వేశారు. ఈ మేరకు బాధితుడు రాత్రి టూటౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి తన గోడు చెప్పుకొన్నాడు. ఈ విషయమై సీఐ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా వెంకటరమణపై సిబ్బంది చేయి చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాస్తవాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. -
కుట్రకు బూడిదైన టమాట సీడ్ కట్టెలు
రూ. 1.65 లక్షల నష్టంకురబలకోట : టమాట సాగుకు వినియోగించే సీడ్ కట్టెలకు నిప్పంటించడంతో.. కాలి పూర్తిగా బూడిదైన సంఘటన కురబలకోట మండలం కమతంపల్లి సమీపంలో శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. బాధిత రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంగళ్లు గ్రామం కమతంపల్లికి చెందిన ఆవుల రవీంద్ర ఊరికి సమీపంలోని బైపాస్ పక్కన పొలంలో ఏడు వేల టమాట సీడ్ కట్టెలు నిల్వ చేశారు. టమాట సాగుకు, కుటుంబ భవిష్యత్తుకు ఎంతో ఆశతో వీటిని భద్రపరిచారు. శనివారం వేకువ జామున ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. సమాచారంతో ఆగమేఘాలపై వెళ్లి చూశారు. అప్పటికే చూస్తుండగానే మంటలకు కట్టెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కళ్లెదుటే రైతు కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే నిస్సహాయుడిగా మిగిలారు. రూ.1.65 లక్షల విలువ చేసే కట్టెలు ఉన్నపాటున కాలిపోవడంతో ఆ రైతుకు వేదన మిగిల్చింది. ఇతనికి మరో రైతు మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ కారణం చేత గిట్టని వారు టమాట కట్టెలకు నిప్పంటించి ఉంటారని బాధిత రైతు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. -
కొండకు నిప్పు.. చారిత్రక సంపదకు ముప్పు
కాలిపోతున్న కొండ కొండలో చెలరేగుతున్న మంటలు గుర్రంకొండ : చారిత్రాత్మక గుర్రంకొండ కొండకు నిప్పు పెట్టడంతో.. చారిత్రక సంపదకు ముప్పు ఏర్పడింది. ఈ కొండలోనే చారిత్రాత్మక కట్టడాలతోపాటు పురాతన భవనాలు, కోటగోడలు ఉన్నాయి. సుమారు 500 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండుగులు కొండకు వెనుకవైపు నిప్పు అంటించారు. దీంతో కొండలో సగానికిపైగా కాలిబూడిదైంది. కొండ ముందు భాగంలో ఉన్న కోటగోడలు, కొండపై భాగం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో చెట్లు మొత్తం కాలిపోయాయి. మంటల్లో చిక్కుకొని అడవి జంతులు, పక్షులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొండ పరిసరాల్లో ఉన్న కొత్తపేట వీధి, పోలేరమ్మ వీధుల్లో దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. మంటలు అదుపు చేయడానికి పురావస్తు శాఖ సిబ్బంది, అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కనీసం అగ్నిమాపక వాహనమైనా వస్తుందేమోనని గ్రామస్తులు ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించారు. ఆయితే కొండలు, గుట్టల్లో చెలరేగే మంటలను తాము అదుపుచేయలేమని వారు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీలేక మంటలను అలాగే వదిలేశారు. దీంతో దాదాపు కొండ మొత్తం కాలిబూడిదయ్యింది. గత కొన్ని రోజులుగా దుండుగులు కావాలనే గుర్రంకొండ పట్టణం చుట్టూ ఉన్న కొండలకు నిప్పు అంటిస్తుండడంతో.. కొండలు, గుట్టల్లో ఉన్న వృక్ష, జంతు సంపద కాలిబూడిదవుతోంది. -
● రూ.187 కోట్ల పనులు
మదనపల్లె: మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం ప్రశ్నార్థకమవుతోంది. మార్చి 31 నాటికి నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతే వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సద్వినియోగం బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కోసం కౌన్సిలర్లు నిత్యం ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నారు. రూ.45 కోట్ల నిధులు మదనపల్లె మున్సిపాలిటీకి 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.45,11,28,679 నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరయ్యాయి. ఇందులో టైడ్, అన్టైడ్ నిధులు కేటాయించారు. టైడ్ నిధులను స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా చేపట్టే పనుల కోసం ఖర్చు చేస్తారు. ఇక్కడి నిధులను కార్పొరేషన్కు చెల్లిస్తే సంస్థ పనులు చేపడుతుంది. ఆన్టైడ్ నిధులను మున్సిపల్ అధికారులు కౌన్సిల్ తీర్మాణాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టైడ్కు కేటాయించిన నిధులు అధికంగా ఉన్నాయి. ఈ మొత్తం నిధుల్లో రూ.16,57,36,372లు ఖర్చు చేశారు. ఇంకా రూ.28,53,92,302లు నిల్వ ఉన్నాయి. ఈ నిధులను పూర్తిగా వినియోగించుకునేందుకు మిగిలింది 52 రోజులే. మార్చి 31 సమీస్తున్నందున అధికారులు నిధులను ఎలా సద్వినియోగం చేస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. ఈ నిధులు పూర్తిగా సద్వినియోగం అవుతాయా .. వెనక్కు వెళ్తాయా అనేది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. రూ.4.82 కోట్ల పనులు రద్దు 2020–21లో 15వ ఆర్థిక సంఘం నిధులు సద్వినియోగం కాలేదు. ఈ నేపథ్యంలో అన్టైడ్కు సంబంధించి రూ.37 లక్షలు, టైడ్కు సంబంధించిన రూ.2.63 కోట్లు, కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఇవ్వాలన్న కారణంతో రూ.1.09 కోట్ల విలువైన 14 పనులను కాంట్రాక్టర్లు రద్దు చేసుకున్నారు. 2021–22లో రూ.63.10 లక్షల విలువైన 11 పనులు రద్దయ్యాయి. దీంతో ఆర్థిక సంఘ నిధులు రూ.4.82 కోట్లను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లు కోవిడ్ కష్టాలు ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గానికి కోవిడ్ కష్టాలు వెంటాడాయి. రెండేళ్లపాటు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. దానికితోడు లాకౌట్ పరిస్థితులు అభివృద్ధికి, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అడ్డంకిగా ఏర్పడింది. ఈ కారణంగా నిధుల వినియోగంలో కొంత జాప్యం జరిగింది. ఈ రెండేళ్లు నిధులను ఖర్చు చేయలేని పరిస్థితి వల్ల నిధులు నిల్వ పెరగడానికి కారణమైంది. మదనపల్లె మున్సిపాలిటీ పర్సులో రూ.కోట్ల నిధులు.. ఖర్చుకు మార్చి 31 వరకు గడువు వినియోగించకుంటే వెనక్కి వెళ్లే అవకాశం ప్రయత్నిస్తున్నాం నిధులను మార్చి 31లోగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేస్తు న్నాం. ఇప్పటికే అభివృద్ధికి వినియోగానికి సంబంధించిన చర్యలు చేపట్టాం. జరుగుతున్న పనులపై చర్యలు వేగవంతం చేశాం. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయించేలా కృషి చేస్తున్నాం. –కే.ప్రమీల, కమిషనర్ ప్రస్తుత కౌన్సిల్ హయాంలో ఇప్పటిదాకా రూ.187.62 కోట్ల అభివృద్ధి చేపట్టింది. పట్టణ ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంది. తాగునీరు, మురికినీటి కాలువలు, రోడ్లు, నీటి సరఫరా మెరుగు, పారిశుధ్యం తదితర వాటికి నిధులను వెచ్చించేందుకు కౌన్సిల్ తీర్మాణాలను ఆమోదించింది. సొంత నిధులు, జీజీఎంపీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ వ్యయం చేశారు. తాజాగా రూ.10.96 కోట్లతో పనులు చేపడుతున్నారు. అందులో రూ.2.32 కోట్లతో 59 పనులు, రూ.3.67 కోట్లతో 40 పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇవిగాక రూ.4.96 కోట్లతో 110 పనులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. వీటిలో పైప్లైన్, తాగునీటి బోర్లు, మురికినీటి కాలువల పనులు ఉన్నాయి. -
ఉపాధ్యాయుడి తీరుపై డీవైఈవో విచారణ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ తీరుపై మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి విచారణ చేశారు. తదుపరి చర్యల కోసం ఆయన డీఈవోకు నివేదిక పంపారు. కాగా ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జాకీర్ కొంత కాలంగా బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం షీటీమ్ సభ్యులు స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్టచ్, బ్యాడ్టచ్లపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. దీంతో హైస్కూల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థినులు సదరు ఉపాధ్యాయుడి తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్మాస్టర్ రామచంద్ర జరిగిన సంఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను విచారణ చేశారు. విచారణ నివేదికను డీవైఈవో, డీఈవోకు అందజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్కు మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి వచ్చారు. ముందుగా ఎంఈవో సురేంద్రబాబుతో కలిసి హెడ్మాస్టర్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రవర్తన, తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులతో వేర్వేరుగా విచారించారు. ఓ ప్రత్యేక గదిలో విద్యార్థినులకు తెల్లకాగితాలు ఇచ్చి సదరు ఉపాధ్యాయుడి తీరుపై లిఖిత పూర్వకంగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. మరో గదిలో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెల్లకాగితాలు ఇచ్చి ఉపాధ్యాయుడి తీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఈ మొత్తం విచారణ నివేదికలను డీఈవోకు సమర్పిస్తామని డీవైఈవో పేర్కొన్నారు. జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ అధికారులు, మహి ళా పోలీసులు, మండల విద్యా శాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరపడం గమనార్హం. పోక్సో కేసు నమోదు మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు జాకీర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుడు జాకీర్ పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తమకు శుక్రవారం ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు. చర్యలకు డీఈవోకు నివేదిక -
నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
రాయచోటి : బంగారు నగలు, మోటారుబైకుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ము ఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ .10.62 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. శుక్రవారం రాయచోటిలోని కార్యాలయంలో ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. రా యచోటి, రామాపురం మండలాల పోలీసులు సమన్వయంతో పని చేసి రెండు వేర్వేరు ఆపరేషన్లలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలను అరెస్టు చేశారన్నారు. రామాపురం పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దర్సినాల ఏడుకొండలు, పందిటి ఉదయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.10,62,320 విలువ గల 62 గ్రాముల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. అలాగే రాయచోటి బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులను మోసగించి సొత్తు దోచుకుంటున్న జోగిరి వెంకటలక్ష్మి, జోగిరి అంజనమ్మను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి లాంగ్ చైన్, చోకర్ కమ్మలు, నెక్లెస్లను రికవరీ చేసినట్లు వివరించారు. బంగారు ఆభరణాల విషయంలో ప్రజలు స్వయం రక్షణ పా టించాలని ఎస్పీ సూచించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల లో విలువైన ఆభరణాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వ్యాపారి సంస్థ, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని తెలియపరిచారు. మీ వీధి లేదా పరిసరాలలో కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులు అందజేశారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణ మోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్ కృష్ణమరాజు నాయ క్, రాయచోటి ఇన్స్పెక్టర్ బీవీ చలపతి, రామాపురం ఎస్ఐ కేవీ శివకుమార్, రాయచోటి ఎస్ఐ విష్ణువర్దన్, పీసీలు అబ్దుల్ కలాం, శ్రీనివాసులు, రవీంద్రరాజు, నవీన్ కుమార్, సీసీఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్ర, హోంగార్డులు గంగిరెడ్డి, తహర్బాషాలకు ఎస్పీ నగదు రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు. రూ .10.62 లక్షల నగలు స్వాధీనం -
అత్యాచారయత్నంపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లెలో గురువారం రాత్రి స్థానికుడైన సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక పాత కక్షలు కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి డీఎస్పీ కార్యాలయాలనికి శుక్రవారం వచ్చి తనపై అత్యాచారయత్నం చేశారని ఆరోపిస్తూ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. ఒంటరి వ్యక్తిపై అమానుష దాడి – పార్టీ స్టిక్కర్ తీయకపోవడంతో కొట్టిన వైనం మదనపల్లి టౌన్/కురబలకోట : అయిన వారు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న మండలంలోని తుమ్మచెట్లపల్లికి చెందిన జరిపిటి సురేంద్ర(56)పై అమానుష దాడి జరగడంతో పలువురిలో విచారం వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి ఇతనిపై సమీప బంధువులే విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర రక్తగాయాలకు గురి చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఆసుపత్రిలో దయనీయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. జరిపిటి సురేంద్రకు తల్లిదండ్రులు చనిపోయారు. భార్య ఎప్పుడో వెళ్లిపోయింది. అతని వద్ద ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉంటున్నాడు. ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. గతంలో మద్యం తాగేవాడు. ఆరేళ్లుగా మద్యం కూడా మానేసి మారిన మనిషిగా ఊరిలో పేరు తెచ్చుకున్నాడు. తెలిసిన వారు పిలిస్తే పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కలకలం రేపిన సంఘటనపై శుక్రవారం గ్రామంలో ఎస్ఐ మధు రామచంద్రుడు విచారణ జరిపారు. బాధితుడు సురేంద్రకు టూవీలర్ ఉంది. దీనిపై ఓ పార్టీకి చెందిన స్టిక్కర్ వేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన అతన్ని పక్కింట్లో ఉన్న రమణయ్య టూవీలర్పై ఉన్న స్టిక్కఽర్ తొలగించాలన్నాడు. దీంతో మాటకుమాట పెరిగి వివాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. ప్రత్యర్థులు రమణయ్యతోపాటు ఐదుగురు ఇతనిపై అమానుషంగా కట్టెలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలు అయినట్లు విచారణలో తేలినట్లు ఎస్ఐ తెలిపారు. ఒక చెయ్యి కూడా విరిగిపోయింది. శుక్రవారం ముదివేడు పోలీసులు తిరుపతి ఆసుపత్రికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రమణయ్యతోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఈ సంఘటన పరిసర ప్రాంతాల్లో కలకలాన్ని సృష్టించింది. యువతి అదృశ్యం రాయచోటి : మతిస్థిమితం లేని యువతి షేక్ షమీమ్(31) రాయచోటిలో అదృశ్యమైనట్లు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గురువారం సాయంత్రం కడపకు వెళ్లడానికి నారాయణరావు కుమార్తె షమీమ్తో కలిసి ఇంటి నుంచి బస్టాండుకు చేరుకున్నారు. కుమార్తెను బస్టాండులో వదిలి బైక్ పార్క్ చేసి తిరిగి వెళ్లే సమయానికి కుమార్తె కనిపించలేదు. రోజంతా వెతికినా కనిపించకపోవడంతో శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తండ్రి నారాయణరావు తెలిపారు. ఫిర్యాదు పై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అర్బన్ పోలీసులు పేర్కొన్నారు. -
నాటు ఆవుకు పుంగనూరు దూడ జననం
చౌడేపల్లె మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ దాదేపల్లెకు చెందిన షేక్ రాహుల్కు చెందిన నాటుఆవు(అల్లికారుజాతి)కు శుక్రవారం పుంగనూరు జాతి దూడ జన్మించింది. పశువైద్య సిబ్బంది సూచనల మేరకు పుంగనూరు జాతి సెమన్ వేయించామని, అంతేకాక వారి సలహాలు పాటించడంతో పుంగనూరు జాతి పేయిదూడ జన్మించిందని రాహుల్ తెలిపారు. చిన్నపాటి ఎత్తు గల పుంగనూరు మేలు జాతి దూడను చూసేందుకు గ్రామస్తులు క్యూకట్టారు. ఈ జాతి దూడలు, ఆవులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. – చౌడేపల్లె ఆక్రమణల తొలగింపు షురూ మదనపల్లె : మదనపల్లె పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు చర్యలు మొదలయ్యాయి. శుక్రవారం పటేల్రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జేసీబీలతో తొలగించారు. దుకాణ దారులు రహదారిని ఆక్రమించి దానిపై మెట్లు, బోర్డులు, వాహనాల పార్కింగ్ కోసం, దుకాణాలకు వచ్చేవారికి విశాలమైన స్థలం ఉండేలా ఇలాంటి ఆక్రమణలను చేశారు. వీటిని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఈ రహదారి పక్కనే ఆస్పత్రి ఉండగా దాని కాంపౌండ్ గోడవైపు మొత్తం రోడ్డు ఆక్రమించారు. వాటిపై నిర్మాణాలు, బంకులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారో అని స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధుల్లో ఇలాగే ఆక్రమణలను తొలగిస్తారా లేదా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయి చర్యలపై అనుమానాలు -
26న నూతన మఠాధిపతికి పట్టాభిషేకం
● మూడు రోజుల పాటు కార్యక్రమాలు ● ఘనంగా ఏర్పాట్లు బ్రహ్మంగారిమఠం(వైఎస్ఆర్ జిల్లా) : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతిగా శ్రీ వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2021 మే 8న శివైక్యం చెందారు. తదుపరి మఠాధిపతి పదవీ కోసం వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు ఒకరికొకరు పోటీ పడటంతో జాప్యం జరిగింది. ప్రధానంగా పూర్వపు మఠాధిపతి పెద్ద భార్య జ్యేష్ట పుత్రుడు వెంకటాద్రిస్వామి, రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామి తీవ్రంగా పోటీ పడ్డారు. కోర్టు కేసులు నడిచాయి. చివరికి ధార్మిక పరిషత్ వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నియమించింది. ఆయన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం మునిమనవడు. ఇప్పటి వరకు బ్రహ్మంగారిమఠానికి 11 మంది మఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వెంకటాద్రిస్వామి 12వ మఠాధిపతి. 24 నుంచి కార్యక్రమాలు వెంకటాద్రిస్వామి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్నాయి. 24న ఉదయం సుప్రభాతం, మంగళతోరణ బంధన, మృత్తికా స్నపనం, సర్వ ప్రాయశ్చిత్తాలు, ప్రత్యక్ష కృఛ్రత్రయాలు, వేదోపనిషత్ పారాయణ, మంగళద్రవ్యాలతో అధిష్టాన మూర్తి దైవదర్శనం, అనుజ్ఞ, సప్త గోప్రదక్షిణ పూర్వక గోపూజ, ప్రధాన సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశన, రక్షాబంధన, అఖండ స్థాపన, రుత్విగ్వరణ, ధీక్షాధారణ, ప్రధాన కలశ స్థాపన, ఆయుష్య సూక్త పారాయణ, రుగ్వేద, యజుర్వేద పారాయణ, సర్వతోభద్ర మండల, కాలచక్ర, నవగ్రహ, దిక్పాలక, అధిష్టాన మూర్తుల, పూర్వ మఠాధిపతుల స్మరణ ఆవాహన, అగ్ని ప్రతిష్టాపన, అష్ట ద్రవ్య సహిత విశేష గణపతి హోమం, షోడశోపచార పూజలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, నిత్య విధులు, వేద పారాయణం, నిత్య హోమం, మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితరాలు నిర్వహించనున్నారు. ● 25న ఉదయం వేదోపనిషత్ పారాయణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, పంచగవ్య ప్రాశన, ఆవాహిత మండపార్చనలు, కూష్మాండ సూక్త పారాయణ, సూర్యోపాశన, సూర్య నమస్కారాలు, హోమం, సప్తసాగర జీవనదుల వైదిక పూర్వక కలశా వాహనములు, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కాలజ్ఞాన చూర్ణికా హోమాలు, దూపదీప నైవేద్య మంత్ర పుష్ప నీరాజన తీర్థ ప్రసాదాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాయంత్రం నిత్య విధులు, సామ్రాజ్య మహాలక్ష్మీ సూక్త పారాయణం, హోమాలు, సప్తసాగర జీవ నదులు మంత్ర జలాలతో విశేష స్నపనం, వైదిక హోమం, వేదపారాయణం, మంత్ర పుష్పం, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ● 26న ఉదయం వేద సూక్త పారాయణ, గణపతి పూజ, పుణ్యాహ వాచన, ఆవాహనాది దేవతా హోమాలు, సర్వశాంతర్థ్యం, రుద్రహోమం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారి బీజాక్షర సహిత చూర్ణికా హోమం, జయాది హోమం, మహా పూర్ణాహుతి, సాగర నదీ జలాల ఆవాహిత జలాలను సమంత్రకంగా, ప్రధాన కలశంలోనికి సమ్మేళన చేయుట, అవబృథస్నానం, పట్టాభిషేక వేదిక ప్రవేశం, కిరీట, ఛత్ర, చామర, ఆందోళిక అంగుళ్యీభరణ, మకరకుండల, శిఖాముద్రిక, సింహతలాట, సంహాసనాది, పేనదండ, రుద్రాక్షమాల, పాదుకా పూజ, సుమూర్తానికి ధారణ, అధిష్టాన మూర్తిదర్శనం, వేద స్వస్తి పండిత సత్కారం కార్యక్రమాలు చేపడుతారు. సాయంత్రం నూతన మఠాధిపతుల అనుగ్రహ భాషణం, వేదోక్త మంగళశాసనాలు ఉంటాయి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి బ్రహ్మంగారిమఠం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నూతన మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి తెలిపారు. ఇంత వరకు అభివృద్ధి పనులు ఎంత వరకు జరిగాయి, ఇంకా ఏమి చేయాలి అనే దానిపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనే దానిపై పరిశీలిస్తామన్నారు. మఠం ప్రగతి కోసం కందిమల్లయ్యపల్లె పుర ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ అధికారుల సహకారం తీసుకుంటామన్నారు. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం పట్టాభిషేకంపై చర్చిస్తున్న మఠాధిపతి, ఆస్థాన పండితులు (ఫైల్) మూడు రోజుల పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం అధికారులు, సిబ్బంది, స్వామి వారి శిష్యులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆహ్వాన పత్రికలను మఠం వారు అందజేసి పిలుస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, దంపతులకు పూజా సామగ్రి అందజేశారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుమునుపే రూ.1500 చెల్లించిన ఉభయదారుల దంపతులతో వేద పురోహితులు అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. ఈ కార్యక్రమానికి 332 జంటల దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రమాదాల నివారణపై అవగాహన అవసరం కలకడ : హెచ్పీసీఎల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పైప్లైన్ వద్ద ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని కడప డీఎఫ్ఓ ఆదినారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని దేవుపల్లె పంచాయతీలో సర్పంచ్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఆఫ్సైట్ మాక్డ్రిల్ కార్యక్రమం హెచ్పీసీఎల్ కంపెనీ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీజిల్ పైప్ లీకేజీ అయినా, ప్రమాదం సంభవించినా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందించడం, ప్రమాదం జరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్డ్రిల్లో చేసి చూపించారు. రైతుల పొలాల్లో తీసిన డీజిల్ పైప్లైన్ గత 10 ఏళ్లుగా ఎక్కడా లీకేజీలు లేవని, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్లాంట్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, రైతుల అభివృద్ధికి సంస్థ నుంచి నిధులు కేటాయింపునకు కృషి చేస్తుట్లు మేనేజర్ చిన్నారావు తెలిపారు. తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు 104 అంబులెన్స్లు అపహరణ – డీఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు రాయచోటి : దొంగల కన్ను నిల్వ ఉంచిన ప్రభుత్వ వాహనాలపై పడింది. సర్వీసు ముగిసి శిథిలావస్థకు చేరిన వాహనాలను డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం నుంచి పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్ ఆవరణలోకి తరలించారు. యార్డులో నిల్వ ఉంచిన నాలుగు 104 వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య ఫిర్యాదు మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 108తోపాటు 104 (గ్రామీణ సంచార వైద్యశాల) వాహనాలను వినియోగంలోకి తెచ్చారు. ఈ వాహనాలలో నాలుగు వాహనాలకు సర్వీస్ ముగియడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిల్వ ఉంచారు. ఆసుపత్రి ఆవరణ పరిధిలో నిర్మాణ పనులు ఉండడంతో.. వాటిని మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఆవరణలోకి తరలించారు. కొన్ని నెలలుగా వాటిపై దృష్టి పెట్టకపోవడంతో పసిగట్టిన దొంగలు ఆ వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకు వెళ్లినట్లు సమాచారం. శిథిలావస్థ దశకు చేరుకున్న ఈ వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యార్డులో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా.. నిల్వ ఉంచిన వాహనాలను ఎప్పుడు? ఎలా? తీసుకెళ్లారన్న విషయం అర్థం కావడం లేదు. శుక్రవారం ఉదయం అందిన సమాచారం మేరకు లక్ష్మీనరసయ్య ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రాజా రాణి బొమ్మలకు జీఐ ట్యాగ్కు ప్రయత్నం
మదనపల్లె సిటీ: పదో తరగతి పరీక్షల్లో వసతిగృహంలో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నక్కలదిన్నెలోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో జిల్లాలోని సహాయ సంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లతో సమీక్షా సమావేశం జరిగింది. పరీక్షలు దగ్గరపడుతున్నాయని, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రెగ్యులర్గా పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు.వసతిగృహాల్లో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.కార్యక్రమంలో ఎఎస్డబ్యూలు గంగిరెడ్డి, శ్రీరాములునాయక్, క్రిష్ణ, వార్డన్లు పాల్గొన్నారు. కురబలకోట: తిరుపతి జిల్లా లక్ష్మీగారిపల్లి పరిసర ప్రాంతాల్లో శతాబ్దాలుగా విరాజిల్లుతున్న ఎర్రచందనం, ఇతర విలువైన చెక్కలతో తయారు చేసే రాజా–రాణి బొమ్మల కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ఉన్న మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (మిట్స్– ఐపీఎఫ్సీ) ఈ సంప్రదాయ కళకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చైన్నె జీఐ రిజిస్ట్రీకి అధికారికంగా ధరఖాస్తు చేసినట్లు వీసీ సి. యువరాజ్ శుక్రవారం తెలిపారు. లక్ష్మీగారిపల్లి, సెట్టిగుంట పరిసర ప్రాంతాల్లోని రాజా–రాణి బొమ్మలు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందాయన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటే శ్వర ఆర్టి స్టిక్ వుడెన్ టాయ్స్ వర్కర్స్ ఇండిస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ పేరిట ఈ దరఖాస్తు దాఖలు చేసిన ట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక కళాకారులకు ఆర్థిక భధ్రతతో పాటు వారి కృషికి, కళకు చట్టబద్ధత లభించగలదని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. మిట్స్ ఆర్ అండ్డీ డాక్టర్ తులసీరామ్ నాయుడు, పి. శివయ్య ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: హెడ్మాస్టర్ అకౌంట్ టెస్టు ఫిబ్రవరి 14,15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఈ విషయాన్ని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఫ్రొఫెసనల్ అడ్వాన్స్మెంట్ టెస్టు 14వతేదీ రెండు పూటలా జరుగుతుందన్నారు. వివరాలకు www.bs.ap.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన కోరారు. -
ఆపుకోలేని ఆవేదన
రాజంపేట: ఉమ్మడి జిల్లా రైలుమార్గంలో నంద్యాల–రేణిగుంట మధ్య నడిచే డెమోరైలులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మహిళలు చెప్పుకోలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఒక్కోసారి చాలా మంది మరుగుదొడ్లలో ఉండగానే రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణికులు సంక్షేమానికి పెద్దపీట అని చెప్పుకునే మోదీ ప్రభుత్వంలో రైల్వేశాఖ పనితీరుకు డెమోలో నరకప్రయాణం అద్దంపడుతోంది. సప్తగిరిలో పెట్టిన తరహాలో.. తిరుపతి–చైన్నె మధ్య నడిచే సప్తగిరిలో మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ఆ తరహాలో డెమోలో ఏర్పాటుచే యాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రయాణికులు కూడా సప్తగిరిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే వారు ఈ విషయంపై తరచూ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రయాణికుల ఆవేదనను అర్థం చేసుకొని పరిష్కారదిశగా విశాఖ జోన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. డెమోకు పెరుగుతున్న ఆదరణ పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రాముఖ్యత కలిగిన స్టేషన్లలో హాల్టింగ్స్ను ఎత్తివేశారు. కోవిడ్–19 ముందు ఉన్న హాల్టింగ్స్ ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు నంద్యాల–రేణిగుంట ఽమధ్య నడిచే డెమో రైలుపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ఈ రైలు రద్దీగానే తిరుగుతోంది. 8 గంటల ప్రయాణంలో నరకం.. నంద్యాలలో 5.30కు బయలుదేరి రేణిగుంటకు 12.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.45 కు బయలుదేరి రాత్రి 9.30గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. దాదాపు 8 గంటలకుపైగా డెమోలో ప్రయాణం కొనసాగుతుంది. నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లా వాసులు ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైలు ఆగితే స్టేషన్లోకి పరుగులు.. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో తమ అవససరాలు తీర్చుకునేందుకు రైలు ఆగగానే సేష్టన్లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు పరుగులు తీసుకున్నారు. ఇటీవల రాజంపేట, రైల్వేకోడూరు స్టేషన్లో ఇటాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికుల చెప్పుకోలేని ఆవేదనను రైల్వేశాఖపరిగణనలోకి తీసుకోలేదు. స్టేషన్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. నీటిసౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల గంటలతరబడి వృద్ధులు, పిల్లలు, మహిళలు అవస్థలు పడుతున్నారు. డెమో ప్యాసింజర్ డెమో రైలులో ప్రయాణికులు డెమో రైలును కాకుండా సాధారణ బోగీల (ఫార్మిసిన్)తో నడిపించాలని నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. డెమో రైలులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. అయితే యాత్రీకులు డెమోలాంటి రైళ్లలో ప్రయాణం బరువని, జనరల్ బోగీలతో నంద్యాల–రేణిగుంట రైలును నడిపించే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలించాలని కోరుతున్నారు. డెమో రైలులో మరుగుదొడ్లు కరువు ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు పట్టించుకోని రైల్వేశాఖ మౌలిక సదుపాయాలు కల్పించాలి డెమో రైలు బాత్రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆపుకోలేని ఆవేదనతో ప్రయాణం చేయాల్సిన దుస్ధితి నెలకొంది. ఈ రైలు ప్రారంభం నుంచి సమస్య కొనసాగుతోంది. రైల్వే అధికారులు స్పందించి డెమోలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. –షమీవుల్లాఖాన్, న్యాయవాది, నందలూరు రైల్వే అధికారులు స్పందించాలి కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలను కలుపుతూ నడిచే డెమో రైలులో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రైలులో మరుగుదొడ్డు ఏర్పాటుచేయాలి..లేదా ఫార్మిసిన్ మార్చాలి. సమస్యలపై రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి. –రాజశేఖర్రెడ్డి, డీఆర్యూసీసీ మాజీసభ్యుడు, నందలూరు -
మల్లయ్యకొండను సందర్శించిన మైనింగ్ ఏడీ
సాక్షి కథనాలపై స్పందన తంబళ్లపల్లె: ‘సాక్షి’ దినపత్రికలో గత నెలలో ‘మల్లయ్యకొండపై మైనింగ్ బాబుల కన్ను’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలోని మల్లయ్యకొండను శుక్రవారం మైనింగ్శాఖ ఏడీ రంగకుమార్, అధికారులతో కలిసి సందర్శించారు. కొండపై ప్రముఖ స్థలాలను, వ్యూ పాయింట్ను పరిశీలించారు. ఈ కొండ చుట్టు పక్కల గ్రామాలు, వ్యవసాయ అధారం, నీటి వనరులు, భౌగోళిక స్థితులను అడిగి తెలుసుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరాలు తెలుసుకునేందుకే మల్లయ్యకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తిరుగు ప్రయాణంలో మల్లయ్యకొండ కింద అన్నదాన ట్రస్టు చైర్మన్ రాజశేఖర్రెడ్డి, కమిటీ సభ్యులు ఏడీని నిలిపి మల్లయ్యకొండ చరిత్ర, అన్నదాన ట్రస్టు అభివృద్ధి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను వివరించారు. మైనింగ్కు అనుమతి ఇవ్వరాదని, చుట్టు పక్కల మూడు,నాలుగు జిల్లాలు దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికీ ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని ఏడీ దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ ఆలయం సందర్శన కోసం వచ్చానని, మైనింగ్ అనుమతి ఇచ్చే స్థాయి ఉన్నతాధికారులపై ఉంటుందని తనకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. ఆయన వెంట స్థానిక ఆర్ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, వీఆర్ఓ నాగరాజు, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు. -
భారీగా నష్టపోయా
గత ఏడాది నవంబరు నెలలో దుక్కి చేసి నారు నాటి, కర్రలు కట్టి, ఎరువులు వేసి నాలుగు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాను. పెట్టుబడిగా రూ.11 లక్షల వరకు ఖర్చు చేసి పంటను సాగు చేశాను. గత జనవరిలో పంట చేతికి రాగా 15 కిలోల ట్రే ధర రూ.100 పలికింది. దూర ప్రాంతాల మార్కెట్కు తరలిస్తే కనీసం వాహన అద్దె, కూలీలకు సరిపోదు. నేడు మరీ దారుణంగా బాక్సు రూ.20కు కూడా కొనేవారు లేరు. టమాట సాగు చేసి రూ. 5 లక్షల వరకు నష్టపోయాను. – టీఎస్ సుహైల్బాషా, రైతు, కలకడ వ్యవసాయం దండగ అనిపిస్తోంది అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, అర్ధరాత్రి వరకు కాపలా, ఇంటిల్లిపాది కష్టపడితే నేడు కొనుగోలు చేసేవారు లేరు. తోటపై వదిలేస్తే ఉన్న చెట్టుకు నష్టం వాటిల్లుతుంది. మార్కెట్కు తరలించాలన్నా వాహనాల అద్దె, ఇతర ఖర్చులు రావడం లేదు. పంట సాగు కోసం చేసిన రూ.2 లక్షల అప్పు అలాగే ఉంది. పరిస్థితులు గమనిస్తే వ్యవసాయమే దండగ అనిపిస్తోంది. కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు. – మద్దిపట్ల సిద్దయ్యనాయుడు, రైతు, కలకడ మండలం -
తత్కాల్ కింద ఫీజు చెల్లింపునకు అవకాశం
మదనపల్లె సిటీ: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద మరో అవకాశం కల్పించారని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. సంబంధిత తత్కాల్ ఫీజును ఈనెల 12వ తేదీ వరకు చెల్లించవచ్చునని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన ద్వారా మాత్రమే www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించడంతో పాటు నామినల్ రోల్స్ సమర్పించాలని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుఽలకు మాత్రమే ఈ అవకావం ఉందని తెలిపారు. మదనపల్లె: ఈనెలాఖరులోగా జిల్లాలోని పంచాయతీల్లో రూ.10 కోట్ల పన్నుల వసూళ్లను లక్ష్యంగా చేసుకున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీల్లో 2,81,161 నివాస గృహలు ఉండగా వాటికి సంబంధించిన పాత బకాయిలు రూ.2.33 కోట్లు ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సర బకాయి రూ.12.66 కోట్లు ఉన్నట్టు చెప్పారు. ఈ రెండు కలిపి రూ.15.01 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటిదాకా పాత బకాయిలు రూ.59.83 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.96 కోట్లు వసూలైనట్టు చెప్పారు. ఇంకా పాత బకాయిలు రూ.1.79 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.31 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం రూ.10.11 కోట్లను ఈనెలాఖరులోగా వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శకులకు ఆదేశించినట్టు చెప్పారు. వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద జరుగుతున్న శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. పురోహితులు మంగళసూత్రాలను భక్తులకు చూపించి స్వామివారి చేతికి తాకించి అమ్మవార్ల మెడలో వేశారు.శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులతో కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. అలాగే సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. మదనపల్లె సిటీ: విభిన్న ప్రతిభావంతులతోనే మార్పు మొదలవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనూరాధ అన్నారు. మదనపల్లెలో శుక్రవారం సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్ అండర్ కల్చరల్ పోటీలు ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ముగింపు సమావేశంలో డీఈఓ,ఏపీసీలు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా రాణించి అద్భుతాలు సృష్టిస్తారన్నారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజం మొత్తం విభిన్న ప్రతిభావంతులను అర్థం చేసుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పలు దేశభక్తి, జానపద నృత్యాలు, ఆర్ట్, డ్రాయింగ్, క్రాప్ట్ పోటీలు, వివిధ రకాల వేషధారణ పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సహిత విద్య కోఆర్డినేటర్ జనార్థన్, ఎంఈఓ ప్రభాకర్రెడ్డి, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
చిన్నమండెం: చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామ పంచాయతీలోని తూర్పుపల్లెలో నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యుఎఫ్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక విద్య, ఉద్యోగ తదితర వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2025 నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. దీనిని పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సామాజిక, విద్య, ఉద్యోగ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ సమాచారం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడంతో పాటు యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ లక్కిరెడ్డిపల్లి: పట్టాదారు పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్ ద్వారా భూ యజమాని, భూమి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతుల గ్రామం, వెంకటరాజుగారిపల్లిలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో అధునాతన సాంకేతికత ద్వారా భూ సమస్యలను, వివాదాలను పరిష్కరించగలుగుతామన్నారు. అధునాతన సాంకేతికత ద్వారా రైతుకు ఎంత భూమి ఉంది.. ఎక్కడ ఉంది.. తదితర అంశాలను స్పష్టంగా, సులభంగా గుర్తించగలుగుతామన్నారు. రెవెన్యూ గ్రామ సభలను సచివాలయ స్థాయిలో నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ పలువురు లబ్ధిదారులతో మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకంలో సరియైన వివరాలు నమోదు చేసి ఉన్నారా లేక ఏమైనా తప్పులు ఉన్నాయా, ఆధార్ నంబర్ సరిగా ఉందా వంటి పలు ప్రశ్నలను అడుగగా సరియైన వివరాలను చేర్చి ఉన్నారని వారు సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తహసీల్దార్ను ఆదేశించారు. మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన పట్టాదారు పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్ను ఏ విధంగా వినియోగించుకోవాలో లబ్ధిదారులకు వివరించారు. ఆధార్, ఫోన్ నంబర్లలో తప్పులు ఉంటే వెంటనే అర్జీ పెట్టుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ క్రాంతి కుమార్, ఆర్ఐ రాజేష్, వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
నానో ఎరువులతో పెరగనున్న పంటల దిగుబడి
మదనపల్లె రూరల్: నానో ఎరువుల వాడకంతో పంటల నాణ్యత, దిగుబడి గణనీయంగా పెరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయశాఖ, ఇఫ్కో సహకార సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎరువులు, పురుగుమందుల వ్యాపారులకు నానో ఎరువులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ శివనారాయణ మాట్లాడుతూ... జిల్లాలోని పలు పంటల్లో నిర్వహించిన క్షేత్రపరీక్షల ఫలితాల ఆధారంగా నానో ఎరువులు మంచి దిగుబడులు ఇస్తున్నాయని తెలిపారు. వీటి పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచి, పర్యావరణ హితంగా ఉంటూ, సంప్రదాయ రసాయన ఎరువుల వాడకాన్ని 20 నుంచి 25 శాతం తగ్గిస్తాయన్నారు. మొక్కలకు అవసరమైన పోషకాలను నేరుగా అందించడంతో పంట ఆరోగ్యం పెరుగుతుందన్నారు. నానో యూరియా వాడకం వల్ల నేల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి నవీన్రెడ్డి మాట్లాడుతూ..విచక్షణా రహితంగా వాడుతున్న ఎరువుల కారణంగా నేలకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ప్రత్యామ్నాయ ఎరువులైన నానో ఎరువులు, జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. -
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
డీఏఓ శివనారాయణ మదనపల్లె రూరల్: భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి రైతులు అధిక దిగుబడి పొందాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ తెలిపారు. గురువారం మదనపల్లె మండలం వలసపల్లె గ్రామంలో భూసార పరీక్షలకు సంబంధించి మట్టి నమూనాలను సేకరించారు. ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు వస్తాయన్నారు. మట్టిలోని పోషక లోపాలను గుర్తించి అవసరమైనంత మేరకు ఎరువులు చల్లడం ద్వారా నేల ఆరోగ్యం కాపాడటంతోపాటు పర్యావరణ కాలుష్యం తగ్గించినట్లు అవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానం, వివిధ రకాల జీవన ఎరువులు వాడటం వల్ల ఉపయోగం, రైతులకు కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ రమేష్రాజు, ఏవో నవీన్కుమార్రెడ్డి, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
యథేచ్ఛగా భూ ఆక్రమణ
ఆక్రమిత భూమిని చదును చేసిన దృశ్యం స్వాధీనం చేసుకున్న టిప్పర్ను పోలీసులకు అప్పగిస్తున్న ఆర్డీఓ చంద్రమోహన్ కాశినాయన : కూటమి నాయకుల ఆధ్వర్యంలో భూ దందాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం మనదే.. ఖాళీగా ఉంటే ఆక్రమించుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆక్రమిత భూములను పరిశీలించారు. అక్కడ ఆక్రమిత భూముల్లో పనిచేస్తున్న రెండు హిటాచీలు, ఒక జేసీబీ, టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డ్రోన్ సర్వే ద్వారా ఆక్రమిత భూములను గుర్తించారు. నిజమైన లబ్ధిదారులకు బెదిరింపులు టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఆక్రమణకు గురైన భూములపై కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మండలంలోని మూలపల్లె రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబర్ 1లో 1,018 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 200 సర్వే నంబర్ల వరకు గతంలో పట్టాలు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేశారు. 300 ఎకరాల భూమిని అటవీశాఖకు స్వాధీనం చేశారు. మిగిలిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారు. కొందరు దొంగ పట్టాలు సృష్టించి మాకు డీ ఫారాలు ఉన్నాయని ఆక్రమించి పంటలను సాగు చేస్తున్నారు. పట్టాలు కలిగి ఆన్లైన్లో ఉన్న భూములను సైతం కొంత మంది ఆక్రమించుకుని సాగు చేస్తూ నిజమైన లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈభూముల ఆక్రమణ జరుగుతోంది. భూమి మాది అని అక్కడికి వెళితే భూమి దగ్గరికి రానివ్వలేదని కొంత మంది రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్కు, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొంత రైతులు ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు. ఆక్రమించిన భూమిలో రేయింబవళ్లు జేసీబీలు, టిప్పర్లతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారు. అక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటాం ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. రెండు రోజుల లోపు ఆక్రమించి భూములు సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలను తహసీల్దార్ వెంకటసుబ్బయ్యకు సమర్పించాలని తెలిపారు. మొత్తం పూర్తి వివరాలు సేకరించి తనకు పంపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, ఆర్ఐ అమరనాథ్రెడ్డి, వీఆర్ఓ నారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
కృషి ఉంటే తెరపై తారగా వెలగచ్చు
కురబలకోట: సినిమా రంగం కలల ప్రపంచమని, కొత్త వారు రాణించాలంటే టాలెంట్తోపాటు తగిన స్కిల్స్ తప్పనిసరి అని మూవీ ప్రొడ్యూసర్ ఆరవింద్ మండెం, డైరెక్టర్ మధుదీప్ అన్నారు. గురువారం అంగళ్లు డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, ఫిలిం మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మూవీ వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ నేడు పోటీతో కూడిన సినీ రంగంలో పైకి రావాలంటే పర్సనాలిటీతోపాటు యాక్టింగ్ నైపుణ్యం, డైలాగ్ డెలివరీ, భావ ప్రకటన అవసరమన్నారు. అంతేగాకుండా కెమెరా ముందు ఎలా నిలుచొవాలి, లైటింగ్కు అనుగు ణంగా నటించడంతోపాటు డైరెక్టర్ ఆశిస్తున్న యాక్టింగ్ను అర్థం చేసుకోవాలన్నారు. దర్శకు లు, నిర్మాతలతో సంబంధాలు కూడా అవ కాశాలను నిర్దేశిస్తాయన్నారు. ఇంజినీరింగ్ విద్య లో చదువులకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, సృజన, కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించాలన్నారు. ఇంజినీరింగ్ చదువులు ఆధునిక కెమె రా, ఎడిటింగ్, విజువల్ టూల్స్కు కూడా ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో క్లబ్ కన్వీనర్ వై.ప్రదీప్కుమార్, ఫిలిం మేకర్స్ క్లబ్ కో ఆర్డినేటర్ రియాజ్ అలీ పాల్గొన్నారు. -
మార్చిలోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి
మదనపల్లె: జిల్లాలో చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులన్నింటినీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక బీటీ కళాశాలలో జిల్లా స్థాయి ఉపాధి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మార్చి 10లోగా రూ.62 కోట్లు చెల్లిస్తామని అన్నారు. జిల్లాలో మొత్తం రూ.103.6 కోట్ల మెటీరియల్ నిధులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.41.6 కోట్లు చెల్లించామన్నారు. గ్రామాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్లు, పండ్ల తోటల పెంపకానికి చేసిన ఖర్చును మార్చి 10లోపు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు మొదలు కాని పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి వీబీ జీ రామ్ జీ చట్టంతో అమలు చేస్తున్నామని, అందుకు వీలుగా ప్రస్తుతం పురోగతిలోని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 12,711 పనులు వారంలోపు పూర్తి చేయాలని, ఈ పనులకు సంబంధించిన బిల్లు పూర్తిగా చెల్లించాలని ఉపాధి సిబ్బందిని అదేశించారు. ఎంపీడీఓలు గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటరత్నం, పీఆర్ ఎస్ఈ, జిల్లా లోని డీఈఈలు, ఏపీడీలు, ఎంపీడీఓలు, ఉపాధి ఎంపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు. ● ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పథకం అమలు ● ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ -
వైభవంగా లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్షకుంకుమార్చన పూజలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం వేద పండితులు గోవర్ధనశర్మ, అర్చకులు గంగిరెడ్డిల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఉత్సవ మూర్తికు ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి దంపతులకు పూజా సామాగ్రిని అందజేశారు.అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట గణపతి, చండీహోమం, మహా మంగళహారతి చేశారు. అనంతరం ఈఓ ,ఆలయ అధికారులు దంపతులకు తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు. ఆలయంలో రెండు రోజులుగా జరుగుతున్న లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారంతో ముగియనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరాలను దొంగలించిన నిందితున్ని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. జనవరి 29న సాయంత్రం పట్టణంలోని మేదరవీధికి చెందిన టంగుటూరు ఎల్లాలు అనే వ్యక్తి మద్యం సేవించాడు. ఈ క్రమంలో హోమస్పేటలో ఉన్న అతను స్కూటీలో వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి స్కూటీలో ఎల్లాలును స్కూటీపై కూర్చోపెట్టుకొని ఒక పథకం ప్రకారం పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను తీసుకొని అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మరుసటి ఉదయం మద్యం మత్తు వదలిన తర్వాత తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు ఎల్లాలు గుర్తించాడు. దీంతో అతను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో నేరస్తుడిని త్వరితగతిన గుర్తించారు. దస్తగిరిపేటకు చెందిన పాత నేరస్తుడైన జేస్టాది రాజేష్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, రెండు ఉంగరాలతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా నిందితుడిపై పలు ప్రాంతాల్లోని పోలీస్ష్టేషన్లలో కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో హత్య కేసుతో పాటు త్రీ టౌన్, రూరల్, రాజుపాళెం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందులలో చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించి సొత్తును రికవరీ చేసిన ఎస్ఐ, సీఐతో పాటు హెడ్కానిస్టేబుల్ దాస్, కానిస్టేబుల్ సునీల్లను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ అభినందించారు. బంగారు నగలు, స్కూటీ స్వాధీనం -
మదనపల్లెలో ఏసీబీ దాడుల కలకలం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏసీబీ అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఓ అధికారి ఇంట్లో జరిపిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. దాడులకు సంబంధించి కడప ఏసీబీ సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కడప రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా పని చేస్తున్న మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో ఓ బాధితుడి దగ్గర రూ.30 వేల లంచం తీసుకుంటూ బుధవారం పట్టుబడినట్లు చెప్పారు. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆదేశాలతో అనంతపురం ఏసీబీ టీమ్తో కలసి మదనపల్లె బీకేపల్లెలో ఉంటున్న మేజారి సుబ్బయ్య ఇంట్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఎలాంటి అక్రమ ఆస్తులు వెలుగు చూడలేదని కొన్ని అనుమానిత రికార్డులను వెంట తీసుకుని వెళ్లామని చెప్పారు. ఏసీబీ అధికారుల దాడుల వార్త పట్టణంలో దావానంలా వ్యాపించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి. -
శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలు
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీలోని కట్టకింద శివాలయంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకాయి. గురువారం ఉదయం మాఘస్థానం చేస్తున్న భక్తులు శివాలయంలో పూజలు చేయడానికి వెళ్లారు. అప్పుడు సూర్య కిరణాలు శివలింగంపై పడడం చూశారు. ప్రతి సంవత్సరం శివలింగంపై ఉదయం7 గంటల నుచి 7.20 గంటల మద్య ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ విశేషాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తంతును భక్తులు సెల్ఫోన్లలో వీడియోలు,ఫోటోలు తీసి వాట్సాప్లలో ప్రచారం చేశారు. -
ఎంపీపీ ఎన్నికకు రెండోసారి ఎంపీటీసీల గైర్హాజరు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్ష పదవికి రెండోసారి గురువారం నిర్వహించిన ఎన్నిక సమావేశానికి ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీఓ) అమరనాథరెడ్డి, ఎంపీడీఓ అబ్దుల్ షుకూర్ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకే సమావేశ సమయం నిర్ణయించి సమావేశానికి హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు అయినా ఒక్క ఎంపీటీసీ కూడా హాజరు కాకపోవడంతో ఎన్నిక జరగలేదని డీడీఓ ప్రకటించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో లక్ష్మీనరసమ్మను ఎంపీటీసీలు ఎంపీపీగా ఎన్నుకున్నారు. తర్వాత ఆమె వ్యవహరశైలితో విసిగిపోయిన ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానంతో పదవీ నుంచి తొలగించారు. తర్వాత వైస్ ఎంపీపీ ఎన్.రాధను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎంపీపీ పదవికి పూర్తి స్థాయిలో నియామకం చేయడం కోసం ఎన్నిక ఏర్పాట్లు చేశారు. బుధవారం ఎన్నిక సమావేశం నిర్ణయించగా ఎంపీటీసీలు హాజరు కాలేదు. తిరిగి రెండోసారి సమావేశం జరిపినా అదే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) దృష్టికి తీసుకెళ్తామని డీడీఓ తెలిపారు. అక్కడి నుంచి అందే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్ఈసీకి నివేదిస్తామన్న డీడీఓ -
లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానం
ప్రార్థనల్లో పాల్గొన్న విశ్వాసులు దైవ సందేశం ఇస్తున్న ఫాదర్ ఎస్.మర్రెడ్డి కడప సెవెన్రోడ్స్: పవిత్ర లూర్దుమాతపై విశ్వాసం ముక్తికి సోపానమని లక్కిరెడ్డిపల్లె విచారణ గురువులు విజయమోహన్రెడ్డి అన్నారు. లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజైన గురువారం కడప పాత చర్చి ఆవరణలో ఫాదర్ విజయమోహన్రెడ్డి దివ్యబలిపూజ నిర్వహించి ప్రసంగించారు. ఏసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుతారన్నారు. మరియమాత కరుణామూర్తి అని, లోకానికి రక్షణ కోసం ఏసుక్రీస్తును భువి నుంచి దివికి తీసుకొచ్చారని వివరించారు. ముద్దనూరు విచారణ గురువులు ఎస్.మర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి క్రైస్తవుడు ఏసు చూపిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మరియమాత బిడ్డలైన మనం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని ఉపదేశించారు. తిరునాల ఉత్సవాల్లో భాగంగా నవదిన జపమాల కార్యక్రమం నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో లూర్దుమాత స్వరూపాన్ని మరియాపురం వీధుల్లో ఊరేగించారు. పూజకు ముందు ఏసుక్రీస్తుకు గుర్తుగా ఉన్న దీప స్తంభానికి గురువులు, కన్యసీ్త్రలు జ్యోతి ప్రజ్వలన చేశారు. దివ్య బలి పూజ కార్యక్రమంలో విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు జంపంగి సుధాకర్, కడప డీన్ ఎండీ ప్రసాద్రావు, ఫాదర్ సిప్రియన్, ఫాదర్ సంబటూరు సురేష్, తిరునాల కమిటీ అధ్యక్షులు సి.బాలయ్య, ప్రధాన కార్యదర్శి జోసెఫ్, ఉపాధ్యక్షులు లూర్దు, ట్రెజరర్ విజయరాజు, ఎంవీ అల్ఫోన్స్, జయరాజు, విశ్వాసులు పాల్గొన్నారు. -
ఆలయంలో హుండీ చోరీ
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని మతుకువారిపల్లెలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వినాయక స్వామి ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం స్థానికులు గుర్తించి చూడగా డబ్బుతో సహా హుండీ తీసికెళ్లారు. దీంతోపాటు అదే గ్రామంలో ఆరుగురు రైతుల పొలాల వద్ద బోరు మోటరుకున్న కేబుల్వైర్లను కూడా కోసుకొని పోయారు. బాధితులు గురువారం కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాలకు వెళ్లి పరిశీలించారు. నాటు తుపాకీ స్వాధీనం చౌడేపల్లె : వన్యమృగాలను వేటాడేందుకు వినియోగించే నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. దిగువపల్లె పంచాయతీ కురిజల వారిపల్లెకు చెందిన నాగరాజ బోయకొండ సమీపం నాటు తుపాకీతో సంచరింస్తుండగా డ్రోన్ కెమెరా లో చిత్రీకరించడంతో ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రైతుపై కర్రతో దాడి మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో గురువారం రాత్రి అకారణంగా దూషించాడన్న కోపంతో కర్రతో రైతును చితకబాదిన సంఘటన జరిగింది. ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాల మేరకు..కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లె గ్రామంలో ఉంటున్న రైతు సురేంద్ర(56) అదేవీధికి చెందిన రమణయ్యను అకారణంగా దూషించాడన్నసాకుతో కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో సురేంద్ర తలకు బలమైన గాయమైంది. అతన్ని కుటుంబీకులు 108వాహనంలో చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోడిపందెం శిబిరంపై మెరుపు దాడి – 13మందిపై కేసు నమోదు చౌడేపల్లె : బోయకొండ అటవీ పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలు మారాయి. నిత్యం పేకాట, కోడి పందెం, వ్యభిచార నిర్వహణకు అడ్డాగా నిలిచాయి. అన్నమయ్య జిల్లాపరిధిలోకి చౌడేపల్లె మండలాన్ని చేర్చడంతో తొలిసారిగా మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో గురువారం డ్రోన్ కెమెరా బృందం తనదైనశైలిలో నిఘా పెట్టి కోడి పందెం శిబిరంపై మెరుపు దాడులు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ దాడుల్లో కోడిపందేలు ఆడుతున్న 13మందిని, 6 పందెం కోడి పుంజులు, రూ:25 వేలు నగదు సీజ్చేసినట్లు చెప్పారు. అలాగే 11 బైక్లు 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు. 104 ఏళ్ల వృద్ధుడు మృతి బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన 104 ఏళ్ల వృద్దుడు కుమార చంగలరావు గురువారం మృతి చెందారు. 1922 జూలై 21న జన్మించిన ఆయన వృద్ధాప్య, ఆరోగ్య సంబంధిత సమస్యలతో చనిపోయారు. కుటుంబీకులు ఆయనకు బెంగళూరులో చికిత్సలు అందించారు. కోలుకోలేని పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. ప్రస్తుత నాయనబావి గ్రామం 65 ఏళ్ల క్రితం వరకు లేదు. ఇక్కడ నివాస గృహాలు, నివాసముంటున్న వారు లేరు. 1960లో ఇక్కడ తొలి గృహాన్ని నిర్మించి ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నివాసాలు మొదలై నాయనబావి గ్రామం ఏర్పడింది. ఇది బి.కొత్తకోట–మదనపల్లె రహదారిపై ఉంది. కుమార చెంగలరావు మృతికి గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలుగురాళ్ళపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామం సమీంలోని తెలుగుగంగ సాగునీటి కాలువలో గుండాపురం ఎస్సీకాలనీకి చెందిన పందీటి ఓబులేసు(20) గురువారం శవమై తేలాడు. స్థానిక ఎస్ఐ శివప్రసాద్ వివరాలు ఇలా ఉన్నాయి మృతి చెందిన యువకుడు గుండాపురం ఎస్సీకాలనీకి చెందినవాడిగా గుర్తించినట్లు చెప్పారు. మృతిని కోసం కుటుంబసభ్యులు, బందువులు ఎవరూ రాలేదన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాయపడిన వ్యక్తి మృతి మైదుకూరు : మైదుకూరు – వనిపెంట రహదారిలో ఈనెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొండపేట గౌస్ (37) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. మండలంలోని వనిపెంటకు చెందిన గౌస్ 1వ తేదీన సాయంత్రం మైదుకూరు నుంచి బైక్లో వనిపెంటకు వెళుతుండగా కేశలింగాయపల్లెకు సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. అతన్ని నంద్యాల శాంతిరాం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందినట్టు అర్బన్ ఏఎస్ఐ శివప్రసాద్రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఉన్నారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనం డ్రైవర్ చంద్రశేఖర్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
బైక్ను తప్పించబోయి కారు బోల్తా
లక్కిరెడ్డిపల్లి : ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల వంక బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు..వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె సర్పంచ్ శ్రీనివాసులు, దివాకర్రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉదయం కాణిపాకం వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వేంపల్లెకు బయలుదేరారు. మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనం వచ్చింది. దీనిని తప్పించబోయి రోడ్డుపక్కన ఉన్న మామిడితోటలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దివాకర్రెడ్డికి తీవ్రంగా, సర్పంచ్ శ్రీనివాసులు,డ్రైవర్ మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సర్పంచ్ శ్రీనివాసులు లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్రెడ్డికి సమాచారం అందించండంతో ఆయన అనుచరులు సంఘటన స్థలానికి చేరుకుని 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివాకర్రెడ్డికి కాలు ఫ్రాక్చర్ కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి వేంపల్లె నుండి లక్కిరెడ్డిపల్లికి కారులో వస్తున్న బంధువులు ప్రమాదానికి గురయ్యారు. మండల కేంద్రంలోని చింతకుంటవాండ్లపల్లి వద్ద మరమ్మతులు జరుగుతున్న జాతీయ రహదారికి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని కారు ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే సబ్ స్టేషన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేంపల్లె సర్పంచ్, ఇద్దరికి గాయాలు -
దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించబోయే దక్షిణ మండల క్రికెట్ టోర్నమెంట్కు హాజరు కావాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాసమూర్తిని కడపజిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి మనోహర్రాజు, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.మధుసూదన్ నాయక్లు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం శ్రీనివాసమూర్తిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ మండల క్రికెట్ టోర్నమెంట్కు హాజరయ్యే దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. శ్రీనివాసమూర్తి స్పందిస్తూ దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి సహకారాలు అందిస్తానని తెలియజేశారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహం కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు గుర్తు తెలియని వ్యక్తిని చికిత్సకోసం ఈనెల 4వతేదీన తీసుకొచ్చారు. వచ్చిన కొంతసేపటికే మృతి చెందాడు.మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
కటర్ కాలిమీద పడి వెల్డర్కు తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె సీటీఎంరోడ్డులోని ఎస్టేట్లోని ఓ వెల్డింగ్షాపులో పనిచేస్తున్న వెల్డర్ కాలిమీద కటర్ పడి, కాలు తెగి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల కథనం మేరకు మండలంలోని బొమ్మనచెరువు గ్రామం, దండువారిపల్లెకు చెందిన ఖాదర్వల్లీ(40)రోజు మాదిరిగానే షాపులో వెల్డింగ్ పనులు చేయడానికి, సీటీఎంరోడ్డులోని ఎస్టేట్కు వచ్చాడు. కమ్మీలను కటర్తో కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు ఎడమ కాలిమీద కటర్ పడింది. ఈ ఘటనలో కాలి ఎముకతో పాటు నరాలు తెగి గాయపడ్డాడు. సహచరులు గుర్తించి బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. మదనపల్లె టౌన్ : పెద్దతిప్పసముద్రం మండలంలో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు..మల్లెల గ్రామానికి చెందిన వెంకటేష్(45), రమణమ్మ(40)బైకులో పనినిమిత్తం సమీపంలోని మల్లెలక్రాస్కు బయలుదేరారు. బైక్ పులికల్లు క్రాస్ వద్దకు రాగానే, జింకల గుంపు అడ్డురావడంతో తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమణమ్మకు మెరుగైన వైద్యం అవసరం ఉందని డాక్టర్లు చెప్పడంతో, కుటుంబ సభ్యులు బాధితురాలిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు ఆమెకు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. పీలేరురూరల్ : ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పీలేరు పట్టణంలోని యల్లమంద క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా దొడ్డిపల్లెకు చెందిన ఎన్. వినోద్కుమార్ (35) ద్విచక్రవాహనంలో పీలేరుకు వస్తుండగా యల్లమంద క్రాస్ వద్ద ఆటోను ఓవర్టేక్ చేయబోయి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వినోద్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారురు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్ : మండలంలోని చీకలబయలుకు చెందిన రైతు జి.నారాయణస్వామి గురువారం రాత్రి రోడ్డుదాటుతుండగా బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా బాధితుడు కోలుకుంటున్నాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కళావెంకటరమణ చెప్పారు. -
కారణం ఉంటేనే మ్యుటేషన్ల తిరస్కరణ
మదనపల్లె: మ్యుటేషన్ల దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో.. అందుకు స్పష్టమైన కారణం ఉండాలని, వాటి వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టంగా ఆదేశించారు. గురువారం స్థానిక ఓ కల్యాణ మండపంలో జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లతో భూముల మ్యుటేషన్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అందులో రికార్డుల నిర్వహణలో పారదర్శకత, మ్యుటేషన్ ప్రక్రియలో కాల పరిమితులపై అవగాహన కల్పించారు. మ్యుటేషన్ల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జిదారులతో ఫొటో రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మ్యుటేషన్లను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలతో స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. రికార్డులు పక్కాగా ఉంటేనే మ్యుటేషన్లకు ఆమోదం తెలపాలన్నారు. దీనిపై అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాసు పుస్తకాలలో తప్పులు సవరించి నిర్ణీత వ్యవధిలో తిరిగి అందించాలన్నారు. మార్చి, ఏప్రిల్లో పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. రీ సర్వేకు సంబంధించి జాయింట్ ఎల్పీఎంలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యుటేషన్ల అర్జీలను ఎలా పరిష్కరించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సబ్ కలెక్టర్ కళ్యాణి, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రావణి వివరించారు. ఎక్కడ తప్పులు దొర్లుతాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దాలో వివరించారు. మీసేవ లేదా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, తహసీల్దార్ ద్వారా అడంగల్ పరిశీలన, ఫారం–8 నోటీసు జారీ, వీఆర్వోల క్షేత్రస్థాయి విచారణ, సబ్ కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో పరిశీలన, తుది ఆమోదం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, డీఆర్ఓ మధుసూదనరావు, రాయచోటి, పీలేరు ఆర్డీవో శ్రీనివాస్, సర్వే ఏడీ భరత్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు రీ సర్వే ఎల్పీఎంలు తక్కువగా ఉండాలి కలెక్టర్ నిశాంత్ కుమార్ -
సర్వేలెన్స్ అధికారిగా శ్రీధర్
మదనపల్లె టౌన్: జిల్లా సర్వేలెన్స్ అధికారిగా మదనపల్లె పీపీ యూనిట్ ఇన్చార్జిగా పని చేస్తున్న డాక్టర్ శ్రీధర్ను నియమిస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన జిల్లాలో రోగాల బారిన పడిన బాధితుల వివరాలు, జ్వర పీడితుల వివరాల సేకరణ తదతర విధులను నిర్వహిస్తారు. మదనపల్లె టౌన్: జిల్లా కార్యక్రమాల సమన్వయ అధికారి (డీపీఎంఓ)గా మదనపల్లె డెప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్బాబుకు బాధ్యతలు అప్పగిస్తూ డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వు జారీ చేశారు. ఇక్కడ ఉన్న డెప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయం కుప్పానికి తరలిపోవడంతో ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. డీపీఎంఓ పరిధిలోని వివిధ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలుపై చర్యలు తీసుకుంటారు. మదనపల్లె సిటీ: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పి.తేజస్విని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)లో ఓసీ–2, బీసీ–4, ఎస్సీ–10, ఎస్టీ–64, కె.వి.పల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఓసీ–2, బీసీ–4, ఎస్సీ–10, ఎస్టీ 64 ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్లైన్లో ఈనెల 5వ తేదీ నుంచి 28లోపు పంపాలన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4న రాయచోటి గిరిజన గురుకులంలో నిర్వహిస్తామని వివరించారు. నిమ్మనపల్లె: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా విద్యా శాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ముష్టూరు కేజీబీవీ విద్యాలయంలో జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఏకాగ్రతతో చదివి పాఠ్యంశాలను గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. పరీక్షలపై భయం వీడి చక్కని ప్రతిభ చూపాలన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంఈఓలు పద్మావతి, నారాయణ, కేజీబీవీ ప్రిన్సిపాల్ మునివెంకటమ్మ, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ అమృత ప్రియదర్శిని, రెడ్డివారిపల్లె హైస్కూల్ హెచ్ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. గాలివీడు: మండలంలోని వివిధ రకాల రైస్, నూనె గింజల మిల్లర్ల యజమానులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని రైస్ మిల్లులు, నూనె గింజల మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్ల యజమానులతో మాట్లాడారు. ప్రతి నెల అమ్మకాలు–కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మార్కెటింగ్ కార్యదర్శికి అందజేయాలని సూచించారు. అలాగే ఏడాది కాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి మార్కెట్ సెస్సును విధివిధానాల ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సెస్సు చెల్లించని పక్షంలో మార్కెట్ సరుకు విలువ ఆధారంగా సెస్సును శాఖే నిర్ణయించి విధించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా, లావాదేవీలకు సంబంధించిన సెస్సు చెల్లించకుండా ఉంటే ఒకటి నుంచి నాలుగు రెట్ల వరకు అపరాధ రుసుంతో కూడిన జరిమానా విధించి, మార్కెట్ చట్ట నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే సెస్సు చెల్లించని మిల్లర్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కార్యదర్శి రమణమ్మతోపాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిషన్ను నియమించాలి
మదనపల్లె సిటీ : ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశానికి ఆయన హాజరయ్యారు. 12వ పీఆర్సీ కాలపరిమితి 2023 జూన్ నాటికి ముగిసిందన్నారు. జులై 1,2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా రెండున్నరేళ్లు దాటినా నేటికి కనీసం పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. టెట్ విషయంలో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి టెట్ మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎస్సీ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సెలవు రోజుల్లో పని చేసిన కాలానికి సీసీఎల్ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పుల్లయ్య, జిల్లా నాయకులు శివకుమార్, అర్జున్నాయక్, వరప్రసాద్, విశ్వనాథ్, రమణప్ప, లక్ష్మిరమణ, ప్రతాప్నాయక్, శ్రీనివాసులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఇన్స్టా రీల్స్ మోజు
వల్లూరు(చెన్నూరు) : రీల్స్ ఫిచ్చి రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రీల్స్కు ఎక్కువ వ్యూస్, లైక్లు ఆశిస్తున్న వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. అయితే తాము రీల్స్ మోజులో చేసే విన్యాసాల వలన ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్న యువత తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగుల్చడమే కాక ఇతరులకు కూడా ఇబ్బందులు కలగిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కడప– తాడిపత్రి ప్రధాన రహదారిపై కడప విమానాశ్రయం సమీపంలో చెన్నూరు మండల పరిధిలోని శాటిట్ సిటీ వద్ద బుదవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కడప పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన సయ్యద్ ముబారక్ అనే యువకుడు తన స్నేహితుడైన లతీఫ్తో కలిసి బైక్లో బయలు దేరారు. ఇన్స్టా రీల్స్ కోసం విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైక్తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించగా ముబారక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన లతీఫ్ చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజుల క్రితం కడప – మైదుకూరు రోడ్డులో చెన్నూరు వద్ద పలువురు యువకులు పట్టపగలే బైక్ విన్యాసాలు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తర్వాత కూడా పలువురు యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా బైక్ విన్యాసాలు చేస్తూ హల్చల్ చేయడం రివాజుగా మారింది. పోలీసులు ఇలాంటివాటిని చూసీ చూడనట్లు వ్యవహరించడం వారికి అలుసుగా మారుతోంది. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారో గమనిస్తూ వారిని అదుపుచేసి సక్రమ మార్గంలో నడిచేలా చూడాల్సిన అవసరం వుంది. లేక పోతే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుంది. -
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు
కలకడ : సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని కోన, కోన పంచాయతీ తిప్పిగారిపల్లె లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు పంటసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అధికంగా రసాయనిక ఎరువులు వినియోగంచరాదని, వ్యవసాయాధికారుల సూచనలమేరకు తగుమోతాదులో సేంద్రియ ఎరువులు వినియోగించాలని తెలిపారు. ఈ– పంటనమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి యంఆర్ శ్రీనివాస్, ఆర్ఎస్కే సిబ్బంది త్రిసూల్, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
ఔను..వాళ్లిద్దరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు
వారిది పెద్దలు కుదిర్చిన వివాహం..అన్యోన్యంగా సాగుతున్న బంధం.. వారికి ఒక చక్కటి పాపాయి.. ఆనందంగా ఉన్న ఆ ఇంట చిన్న మనస్పర్థలు.. అర్థం చేసుకోవాల్సిన ఆలుమగలు అపార్థం చేసుకున్నారు. ఎడబాటు పెంచుకున్నారు. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుండాల్సినవారు దూరమయ్యారు. కొద్ది కాలానికి తమ తప్పు తెలుసుకున్నారు. చిన్నారి పడే వేదన అర్థం చేసుకున్నారు.. మళ్లీ అనుబంధం కావాలనుకున్నారు.. మళ్లీ పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటిచెబుతున్నారు.. రొంపిచెర్ల : చిన్న చిన్న గొడవలతో ఏడు అడుగులు నడిచి మూడు ముళ్ల బంధాన్ని తెంచుకుంటున్న రోజులివి. అయితే వీళ్లు మనస్పర్థలతో విడిపోయినా మళ్లీ పెళ్లి చేసుకుని ఒక్కటై యువతకు అదర్శంగా నిలిచారు. వివిరాల్లోకి వెళ్లితే ... రొంపిచెర్ల మండలం మోటుమెల్లెల గ్రామ పంచాయతీ బాలనాగిరెడ్డిగారిపల్లె దాసరిగుడెంకు చెందిన మారయ్య ,హేమలతకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం రెండేళ్లు సజావుగా సాగింది. వీరికి ఒక కూతురు ఉంది. అనంతరం భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. వీరిని కలపాలని ఇరు కుటుంబ సభ్యులు బంధువులు ప్రయత్నించారు. భార్యా భర్తలు కూడా కలిసి ఉంటేనే బాగుంటుందని భావించారు. దీంతో బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీలోని కట్టకింద శివాలయంలో బుధవారం ఉదయం మళ్లీ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తల్లిదండ్రులిద్దరు ఒక్కటి కావడంతో కూతురు అనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. -
అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష
మదనపల్లె: జిల్లాలో ప్రభుత్వశాఖల ద్వారా చేపట్టిన పనులపై కలెక్టర్ నిశాంత్కుమార్ బుధవారం వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో శాఖల వారీగా మంజూరైన అభివృద్ధి పనులు, వాటి ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సూర్య ఘర్ పథకంలో లక్ష్యాలను పూర్తిచేయాలని, జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల పనులు వేగవంతం చేయా లని అధికారులను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ బిజిలీ యోజన, పీఎం కుసుం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమాల పనులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారికి సంబంధించి జిల్లాలో 12,242 రిజిస్ట్రేషన్లను స్వీకరించామని వీటి పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలుపగా, సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి సోలార్ ప్యానళ్లను ఇన్స్టాలేషన్ పూర్తి చేయా లని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ ఫీడర్ల నిర్మాణం జరుగుతోందని విద్యుత్ శాఖ అధి కారి సోమశేఖర్రెడ్డి వివరించారు. జిల్లాలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రాయచోటి, పుంగనూరు, నియోజకవర్గాల్లో 1,652 కిలోమీటర్లలో గుంతలు పూడ్చి, రహదారుల పునరుద్ధరణ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. రాయచోటి–వేంపల్లె, రాయచోటి–లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె–పీలేరు జాతీయ రహదారుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ● సత్వరమే లక్ష్యాలు సాధించాలి ● కలెక్టర్ నిశాంత్ కుమార్ -
పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు : పట్టణంలోని దోబికాలనీలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అన్సర్బాషా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు దోబికాలనీలో దాడులు చేసి పేకాటరాయళ్ల నుంచి రూ.77 వేలు నగదు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు తంబళ్లపల్లె : ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. పరసతోపు పంచాయతీ గోల్లపల్లివారిపల్లెకు చెందిన సదాశివరెడ్డి(46) ద్విచక్రవాహనంలో పనిగా తంబళ్లపల్లెకు బయలుదేరాడు. నల్లగడ్డబావి సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు వైద్య చికిత్సల కోసం స్థానిక సీహెచ్సికి తరలించారు. పరిిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. మట్టిట్రాక్టర్ కిందపడి కూలీ దుర్మరణం మదనపల్లె టౌన్ : కూలిపనులకు వెళ్లి ఓ వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు, మృతుడి కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లె మండలం, కోళ్లబైలు పంచాయతీ, బయారెడ్డికాలనీలో నివాసం ఉంటున్న వెంకటరెడ్డి కొడుకు రెడ్డిశేఖర్(40), రోజు మాదిరిగానే బుధవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కరుబలకోట మండలం, ముదివేడు వద్ద ట్రాక్టర్కు మట్టిలోడు చేసేందుకు సహచరులతో వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్కు మట్టిలోడు చేసి, ట్రాలీపై కూర్చొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ముదివేడుకు సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్ చక్రాలు రెడ్డిశేఖర్పై వెళ్లగా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించేలోపే మృతిచెందాడు. రెడ్డిశేఖర్కు భార్య, పిల్లలు ఉన్నారు. బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని అనంతరాజుపురం పంచాయతీ లక్ష్మీపాలెం గ్రామంలోని పురాతన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15 ఏళ్లుగా భద్రపరిచిన స్వామి ఆభరణాలకు బుధవారం అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పంచానామా నిర్వహించారు. 15 ఏళ్ల క్రితం స్వామివారి ఆభరణాల్లో కొన్ని చోరీకి గురయ్యాయి. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి ఆభరణాలు రికవరీ చేశారు. అప్పటి నుంచి వీటిని బయటకు తీయకుండా అలాగే ఉంచారు. త్వరలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పాలక మండలి సభ్యులు స్వామివారి ఆభరణాలకు పంచనామా నిర్వహించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో పంచనామా నిర్వహించారు. పంచనామా అనంతరం ఆభరణాలను తిరిగి ఆలయంలోని పెట్టెలోనే భద్రపరిచి సంరక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. -
● వైఎస్ జగన్ ముందుచూపుతో ఎత్తిపోతలకు శ్రీకారం
కడప సెవెన్రోడ్స్: కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించడంలో ఎంతో కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, నేటి కూటమి ప్రభుత్వం తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి చరమగీతం పాడింది. ప్రాణప్రదమైన ఈ పథకం పనులు ఆగిపోవడంపై రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన, అభద్రత వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమాధానం కరువైన ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఎదురుదాడికి పాల్ప డుతోంది. రాయలసీమ జీవనాడి అయిన ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడానికి సంసిద్ధమయ్యారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడుకు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద బహిరంగసభ నిర్వహించాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ కడపజిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ న్యాయస్థానం జోక్యంతో అనుమతి వస్తుందనే తాము భావిస్తున్నామన్నారు. ఏది ఏమైనా తాము చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళతామన్నా రు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతుల్లో పోలీసు బలగాలను పంపి అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసనలు, సభలు జరుగుతాయని స్పష్టం చేశారు. ‘సీమ’సాగునీటికే ఎత్తిపోతలు ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకువెళుతోంది. అలాగే కల్వకుర్తిలో 25కుగాను 50 టీఎంసీల నీటిని తోడేస్తున్నారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకమునుపున్న 60 వరద రోజులు ప్రస్తుతం 30కి పడిపోయాయి. రాయలసీమలోని ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, చైన్నె తాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు–నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు చొప్పున నీరు అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు సాగునీరు అందే వీలుండదు. ఈ నేపథ్యంలో 841 బెడ్లెవెల్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని పోతిరెడ్డిపా డు హెడ్ రెగ్యులేటర్ను ఆనుకుని ఈ ఎత్తిపోతల పథకం ఉంది. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3,825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 30 శాతం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు తిరుగులేని నిదర్శనం. కరువు నేలపై జలసిరులు పారించాలనే సదాశయంతో వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.. బీటలు వారిన చేలతో.. కంట కన్నీళ్లతో అలసిపోయిన రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో నిధులు విడుదల చేశారు.. ఆయన ఆశయానికి బాబు సర్కారు తూట్లు పొడిచింది. సీమ జీవనాడైన సీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసి రైతు సంక్షేమానికి ‘నీళ్లొ’దిలింది. ముచ్చుమర్రి వద్ద నుంచే లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని ‘సీమ’నేతలు మండిపడుతున్నారు. సీమ ఎత్తిపోతల నుంచి ఎస్ఆర్ఎంసీలోకి నీటిని తీసుకు రావడానికి దూరం నాలుగు కిలోమీటర్లే ఉంటుంది. కానీ ముచ్చుమర్రి నుంచి తీసుకు రావాలంటే సుమారు 50 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఇది అధిక వ్యయం, ప్రయాసతో కూడు కున్నది. సీమ ఎత్తిపోతల పథకం పనులను బా బు సర్కార్ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అక్రమ నీటి వాడకంతో తగ్గిన వరద రోజులు దిండి, పాలమూరు–రంగారెడ్డితో నీటిని తోడేస్తున్న తెలంగాణ బాబు అండ్ కో కుతంత్రాలతో ఆగిన ‘సీమ’ఎత్తిపోతల పనులు నేడు వైఎస్సార్ సీపీ చలో పోతిరెడ్డిపాడు -
కనికరం చూపి పెన్షన్ ఇప్పించండయ్యా..!
మదనపల్లె రూరల్ : పుట్టుకతోనే పిల్లవాడి రెండుచేతులకు వైకల్యం. తన పనులు తాను చేసుకోలేని దుస్థితి. సదరం సర్టిఫికెట్లో 89 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినప్పటికీ పెన్షన్ ఇచ్చేందుకు అధికారులకు మనసు రావడం లేదు. దయచేసి తమ బిడ్డపై కనికరం చూపి పెన్షన్ ఇప్పించండయ్యా అంటూ కలెక్టరేట్ ఆవరణలో బుధవారం తల్లిదండ్రులు వేడుకున్నారు. మదనపల్లె పట్టణం దేవలంవీధికి చెందిన కురాకుల వెంకటేశ్వర్లు బిల్డింగ్ సెంట్రింగ్ వర్క్ చేస్తుంటాడు. భార్య శిరీష గృహిణి. వీరికి ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు కురాకుల రామ్చరణ్తేజ్(11) అంగవైకల్యంతో జన్మించాడు. రెండుచేతులు సన్నగా చచ్చుపడిపోయాయి. పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్కు దరఖాస్తు చేస్తే 89శాతం అంగ వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించారన్నారు. దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, తమ ఆధార్కార్డుపై వేరొకరి ఇల్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపడంతో మంజూరుకాలేదన్నారు. దీంతో నానాతంటాలు పడి ఆన్లైన్లో దాన్ని తొలగించేందుకు రెండేళ్లు పట్టిందన్నారు. రెండేళ్ల క్రితం మళ్లీ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, అధికారులు ఇదిగో, అదిగో అంటూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా అని అడిగితే, ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదని చెపుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్కు ఉన్న ప్రత్యేకాధికారాలతో తప్ప పెన్షన్ మంజూరుచేయడం సాధ్యం కాదని చెప్పడంతో కలెక్టరేట్కు వచ్చినట్లు తెలిపారు. కుమారుడు రామ్చరణ్ తేజ్ దుస్థితిని కళ్లారా చూసి అయినా కలెక్టర్ సార్ కరుణిస్తాడేమోనని కొండంత ఆశతో వచ్చినట్లు చెప్పారు. దివ్యాంగ బాలుడికి మద్దతుగా బీజేపీ నాయకులు డాక్టర్.అజ్మతుల్లాఖాన్ నిలిచారు. కలెక్టరేట్కు తీసుకురావడంతో పాటు సమస్యను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
పన్నుల్లో కిరికిరి !
● కమర్షియల్ భవనాలకు హౌస్ట్యాక్స్ ● పంచాయతీ ఆదాయానికి గండి రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో కమర్షియల్ క్లాంపెక్స్కు పన్నుల విధింపులో అవతవకలు చోటుచేసుకున్నాయనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళుతున్నాయి. పట్టణంలోకి కూచివారిపల్లె, ఊటుకూరు, పెద్దకారంపల్లె పంచాయతీలు విస్తరించి ఉన్నాయి. వీటి హద్దుల మేరకు పట్టణంలో కీలకమైన ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు కొంతవరకు పంచాయతీల పరిధిలో ఉన్నాయి.అయితే పన్నులు మాత్రం పంచాయతీలకు వర్తిస్తున్నాయి. రాజంపేట బైపాస్ తిరుపతి వైపు, రైల్వేకోడూరు వైపు, మన్నూరు వైపు ఇలా పట్టణంలో కొన్ని ప్రాంతాలు పంచాయతీ పరిధిలో ఉండటంతో అక్రమార్కులకు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. పట్టణంలోని రైల్వేకోడూరు మార్గంలో ఉన్న పక్కా కమర్షియల్ భవనాలకు ఇంటి పన్ను రాబడుతున్న సంఘటన కూచివారిపల్లె పంచాయతీలో వెలుగుచూసింది. ఇటీవల డిప్యూటీ ఎంపీడీఓపై పచ్చనేతల వీరంగంతో పన్నుల విధింపులో అవకతవకలు బహిర్గతమయ్యాయి. ఇటీవల రాజంపేట ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్అలీని కొంతమంది పచ్చనేతలు బెదిరించడం, పంచాయతీలో జరిగిన అవకతవకలను బలపరుస్తోంది. ఇప్పుడు ఈ పంచాయితీ నిర్వహణ వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. పైగా పంచాయతీరాజ్ కమిషనరు, డీపీఓ, డీఎల్డీఓకు ఫిర్యాదులు వెళ్లాయి. పంచాయతీ కార్యదర్శికి నోటీసు.. రైల్వేకోడూరు రహదారిలోని కమర్షియల్ భవనాన్ని నివాస భవనంగా గుర్తించి పన్ను వసూలు చేసుకుంటున్నారని పీజీఆర్ఎస్లో కూచివారిపల్లె గ్రామానికి చెందిన పోలూరు జయమ్మ అనే మహిళ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్అలీ కార్యదర్శి కమలాదేవికి నోటీసు జారీ చేశారు. కూచివారిపల్లె పంచాయతీ పరిధిలో గల ఇంటికి పన్ను గత సంవత్సరం నాన్ కమర్షియల్ ట్యాక్స్, కింద పంచాయితీకి జమచేశారు.కానీ పట్టణంలో ఉన్న ఈ భవనంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. పక్కా కమర్షియల్ను నాన్ కమర్షియల్గా పన్ను ఏవిధంగా వసూలు చేస్తారు? ఇందుకు సంబంధించి డాక్యుమెంట్స్తో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కూచివారిపల్లెకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ కూడా పంచాయితీ ఆదాయం గురించి వాకబు చేసినట్లు సమాచారం. గతంలో పీజీఆర్ఎస్లో గాంధీనగర్ డోర్ నంబరు కేటాయింపు వ్యవహారంపై ఫిర్యాదులు వెళ్లాయి. కూచివారిపల్లె పంచాయతీ పరిధిలో ఇంటిపన్ను వ్యవహారంలో అవకతవకలు.. పట్టణం పరిధిలోకి విస్తరించిన పంచాయతీలకు చుట్టుకుంటోంది. పట్టణంలోని రైల్వేకోడూరు రహదారి ప్రాంతంలో దాదాపు అన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇది ఖరీదైన ప్రాంతంగా కొనసాగుతోంది. దీంతో పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం రావాలి. కానీ ఆ విధమైన పరిస్థితులు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరి ఫిర్యాదుతో ఇప్పుడు ఇంటిపన్నులు విధింపులో అవకతవకలు జరిగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రాజంపేట బైపాస్ రహదారిలో తిరుపతివైపు కూడా అనేక భవనాలు, స్థలాలు ఊటుకూరు పంచాయతీ పరిధిలోకి వస్తాయి. అనుడా అనుమతి లేకుండానే... అన్నమాచార్య అర్బన్ డెవలప్మెంట్(అనుడా) అనుమతి లేకుండానే కూచివారిపల్లె, ఊటుకూరు, పెద్దకారంపల్లె పంచాయతీల పరిధిలోని రాజంపేట పట్టణంలో వెలిసిన నిర్మాణాలపై ఆరోపణలు వెలువడుతున్నాయి.కమర్షియల్ భవనాలకు ఇంటి పన్ను, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లో చేతివాటంతో చకచకా ఇవి జరిగిపోతున్నాయి.చాలావరకు అనుమతి లేకుండా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్లాన్ అప్రూవుల్ కూడా అనుడా నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు పాటిస్తున్న నిబంధనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఏదీ ఏమైనప్పటికి కొంతమంది కార్యదర్శుల చేతి వాటం వల్ల పంచాయతీల ఆదాయానికి భారీగానే గండిపడుతోంది. పట్టణంలో ఉన్నప్పటికీ అవి పంచాయతీకి సంబంధించిన ప్రాంతాలు కాబట్టి మున్సిపాలిటీ అటువైపు తొంగిచూడటం లేదు. అయితే పురపాలిక సేవలు మాత్రం ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. కమర్షియల్ కాదని,ఇంటినివాసం పన్ను వసూలు చేస్తున్న రాజంపేటలోని రైల్వేకోడూరు రహదారిలో ఉన్న భవనం ఈ చిత్రంలో కనిపిస్తోంది కమర్షియల్ భవనం అనుకుంటే...పప్పులో కాలిసేనట్లే...ఇది నివాసభవనం అని కూచివారిపల్లె పంచాయతీ గుర్తించిందంటా..ఇంటిపన్ను కూడా వసూలు చేస్తోందంటా..ఇప్పుడు ఈ భవనం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా ఇంటిపన్ను విధించారో ఆయనకే తెలియాలి. రాజంపేట పట్టణంలోకి చొచ్చుకొచ్చిన పంచాయతీల పరిధిలో పన్ను విధింపు లీలలు అనేకం ఉన్నాయి. ఇటీవల పచ్చనేతలు డిప్యూటీ ఎంపీడీఓపై వీరంగం సృష్టించడానికి కారణం వెనుక అసలు వ్యవహారం బయటికిపొక్కింది. పట్టణంలో పంచాయతీపాలనలో పన్నులు, బిల్డింగ్ప్లానింగ్ లాంటి వాటి విషయంలో అడ్డగోలు అనుమతులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పీజీఆర్ఎస్లో ఇచ్చిన ఫిర్యాదుపై కూచివారిపల్లె పంచాయతీ కార్యదర్శి కమలాదేవికి నోటీసు ఇచ్చామని డిప్యూటీ ఎంపీడీఓ అస్రఫ్ అలీ వివరణ ఇచ్చారు. ఇదే నోటీసు పంచాయతీరాజ్ కమిషనరు, డీపీఓలకు పంపామన్నారు. అలాగే పోలరపు లక్షుమయ్య అనే వ్యక్తి పేరుతో డీబీఎన్ పల్లె డోర్ నంబరు4/350, 4/351 ఉన్న రెసిడెన్సీల కింద ఉన్న పన్ను కమర్షియల్గా మారుస్తానని జనవరి 22లోపు రాతపూర్వకంగా ఇస్తానని తెలియచేసిందన్నారు. అయితే ఇంతవరకు ఎటువంటి రికార్డులు సబ్మిట్ చేయలేదని ఎంపీడీఓ స్పష్టంచేశారు. -
రైతులను వ్యాపారులు అవమానిస్తున్నారు
జేసీకి టమాటా రైతుల ఫిర్యాదు గుర్రంకొండ: మార్కెట్యార్డులో టమాటా రైతులను వ్యాపారులు అవమానిస్తున్నారని జాయింట్కలెక్టర్ శివనారాయణకు రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ ముగ్గురు మండీల యజమానుల లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని మార్కెట్ కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే వ్యాపారులు హేళనగా మాట్లాడడంపై రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మార్కెట్యార్డులో జాయింట్ కలెక్టర్ శివనారాయణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా వేలం పాటలు నిర్వహిస్తున్న టమాటా మండీలలో పరిస్థితిని గమనించారు. టమాటా క్రీట్లపై ఎత్తుగా టమాటాలు పోసి ఉండడాన్ని గమనించి ఇదేమిటని మండీల యజమానులను ప్రశ్నించారు. దీంతో రైతులు మండీలలో ఇదంతా మాములుగా జరిగే తంతు అని ఇలా వేయకపోతే వేలం పాటల్లో ఇష్టానుసారం కోతలు వేస్తారని రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే కొంతమంది మండీల యజమానులు రైతులను అవమానిస్తూ జాక్పాట్పై హేళనగా మాట్లాడడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. మీ సమక్షంలోనే తమను అవమానించడం ఎంత వరకు సబబని రైతులు జేసీని ప్రశ్నించారు. మార్కెట్యార్డులోని ఆన్నిమండీలలో జేసీ తనిఖీలు నిర్వహించారు. మండీల యజమానుల తీరు సరిగ్గాలేదని వెంటనే ముగ్గు రు మండీయజమానుల లైసెన్స్లు రద్దు చేయాలని జిల్లా మార్కెట్కమిటి ఏడీఏ త్యాగరాజుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక మార్కెట్యార్డు ఉపకార్యాలయంలో మండీల యజమానులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్యార్డులో ప్రభుత్వ నిబంధనల మేరకే మండీలు నిర్వహించుకోవాలన్నారు. కమీషన్ నాలుగుశాతం మాత్రమే తీసుకోవాలన్నారు. 25కేజీల క్రీట్ల బదులు 15కేజీల క్రీట్ల విధానం వెంటనే అమలు చేయాలన్నారు. జాక్పాట్లు తీసుకొంటే లైసెన్స్లు రద్దు చేసి చట్టపరంగా క్రిమినల్కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతుల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా మార్కెట్కమిటీ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మార్కెట్కమిటీ ఏడీఏ త్యాగరాజు, మార్కెట్కమిటీ కార్యదర్శి సునీల్, సూపర్వైజర్ నయిబ్ఆలీ,సిబ్బంది పాల్గొన్నారు. -
బోయకొండలో లక్ష కుంకుమార్చన ప్రారంభం
ప్రత్యేక అలంకారంలో అమ్మవారు లక్షకుంకుమార్చనలో పాల్గొన్న ఉభయదారులు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా వేద పండితులు,అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు.మూడు రోజులపాటు ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట గణపతి, చంఢిహోమం, మహా మంగళహారతి చేశారు.122 మంది దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరంఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉభయదారులకు అమ్మవారి ప్రతిమ గల వెండి కాయిన్, పవిత్ర శేషవస్త్రం, తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు. దౌర్జన్యాలకు పాల్పడితే చర్యలు బోయకొండ గంగమ్మ దర్శనార్థంవచ్చే భక్తుల పట్ల సుమో,ఆటో డ్రైవర్లు, మాంసంకటింగ్ చేసే వారు దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు. బుధవారం బోయకొండలో ఉన్న డ్రైవర్లు , మాంసం కటింగ్ దుకాణాల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇ టీవల ఓ మహిళా భక్తురాలిపట్ల సుమో డ్రైవర్ అసభ్య కరంగా ప్రవర్తించడంతో బాధితురాలి ఫిర్యాదు మేర కు అతనిపై కేసు నమోదుచేశామని తెలిపారు. భక్తులపట్ల మర్యాధతో సత్పవర్తనతోమెలగాలని సూచించారు. బోయకొండలో పనిచేస్తున్న వివిధ వాహనాల డ్రైవర్లు, మాంసం కటింగ్ నిర్వాహకులు తమ ఆధార్, ఫొటోలను పోలీస్స్టేషన్లొ అందజేసి తగిన గుర్తింపు కార్డు పొందాలన్నారు. సమావేశంలో సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ నాగేశ్వర రావు తదితరులు ఉన్నారు. -
పెస్టిసైడ్స్ సరఫరాకు సీల్డ్ టెండర్ల ఆహ్వానం
మదనపల్లె రూరల్: జిల్లాలోని పట్టు రైతులకు పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున నాణ్యమైన క్రిమిసంహారక మందులు(పెస్టిసైడ్స్) సరఫరా కోసం ఉత్పత్తిదారుల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జేసీ శివ్ నారాయణశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 12వతేదీ సాయంత్రం 5 గంటలలోపు టెండర్లు వేసేందుకు గడువు విధించామని పేర్కొన్నారు. టెండర్ పూర్తి వివరాల కోసం 99661 53900 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుడిపాల, బి.కొత్తకోట ఎంపీపీల స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. బి.కొత్తకోట ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళ కావడంతో, ఎంపీటీసీలు ఎవరూ ఆ కేటగిరీకి చెందిన వారు లేకపోవడంతో పోటీ చేయలేదు. అధికారులు ఎన్నికను గురువారానికి వాయిదా వేశారు. అసలు సమస్యను ఎన్నికల సంఘంకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గుడిపాలలో ఎంపీటీసీ జి.హరిప్రసాద్ చౌదరి ఎంపీపీగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్(డీఆర్)గా పి.ఉమా మహేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏవీఎస్.మూర్తి, చిత్తూరుజిల్లా డీఆర్గా ఉంటూ డెప్యుటేషన్పై అన్నమయ్యజిల్లా బాధ్యతలు నిర్వహించేవారు. హిందూపురం డీఆర్గా పనిచేస్తున్న ఉమా మహేశ్వరిని అన్నమయ్యజిల్లా డీఆర్గా నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాయచోటిలోని డీఆర్ కార్యాలయంలో ఉమా మహేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లె రూరల్: జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షణ విభాగంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిపై ఫిజియోథెరపిస్టులుగా సేవలందించేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కలెక్టరేట్లో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సమగ్ర శిక్ష జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలోని 5 ఫిజియోథెరపిస్ట్ ఖాళీలకు మొత్తం 35మంది దరఖాస్తు చేసుకోగా, 28 మంది అభ్యర్థులు ఇంట ర్వ్యూలకు హాజరయ్యారన్నారు. జేసీ శివ్ నారాయణ శర్మ, డీఈఓ సుబ్రహ్మణ్యం, సమగ్రశిక్షా ఏపీసీ అనూరాధ, డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య ఇంటర్వ్యూ నిర్వహించారన్నారు. కేవీపల్లె: మండలంలోని గ్యారంపల్లె కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.సరస్వతి తెలిపారు. హ్యాండ్ బాల్ క్రీడలో రాణించిన విద్యార్థులను బుధవారం పాఠశాలలో అభినందించారు. అండర్ 14 విభాగంలో తమ పాఠశాల నుంచి రాహుల్, సోహిత్రెడ్డి, విహాన్, దీక్ష జిల్లా జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్ 17 విభాగంలో తమ పాఠశాల నుంచి మహేంద్ర, ఓంప్రకాష్, లోకేష్కుమార్నాయక్, లక్ష్మీ, మహిత కర్ణాటకలో జరిగిన అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొని ప్రతిభచూపినట్లు వివరించారు. మదనపల్లె అర్బన్: క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్తో సాధ్యమవుతుందని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలి, ప్రవర్తనతో క్యాన్సర్ను నియంత్రించవచ్చన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి శివప్రతాప్ , హెల్త్ఎడ్యుకేటర్ మహ్మద్రఫీ మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బందితో కలసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాన్సర్ను నియంత్రిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో క్షయనివారణ జిల్లా అధికారి డాక్టర్ రాధిక, ఏవో మధుసూదన్రెడ్డి, 104నోడల్ అధికారి శ్రీధర్, డీఎంవో రామచంద్రారెడ్డి, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
హత్యరాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
రాజంపేట: చెయ్యేరు నదీ ఒడ్డున వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం హత్యరాల త్రేతేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని రాజంపేట సబ్కలెక్టర్ సీహెచ్ భావన అన్నారు. బుధవారం అన్నమయ్య సభాభవనంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. హత్యరాల ఉత్సవాలకు రాజంపేట పరిసర ప్రాంతాలే కాకుండా తిరుపతి, కడప జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే మాట్లాడుతూ ఉత్సవాలకు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తామన్నారు.సబ్కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీధర్, ఎంవీఐ వినోద్కుమార్, డీఈఈ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజంపేట సబ్కలెక్టర్ సీహెచ్ భావన -
అంత్యక్రియలకు అభ్యంతరం
పీలేరురూరల్ : మండంలోని కాకులారంపల్లె పంచాయతీ చిన్నగాండ్లపల్లె ఓ వ్యక్తి అంత్యక్రియలకు పక్క పొలం రైతులు అభ్యంతరం తెలిపి అడ్డుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. చిన్నగాండ్లపల్లెకు చెందిన బేతాళ కన్నయ్య మృతి చెందాడు. గతంలో తమ బంధువులను ఖననం చేసిన ప్రాంతంలోనే కన్నయ్య అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు. అయితే సమీప వ్యవసాయ పొలం యజమానులు తమ భూమి పక్కన ఖననం చేయరాదని అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటనపై మృతుని కుమారుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ శివకుమార్, ఎస్ఐ లోకేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పి సర్వే నంబరు 1034లో ప్రభుత్వ భూమి 25 సెంట్లను శ్యశానానకి కేటాయించి శాశ్వితంగా సమస్య పరిష్కరించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. . ఈ కార్యక్రమంలో ఆర్ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వో ఆజయ్ పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు
పీఆర్ అడిషనల్ కమిషనర్ డాక్టర్.సుధాకర్ రావు మదనపల్లె రూరల్: పంచాయతీరాజ్ చట్టంలోని అధికారాన్ని ఉపయోగించి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పన్ను వసూళ్లు చేయాలని పంచాయతీరాజ్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ డాక్టర్.సుధాకర రావు ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎన్వీఆర్ కల్యాణమండపంలో డీపీఓ రాధమ్మ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో పంచాయతీరాజ్ యాక్టివిటీస్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని 25 మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు, 480 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్.సుధాకర్ రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీఓ అధికారాలు, విధులు, బాధ్యతలపై వివరించారు. పన్ను వసూళ్లు, పంచాయతీలకు ఇతర ఆదాయ వనరులపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని, అందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. అన్నమయ్య జిల్లాలో సుమారు 3లక్షల అసెస్మెంట్లు నుంచి రూ.15 కోట్లు పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటివరకు 40 శాతం వసూలైందన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూలులో అలసత్వం వహిస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుందని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పంచాయతీరాజ్ సిబ్బందికి అవార్డుల ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్డబ్ల్యూఎస్ డీఎల్డీఓ లక్ష్మీపతి, అమరనాథరెడ్డి, డీఎల్పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధుని కొండపై ఆంక్షలు తొలగించాలి
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధునికొండపై ఆరునెలలుగా అమలుచేస్తున్న నిషేధాజ్ఞలు వెంటనే ఎత్తివేసి, బుద్ధ భగవానుడి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకులు పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకు సంక్రమించిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారంటూ పోలీసుల తీరుకు నిరసగా ఆయన ఇంట్లో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...బుద్ధుడికొండపై రెవెన్యూ, పోలీసు అధికారులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. భగవాన్ బుద్ధుడి పూజలకు అనుమతి కోరుతూ, మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మౌనదీక్ష పేరుతో నిరసన కార్యక్రమానికి బాస్ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమ అనుమతికి మూడురోజుల ముందే వన్టౌన్ పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకుంటే, చివరిక్షణంలో అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలపడం భావ్యం కాదన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంట్లోనే మౌనదీక్ష చేపట్టినట్లు చెప్పారు. బుద్ధవిహారలో ఇప్పటివరకు నాలుగుసార్లు బుద్ధుడి విగ్రహాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధంపై కొనసాగుతున్న ద్వేషాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మార్చి 13న ఛలో ఢిల్లీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాస్ నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, జీ.వి.రమణ, వై.గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, రవిశంకర్, తలారికృష్ణ, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో చీకట్లే
మదనపల్లె: జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. వైఎస్ జగన్కు ఆ ఖ్యాతి దక్కుతుందన్న అక్కసుతో వాటన్నింటిని రద్దు చేసి కొత్తగా తామనుకున్న ప్రాంతాలకు మొక్కుబడిగా ఏడు విద్యుత్ కేంద్రాలను మంజూరు చేసి చేతులుదులుపుకుంది. ఫలితంగా మెరుగైన సేవలు పొందాల్సిన ప్రజలు, రైతులకు ప్రయోజనం కలగకుండాపోయింది. విద్యుత్ వెలుగులు ప్రసరించాల్సిన మారుమూల ప్రాంతాల్లో చీకట్లు అలుముకొంటున్నాయి. వైఎస్ జగన్ పాలనలో 36.. ప్రస్తుత అన్నమయ్య జిల్లా, పొరుగుజిల్లాల్లో కలిసిన రాజంపేట, కోడూరు నియోజకవర్గాలకు చెందిన గ్రామాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 33/11 విద్యు త్ సబ్స్టేషన్లు 36 మంజూరయ్యా యి. చీమలచెరువుపల్లె, అరవీడు, రాయచోటి రింగ్రోడ్డు, రౌతుకుంట, తాటిగొండపల్లె, రాయచోటి టౌన్, దప్పేపల్లె, మాచిరెడ్డిగారిపల్లె, గోళ్లపల్లె, గాండ్లచెరువు, చీకటిపల్లె, కుమ్మరపల్లె, నారాయణరెడ్డిగారిపల్లె, యండపల్లె, మద్దినాయునిపల్లె, పాతకోట, పులికల్లు, కాలువపల్లె, బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ, దిన్నిమీదపల్లె, బాలయ్యగారిపల్లె, గట్టూరువారిపల్లె, బాలాపల్లె, రెడ్డివారిపల్లె, బాలరెడ్డిగారిపల్లె, కే.కందులవారిపల్లె, మార్గవపల్లె, అన్నమయ్యప్రాజెక్టు, సాదువారిపల్లె, రామలింగాపురం, అనంతసముద్రం, చెక్రయాపేట, మట్లివారిపల్లె, దండువారిపల్లె, బరినేపల్లిలకు ఈ విద్యుత్సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్స్టేషన్ను రూ.2 కోట్లతో నిర్మించేలా రూ.70 కోట్లు నిధులు కూడా మం జూరయ్యాయి. వీటిస్థానంలో 7.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరుచేసిన 36 విద్యుత్ సబ్స్టేషన్లను పక్కనబెట్టిన కూటమి ప్రభుత్వం వాటిస్థానంలో ఏడు కొత్త సబ్స్టేషన్లకు మళ్లీ మంజూరు చేసింది. వీటిలో గత పాలనలో మంజూరైన గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లె, వీరబల్లి మండలంలోని తాటిగొండుపల్లె, చిట్వేలి మండలంలోని కే.కందులవారిపల్లె ఉండగా కొత్తగా ములకలచెరువు మండలంలోని సొంపల్లె, ఓబులవారిపల్లె మండలంలోని తల్లవారిపల్లె, రాయచోటిలోని బోయపల్లె, రామాపురంలో సబ్స్టేషన్లు మంజూరు చేశారు. వీటిలో మూడు చీమలచెరువుపల్లె, బోయపల్లె, తాటిగుంటపల్లె సబ్స్టేషన్లు పూర్తవ్వగా సొంపల్లెలో పనులు సాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గత ప్రభుత్వం కొత్తగా 36 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లకు ఈ ప్రాంతాలకు దూరంగా ఉండటంతో పాటు విద్యుత్ సరఫరా నష్టాలు, లోఓల్టేజి, ఇబ్బందులు తలెత్తేవి. దాంతోపాటు వినియోగం భారీగా పెరగడంతో అంతరాయం అధికమైంది. దీన్ని అరికట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటే పరిష్కారమని గత ప్రభుత్వం గుర్తించి ఈ కేంద్రాలను, వాటికయ్యే నిధులను మంజూరు చేసింది. కూటమిపాలన రావడంతో 36 విద్యుత్ సబ్ స్టేషన్లలో 29 సబ్స్టేషన్లను నష్టపోవాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాకు 36 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు కూటమి ప్రభుత్వంలో ఏడింటికే అనుమతి వాటిలో పాతవి 3, కొత్తవి 4 ఇచ్చారు తీవ్రంగా నష్టపోయిన జిల్లా ప్రజలు -
పది కిలోల గంజాయి స్వాధీనం
మదనపల్లె : పెద్దతిప్పసముద్రం మండలంలో గంజాయి సాగు చేస్తూ దాన్నే బి.కొత్తకోట కేంద్రంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితులైన పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామం పెద్దమేకలవారిపల్లెకు చెందిన అవులప్పగారి వెంకటరమణారెడ్డి (53), బి.కొత్తకోటకు చెందిన మొటుకు సురేంద్ర అలియాస్ డిమ్మర్ (26), సంపతికోట మహమ్మద్ ఆఫ్రిద్ ఖాన్ (20), దేసుగారి పురుషోత్తం (20), ఆదిల్ (22)లను అరెస్ట్ చేసి వారినుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వెంకటరమణారెడ్డి పెద్దమేకలవారిపల్లె గుట్టవద్ద ఉన్న పొలంలో మూడేళ్లు గా గంజాయిని సాగు చేస్తున్నాడు. స్థానికంగా ఆవులు, గొర్రెలకు కడుపునొప్పి వస్తే తినిపించేందుకు ఈ గంజాయిని విక్రయించే వాడని చెప్పారు. ఈ వ్యవహారం గుట్టుగా ఉండటంతో గంజాయి సాగుచేసి దాన్ని బి.కొత్తకోటకు చెందిన వారికి కిలో రూ.20 వేలకు విక్రయించుకొంటున్నాడు. ఈ కోవలో వృత్తిపనులతో జీవిస్తున్న బి.కొత్తకోటకు చెందిన నలుగురు నిందితులు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదన వైపునకు మళ్లారు. దాంతో పెద్ద వెంకటరమణారెడ్డి విక్రయించిన గంజాయిని కొనుగోలు చేసి దాన్ని స్థానికంగా విక్రయించుకుని సొమ్ము చేసుకునేవారు. వెంకటరమణారెడ్డి సాగుచేసిన గంజాయిలో విక్రయించగా మిగిలిన దాన్ని గుట్టవద్ద దాచిపెట్టేవాడు. సోమవా రం సాయంత్రం బి.కొత్తకోట పిటిఎం రోడ్డులో గంజాయిని విక్రయించేందుకు వెంకటరమణారెడ్డి రావడం, వీటిని కొనుగోలు చేసేందుకు నిందితులు నలుగురు కలిసిన సమాచారం అందడంతో సిఐ కే.గోపాల్రెడ్డి దాడులు నిర్వహించి పట్టుకున్నారని చెప్పారు. వారి సమాచారంతో రెండుకిలోల ఐదు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కాగా బి.కొత్తకోట, మదనపల్లెల్లో కిలో గంజాయి రూ.20 నుంచి రూ.40వేలు, బెంగళూరులో రూ.లక్ష పలుకుతోందని చెప్పారు. పట్టుబడిన గంజాయి నాణ్యతను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ మహేంద్ర, సీఐలు గోపాల్రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఐదుగురు నిందితుల అరెస్ట్ -
యూరియా కొరతను తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలి
కడప అగ్రికల్చర్ : యూరియా కొరత తీర్చి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి బుక్కే చంద్రనాయక్లను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 1,07,013 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. సాగుకు అనుగుణంగా ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 16 వేల మెట్రిట్ టన్నుల యూరియా మాత్రం జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. పూర్తి స్థాయిలో యూరియాను జిల్లాకు కేటాయించాలన్నారు. ఎమ్మార్పీ ధరలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, ఖాజీపేట మండల యువత అధ్యక్షుడు ముత్తూరు రమణ, చెముళ్ళపల్లె సర్పంచ్ ములపాకు బుజ్జి, ఏటూరు మాజీ సర్పంచ్ ఏనుగు గోపాల్ రెడ్డి, నేతలు మల్లెం వెంకటరామిరెడ్డి, పాలగిరి వెంకటసుబ్బారెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, రామా శివప్రసాద్ రెడ్డి, చాగం రెడ్డి మహేశ్వర రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
● రూ.36 లక్షల సొత్తు స్వాధీనం ● జిల్లాలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు ● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన కిరాణాదుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దుద్దే రమేష్ శెట్టి ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో దొంగల ముఠాను ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.36 లక్షల విలువచేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.60 వేలు విలువైన ఐ–ఫోన్, మూడు సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించిన కట్టింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో మంగళవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరం, అరెస్ట్, రికవరీ వివరాలను ఎస్పీ తెలియజేశారు. గత సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ న దుద్దే రమేష్ శెట్టి ఇంటిలో దుండగులు అక్రమంగా ప్రవేశించి బీరువా లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగలించారు. ఈ కేసులో ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన యెట్టి విజయ్పాల్, షేక్ గైబువల్లి అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చదువు మానేసి, చెడు వ్యసనాలకు బానిసై జులాయి గా తిరుగుతూ జన సంచారం తక్కువ ఉన్న ప్రాంతాలలో కొంత కాలంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నారు. నిందితులు ముందస్తు పథకంలో భాగంగా కుట్ర పన్ని గత కొద్ది రోజులుగా నాలుగు రోడ్ల కూడలిలో కిరాణా దుకాణం నడుపుకుంటున్న దుద్దే రమేష్ శెట్టి, కుటుంబ సభ్యుల కదలికలు, ఇంటిని గమనించారు. రమేష్ శెట్టి అంగడి వద్ద ఉండగా డిసెంబర్ 21న రాత్రి 7 నుండి 7.30 గంటల సమయంలో ఇంటి తలుపు గడియను కట్టింగ్ మిషేన్తో కట్ చేశారు. ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లాలో చోరీల నివారణకు కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. -
లోకానికి వెలుగు ఏసు క్రీస్తు
కడప సెవెన్రోడ్స్ : క్రీస్తు ఏసు లోకానికి వెలుగై అవతరించారని మాసాపేట విచారణ గురువులు జోసెఫ్ రాజ్, ఫాదర్ బడుగు శ్యాంసన్లు అన్నారు. మంగళవారం మరియాపురం పాత చర్చి ఆవరణలో లూర్దుమాత ఉత్సవాల్లో భాగంగా జోసెఫ్ రాజ్ దివ్య బలిపూజ చేశారు. ఫాదర్ శ్యాంసన్ దైవ సందేశం అందజేస్తూ క్రీస్తు ఏసు తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చి మళ్లీ వెళ్లేంత వరకు మరియమాత ఆయనకు తోడుగా నిలిచిందన్నారు. తన సంఘాన్ని, శిష్యులను అప్పగిస్తున్నానని, వారికి తోడుగా ఉండాలంటూ శిలువ యాగ సమయంలో ప్రభువు ఏసుక్రీస్తు తన తల్లి మరియను కోరారన్నారు. అప్పటి నుంచి మరియతల్లి అందరికీ తోడుగా ఉంటోందన్నారు. ప్రభువు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన నిర్వహిస్తే ఎలాంటి వ్యాధి అయినా మటుమాయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మనోహర్, సురేష్, హృదయరాజ్, సిప్రియన్ సైమన్, విజయరావు, తిరునాల కమిటీ చైర్మన్ జి.బాలయ్య, ఉపాధ్యక్షులు పి.లూర్దు, ప్రధాన కార్యదర్శి జోసెఫ్, సహాయ కార్యదర్శి ఎన్.ప్రసాద్, ట్రెజరర్ విజయరాజు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. -
కూటమి విజయం వెనుక ఎన్నో అనుమానాలు
పుంగనూరు: 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల విజయం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఎర్రాతివారిపల్లెలో మంగళవారం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈవీఎంలతో గెలిచాయా? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఏది ఎలా ఉన్నా రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి, కులాల వారీగా నాయకుల ఇళ్లపై దాడులు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్లు చేయిస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయి అనైతిక పాలన సాగిస్తోందని విమర్శించారు. అందరి లక్ష్యం జగన్ను మళ్లీ సీఎం చేయడమే ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ అందరి లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వైఎస్.జగన్ను గెలిపించి, మళ్లీ సీఎంగా చేయడమేనని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తల పాలన సాగుతుందని, ఇప్పటికే జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత పటిష్టత, కార్యకర్తల క్రీయాశీలత, సర్వసన్నద్ధతతో బలంగా ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులను ఆదర్శంగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గత పాలనలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, ఇప్పుడు వాటిని సమీక్షించుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకోవలసి ఉన్నా గ్రామస్థాయి కమిటీల అభిప్రాయాలు, సూచనలు కీలకమౌతాయని అన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటులో పుంగనూరు ప్రథమం: మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా 18 ఏళ్లు పరిపాలన సాగించినా కూడా ప్రజాభిమానంలో పెద్దిరెడ్డి వెనకనే ఉన్నారని తెలిపారు. శివశంకర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయడంలో పుంగనూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచిందని కొనియాడారు. పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి మాట్లాడుతూ కమిటీలు ప్రతినెల మూడవ ఆదివారం రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి, ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజి ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, రెడ్డిశ్వర్రెడ్డి, ఫృధ్వీదర్రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, ఉమ్మడి జిల్లాల ఐటీ వింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సర్కార్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది కులాల వారీగా నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు, అరెస్ట్లకు భయపడేది లేదన్నారు. ప్రజలతో కలసి పోరాటం చేసి విజయం సాధిస్తామన్నారు. వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి మరణం తరువాత వైఎస్.జగన్కు అండగా ఉండేందుకు అభిమానులు అందరితో కలసి ఒక ఎమోషన్తో వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని కొనియాడారు. -
● పలు మార్లు ఫిర్యాదు
కేవీపల్లె మండలంలో మైనింగ్ మాఫియాపై గతేడాది నుంచి సీపీఐ నాయకులు, బీజేపీ నాయకులు, స్థానిక నాయకులు పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు. అడవిపల్లె ప్రాజెక్టు సమీపంలో కొండలలో అక్రమంగా తమిళనాడు కూలీలచే మైనింగ్ చేయిస్తున్న మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అడవిపల్లె ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టు సమీపంలో పేలుళ్లు చేపడుతుండడంతో ప్రాజెక్టు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకుని ప్రాజెక్టును కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
● మృతుడు కోవెలకుంట్ల వాసిగా గుర్తింపు ● బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుఖాజీపేట : అనుమానాస్పదంగా పడి ఉన్న మృతదేహం పై అనేక అనుమానాలు.. సందేహాల నడుమ కడప రిమ్స్కు మృతదేహాన్ని తరలించారు.. విచారణ జరుపగా చనిపోయిన వ్యక్తి కోవెలకుంట్ల వాసిగా గుర్తించారు.. అయితే అతని మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెలితే ఖాజీపేట మండలం పాటిమీదపల్లె సమీపంలోని టోల్ ప్లాజా కు దగ్గరగా వ్యక్తి చనిపోయి పడి ఉండటం స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం ఖాజీపేట సీఐ వంశీధర్కు ఇచ్చారు. వెంటనే ఆయన అక్కడకి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. అతని వద్ద ఉన్న ఆధార్కార్డు ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లోని పెద్ద అల్లుడు సాల్రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బంధువులతో పోలీసుల విచారణ తరువాత చనిపోయిన వ్యక్తి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం బిజివేముల గ్రామంగా తెలిసింది. చనిపోయిన వ్యక్తి పేరు బత్తల ఎర్రన్న గా గుర్తించారు. మృతుడు 2వ తేది ఉదయం 10 గంటలకు గుంటూరులోని ప్రార్థనలకు వెళుతున్నట్లు బంధువులకు చెప్పాడని.. అయితే ఖాజీపేటలో ఎలా మృతి చెందాడు అన్నది అంతుచిక్కని విషయంగా మారింది. మృతి పై అనుమానాలు.. గుంటూరుకు వెళుతున్న వ్యక్తి ఖాజీపేట మండలం పాటిమీద పల్లెకు వచ్చి ఎలా చనిపోయాడు.. చనిపోవడానికి కారణాలు ఏమిటీ అన్నది తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ కడప జోన్ ఈడీగా రాఘవకుమార్
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా మంగళవారం ఎస్టీపీ రాఘవకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఈడీగా పని చేసిన పైడి చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పని చేస్తున్న రాఘవకుమార్ను పదోన్నతిపై నియమించారు. ఈయన మొదట 1988లో ఆర్టీసీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1990–93లో నరసరావుపేట డీఎంగా, 1993–96లో ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు డీఎంగా పని చేశారు. 1996–99లో విజయవాడలోని జోనల్స్టోర్లో, 1999–2004లో ప్రధాన కార్యాలయంలో పర్చేజ్ ఆఫీసర్గా, 2004–2007లో ప్రొద్దుటూరు డీవీఎంగా, 2007–19లో ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ ఆఫ్ స్టోర్లో పని చేశారు. 2019లో ఈస్ట్ గోదావరి డిప్యూటీ సీఎంఈగా, 2020–21లో గుంటూరు రీజినల్ మేనేజర్గా, 2022–24లో విజయవాడలోని కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్లో పని చేశారు. 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డీపీటీఓగా పని చేస్తూ పదోన్నతిపై కడపకు ఈడీగా వచ్చారు. ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
కేబుల్ వైర్లు చోరీ
చౌడేపల్లె : మండలంలోని దిగువపల్లె పంచాయతీ మేకలవారిపల్లె పరిసర ప్రాంతాల్లో రైతులకు చెందిన వ్యవసాయ బోర్లకు అమర్చిన సుమారు రూ:1 లక్ష విలువచేసే కేబుల్ వైర్లు సోమవారం రాత్రి చోరీ అయ్యాయి. మంగళవారం ఉదయం బోర్లవద్దకు వెళ్లిన రైతులు కేబుల్వైర్లు చోరీ అయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు 20మందికి చెందిన వైర్లు రాత్రి చోరీ అయినట్లు తెలిసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పోలీసులు నిఘా ముమ్మరంచేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నంమదనపల్లె అర్బన్ : కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. తంబళ్లపల్లె మండల కేంద్రానికి చెందిన రెడ్డెమ్మ(45)కూలిపనులు చేస్తుండేది. ఈనేపథ్యంలో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్ధానికులు బాధితురాలిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందించారు. పాముకాటుతో కూలీకి తీవ్ర అస్వస్థత మదనపల్లె అర్బన్: పాముకాటుతో ఓ కూలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ కొత్తిండ్లకు చెందిన రెడ్డెప్ప(46) కూలి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం కూలి పనులు చేసేందుకు మండలంలోని బొమ్మన చెరువుకు వెళ్లాడు. అక్కడ పొలంలో పనులు చేస్తుండగా విష సర్పం కాటేసింది. దీంతో రెడ్డెప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచర కూలీలు బాధితుని హుటాహుటీనా 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పొలంలో నిప్పంటుకుని రైతు మృతి పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన గుండం నరసింహులు (55) అలియాస్ వుల్లాచి అనే వికలాంగ రైతు మంగళవారం మృతి చెందాడు. వికలాంగ రైతు తన పొలం వద్దకు వెళ్ళి చుట్టూ ఉన్న గడ్డిని కాల్చేందుకు నిప్పు పెట్టాడు. మంటలు ఒక్కసారిగా తనను చుట్టు ముట్టి వ్యాపించాయి. ఈ ఘటనలో ఆ రైతు తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో రైతు పొలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చౌడేపల్లె : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పెద్దకొండామర్రి, గడ్డంవారిపల్లె రెవెన్యూ గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ స్థలాలను మంగళవారం తహసీల్దార్ పార్వతి పరిశీలించారు. ట్రాన్స్కో ఏఈ శశిధర్, సర్వేయర్ల బృందంతో కలిసి స్థలాలను రికార్డుల ఆధారంగా పరిశీలన చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 15 ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుచౌడేపల్లె : చౌడేపల్లె– పుంగనూరు మార్గంలోని చిన్నయల్లకుంట్ల సమీపంలోని చిగరమాను మిట్ట వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన జరిగింది. బూరగపల్లెకు చెందిన దేవరాజులు (50), నవీన్(25)లు పుంగనూరు వైపు నుంచి చౌడేపల్లెకు వస్తుండగా కింద పడ్డారు. బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగిందా...మరేదైనా వాహనం ఢీకొందా తెలియాల్సి ఉంది. గాయపడినవారిని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు బైకులు ఢీచింతకొమ్మదిన్నె : మండల పరిధిలోగల ఊటుకూరు రింగురోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం రెండు బైకులు ఢీకొనడంతో ఇంజనీరింగ్ విద్యార్థి నంబూరి గోవర్ధన్ (19) మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఈసీఈ చదివే నంబూరి గోవర్ధన్, తన స్నేహితుడు నితీశ్వర్ రెడ్డి అనే విద్యార్థితో కలిసి ట్రయంఫ్ బైక్ పై కడప వైపు నుంచి అన్నమాచార్య కళాశాలకు బయలుదేరారు. ఊటుకూరు వైపునకు స్థానిక చైతన్య పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులతో వెళ్తుండిన కేర్ టేకర్ రాజశేఖర్ అనే వ్యక్తి తన హోండా బైక్ ను రోడ్డు అవతలివైపు రోడ్డులోకి గమనించకుండా మలుపు తిప్పడంతో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోవర్ధన్ మృతి చెందగా కొందరికి గాయాలయ్యాయి. -
ఇలా కట్టారు.. అలా కూలింది
● సౌమ్యనాథాలయంలో సంఘటన ● నిర్మాణంలో నాసిరకమే ప్రహరీ పడిపోవడానికి కారణమా? ● భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం ● కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యమే అంటున్న భక్తులురాజంపేట : దక్షిణ భారత దేశంలో అతిపెద్ద వైష్ణవ ఆలయాలలో నందలూరు సౌమ్యనాథాలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రాచీన ప్రహరీ (ఆలయం ఉత్తర గాలి గోపురం) నిర్మించిన మూడు రోజులకే కూలిపోయింది. ఆదివారం సాయంత్రం ఆ ప్రహరీ కుప్పకూలిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదేంటీ ఇలా కట్టారు.. అలా కూలిపోయింది అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఆ సమయంలో అటుగా భక్తులు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రహరీ నిర్మితం విషయంలో కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యంపై భక్తులు పెదవివిరిచారు. సౌమ్యనాథాలయం అభివృద్ధికి ఇప్పటికే కేంద్రపురావస్తుశాఖ అడ్డంకిగా నిలుస్తోందన్న అపవాదును మూటకట్టుకుంది. టీటీడీ చేపట్టాలనుకున్న అభివృద్ధికి కూడా కేంద్రపురావస్తుశాఖ ఆంక్షలే కారణమన్న విమర్శలు వెలువడుతున్నాయి. నాసిరకమే గోడ కూలడానికి కారణమా? ఆలయంలో ప్రహరీ నిర్మాణం నాసికరంగా చేపట్టడమే కార ణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన ప్రహరీ పునఃనిర్మితంలో సున్నం వాడతారు. అదే విధంగా ఆలయం ప్రహరీ నిర్మాణం జరిగినప్పటికీ, సున్నంతో ప్రహరీ బలంగా ఉండేందుకు తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్తలు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. గోడ నిర్మితం కాగానే, అప్పుడే ప్రహరీపై క్రేన్ తీసుకొచ్చి, రాతి బండలు పెట్టేందుకు ప్రయత్నించే సమయంలో బలహీనంగా ఉన్న గోడలు కూలిపోయాయని భక్తులు చెపుతున్నారు. కూలిన సంఘటనకు మూడేళ్లు.. కాగా సౌమ్యనాథాలయంలో 2023లో వైకుంఠ ఏకాదశి ముందురోజున ఆలయ ప్రాచీన ప్రహరీ కూలిపోయింది. అప్పుడు కూడా భక్తులు అటుగా వెళ్లకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాళ్లు రప్పలతో ఉండిపోయింది. ప్రహరీ నిర్మితంపై కేంద్రపురావస్తుశాఖ నిర్లక్ష్యంపై సాక్షిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. నిర్మాణం చేపట్టేందుకు కేంద్రపురావస్తుశాఖ టెండర్లు కూడా పిలిచారు. పనులు చేపట్టే విషయంలో మొన్నటి వరకు జాప్యం కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం జోక్యం చేసుకొని ప్రహరీ నిర్మితం చేయాలని కేంద్రపురావస్తుశాఖ పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. చేపట్టిన మూడు రోజులకే కూలిపోయింది. ఒకొక్కసారి అలా జరుగుతుంటుంది : కేంద్రపురావస్తుశాఖ సీఎ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ డాకారెడ్డి మంగళవారం సౌమ్యనాథాలయంలో మకాం వేశారు. కూలిన ప్రహరీ విషయంపై దగ్గరుండి పర్యవేక్షించారు. కూలిన సంఘటనపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గోడ నిర్మితం సక్రమంగానే చేపట్టామన్నారు. ఒకొక్కసారి అలా జరుగుతుంటుందని తెలిపారు. ఇది సర్వసాధారణమే అని కొట్టిపారేసారు. ఈయనతోపాటు కడప కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో షబ్–యే–బరాత్
● రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలుబయాన్ చేస్తున్న మహమ్మద్ అలీ బగ్దాదికడప సెవెన్రోడ్స్: ముస్లింలు మంగళవారం షబ్–యే–బరాత్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతోపాటు కడప నగరంలోని దాదాపు అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళలు, పిల్లలు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ ప్రార్థనలు, జికర్ నిర్వహించారు. మసీదులు భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు తెల్లవారుజాము ఫజర్ నమాజ్ వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మత గురువులు, ఆధ్యాత్మికవేత్తలు సందేశాలు ఇచ్చారు. ముఖ్యంగా షబ్బే బరాత్ పర్వదినం విశిష్టత, రంజాన్ మాసాన్ని పుణ్యసాధనకు వినియోగించుకోవాల్సిన విషయాన్ని తెలియజేశారు. రంజాన్ మాసం పొందడం తమ అదృష్టంగా భావించాలన్నారు. ఈ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో గడుపాలన్నారు. ఈ మాసంలోని ప్రతి క్షణాన్ని పుణ్యసాధనకు కృషి చేయాలన్నారు. అల్లాహ్తోపాటు మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) జీవన విధానాన్ని కొనసాగించాలని భక్తులకు సూచించారు. అనంతరం ప్రత్యేక నమాజులు, జికర్, తహజూద్ నమాజ్లు పాటిస్తూ తమతోపాటు తమ కుటుంబ సభ్యులు పాపాలను క్షమించాలని, స్వర్గలోక ప్రాప్తి కల్పించాలని అల్లాహ్ను కన్నీటితో వేడుకున్నారు. ఇదిలా ఉండగా మసీదులకు అదిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా మసీదు కమిటీ ప్రతినిధులు విశేష ఏర్పాట్లు చేశారు. మసీదులకు ఏర్పాటు చేసిన విద్యుద్దీప అలంకరణ పర్వదిన శోభను మరింత రెట్టింపు చేసింది. -
తల్లిదండ్రులను గెంటేసిన కొడుకు
● ఇంటి బయట దీనంగా కూర్చున్న వృద్ధదంపతులు ● సీఐ జోక్యంతో సమసిన వివాదంరాయచోటి టౌన్ : తల్లిదండ్రుల వృద్ధాప్యం వారిని కొడుకు చాటు బిడ్డల్లాగా చేసింది..వృద్ధాప్యంలో కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కొడుకు, కోడలు వారిపట్ల విసుగు చెందడం మొదలెట్టారు.. ఫలితంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని.. తండ్రిని ఇంటి నుంచి బయటకు పంపేశారు.. కొడుకును వదల లేక.. ఉన్న ఇంటి నుంచి దూరం కాలేక వీధిలోనే ఇంటి బయట దీనంగా కూర్చున్నారు.. గ్రామస్తులు సద్దు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.వివరాలు.. రాయచోటి రూరల్ మండలం సిబ్యాల గ్రామానికి చెందిన సుబ్బరాయుడు తన తండ్రి సుబ్బరాయుడు, తల్లి నాగమ్మలను సోమవారం ఇంటి నుంచి వెలగొట్టాడు. పేగు తెంచుకున్న బిడ్డ అమ్మ నాన్నలను బయటకు నెట్టి వేసిన సంఘటన గ్రామస్తులను కలిసి వేసింది. విషయాన్ని సోషల్ మీడియా ద్వారా గ్రామస్తులు బయటకు తెచ్చారు. తల్లిదండ్రులను కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారన్న సమాచారం మీడియా, సోషల్ మీడియా ద్వారా రాయచోటి అర్బన్ పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన అర్బన్ సీఐ బివి చలపతి సిబ్బందిని గ్రామానికి పంపి అమ్మ నాన్నలను, కొడుకు, కోడలను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించడంతో పాటు వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత బిడ్డలదేనని చెప్పారు. వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని సీఐ హెచ్చరించారు. పోలీసులు ఆదేశాల మేరకు తప్పును తెలుసుకున్న వెంకటరమణ అమ్మా నాన్నలను బాగా చూసుకుంటానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి వెళ్లారు. పోలీస్ చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు. -
● తనూజ...నెరవేరిన ఆకాంక్ష
మదనపల్లె సిటీ : కృషి, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యం సాధించింది ఎం.ఎస్.తనూజ. రూ.లక్షల్లో జీతమిచ్చే కొ లువు ఉన్నా ప్రభుత్వ ఉ ద్యోగం చేయాలనే ఆశయంతో శ్రమించింది. తొలిసారే గ్రూప్–1 రాసి మున్సిపల్ కమిషనర్–గ్రేడ్ 2 ఉద్యోగానికి ఎంపికై ంది. మదనపల్లెలోని సొసైటీకాలనీకి చెందిన ఏసీటీఓ శివప్రసాద్, శశికళ కుమార్తె తనూజ ప్రాథమిక విద్య స్థానిక విజయభారతి ఉన్నత పాఠశాల, ఉన్నత విద్య చైతన్య టెక్నో, పాలిటెక్నిక్ పద్మావతి వర్సిటీలో చదివారు. బీటెక్ ఈసీఈ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేసిన ఆమె కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. -
కష్టించి.. విజేతలుగా నిలిచి..
వారంతా వివిధ నేపథ్యాలు కలిగిన వారు. కష్టపడి చదివారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభతో మెరిశారు. అనుకున్నలక్ష్యం మేరకు విజేతలుగా నిలిచారు. జమ్మలమడుగు : ఐపీఎస్ సాధించాలన్నదే తన లక్ష్యమని గ్రూప్ 1 విజేత అల్లూరు మహమ్మద్ ఖదీర్ అన్నారు. 2018 నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఖదీర్ ఇప్పటివరకు మూడు సార్లు యూపీఎస్సీ రాయగా.. అందులో రెండు సార్లు మెయిన్స్ అర్హత సాధించాడు. మరో మూడు అవకాశాలు ఉన్నాయని..ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తానని పేర్కొన్నాడు. కాగా ఇదివరకు రెండు సార్లు గ్రూప్ 1లో విజేతగా నిలిచిన ఖదీర్ తాజా గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై శభాష్ అనిపించారు. ఈ నేపథ్యంలో ఆయనతో చేసిన చిరు ఇంటర్వ్యూ. ? ఓ వైపు ఉద్యోగం..మరోవైపు ప్రిపరేషన్.. ఎలా సమన్వయం చేస్తున్నారు ఉద్యోగ వేళలు ముగిశాక రోజుకు ఐదునుంచి ఆరు గంటల వరకు చదువుతాను. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్–1పోస్టులు సాధించా. తొలిసారి 2022లో గ్రూప్ –1లో ఎంపీడీఓగా పోస్టు సాధించి అన్నమయ్య జిల్లాలో కె.వి.పల్లిలో చేశా.అనంతరం 2024లో అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్గా పోస్టు సాధించి అమరావతిలో పనిచేస్తున్నా. తాజా ఫలితాల్లో డీఎస్పీగా సెలెక్టు అయ్యాను. ? డీఎస్పీ పోస్టుతోనే ఆగిపోతారా సివిల్స్ రాయాలనే ఆలోచన ఉందా.. సివిల్స్కు ఎంపికై ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. ఇప్పటికే మూడు సార్లు యుపిఎస్సీ పరీక్షలు రాశాను. రెండు సార్లు మెయిన్స్కు అర్హత సాధించాను. మరో సారి ప్రయత్నం చేస్తాను. ? కోచింగ్ ఎక్కడైనా తీసుకుంటున్నారా.. 2019–2022 వరకు ఢిల్లీలోని వాజిరామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని జామియామిలియా ఇస్తామియా యూనివర్శిటిలో ప్రిపరేషన్ చేశాను.అక్కడ తీసుకున్న కోచింగ్తోనే మూడు సార్లు గ్రూప్–1 పోస్టులు సాధించాను. ? ఈ ప్రయాణంలో మీకు స్ఫూర్తి ఎవరు డీఎస్పీ పోస్టు సాధించటానికి స్పూర్తి మా కుటుంబ సభ్యులు. మా నాన్న నజీర్ అహమ్మద్ న్యాయవాది, మా చిన్నాన్న పోలీసుకావడంతోనే సమాజానికి ఉపయోగపడాలి అనే భావనతో డీఎస్పీ కావటానికి ప్రయత్నం చేశాను. ? మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది ప్రాథమిక విద్య స్థానికంగా జరిగినా ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిగా హైదరాబాద్లో జరిగింది. అక్కడ ఆర్ట్స్ గ్రూపు తీసుకుని అప్పటినుంచే గ్రూప్స్, యూపీపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. మొత్తం 8 ఏళ్లు కష్టపడి డీఎస్పీ పోస్టు సాధించాను. ? ప్రస్తుతం ప్రిపరేషన్ అవుతున్న వారికి మీరిచ్చే సలహా.. ఎన్ని గంటలు చదివిన ఎంచుకున్న సబ్జెక్టులపై పూర్తిగా పట్టుసాధించాలి. పాత సివిల్స్ పేపర్ ఆన్లైన్లో చూసి ప్రిపరేషన్తోపాటు, ప్రముఖుల రాసిన పుస్తకాలను, తెలుగు, ఇంగ్లీషు పత్రికలు బాగా చదవాలి. ముందు మన కష్టం ఉండాలి. ఫలితం దైవం నిర్ణయిస్తుంది. ఐపీస్ సాధించడమే లక్ష్యం: ఖదీర్ -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని స్థానిక న్యాక్ బిల్డింగ్లో డీడీయూ–జీకేవై, సీడాప్ సహకారంతో ఇస్తున్న ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.రాకేష్ తెలిపారు. ఈ శిక్షణలో సోలార్ పీవీ ఇన్స్టాలర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్ చదివిన అభ్యర్థులకు న్యాక్ సంస్థలో ఎంపిక పక్రియ ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోపు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9985142155, 9010016887, 9989140993 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. సింహ వాహనంపై శ్రీరంగనాథుడు పులివెందుల టౌన్ : పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద ఉన్న శ్రీరంగనాథ కాంప్లెక్స్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం శ్రీరంగనాథుడు సతీసమేతుడై రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు వస్తుంటే భక్తులు పూజాద్రవ్యాలు కాయ కర్పూరాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ ప్రాంగణంలో భజన బృందం భక్తి గీతాలను ఆలపించారు. నేడు ప్రమాణ స్వీకారం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా పాలక మండలి సభ్యులు పట్టణంలో భారీ ఊరేగింపుగా వచ్చి ఆలయానికి వస్తారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొంటారని వివరించారు. రేపు ఎన్నికలు చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని గుడిపాల, బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్ష పదవులకు బుధవారం ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ రోజు మండలాల్లో ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. గుడిపాల, బి. కొత్తకోట ఎంపీపీలు ప్రసాద్రెడ్డి, లక్ష్మి నరసింహాలు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే. పదవుల భర్తీకి ఎన్నిక నిర్వహించేందుకు జెడ్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. చెస్లో రేటింగ్ సాధించిన జిల్లా క్రీడాకారులు కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాకు క్రీడాకారులు చెస్లో సత్తా చాటినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ధనిత సింధురాజు (ప్రొద్దుటూరు),రీహాన్ (కడప) ఇంటర్నేషనల్ ఫిడే చెస్ రేటింగ్స్ సాధించి జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత సింధురాజు ఇటీవల 1499 ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ చెస్ రేటింగ్ సాధించిందన్నారు. గత నెలలో బెంగళూరులో నిర్వహించిన ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఇద్దరు రేటెడ్ క్రీడాకారులపై విజయాలు సాధించడం ద్వారా ఈ ఘన తను అందుకుందని తెలిపారు. అదేవిధంగా కడ పకు చెందిన రీహాన్ 1451 ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ రేటెడ్ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడన్నా రు. గత నెలలో చైన్నె నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహించిన క్లాసికల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో రీహాన్ రేటెడ్ క్రీడాకారులపై 4 రేటెడ్ పాయింట్లు సాధించి ఈ విజయాన్ని అందుకున్నారన్నారు. ఒకే సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే రేటింగ్స్ సాధించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ధనిత సింధురాజు రీహాన్ -
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
వాల్మీకిపురం : అక్రమంగా కత్తులతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాఘవ రెడ్డి తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మద్యానికి బానిసై, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వాల్మీకిపురానికి చెందిన మంకమూతక రమేష్ (24), కరమల లోకేష్ (20)లు బెంగళూరులో సెల్ పోన్లు దొంగతనం చేయడంతో పాటు వాల్మీకిపురం పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న వన్ప్లస్ మొబైల్, రూ.130 నగదు దోచుకున్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి, వీరి వద్ద ఉన్న కత్తి, వన్ ప్లస్ మొబైల్ ఒకటి, ఆపిల్ ఫోన్ ఒకటి, ఏపీ40ఎఎక్స్9538 గల ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచి, సబ్జైలుకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు తిప్పేస్వామి, రవీంద్రబాబు, ఎఎస్సై గోపాల్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కడప అగ్రికల్చర్ : రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కడపలోని సింధూర్ ఫంక్షన్ హాల్లో ఐసీఆర్పీలకు సంబంధించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమ వారం ముగిసింది. ఇందులో ప్రకృతి వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను ప్రత్యక్షంగా చూపించారు. అలాగే జీవ ఉత్ప్రేరకాలను ప్రాక్టికల్గా తయారు చేయడం, వాటిని సాగులో వినియోగించే విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గ్రామస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. -
దూసుకెళ్లిన ‘రాకేష్’
కమలాపురం : వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్టణం అప్పాయపల్లెకు చెందిన న్యాయవాది నాగభూషణ్రెడ్డి కుమారుడు రాకేష్రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో విజేతగా నిలిచి డీఎస్పీగా ఎంపికయ్యారు. రాకేష్రెడ్డి బాల్యం స్వగ్రామం పులివెందుల నియోజకవర్గం గొల్లల గూడూరులో సాగింది. వృత్తి రీత్యా నాగభూషణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు కమలాపురంలో స్థిరపడ్డారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో చదివిన రాకేష్రెడ్డి ఇంటర్ పులివెందుల నారాయణ కాలేజ్లో, అనంతపురం జేఎన్టీయూలో ట్రిపుల్ ఈ పూర్తి చేశారు. స్కాలర్షిప్పై సింగపూర్ వెళ్లారు. అలాగే ఫారిన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఏడాదిపాటు రీసెర్చ్ చేశారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండియాకు తిరిగి వచ్చేశారు. యూపీఎస్సీకి రెండుసార్లు, ఏపీపీఎస్సీకి రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపికై నా ప్రాధాన్యత కలిగిన పోస్టు రాలేదు. దీంతో తిరిగి తన ప్రయత్నం ప్రారంభించారు. 2023లో జరిగిన యూపీఎస్సీ ద్వారా ఎంపికై ప్రతిభాసేతు స్కీంలో అసిస్టెంట్ డైరెక్టర్గా శిక్షణ పొందుతున్నారు. ఈ తరుణంలో విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ శుభ సందర్భాన్ని తల్లిదండ్రులు నాగభూషణ్రెడ్డి, భాగ్యలక్ష్మితో కలసి పంచుకున్నారు. -
బాహుదాకు కృష్ణా జలాలు మళ్లించండి
మదనపల్లె : నిమ్మనపల్లె మండలంలోని బాహుదా ప్రాజెక్టుకు శాశ్వతంగా కృష్ణా జలాలను తరలించి నింపేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. నీటిని మళ్లించాల్సిన ఆవశ్యకత, వేసవి వస్తున్న కారణంగా అవసరాన్ని కలెక్టర్కు వివరించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం, మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, వైస్చైర్మన్ జింకా వెంకటా చలపతి మీడియాతో మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను బాహుదా, మదనపల్లె నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు, చిప్పిలి, గుంటివారిపల్లి సమ్మర్స్టోరేజి ట్యాంకులకు కృష్ణా జలాలను తరలించాలని కలెక్టర్ను కోరామన్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య చేపట్టాలన్నారు. తద్వారా మదనపల్లె పట్టణానికి తాగునీటి సమస్య తీరడంతోపాటు భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. కృష్ణా జలాలన్నీ కుప్పానికి తరలించుకుంటున్నారని, మదనపల్లె విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిప్పిలి సమ్మర్స్టోరేజి ట్యాంకుకు నీళ్లిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కృష్ణా జలాలతో మదనపల్లె చెరువులు, బాహాదా ప్రాజెక్టు, కాలువలకు మళ్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, నాయకులు గుండ్లూరి రఫీ, బాలగంగాధర్రెడ్డి, ఇర్ఫాన్ షేక్, మల్లిక, వినుతాబాయి, శారదరెడ్డి పాల్గొన్నారు. -
చిట్టీ డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి
మదనపల్లె రూరల్ : నమ్మకస్తుడని నమ్మి చిట్టీలు వేశాం. చిట్టీలు వేయించుకున్న అతను ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో తాము చెల్లించిన డబ్బులు ఇవ్వకుండా అతడి కుటుంబసభ్యులు తమను ఇబ్బందులు పెడుతున్నారని, దయచేసి తమ కష్టార్జితాన్ని ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా బాధితులు ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని వేడుకున్నారు. బాధితులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని ప్రశాంత్నగర్కు చెందిన గాలి వెంకటరమణ 20 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తూ నమ్మకంగా ఉండేవాడు. దీంతో స్థానికంగా ఉంటున్న రాజానగర్, ప్రశాంత్ నగర్కు చెందిన భాస్కర్, సుజాత, సోమశేఖర్, రామాంజనేయులు, శ్రీనివాసులు, మల్లికార్జున, షాహిద్, సయ్యద్, రమణ, నాగేశ్వర్, రమేష్, ఆదినారాయణ, దాదాపీర్, రామలక్ష్మి తదితరులు సుమారు 76 మంది అతని వద్ద చీటీలు వేశారు. సుమారు రూ.కోటి 30లక్షలు చిట్టీల రూపంలో అతడికి చెల్లించారు. కాగా గత ఏడాది నవంబర్లో గాలి వెంకటరమణ చనిపోయాడు. దీంతో అతడి వద్ద చిట్టీలు వేసిన బాధితులు అతని భార్య రమణమ్మ, కుమార్తె గీత, అల్లుడు జగదీశ్వర్లను అడిగారు. తమకు సంబంధం లేదని, మేము ఒక్క పైసా ఇవ్వమని వారు తెగేసి చెప్పారని వాపోయారు. గాలి వెంకటరమణ దగ్గర చిట్టీలు వేసిన తాము మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమని, కష్టార్జితం పొదుపు చేసుకునే క్రమంలో అతడిని నమ్మి చెల్లించామన్నారు. తమ వద్ద చెల్లింపుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. చిట్టీల నిర్వాహకుడు గాలి వెంకటరమణ మృతిపై తమకు అనుమానం ఉందన్నారు. అతని భార్య, కుమార్తె అల్లుడిని విచారించి బాధితులైన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితుల మొర -
●తల్లి ప్రోత్సాహం...
రాయచోటి అర్బన్ : రెండు సార్లు యూపీఎస్సీలో, ఒకసారి గ్రూప్–1కు పోటీ పడ్డా కొలువు దక్కలేదు. ఈసారి మరింత ఉత్సాహంతో పరీక్షకు సన్నద్ధమయ్యాడు. దీనికి తల్లి ప్రోత్సాహం తోడైంది. ఇంకేముంది గ్రూప్ –1 విజేతగా నిలిచాడు. రాయచోటి పట్టణం కె.రామాపురానికి చెందిన మద్దిరేవుల అంజన్ రెడ్డి (లేట్), రెడ్డిరాణిల కుమారుడు మద్దిరేవుల మనీష్ రెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. మనీష్ రెడ్డి 10వ తరగతి వరకు రాయచోటిలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో, గ్రాడ్యుయేషన్ తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలో చదువుకున్నాడు. తండ్రి మరణాంతరం తల్లి రెడ్డిరాణి(జూనియర్ అసిస్టెంట్) ప్రోత్సాహంతోనే ఇంతటి విజయం సాధించినట్లు మనీష్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ అయ్యి ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని సాక్షితో పేర్కొన్నారు. -
శభాష్..సురేష్
పెద్దతిప్పసముద్రం : పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు కష్టాలకు ఎదురొడ్డి..కన్నీళ్లను దిగమింగి పట్టుదలతో చదివాడు.. పేదరికాన్నే కాదు మృత్యువును సైతం జయించి విజేతగా నిలిచాడు. ఒకటి ..రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. తాజాగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటి కలెక్టర్గా ఎంపికై న సురేష్ విజయగాథ ఇదీ. అన్నమయ్య జిల్లా రాపూరివాండ్లపల్లి పంచాయతీలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యాదసంద్రం సిద్దప్ప, సిద్దమ్మల కుమారుడు సురేష్. బీటెక్ పూర్తి చేసిన అనంతరం తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద ఉన్న మల్లాడి డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ ఫ్యాక్టరీలో కెమికల్ ఇంజనీర్గా పని చేసేవాడు. 2017లో ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో జరిగిన మిషన్ బ్లాస్ట్లో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మృత్యువుతో పోరాడి నిలిచి గెలిచాడు. 2019 వైఎస్సార్సీపీ హయాంలో పంచాయతీ కార్యదర్శిగా కొలువుదీరిన సురేష్ .. గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటి తహశీల్దార్గా ఎంపికయ్యారు. తాజాగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటి కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సురేష్ స్పష్టం చేశాడు. -
మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత
కడప సెవెన్రోడ్స్ : ప్రపంచ మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత అని నెల్లూరు పీఠం నూతన ఆధ్యాత్మిక సహ సారధి పిల్లి ఆంథోనిదాస్ తెలిపారు. కడప నగరంలోని మరియాపురంలో వెలసిన లూర్ధుమాత మహోత్సవాలు ఈ నెల 10,11 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పాత చర్చి ఆవరణలో ఆయన పతాకావిష్కరణ చేశారు. తొలుత బిషప్ను మరియాపురం పుర వీధుల గుండా ఊరేగింపు చేశారు. అనంతరం దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మానవుని ప్రతి పాపమునుంచి రక్షించ గల శక్తి ఏసుక్రీస్తుకు ఉందన్నారు. అలాంటి దేవునికి మానవులకు మధ్య వారధిగా లూర్దుమాత ఉందని చెప్పారు. నవదిన జపమాల కార్యక్రమాల్లో విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఈరి మరియన్న , సహాయ గురువు జంపంగి సుధాకర్, వివిధ విచారణకు చెందిన ఫాదర్స్ సిప్రియన్,బి జ్వాన్నేష్, టి.ఫ్రాన్సిస్సేజేవియర్,లూర్ధురాజు,తిరుణాల కమిటీ చైర్మన్ గుంత మళ్ళ బాలయ్య ,ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్, ఎండీ అల్ఫోన్స్, నంది మండలం విజయరాజు, విశ్వాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రహమత్నగర్కు చెందిన నౌషాద్ భార్య మల్లిక (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీరొంపిచెర్ల : రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం చోరీకి గురైందని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ బజారువీధికి చెందిన జి.శ్రీనివాసులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలోని ప్రైవేట్ యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతను రోజూ రొంపిచెర్ల క్రాస్ వరకు ద్విచక్ర వాహనంలో వెళ్లి అక్కడ నుంచి బస్సుకు వెళ్లి వస్తున్నారు. అయితే జనవరి 31వ తేదీ రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో గర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని తెలిపారు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదన్నారు. దీంతో ద్విచక్ర వాహనం చోరీ చేసిన నింధితులను పట్టుకుని తన వాహనాన్ని తనకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లారింది.. తాగండ్రోయ్!మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీబస్టాండ్ సమీపంలోని ఓ బార్లో ఉదయం 7 గంటల నుంచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం కిటీకీ తెరిచి దర్జాగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. మద్యం ప్రియులు బార్ బయటే కూర్చుని మద్యం తాగి వెళుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు తతంగం మొత్తం వీడియోలు, జీపీఎస్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వాస్తవానికి బార్ ఉదయం 10 గంటలకు తెరవాల్సి ఉంటుంది. బార్కు కేటాయించిన మద్యంను లూజుగా విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఎకై ్సజ్ సీఐ భీమలింగను వివరణ కోరితే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. చోరీ, వేధింపుల కేసుల్లో నిందితుడు అరెస్టువాల్మీకిపురం : అక్రమంగా గంజాయిని విక్రయించడం, తరలించడం వంటివి చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాఘవ రెడ్డి వివరాలను వెల్లడించారు. గుర్రంకొండ పట్టణం బజారు వీధికి చెందిన పఠాన్ షౌకత్ కుమారుడు కలకడ ఆదిల్ (22)పై గంజాయి అక్రమ రవాణాలో ఐదు కేసులు, ఆటో, ద్విచక్రవాహనం చోరీకి సంభందించి రెండు కేసులు, అల్లర్లులో ఒక కేసు, మహిళను వేధించినందుకు ఒక కేసు మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. ఈ మేరకు అతనిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపర చినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ ఎస్సై రవీంద్ర బాబు, వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి పాల్గొన్నారు. సంపూర్ణతే లక్ష్యం.. గోల్డ్మెడల్ గమ్యంకురబలకోట: నీతి అయోగ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంపూర్ణత అభియాన్ 2.0లో ఏప్రిల్ 14 లోపు నిర్దేశిత లక్ష్యాలు సాధించి కురబలకోట మండలం గోల్డ్మెడల్ సాధించాలని అన్నమయ్య జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి టి. వెంకటపెద్దయ్య సూచించారు. సంపూర్ణత అభియాన్పై ఎంపీపీ ఎంజి భూదేవి అధ్యక్షతన సోమవారం స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో వివిధ శాఖల వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఊరు ప్రతి కుటుంబం ప్రతి పౌరుడికి వంద శాతం ప్రభుత్వ సేవలు చేరాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు.వ్యవసాయం, పశువైద్యం,విద్య, మహిళా శిశు సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యశాఖలు నిర్దేశిత లక్ష్యాలు సాధించి గోల్డ్మెడల్ సాధించాలన్నారు. ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. జెడ్పీటీసీ బైసాని జ్యోతి, ఎంపీడీఓ గంగయ్య, సీడీపీఓ సుజాత, సూపర్వైజర్లు నాగలక్ష్మి,చంద్రకాంత తదితరులు పాల్గొన్నారు. -
ఆలకించండి... ఆదుకోండి
ప్రజాసమస్యలపై కలెక్టరేట్కు పోటెత్తిన ప్రజలుమదనపల్లె రూరల్ : ‘సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం. అధికారులు అర్జీలు తీసుకుంటున్నారు. గడువులోపు పరిష్కరిస్తాం వెళ్లండి అంటూ పంపేస్తున్నారు. అయినా మా సమస్యలు తీరడం లేదు. కనీసం మీరైనా మా బాధలు అర్థం చేసుకుని పరిష్కరించండయ్యా’ అంటూ కలెక్టరేట్కు వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్ఓ మధుసూదనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో చాలా మంది పెన్షన్ కోసం అర్జీలు అందజేశారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులను అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో కొన్ని.... మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వభూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్కుమార్ ఫిర్యాదు చేశారు. గతంలో రద్దైన పట్టాతో ప్రస్తుతం ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా కబ్జాదారులతో కుమ్మక్కై మౌనంగా ఉంటున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో కారు పార్క్ చేసి వెళితే, ఆ స్థలానికి ఎటువంటి సంబంధం లేని జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్, ఉమేష్ తనపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటకు చెందిన ఎం.ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వస్థలాన్ని జనసేన నాయకుల ఆక్రమణ నుంచి స్వాధీనం చేసుకోవాలని, స్థానికులకు వీరి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. నవోదయం–2 కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారీ, విక్రయాలు మానేస్తే జీవనోపాధి కల్పిస్తామన్న ఎకై ్సజ్ అధికారుల మాటలు నమ్మి పూర్తిగా వదిలేశామని, ఏళ్లు గడుస్తున్నా అధికారు లు ఇప్పటివరకు తమకు న్యాయం చేసిన దాఖలా లేదని మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ తుమ్మలతాండాకు చెందిన ప్రజలు అర్జీ సమర్పించారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, ఆవులు, ఆటోలు సబ్సిడీ ద్వారా ఇప్పిస్తే బాగుపడుతామని విన్నవించారు. కష్టపడి సంపాదించుకున్న నగదు, బంగారాన్ని పరిచయస్తులైన వ్యక్తులను నమ్మి అప్పుగా ఇస్తే..తిరిగి ఇవ్వకపోగా పైపెచ్చు తనపైనే దాడిచేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని మదనపల్లె పట్టణం చీకలగుట్టకు చెందిన హిజ్రా స్వాతి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదుచేసినా తనకు న్యాయం జరగలేదని, తనకు రక్షణ కల్పించాల్సిందిగా వేడుకుంది. మదనపల్లె పట్టణం అప్పారావుతోట, సైదాపేట, కౌసర్ మసీదు తదితర ప్రాంతాల్లో నివసించే వ్యక్తులను ఇబ్బంది పెడుతూ, రాకపోకలకు వినియోగిస్తున్న దారిలో గుంతలు తవ్వి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మున్సిపల్ వైస్చైర్మన్ నూర్ఆజం, కౌన్సిలర్ బి.ఏ.ఖాజా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. -
ఎస్పీడీసీఎల్లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమానికి ఆ సంస్థ సీఎండీ శివశంకర్ శ్రీకారం చుట్టారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పరిశ్రమలకు విద్యుత్ పరంగా తలెత్తే సమస్యల్ని పరిష్కరించేందుకు వీలుగా ‘‘పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక‘ను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఆయా జిల్లాల్లోని సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాల్లో, ప్రతి మూడో బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. నిర్ధేశించిన ఆ రోజుల్లో పారిశ్రామిక వినియోగ దారులు సంబంధిత జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ను కలిసి తమ విద్యుత్ సమస్యలను తెలియజేయాలని సూచించారు. -
డైవర్షన్ పాలిటిక్స్తోనే అరాచకాలు
తంబళ్లపల్లె : తిరుమల లడ్డూలో కల్తీ లేదని సిట్ నిర్థారించడంతో కూటమి ప్రభుత్వానికి గొంతులో వెలగకాయపడినట్లుయిందని, కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్తో అరాచకాలకు దిగజారిందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆరోపించారు. సోమవారం స్వగృహంలో నాయకులతో చర్చించారు. సమస్యలు అడిగ తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్తోనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేయించడం, అంబటి రాంబాబును అక్రమ అరెస్టు చేయడం దారుణమని ఖండించారు. సమావేశంలో పరిశీలకులు ఉమాపతిరెడ్డి, నాగిరెడ్డి ,శివారెడ్డి, పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్, కన్నెమడుగు సురేంద్రనాథ్, ఎంపిటీసీ మహేష్, శివారెడ్డి, రామమూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వరికోత వాహనం,బైక్ ఢీ : ఇద్దరు దుర్మరణం
జమ్మలమడుగు రూరల్ : ముద్దనూరు రహదారిలో వరికోత వాహనం, బైక్ను ఢీ కొన్న సంఘటనలో మాబుహుసేన్ (36) ఖాదర్ బాషా (29) అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. పట్టణ సీఐ నరేష్ బాబు కథనం మేరకు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలపరిధిలోని పెద్దండ్లూరు గ్రామానికి చెందిన మాబుహుసేన్ ప్రొద్దుటూర్ నియోజకవర్గంలోని చౌడూరు గ్రామానికి చెందిన ఖాదర్ బాషాలు బంధువులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వరికోత వాహనానికి డ్రైవర్లుగా వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి పల్సర్ బైక్లో స్వగ్రామాలకు వస్తుండగా జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల (పాటి) గ్రామం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న వరికోసం వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మాబుహుసేన్కు భార్య షాహీనా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఇవన్నీ ప్రభుత్వ దాడులే
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి, ఆయనపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమని, ఇది ప్రభుత్వ దాడేనని కడప మేయర్ పాకా సురేష్ కుమార్ ఆరోపించారు. అంబటి రాంబాబుపై దాడిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో నల్ల రిబ్బన్లు, చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘నో రెడ్ బుక్’ అంటూ రెడ్ బుక్లను దహనం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రాక్షస రాజకీయం నశించాలి, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, సీబీఎన్ డౌన్ డౌన్, అంబటి రాంబాబును విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపైనే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు చేస్తూ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, రోజా, ఇళ్లపై దాడులు చేశారని, తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసి ఇంట్లోని ఫర్నీచర్, కార్లు, సామగ్రిని ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి పోవాలి అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ ధర్నా..రెడ్బుక్లు కాల్చివేత -
గాండ్ల కులస్తులు ఐక్యతతో ముందుకు సాగాలి
మదనపల్లె : సమస్యలు, సంక్షేమం విషయంలో గాండ్ల కులస్తులు ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల గాండ్ల తెలగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్రోస్ సుబ్బారావు పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె మండలం పోతబోలు పంచాయతీ దేవలంబండ వద్ద జిల్లా అధ్యక్షులు బండపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో మాఘమాస వన భోజనాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గాండ్ల కులస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సంక్షేమం, సంఘ అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. వీటిని ఐక్యంగా సాధించుకుంటూ ముందుకు సాగితే మరింత వృద్ధి సాధిస్తామన్నారు. నరేంద్రమోడీ లాంటి నాయకులు తమ కులస్తులు కావడాన్ని గర్వించాలన్నారు. మండలస్థాయి నుంచి సంఘం పురోభివృద్దికి ప్రతిఒక్కరూ సహకరించి పని చేయాలన్నారు. ఈ సభకు ముందుకు స్థానిక చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గోమాతకు, కులానికి ఆధారమైన గానుగకు పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్బాబు రాజా, సత్యనారాయణ, కొండయ్య, కేవీ.ప్రసాద్, సిటిఎం క్రాస్రోడ్డు సర్పంచు బండపల్లి ఈశ్వరమ్మ, పోతబోలు సర్పంచు ఈశ్వరయ్య, శెట్టివారి చంద్ర, కృష్ణప్ప, నారా నరసింహులు, గోపిత, పాలెం నవీన్ పాల్గొన్నారు. ఏకగ్రీవ ఎన్నిక మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గ గాండ్ల తెలగ సంఘ నూతన అధ్యక్షుడిగా కేవి.ప్రసాద్ బుజ్జిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని దేవలంబండ వద్ద జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నూతన కమిటి ఎన్నికై ంది. కార్యదర్శిగా సీహెచ్.కృష్ణప్ప, కోశాధికారిగా టి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పి.వెంకటరమణ, సంయుక్త కార్యదర్శిగా బి.కేశవ, జి.వెంకటరమణ, కార్యానిర్వహక కార్యదర్శిగా టి.కేశవ, కార్యవర్గ సభ్యులుగా వండాడి బాబు చెన్నకేశవులు, ఎన్.శ్రీనివాసులు, టి.నవీన్, పి.కృష్ణప్ప, కే.నాగరాజు, సి.కృష్ణప్ప, జి.బాబు ప్రసాద్, నరసింహులును ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు గ్రోస్ సుబ్బారావు -
మేలు లేదు
కేంద్ర బడ్జెట్లో సామాన్యులకు ఊరట కలగలేదు. ఈనెల 12న సార్వత్రిక సమ్మె ప్రకటించగా కార్మిక సమ స్యలపై కనీస ప్రస్తాపన లేకపోవడం విచారకరం. రూ.26 వేల వేతనం డిమాండ్ చేస్తుంటే పట్టించుకోలేదు. ధరల పెరుగుదల, ఉపాధి హామీ పథకం అమలుపై స్పష్టత ఇవ్వలేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంటే దానికి తగ్గట్టు బడ్జెట్లో ఎలాంటి ఊరటనిచ్చే ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించింది. – సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటియూసీ సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర బడ్జెట్లో సీమకు మొండిచేయే మిగిలింది. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా ఉక్కు పరిశ్రమ నిర్మాణ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా నిర్మలమ్మ బడ్జెట్పై ప్రతిపక్షాలు పెదవివిరిచాయి. ప్రభుత్వ వేతనజీవులు...చిన్న, సన్నకారు రైతులపై మమ అన్పించడం మినహా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రత్యేక చొరవ చూపెట్టలేదని విమర్శలు గుప్పించాయి. మధ్యతరగతి ప్రజానీకానికి కాస్త ఊరట కల్పించినా, పరోక్షంగా నడ్డివిరిచే చర్యలే అధికంగా ఉన్నాయని బడ్జెట్పై రాజకీయ పక్షాలు నినదిస్తున్నాయి. ● కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకత లభించలేదు. విభజన చట్టంలోని అంశాలకు గుర్తింపు దక్కలేదు. కడప ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని చట్టం చేసినా నరేంద్రమోదీ సర్కార్ విస్మరిస్తోంది. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిణామం జిల్లా వాసులకు రుచించడం లేదు. వెనుకబడిన ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడుతాయన్న ధ్యాస కేంద్ర ప్రభుత్వానికి లేకపోయింది. 350 రకాల సంస్కరణలు చేశామని చెప్పినా, పేదలు, కార్మికులకు ప్రయోజనం లేదని నిపుణులు వివరిస్తున్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్ విద్య రంగాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నిధులు, ఖాళీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, స్కాలర్షిప్లకు అధిక కేటాయింపులు విస్మరించింది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప–బెంగళూరు రైల్వే లైన్కు ప్రాధాన్యత దక్కలేదని పలువురు వివరిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు మోదీ సర్కార్ కంకణం కట్టుకుందని, అందుకు నిర్మలమ్మ బడ్జెట్ కేటాయింపుల స్పష్టం చేశాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గత బడ్జెట్లో 88వేల కోట్లు ఉపాధి హామీ పథకం కోసం కేటాయించగా, 2026–27లో కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే కేటాయించడాన్ని ఉదహరిస్తున్నారు. ఉద్యోగులను సంతృప్తి పరచని కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకుసంతృప్తి పరిచే విధంగా లేదు. ఉద్యోగులకు పన్నుల రహిత ఆదాయం రూ.20లక్షలు ఉంటుందని ఆశించారు. కార్పోరేట్లకు ఇచ్చిన విధంగా అనేక రకాల పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, ఉద్యోగ వర్గాలకు కూడా ఉంటాయని అనుకున్నారు. బడ్జెట్లో ఇవి లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. –కొండూరు శ్రీనివాస రాజు, రాష్ట్ర అధ్యక్షుడు, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ పేదలు, కార్మికులకు ప్రయోజనం నిల్ ఉపాధి హామీ పథక నిధుల్లో కోత విద్యకు న్యాయం చేయని నిర్మలమ్మ కొప్పర్తి పారిశ్రామికవాడ మాత్రమే పరిగణలోకి ఉక్కు పరిశ్రమ ఊసే లేదు -
వైభవంగా మసెమ్మ జాతర
పుంగనూరు : పుంగనూరు మండలం కురప్పల్లెలో మసెమ్మ జాతర వైభవంగా జరిగింది. శనివారం రాత్రి అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు చేసి, భక్తుల దర్శనార్థం ఆలయం వద్ద నిలిపారు. వేలాది మంది భక్తులు మసెమ్మను దర్శించుకున్నారు. సుమారు 50 గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు జాతరకు హజరయ్యారు. ఆదివారం రాత్రి అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, సోమవారం వేకువజామున నిమజ్జనం చేశారు.రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో భక్తులు జాతరను జరుపుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజలు మసెమ్మ జాతరతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జాతర్లు ప్రారంభంకావడం ప్రతిఏటా అనాదిగా వస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మసెమ్మ జాతరకు పెద్దిరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని పలువురి ఇళ్లకు వెళ్లి వారితో సరదాగా గడిపారు. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మసెమ్మతల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండేలా దీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. రెండోసారి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా, వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, ఎంపీటీసీ నంజుండప్ప, సర్పంచ్ శంకరప్ప, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, నాయకులు ఆరడిగుంట రెడ్డెప్ప, జయరామిరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రామకృష్ణారెడ్డి,రాజేష్, సూరి, హేము, కంచప్ప తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ రాకెట్ కేసులో పెరుగుతున్న నిందితులు
మదనపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా కొనసాగిన కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులపై కేసులు నమోదు చేస్తూనే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గతేడాది నవంబర్ 9న విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాళెంకు చెందిన సాడి యమున (29) శరీరం నుంచి స్థానిక గ్లోబల్ మల్టీ స్పెషాలిటి హాస్పటిల్లో కిడ్నీని తొలగించి మరొకరికి అమర్చారు. కిడ్నీ ఇచ్చిన యమున ..నవంబర్ 10న మృతి చెందింది. దీనిపై తల్లి సూరమ్మ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి స్థానిక టూటౌన్ పోలీసులు మొదటి దఫాలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా కేసు దర్యాప్తును ఆపకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. దాంతో పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు చెబుతున్నారు. 22కి పెరిగిన నిందితులు సాడి యమున మృతిపై తొలుత ఈ కేసులో నేరుగా ప్రమేయం, మృతి కారణమైన నిందితులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ–1గా గత డీసీహెచ్ఓ ఆంజనేయులు, తర్వాత వరుసగా నిందితులను చేర్చారు. దర్యాప్తు సాగిస్తూనే ఇప్పటి వరకు 22 మందిని నిందితుల జాబితాలో చేర్చారు. వీరిలో ఆంజనేయులు కుటుంబీకులతోపాటు, వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ఆధారంగా ఆస్పత్రి నిర్వాహకురాలిని కేసులో చేర్చారు. ఇప్పటికి 22 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయనుండగా. దర్యాప్తు మరింత లోతుగా వెళ్లడంతో కిడ్నీ దాతలు, స్వీకరించిన వ్యక్తులకు మధ్యవర్తలు ఎవరు, ఎక్కడి వారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరి సమాచారం అందడంతో కొత్తగా మరో ఇద్దరు లేక ముగ్గురిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాళ్లతో లింకు ఎలా మృతి చెందిన సాడి యమున, మరో మహిళ నుంచి తీసుకున్న కిడ్నీల వ్యవహారంలో తెరవెనుక ఉన్న మరికొందరు మధ్యవర్తులు, చికిత్స చేసిన సమయంలో సహకరించిన మరొకొందరు ప్రయివేటు వైద్య సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. మధ్యవర్తులు, వైద్య సిబ్బంది కోస్తా, రాయలసీమకు చెందిన వాళ్లునట్టు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా కిడ్నిలు అమర్చిన వ్యక్తులను ఎవరు గుర్తించారు, వారిని సంప్రదించింది ఎవరు, వారి మధ్య జరిగిన వ్యవహరాలపై ఆరా తీస్తున్నారు. దీంతో ఈ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. -
అంబటిపై హత్యాయత్నం అమానుషం
రాజంపేట : కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీమూకలు హత్యయత్నానికి పాల్పడటం అమానుషమని, అంబటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆకేపాడులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో రౌడీమూకలు అంబటి ఇల్లు, కార్యాలయం దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకొని చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి, తిరిగి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో రాక్షస పాలన గుర్తుకొస్తోందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాక్షసం కొనసాగుతోందన్నారు. రెడ్బుక్కు పోయేకాలం వచ్చిందన్నారు. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు తక్షణమే భద్రత కల్పించాలన్నారు. చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా, ఒక పథకం ప్రకారం టీడీపీ రౌడీమూకలు దాడికి పాల్పడటం వెనుక టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు.టీడీపీ రౌడీమూకలపై కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టించే మాట అటుంచి, ప్రస్తుతానికి ఆటవిక రాజ్యం సృషించారన్నారు. అంబటి ప్రశ్నించేందుకు హతమార్చే కుట్ర జరిగిందన్నారు. అసత్యాలతో ఎదురుదాడి జరిగిందన్నారు. సరికొత్త డైవర్షన్ డ్రామాలో భాగంగానే కాపునేత అంబటిపై దాడి జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. కాపులను అణిచివేయడమే లక్ష్యంగా అంబటి పై హత్యయత్నంకు పాల్పడినట్లుగా ఇప్పటికే కాపువర్గాలు మండిపడుతున్నాయన్నారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పరిహారంగా ఆకేపాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఎమ్మెల్యే పార్టీ అమరనాథరెడ్డి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. -
వర్గ పోరా! ఆధిపత్య ఆరాటమా?
● జిల్లా కేంద్రం అయ్యాక మదనపల్లెలో టీడీపీ బల ప్రదర్శనలు ● రెండువర్గాలుగా విడిపోయిన నాయకులుమదనపల్లె : అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాయచోటి కేంద్రంగా ఒక రకమైన రాజకీయ పరిస్థితులు ఉండగా, ఇప్పుడు మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు మారిపోతున్నాయి. నిన్నటిదాకా ఉప్పు–నిప్పుగా ఉన్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, వర్గపోరు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. దీనికి మదనపల్లె వేదికగా మారింది. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ విషయం గతనెల 23న జరిగిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పర్యటన, ఆదివారం జరిగిన మంత్రి మండిపల్లి పర్యటనతో స్పష్టమైంది. దీనికి తగినట్టు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రెండు వర్గాలుగా మారిపోతున్నారు. కిషోర్ తో జతకట్టిన జహా, ప్రసాద్ గత నెల 23న పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లెకు వచ్చారు. ఆయన రాక సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా హడావిడి జరిగింది. పట్టణంతోపాటు, ఆయన విడిది చేసిన ఆర్ అండ్ బి బంగ్లా వద్ద భారీగా స్వాగత ఫ్లెక్సీలు పెట్టారు. భారీ స్థాయిలో టపాకాయలు కాల్చి హడావుడితో బలప్రదర్శన చేశారు. ఆర్అండ్బీ బంగ్లాకు వచ్చిన కిషోర్ కుమార్ రెడ్డిని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల నాయకులు కలిశారు. వారికి అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. కిషోర్ కిషోర్ వెంట రాజంపేట జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఉండగా, కొంతసేపటి తర్వాత స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలిశారు. ముగ్గురు కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికి ఒకరోజు ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కిషోర్ ప్రకటించారు. టిడిపి నేతలు మినహా జనసేన, బిజెపి నేతలు ఇటువైపు రాలేదు. ఇప్పుడు మంత్రి.. మదనపల్లె జిల్లా కేంద్రం అయ్యాక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం మదనపల్లె వచ్చారు. ఆయన రాక కోసం టీడీపీలోని ఓ వర్గం హడావుడి చేసింది. బ్యానర్లతో స్వాగతం పలికారు. పట్టణంలో కార్లు, బైక్ ర్యాలీగా మంత్రితో ప్రదర్శన చేశారు. ఆయనతో పుంగనూరు ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, స్థానిక జనసేన నేతలు, టీడీపీ ముఖ్య నాయకులు వెంట ఉన్నారు. మీడియా సమావేశంలో మంత్రి కూడా వారానికి ఒకరోజు మదనపల్లెలో ఉంటానని ప్రకటించారు. దీంతో ఈ రెండు వర్గాలు మదనపల్లెలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. వర్గాలుగా చీలిపోయారు? టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరులో పైచేయి ఎవరిది అన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఎమ్మెల్యేలు కిషోర్, షాజహాన్ ఓ వర్గంగా జతకట్టడం స్పష్టమైంది. దీనివల్లే ఎమ్మెల్యే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేకు మంత్రి పర్యటన సమాచారం ఇవ్వలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు మంత్రి వైపు వెళ్లారు. దీంతో మండిపల్లికి ఎమ్మెల్యే దూరం కావడం సహజమే. మంత్రి కూడా మదనపల్లెలో తన ప్రభావాన్ని చూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలతో పాటు, జనసేన నేతలు ఆయనతో కలిసి రావడం కూటమి నేతల మద్దతు ఉందని చాటి చెప్పే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఐదు నియోజకవర్గాల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఓడిపోయిన అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఉండగా, మంత్రి పదవితో మండిపల్లికి అధికార బలం తోడైంది. కిషోర్, షాజహాన్ బాషాలతో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ కలవడం ఈ వర్గానికి పార్టీపరంగా బలం తోడైనట్టు భావించాలి. తంబళ్లపల్లె ఇంచార్జ్ ఎవరు లేకపోవడంతో దీనికి ఏ వర్గమూ లేదు. నాలుగు రోజులుగా కసరత్తు మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ, ఇతర కార్యక్రమాలకు కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అలాగే గత నెల 23న నాటి పర్యటనను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గీయులు మదనపల్లెలో తమ సత్తా నిరూపించాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసం నాలుగు రోజులుగా కసరత్తు చేసినట్టు తెలిసింది. కిషోర్ పర్యటనకు మించి బలప్రదర్శన చేయాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమంలో నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే షాజహాన్ బాష జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్న రోజే మంత్రి వర్గీయులు మదనపల్లెలో బల ప్రదర్శనకు చేయడం చర్చనీయాంశమైంది. -
వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్
ఆరంజ్ ఎకానమీకి సపోర్ట్గా బడ్జెట్ కనిపిస్తుంది. టాక్స్ పేయర్స్కి ఊరట లభించలేదు. ఉద్యోగాల ఉత్పత్తి కోసం పరిశ్రమ లు, విద్యా సంస్థలు అనుసంధానం చేయడం యువతకు ఊరట. – శ్రీనివాసులు బాయినేని, విభాగాధిపతి, ఆర్థిక శాస్త్ర శాఖ, వైవీయూఎప్పటిలాగే సీమకు అన్యాయం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంరాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది. రాయలసీమ ప్రాంత ప్రజ లను పరిగణలోకి తీసుకోకుండా, ఈ ప్రాంతంలో పడకేసిన పనులను ప్రస్తావించకుండా అభివృద్ధిలో రాయలసీమను వెనక్కి నెట్టివేస్తున్నారన్నారు. –ఎన్. రవిశంకర్ రెడ్డి, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువు మండలం బురకాయలకోట పంచాయతీ దేవరపల్లెకు చెందిన రాజన్న(65) వ్యక్తిగత పనులపై స్కూటీలో పక్క గ్రామానికి వెళుతుండగా, బురకాయలకోట సమీపంలోని బైపాస్రోడ్డు వద్ద మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొంది. ప్రమాదంలో రాజన్నకు కాలు, చేయి విరగ్గా, తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతి రుయాకు తరలించారు. అదేవిధంగా మదనపల్లె పట్టణం ఎగువకురవంకకు చెందిన రామకృష్ణ కుమారుడు కిషోర్(24) పాల ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అదే ప్రాంతానికి చెందిన రవితేజ(24)తో కలిసి ములకలచెరువుకు బైక్పై వెళ్లారు. తిరిగి మదనపల్లెకు వస్తుండగా, బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె వద్ద కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
దౌర్జన్యంగా ఉలవ పంట కోశారని ఫిర్యాదు
రొంపిచెర్ల : తళితుని పొలంలో ఉలవ పంటను అగ్రవర్ణాల వారు దౌర్జన్యంగా పెరికేశారని బాధితుడు రొంపిచెర్ల పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గాజులపల్లెకు చెందిన దళితుడు శ్రీనివాసులు తన భూమిలో ఉలవ పంటను సాగు చేశాడు. అయితే అ భూమిలో అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణా కులానికి చెందిన మునిరామయ్య, మంగమ్మ ఉలవ పంటను కోశారని తెలిపారు. ఇదేమని అడిగితే అడ్డు వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారన్నారు. తన భూమిని వారి పట్టాదారు పుస్తకంలో నమోదు చేసుకున్నారన్నారు. దీనిపై కోర్టులో కేసు కూడా వేశామన్నారు. ఈ భూమి తనదేనని హైకోర్టు కూడా తనకు అనుగులంగా తీర్పు ఇచ్చిందన్నారు. అయితే అగ్రవర్ణాల వారు నా కుటుంబాన్ని చంపేసి భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించి పంట కోసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాసులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని రొంపిచెర్ల పోలీసులు పరిశీలించి ఇరువర్గాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు శ్రీనివాసులకు అనుకూలంగా తీర్పు ఇస్తే మీరు ఎలా భూమిలోకి పోతారని అగ్రవర్ణాల వారిని పోలీసులు ప్రశ్నించారు. దీనిపై రొంపిచెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కల దాడిలో 96 గొర్రెల మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట పంచాయతీడుంవారిపల్లిలో శనివారం అర్ధశువుల కొట్టంలో సేద తీరుతున్న గొర్రెల మందపై 20 ఊర కుక్కలు దాడికి దిగాయి. ఈ ఘటనలో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి వెళితే పిడుంవారిపల్లికి చెందిన పశుకాపరి తంబళ్ళపల్లి నాగరాజు, అక్కులమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. గొర్రెలను మేపుకోవడం వీరి జీవనాధారం. గొర్రెలను మేపుకుంటూనే పశు కాపరి ముగ్గురు కుమార్తైలెన అనూరాధ, శారద, కవితలకు వివాహం చేశాడు.కమార్తె గీత చిత్తూరులో ఫార్మసీ చదువుతోంది. ఒక్కగానొక్క కుమారుడు కర్నూల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ తరుణంలో ఊరకుక్కలు ఒక్కసారిగా వచ్చి గొర్రెల గొంతు, కడుపు, కాలు భాగాలకు కాటు వేయడంతో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో బాధిత రైతు రూ.7 లక్షలకు పైగా నష్టపోయాడు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న నాగరాజు మృతి చెందిన గొర్రెలను చూసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. తోటి రైతులు సైతం బాధిత రైతును ఓదార్చారు. గొర్రెలనే నమ్ముకున్న తాను జీవనాధారం కోల్పోయానని ప్రభుత్వం తనను ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని రైతు కంటతడి పెట్టాడు. -
రిజిస్ట్రేషన్ మరింత భారం!
రాయచోటి: సంపద సృష్టిస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ చార్జీలను మరోసారి పెంచి జనం నెత్తిన బండ మోపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్ విలువలు సవరించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన చార్జీల ను అమలు చేయాలంటూ అర్బన్ కేంద్రాలలో ఉన్న సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి పెంచిన మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకూలింది.. పెంచిన చార్జీలతో మరింత దిగజారుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది కిందటే 50 శాతం పెంపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిలో 50 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాలలో కూడా 15 నుంచి 30 శాతం వరకు భూముల విలువలను పెంచారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా భారీగా పతనమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రెండో విడతగా భూముల విలువ పెంచడం వ్యాపారులకు కొనుగోలుదారులకు మరింత భారంగా మారింది. జిల్లాల మార్పు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాలను వారి ఇష్టాను రీతిన బదలాయించడం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ● కాగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో 0 నుంచి 50 శాతం, రాయచోటి 10, బి.కొత్తకోట 15 నుంచి 20 శాతం, పుంగనూరు 10 నుంచి 15, పీలేరు 10 నుంచి 20 శాతం, లక్కిరెడ్డిపల్లి 10 నుంచి 15 శాతం మేర పెరిగిన భూముల విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి అమలు పెంచిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ మూర్తి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో సున్నా నుంచి 50 శాతం మేరకు భూముల వివరాలు పెరిగాయన్నారు. రాయచోటిలో గత ఏడాది 50 శాతం మేర పెంచిన ధరల దృష్ట్యా ప్రస్తుతం 0 నుంచి 10 శాతం వరకు మాత్రమే పెంచామన్నారు. ఈ పెంపుతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ముసుగులో మార్కెట్ విలువల సవరణతో వ్యాపారరంగం పాతాళానికి పడిపోయింది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కనిపించకుండా పోయా యి. ఈ వ్యాపారాల ప్రభావంతో భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. తద్వారా వేల మంది ఉపాధిని కోల్పోతున్నారు. వీటికి అనుబంధంగా ఉన్న సిమెంట్ కడ్డీలు ఇటుకలు, ఇసుక రాళ్లకు తగిన డిమాండ్ లేకపోవడంతో వాటి వ్యాపారులు కూడా ఉసూరుమంటున్నారు. జిల్లా కదలిక మార్పులతో పాతాళానికి పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చార్జీల పెంపుతో రియల్ ఢమాల్ గత ఏడాది రాయచోటిలో 50 శాతం పెంపు నేడు మదనపల్లి 0 నుంచి 50 శాతం పెంపు -
ట్రాన్స్కో డీఈఈగా ఎన్ఎల్డీ లివింగ్ స్టన్
రాయచోటి: రాయచోటి ట్రాన్స్కో డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎన్ఎల్డీ లివింగ్ స్టన్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. స్థానికంగా పనిచేస్తున్న యుగంధర్ శనివారం ఉద్యోగవిరమ ణ పొందారు. ఆయన స్థానంలో నెల్లూరులో డీఈ గా పనిచేస్తూ పదోన్నతి మీద ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్గా రాయచోటి డివిజన్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన డీఈఈకి ఉద్యోగులు, కార్మికులు శుభాభినందనలు తెలియజేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కేంద్ర ప్రభుత్వం అను సరిస్తున్న కార్మిక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహించను న్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. ఓబులు తెలిపారు.ఆది వారం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లా డారు. కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చిందన్నా రు. 8గంటల పని దినాలను 10గంటలకు పెంచు తూ తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బి.కొత్తకోట: మండలంలోని హార్సిలీహిల్స్పైకి అంగళ్లు మిట్స్ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. 14 మంది ఎయిర్వింగ్ క్యాడెట్లు శారీరక ధృడత్వం, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ట్రెక్కింగ్ నిర్వహించారు. 9 కిలోమీటర్ల ట్రెక్కింగ్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎయిర్వింగ్ సిటిఓ డాక్టర్ చరణ్ పర్యవేక్షించారు. మదనపల్లె సిటీ: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 39 జనరల్ సెంటర్లు,రెండు ఒకేషనల్ సెంటర్లలో ప్రాక్టికల్స్ జరిగాయి. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్ నిర్వహించారు. ప్రాక్టికల్స్ కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి రవి మదనపల్లె, రాయచోటిలోని ప్రభుత్వ,ప్రెవేటు జూనియర్ కాలేజీల పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. -
గంజాయి కేసులో కీలక నిందితుడి అరెస్ట్
పెద్దతిప్పసముద్రం : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ పెండ్లిమామిడి గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు కొర్రు అర్జున్ (35) అనే నిందితుడు రెండు కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. ములకలచెరువు సీఐ వెంకటేశులు పర్యవేక్షణలో పీటీఎం ఎస్ఐ పరమేశ్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాలకు సరిహద్దులోని సండ్రడవి అటవీ ప్రాంతంలో 2024 ఫిబ్రవరి 5న గంజాయి అక్రమ రవాణా ముఠా సభ్యులు పట్టుబడిన విషయం పాఠకులకు తెలిసిందే. అప్పట్లో వారి వద్ద లభించిన రూ.30 లక్షల విలువ చేసే 50 గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు కార్లను పోలీసులు సీజ్ చేసారు. అప్పట్లో మదనపల్లికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి తనకు 110 కిలోల గంజాయి కావాలని చెప్పడంతో నిందితుడు అర్జున్ రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకుని గంజాయిని ఓబులేసుకు అందజేశాడు. మిగిలిన పైకం ఇవ్వాలని అర్జున్ డిమాండ్ చేయగా గంజాయి విక్రయించాక ఇస్తామని ఓబులేసు చెప్పడంతో మిన్నకుండిపోయాడు. అప్పటి నుంచి ఓబులేసు కోసం అర్జున్ తచ్చాడుతుండగా శనివారం ములకలచెరువు రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల కంట పడ్డాడు. పోలీసుల తనిఖీలో అర్జున్ రెండు కిలోల గంజాయితో పట్టుబడగా, అతన్ని అరెస్టు చేశారు. -
15లోపు పన్ను వసూళ్లు పూర్తిచేయాలి
● జిల్లాకు 37 స్వచ్ఛ రఽథాలు ● డీపీఓ రాధమ్మ మదనపల్లె రూరల్: జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రూ.19 కోట్ల పన్ను వసూళ్లు బకాయిలు ఉన్నాయని, ఫిబ్రవరి 15లోపు వాటిని వసూలు చేయాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు. మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జిల్లాలోని అన్ని మండలాల డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు అన్ని పన్ను వసూళ్లను స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారానే వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి 2 స్వచ్ఛ రధాలు సేవలందిస్తున్నాయని, జిల్లాకు మొత్తం 37 స్వచ్ఛ రథాలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలోని రెవెన్యూ గ్రామాల్లో స్వమిత్వ సర్వే 204 గ్రామాల్లో పూర్తి కావస్తోందని, సర్వే వివరాలను పీయూజీఐఎస్ సాఫ్ట్వేర్ యాప్లో సరిచూసుకోవాలన్నారు. డీఎల్పీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
రెవెన్యూలో ‘మ్యుటేషన్’ గుబులు
రాయచోటి : అక్రమంగా మ్యుటేషన్ చేసినా.. సరియైన కారణం లేకుండా దరఖాస్తులను తిరస్కరించినా రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరికలతో.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది గుండెల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో వారికి ఇష్టం వచ్చిన రీతిలో రికార్డులు తారుమారు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. పక్కా రికార్డులు ఉన్నప్పటికీ కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీంతో బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై కలెక్టర్ నేరుగా విచారణ చేపట్టడంతోపాటు అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. మ్యుటేషన్ దరఖాస్తులను తిరస్కరించిన అంశంపై శనివారం విచారణ చేపట్టారు. రాయచోటి, కలకడ మదనపల్లి మండలాల తహసీల్దార్లను ఆయా మండలాలకు సంబంధించిన ఐదు గ్రామాల వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లను మదనపల్లి కలెక్టరేట్కు పిలిపించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులపై కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ స్వయంగా పలువురు మ్యుటేషన్ల దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి వారు పెట్టుకున్న దరఖాస్తులపై పలు అంశాలను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విచారణలో తాము చేసిన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం అధికారులలో కనిపిస్తోంది. పీజీఆర్ఎస్ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా జరుగుతోందనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. భవిష్యత్తులో మ్యుటేషన్ తదితర రెవెన్యూ దరఖాస్తులపై అక్రమంగా దరఖాస్తుల తిరస్కరణ, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పరిశీలన సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ విచారణతో అధికారుల్లో ఆందోళనరాయచటోటి మండల పరిధిలోని రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
చౌడేపల్లె : అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తిప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె మార్గంలో గల దొడ్డిగాని దేవళం సమీపంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె నుంచి పరికిదొనకు ఆటోలో ఆరుగురు ప్రయాణికులు వెళ్తుండగా దొడ్డిగాని దేవళం సమీపంలో గల మలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చౌడగానిపల్లెకు చెందిన లక్ష్మమ్మ(62), పరికిదొనకు చెందిన రెడ్డప్ప(67)లు తీవ్రంగా గాయపడగా, పరికిదొనకు చెందిన కాటమన్న(45), వెంకటమ్మ(48), ప్రవీణ్కుమార్(30), గడ్డంవారిపల్లెకు చెందిన రమణమ్మ(47)గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందించారు. లక్ష్మమ్మ, రెడ్డెప్పలను మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఏర్పాటు
మదనపల్లె : ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీని మదనపల్లెలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కన్వీనర్గా జి.రమేష్ (మదనపల్లె), కో–కన్వీనర్లుగా ఎన్.చంద్ర (మదనపల్లె), ఎస్.రవీంద్ర (మదనపల్లె), జి.గిరిశేఖర్ (మదనపల్లె), ఎల్.నాగరాజు (పుంగనూరు), ఎం.శ్రీనివాసులునాయుడు (పీలేరు), బి.వెంకటరమణ(పీలేరు), జి.శివప్రసాద్ (రాయచోటి), సి.రామకృష్ణారెడ్డి (తంబళ్లపల్లె), ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్లుగా వి.రెడ్డిప్రసాద్(మదనపల్లె), ఎస్.రమేష్రాజులను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. 3 పొట్టేళ్ల చోరీ పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరులో రిజ్వాన్ అనే వ్యక్తికి చెందిన రూ.50 వేల విలువ చేసే మూడు పొట్టేళ్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. తేరు బజారు సమీపంలోని ఓ ఇంట్లో వదిలిన పొట్టేళ్లను దొంగలు శుక్రవారం అర్ధరాత్రి అనంతరం తాళాలు పగులగొట్టి ఎత్తుకెళ్లారు. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలంతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ చౌడేపల్లె : పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్లో నివాసమున్న వి.సహదేవన్, కళావతిల కుమార్తె వి.అశ్వని ఏపీపీఎస్సీ గ్రూఫ్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. అమరావతిలోని ఆంధ్రరాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(రాష్ట్ర పరిపాలనా విభాగం) పోస్టుకు ఎంపికయ్యారు. 2018లో గ్రూప్–3లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై చౌడేపల్లె మండలం కాటిపేరిలో విఽధులు నిర్వహిస్తున్నారు. 2023లో గ్రూప్–1 పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుతిరిగినప్పటికీ పట్టుదలతో విజయం సాధించినట్లు చెప్పారు. తన భర్త వెంకటేష్ ప్రోత్సాహం, కుటుంబ సభ్యులతోపాటు ఎంపీడీఓ లీలామాధవి, వెంగమునిరెడ్డిల సహకారంతోనే ఈ విజయం సాధించానని అశ్వని తెలిపారు. -
లూర్దుమాత తిరునాలకు ఘనంగా ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్ : కడప మరియాపురంలో లూర్దుమాత తిరునాలను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఫాదర్ ఈరి మరియన్న తెలిపా రు. శనివారం లూర్దుమాత చర్చి ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. 1936లో రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ క్రంబ్లిష్ ఈ చర్చిని నిర్మించారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఏటా లూర్దుమాత తిరునాల నిర్వహిస్తున్నామన్నారు. తిరునాల కమిటీ అధ్యక్షుడు జి.బాలయ్య ఫిబ్రవరి 11వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమాల గురించి వివరించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2న సాయంత్రం 5.30 గంటలకు పతాకావిష్కరణతో తిరునాల ప్రారంభిస్తామన్నారు. నవదిన పూజలు ఉంటాయన్నారు. 10న డాన్బాస్కో ఐటీఐ నుంచి లూర్దుమాత ఊరేగింపు మరియాపురం వరకు సాగుతుందన్నారు. 11న కడప మేత్రాసన పీఠాధిపతులు సగినాల పాల్ప్రకాశ్ పూజలు నిర్వహిస్తారన్నారు. వివిధ పోటీలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా లూర్దుమాత తిరునాల మహోత్సవానికి సంబంధించి కరదీపికలు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహణ ఫాదర్ ఈరి మరియన్న -
తపాలా బీమా.. జీవితానికి ధీమా
● గ్రాడ్యుయేట్లకు పీఎల్ఐ పాలసీ వర్తింపు ● 6 ప్లాన్లతో ఆర్థిక ప్రయోజనాలు ● నేడు 142వ తపాలా జీవిత బీమా వార్షికోత్సవంకడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమా ఇస్తున్నాయి. 1884లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తపాలా జీవిత బీమా ఆదివారంతో 141 వసంతాలు పూర్తి చేసుకొని 142వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. పీఎల్ఐ(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశ పెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తోపాటు బీఎస్ ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు కంపెనీల ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు ఈ పీఎల్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటీసిపెటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి 1000 రూపాయలకు రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గల వారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకొనే వీలుంటుంది. ఐదేళ్లలోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనసులు వర్తించవు. కోతలు విధిస్తారు. ఏటా 1000కి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము, బోనస్ ప్రయోజనాలు చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.1000కి 76 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది. ఎండోమెంట్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా 20,000.. గరిష్టంగా 50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం పాలసీ సరెండర్కి అవకాశం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోతల విధింపు తప్పదు. ఏటా 1000కి 52 రూపాయల చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా 20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్ పై బోనస్ల్లో కోత ఉంటుంది. పాలసీదారుడు మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు వర్తిస్తాయి. ఏటా రూ.1000కి 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు(పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్లో ఉండవు. ప్రీమియంలు తల్లిదండ్రులు చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకోవడం ఇలా.. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి స్కీంలో భాగస్వాములు కావచ్చు. ఉమ్మడి జిల్లాలో 3,81,680 పాలసీదారులు పీఎల్ఐ పథకంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 3,79,680 మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో కడప డివిజన్లో 2,09,722, ప్రొద్దుటూరు డివిజన్లో 1,71,958 పాలసీదారులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎల్ఐ పధకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు ఈ పథకంలో చేరి వివిధ పథకాల్లోని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ బీమాతో ఎక్కువ ప్రీమియంలు పొందవచ్చు. పోస్టల్ ఉద్యోగులు ఈ పీఎల్ఐ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – రాజేష్, సూపరింటెండెంట్, కడప పోస్టల్ డివిజన్ -
ఫిజియోథెరపిస్ట్ల మెరిట్ లిస్టు ప్రకటన
మదనపల్లె సిటీ: జిల్లాలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్ పోస్టుల మెరిట్ లిస్టు ప్రకటించినట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు ఫిజియోథెరపిస్టు పోస్టులకు 32 దరఖాస్తులు వచ్చాయన్నారు. బీపీటీ, ఎంపీటీ మార్కుల ఆధారంగా తయారు చేసిన మెరిట్లిస్టును సమగ్రశిక్ష కార్యాలయం, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, మదనపల్లెలో, ప్రతి మండలంలోని ఎంఆర్సీ, భవిత కేంద్రాల్లోని నోటీసు బోర్డులలో ఉంచామన్నారు. దరఖాస్తుదారులు అభ్యర్థనలు, సందేహాల నివృత్తి కొరకు లిఖితపూర్వకంగా సమగ్రశిక్ష కార్యాలయం, మదనపల్లె నందు సంప్రదించాలన్నారు. సమాచారం కోసం 9440455211, 8309472517 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్ కుమార్లు మూల విరాట్ కి పంచామృతాభిషేకం నిర్విహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జిల్లాలో 8 మంది డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి.కృష్ణారావు తెలి పారు. మైదుకూరు ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలలో ఇద్దరు, పుల్లారెడ్డిపేట ఎస్ఎల్ఎస్ డిగ్రీ కళాశాలలో ఆరుగురిని డిబార్ చేసామన్నారు. ఆ కేంద్రాలను తనతో పాటు హైపవర్ కమిటీ సభ్యులు డాక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి, కట్టా వెంకటేశ్వర్లు తనిఖీలు చేశారన్నారు. కాగా, ఒంటిమిట్టలోని డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని హై పవర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ రియాజున్నీసా, డాక్టర్ మాదక్క తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య కృష్ణారావు మాట్లాడుతూ వైఎస్సార్ కడప, మదనపల్లి, తిరుపతి జిల్లాలలోని పరీక్ష కేంద్రాలకు అబ్జర్వర్లతో పాటు తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయన్నారు. శనివారం జరిగిన పరీక్షలకు 7,322 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో నుంచి మట్టి నమూనాల సేకరణ మార్చి 25కల్లా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ సూచించారు. శనివారం కడప ఊటుకూరులోని జిల్లా వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే.చంద్ర నాయక్ మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ స్కీం కింద 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25,000 మట్టి నమూనాల సేకరణ విశ్లేషణ లక్ష్యంగా నిర్దేశించారని తెలియజేశారు. ఈ పథకం కింద జిల్లాలోప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి కడప భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు రాధాదేవి, వ్యవసాయ అధికారులు ఈశ్వర కవిత, భారతి, సాయి జ్యోతి పాల్గొని మట్టి నమూనా సేకరణ, మొబైల్ యాప్ వినియోగంపై ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. -
రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
మదనపల్లె రూరల్: రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పీపీఆర్ కల్యాణమండపంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కే.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ నిశాంత్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రహదారి భద్రతపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయన్నారు. రోడ్డు భద్రతపై సరైన అవగాహన లేకుండా యువత చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్, వేగంగా బైక్స్ నడపడం, యాంగిల్స్ మీద కట్చేయడం కిక్ ఇస్తుందనుకుంటే, దాని పర్యవసానం జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. పిల్లలు చేసిన పొరపాట్లకు, తప్పిదానికి జీవితాంతం తల్లిదండ్రులు పరువు పోగొట్టుకోవడమే కాకుండా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు అండగా నిలిచి, గోల్డెన్ అవర్లో వారిని ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడిన గుడ్ సెమారిటన్కు రూ.25వేలు గౌరవవేతనంతో పాటుగా ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. రోడ్డు భద్రతను ప్రజలు చాలా చిన్న విషయంగా భావిస్తున్నారని, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం గాల్లో కలుస్తోందని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల్లో అన్నమయ్యజిల్లా టాప్ ఫైవ్ జాబితాలో ఉండటం ఆవేదన కలిగించే అంశమన్నారు. రోడ్డు భద్రత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాళ్ల సొంత ప్రాణాలతో పాటు వేరే వాళ్ల కుటుంబాలను ఇబ్బందుల్లో పడేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా మొమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ఆర్టీఓ అశోక్ప్రతాప్, పంచాయతీరాజ్ అధికారి దయాకర్, ఎంవీఐ దినేష్చంద్ర, ఏఎంవీఐలు శివలింగయ్య, శ్రీహరి, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందే దరఖాస్తులకు సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన పరిశ్రమలకు అందిస్తున్న రాయితీపై అధికారులతో ఆరా తీశారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ కృష్ణకిశోర్, జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, పలుశాఖల అధికారులు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యలపై కలెక్టర్ ఆరా: మండలంలోని కొండామర్రి పంచాయతీలో శనివారం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు విధుల నిర్వహణలో, సమస్యలపై నిర్లక్ష్యంతో వ్యవహరించరాదని ఆదేశించారు. ఎంపీడిఓ తాజ్మస్రూర్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రహదారి నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
సమగ్ర శిక్ష ఏపీసీ అనూరాధ
మదనపల్లె సిటీ: వచ్చే ఏడాది విద్యా సంవత్సరంలో రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర–2 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేయనున్న షూలకు సంబంధించి, విద్యార్థుల పాదాల కొలతలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ నున్నె అనూరాధ తెలిపారు. శనివారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల పాదాల కొలతలను పరిశీలించారు. రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. విద్యార్థులను కూర్చోబెట్టి కొలతలు తీయడం, అంచనాల ప్రకారం లేదా రౌండ్ ఫిగర్గా నమోదు చేయడం వంటి చేయరాదన్నారు. ఏదైనా పాఠశాలల్లో పాదాల కొలత తప్పుగా నమోదు చేసి ఉన్నట్లయితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫిబ్రవరి 2వతేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సరిచేయాలని ఆదేశించారు. సమ గ్రశిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కరుణాకర్,ఎంఈఓ ప్రభాకర్రెడ్డి, హెచ్ఎం మోహన్, పీడీ భద్రయ్య పాల్గొన్నారు. -
మదనపల్లెలో పట్టపగలే భారీ చోరీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని కదిరి రోడ్డు సంగం ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న ప్రశాంత్ నగర్ 4వ క్రాస్ రోడ్డులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని ప్రస్తుతం అమెరికాలో ఉండగా, ఆ ఇంటిలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేసే శేషాద్రి రెడ్డి అతని భార్య రెడ్డమ్మ ఉంటున్నారు. వారు సొంత పనులపై మరో ఊరికి వెళ్లాల్సి రావడంతో కాళ్ల మడుగులో ఉంటున్న రెడ్డమ్మ తల్లి ముత్తమ్మను పిలిపించి ఇంటికి కాపలాగా ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం ముత్తమ్మ పక్కింటి ఆవిడ భోజనం క్యారియర్ తీసుకుని స్కూలుకు వెళుతుండగా, ఆమెకు తోడుగా వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువా పగులగొట్టి అందులోని నగలు నగదు అపహరించుకుని వెళ్లారు. ఆమె స్కూల్ వద్ద నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళనగా ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తలుపులు తెరిచి ఉండడం, సీక్రెట్ లాకర్లను పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని అల్లుడు శేషాద్రి రెడ్డికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఇంటికి చేరుకుని పరిశీలించగా ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన రూ. 6 లక్షల నగదు, 90 గ్రాముల బంగారు చోరికి గురైనట్లు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూ టౌన్ సీఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది.రూ.6 లక్షల నగదు, 90 గ్రాముల బంగారు అపహరణ -
శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు
చౌడేపల్లె : మండల పరిధిలోని దిగువపల్లె గ్రామంలో వెలసిన బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్రోక్తంగా గంగమ్మకు రాహుకాల పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధిచేశారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస ధీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీలో నియామకాలుకడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకుచెందిన పలువురిని వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేసింది. ● తంబళ్లపల్లెకు చెందిన కేవీ రమణ రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీగా, రాయచోటికి చెందిన సయ్యద్ షబ్బీర్ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా, రాజంపేటకు చెందిన పోలి రఘునాథరెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదేవిధంగా తంబళ్లపల్లెకు చెందిన ఇ.ప్రవీణ్కుమార్రెడ్డిని డిస్ట్రిక్ట్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్గా నియమితులయ్యారు. రైతులకు యూరియా కష్టాలునిమ్మనపల్లె : యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. శుక్రవారం మండలంలోని సామకోటవారిపల్లె సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులు యూరియా పంపిణీ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమకు ఎక్కడ యూరియా దక్కకుండా పోతుందోనన్న ఆదుర్దాతో ఒకరినొకరు తోసుకునే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట మొదలైంది. దీంతో అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం నిమ్మనపల్లె పోలీస్స్టేషన్ నుంచి కానిస్టేబుల్ సామకోటవారిపల్లెకు చేరుకుని రైతులకు సర్దిచెప్పి క్యూలైన్ ఏర్పాటుచేశారు. సాయంత్రం వరకు 400 బస్తాల యూరియా పంపిణీ చేశారు.కొన్ని పంచాయతీలకు యూరియా రాకపోవడంతో రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరతున్నారు. 1న షూటింగ్బాల్ జిల్లా జట్ల ఎంపికమదనపల్లె సిటీ : జిల్లా సబ్ జూనియర్ బాల,బాలికల షూటింగ్బాల్ జిల్లా జట్ల ఎంపిక ఫిబ్రవరి 1న జరుగుతుందని జిల్లా షూటింగ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి తెలిపారు. ములకలచెరువు అక్సఫర్డ్ పాఠశాలలో ఎంపిక జరుగుతుందన్నారు. క్రీడాకారులు 1.4.2010 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఒరిజనల్ ఆధార్కార్డు తీసుకురావాలన్నారు.ఎంపికై న జట్లు పల్నాడులో ఫిబ్రవరి 8న జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షూటింగ్బాల్ ఛాంఫియన్షిప్ పోటీల్లో పాల్గొంటాయన్నారు. వివరాలకు 6281881022, 8179230577 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం, పుంగునూరు రోడ్డులోని, వలసపల్లి నవోదయ స్కూల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారించగా, ఢీకొన్న వాహనం వివరాలు, మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. నల్లటి ప్యాంటు షర్టుతోపాటు కోటు ధరించి ఉన్నాడు. ఇతని వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తాలూకా పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించిన వ్యక్తులు తాలూకా పోలీసులను సంప్రదించాలని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసుకొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో ఉన్న హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈఓ షంషుద్దీన్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు.విధులకు డుమ్మా కొట్టిని ఉపాధ్యాయుడికి షోకాజ్ నీటీసు ఇచ్చినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం. ఓబులేసు తెలిపారు.లావనూరు హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఆర్ .రామంజులరెడ్డి విధులకు రాకుండా వలంటీర్తో నిర్వహిస్తున్నాడని స్థానికులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. డీఈఓ వచ్చిన సమయంలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చారని మండల విద్యాశాఖాధికారి తెలిపారు. -
తరిగొండ పాఠశాలకు హరిత అవార్డు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్కు జాతీయ హరిత పాఠశాలల అవార్డు వచ్చింది. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025–2026 ఏడాదికి గానూ గ్రీన్స్కూల్ ప్రోగ్రామ్ అవార్డుకు తరిగొండ జెడ్పీ హైస్కూల్ ఎంపికయ్యింది. ఈ అవార్డు కోసం మన రాష్ట్రం నుంచి మొత్తం 39 పాఠశాలలు దరఖాస్తు చేసుకొన్నాయి. అందులో 11 జెడ్పీ హైస్కూళ్లు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే 7 జెడ్పీ హైస్కూళ్లు ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. తరిగొండ జెడ్పీ హైస్కూల్లో 2025–2026 ఏడాదికి గానూ మొత్తం 1200 మొక్కలు నాటి పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడంతో ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ సంస్థ న్యూఢిల్లీలోని లోధిరోడ్లో స్టెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ సునీతా సురైన్ చేతుల మీదుగా జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రామచంద్ర, గ్రీన్ టీచర్ కిషోర్కుమార్, విద్యార్థులు నందివర్థన్, ధనుష్కుమార్రెడ్డిలు అవార్డు అందుకొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు గ్రీన్ స్కూల్ అవార్డు రావడం పట్ల రాష్ట్ర ఎన్జీసీ కోఆర్డినేటర్ నీలకంఠ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శివలక్ష్మీ, పాఠశాల సిబ్బంది ఆభినందించారు. -
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
పీలేరు : వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పని సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆపీసర్ ఎస్. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక ఫారెస్ కార్యాలయంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత నెల 5వ తేదీన అలుగును వేటాడి అలుగు చిప్పలను విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. కేవీపల్లె మండలానికి చెందిన రెడ్డెప్ప ప్రధాన సూత్రధారి అన్నారు. ఆయన స్థానికంగా ఉన్న యానాదులు డబ్బు ఆశతో అడవి జంతువులను వేటాడి వాటి మాంసం, ఇతర భాగాలు అక్రమంగా రెడ్డెప్పకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. ఆయన ద్వారా అంతర్జాతీయ కొనుగోలుదారులను కూడా గుర్తించి అరెస్ట్ చేయడానికి డీఆర్ఐ ముంబై అధికారులతో కలసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీచట్టం 1972 ప్రకారం అటవీ జంతువులను వేటాడినా, అటవీ సంపదను దోచుకున్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెయిల్ కూడా లేకుండా కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. అటవీ సంపద నాశనం చేయడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆపీసర్ ఎస్. శ్రీనివాసులు -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మదనపల్లె : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మినరసయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని సిటిఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను, రోగుల సంఖ్య, కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్టులు పక్కాగా నిర్వహించాలన్నారు. మాత–శిశు మరణాలను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. సంక్రమణ వ్యాధులు నియంత్రణ, టి బి కార్యక్రమాలు, సాధారణ రోగులకు అందిస్తున్న సేవల సూచికలను సిద్దంగా ఉంచాలన్నారు. రికార్డుల నిర్వహణ, మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించాలన్నారు. వైద్యాధికారిణి డాక్టె కృపలత, టిబి సూపర్వైజర్ ప్రభాకర్, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కుష్టువ్యాధిగ్రస్తులపై వివక్ష వద్దు మదనపల్లె రూరల్ : కుష్టువ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్.లక్ష్మీనరసయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కుష్టునివారణ దినోత్సవంగా జరిపారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుష్టువ్యాధి అవగాహన కార్యక్రమాలపై పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కుష్టువ్యాధి అవగాహన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామపంచాయతీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 80 లెప్రసీ కేసులు ఉన్నాయన్నారు. 278 మందికి కుష్టువ్యాధి వల్ల కలిగిన అంగవైకల్యం కారణంగా పెన్షన్ అందించినట్లు చెప్పారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధిని ముందస్తుగా గుర్తించాలన్నారు. శరీరంపై స్పర్శలేని మచ్చలు నొప్పి లేకుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యూక్లీస్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్ధన్రెడ్డి, పీఎంఓ రవికుమార్, డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: 12 మందికి గాయాలు
చౌడేపల్లె : ఆటో బోల్తాపడిన ప్రమాదంలో 12మందికి గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా బోయకొండ గంగాపురం వద్ద ఉన్న చెక్పోస్టు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలు.. బాపట్ల జిల్లా రేపల్లె, భట్టిప్రోలు మండలం పల్లికోన నుంచి వచ్చిన వలస కూలీలు అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు సమీపంలో కొటగుండ్లపల్లెకు చెందిన ఓ రైతు వద్ద పనులకోసం పదిరోజుల కిందట వచ్చారు. శుక్రవారం పనులకు విరామం ఇవ్వడంతో పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వీరు ఆటోలో బయలుదేరారు. మళ్లీ అదే ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలోని 12 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుకొండలు(45), వెంకటేశ్వరమ్మ(38), విజయ్(40), అనితమ్మ(55), వీరమ్మ(55), మాధవి(38), శివరామకృష్ణ(45)లకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకొన్న ఈఓ ఏకాంబరం ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నాగేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఏటవాలుగా ఉన్న మార్గంలో ఆటోలు పూర్తిగా నిషేధం. ఈ మార్గంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ను ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు.క్షతగాత్రులు బాపట్ల జిల్లా రేపల్లె, పల్లికోన వాసులు -
బడ్జెట్ రైలు ఆగేనా?
● రేపు పార్లమెంట్లో కేంద్రబడ్జెట్ ● రైల్వేల పరంగా కేటాయింపుల కోసం ఉభయజిల్లా వాసుల ఎదురుచూపులురాజంపేట : రైల్వే బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 8వసారి ప్రవేశపెట్టనుంది. మొదటిసారిగా ఆదివారం రోజున కేంద్రబడ్జెట్ను ప్రవేశపెడుతుండటం గమనార్హం. ఏటా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో ఉభయ జిల్లాల రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్లో కేవలం పాత ప్రాజెక్టులకే కేటాయించి చేతులు దులుపుకున్నారు. కొత్తగా ఏర్పాటైన సౌత్కోస్ట్జోన్కు తొలిబడ్జెట్ ఇది. ఏ విధంగా కేటాయింపులు ఉంటాయో వేచిచూడాల్సిందే. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం లైనున్నా...రైలేది రూ.6,660 కోట్లతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం లైన్ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు1, 2019లో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్యాసింజర్ రైలును నడిపించలేదు. కర్నూలు, నంద్యాల, కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నెల్లూరు మీదుగా రైలుప్రయాణాలు కొనసాగించేందుకు వీలవుతుంది.ఈ విధమైన ప్రతిపాదనలను రైల్వే అధికారులు చేయడంలేదు. ● ముంబై–చైన్నె ప్రధాన రైలుమార్గంపేరుకే. కానీ రైళ్లు అరకొరే. వందేభారత్, అమృత్భారత్ లాంటి రైళ్లు ఈ మార్గంలో నడిపించరు. కోస్తా రైలుమార్గాలకు ఉన్న ప్రాధాన్యం ఈ రైలుమార్గానికి ఇవ్వడంలేదన్న అపవాదును కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ మూటకట్టుకుంది. కొత్తరైళ్ల కూత ఏదీ.. ● ఉభయజిల్లామీదుగా బెంగళూరు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా లేదు. ● గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో ఉభయ వైఎస్సార్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రయాణికులకు ప్యాసింజర్ రైళ్ల సౌకర్యం కల్పించే ప్రతిపాదనలు ఏవీ పట్టా లెక్కడంలేదు. ఉదయం తిరుపతి వైపు, సాయంత్రం కడప వైపు ఒక ప్యాసింజర్రైలు నడిపించే ప్రతిపాదన చేయాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ● తిరుపతి–విజయవాడకు జిల్లా మీదుగా ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడిపించే విధంగా కొత్తరైలును ప్రవేశపెట్టాలని ప్రయాణికుల డిమాండ్. ● ఉభయ వైఎస్సార్ జిల్లాలను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమోరైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ● విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు,రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట,నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్ప్రెస్ రైలును తీసుకొస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. నందలూరులో రైళ్లకు వాటరింగ్ ప్రతిపాదన కనుమరుగు నందలూరు రైల్వేకేంద్రంలో వాటరింగ్ ప్రతిపాదన కోవిడ్–19 ముందు చేశారు. సర్వే కూడా నిర్వహించారు. రూ.35లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. నందలూరులోపుష్కలంగా నీటివనరులు ఉన్నాయని డివిజన్ ఉన్నతాధికారులకు తెలుసు. నీటి వల్ల బ్రిటీషర్లు నందలూరులో స్టీమ్లోకోషెడ్ను ఏర్పాటుచేశారు. తిరిగి ప్రతిపాదన అమలుచేస్తే, తిరుపతి, రేణిగుంటలో రైళ్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బాలాజీ డివిజన్ ఏర్పాటుతోనే.. డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్లు ఉంటే డివిజన్గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ),పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. బాలాజీ డివిజన్ ఏర్పాటుతో కడప రైల్వేల అభివృద్ధి, ప్రాముఖ్యత పెరుగుతుందని రైల్వేనిపుణులు అంటున్నారు. గత బడ్జెట్లో ఇలా.. 126 కీ.మీ దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్(ఎస్) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కి.మీటర్ల దూరం కలిగిన కష్ణపట్నం–ఓబులవారిపల్లైరెలుమార్గానికి డిపాజిట్(ఆర్వీఎన్) కింద 267.46 కోట్లు వ్యయం చేస్తున్నారు. పులివెందులకు రైలుకూత.. 2020లో బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైన్ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తాయి. ఈ సారి బడ్జెట్లో 65 కి.మీటర్ల దూరమున్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్ ఆర్ఈటీ సర్వే కింద రూ.16 లక్షలు కేటాయించారు. 110 కి.మీ దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్కు రూ.2.75 కోట్ల ఫైనల్ లోకేషన్ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యే క గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులకు ఎదురచూపులే మిగులుతున్నాయి. ● గుంతకల్–రేణిగుంట మధ్య 3, 4 లైను నిర్మాణం రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్ లోకేషన్ సర్వే కింద గుంతకల్–ఓబులవారిపల్లె(256 కి.మీ) రూ.5.12కోట్లు కేటాయింపులు జరిగాయి. 56 కి.మీ దూరం ఉన్న ఓబలవారిపల్లె–రేణిగుంటకు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1.12 కోట్లు వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ రద్దీ భారం తగ్గుతుంది. ● ఉభయవైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్ ఆధునీకరణకు రూ.18 .80 కోట్లు కేటాయింపులు జరిగాయి. పార్శిల్ ఆఫీసు ఆధునీకరణ చేయనున్నారు. ఓపెన్ వెయిటింగ్ హాల్తోపాటు, రూ.4.44 కోట్లతో ఎస్కలేటర్స్ తదితర సౌకర్యాలు కల్పన దిశగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అప్గ్రేడ్ స్టేషన్ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపులు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్సిస్టమ్ బలోపేతం పనులు చేపట్టనున్నారు. ● గుంతకల్–రేణిగుంట మార్గంలో ప్లాట్ఫాంలను పొడిగింపు చేయనున్నారు. రూ.3.55కోట్లతో 24/26/ఎల్హెచ్బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3.40కోట్లతో ప్లాట్ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గూడ్స్షెడ్ల అభివృద్ధి : రైల్వేకోడూరులో గూడ్స్షెడ్ను రూ.11.55కోట్లతో ముద్దనూరు గూడ్స్షెడ్ రూ.13.26 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్ మిషన్సైడింగ్స్,రెస్ట్రూం తదితర సౌకర్యాల కోసం రూ.5.22కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డు లోని సబ్వేకు రూ.5.22 కోట్లు కేటాయించారు.కడప–బెంగళూరు రైల్వేలైను ముందుకెళ్లేదెపుడో.. కడప–బెంగళూరు మధ్య రైలు నిర్మాణానికి 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు. ఈ రైలుమార్గానికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణపనులు మొదలయ్యాయి. 258కిలోమీటర మేర రైలుమార్గం నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఐదేళ్లు కాదుకదా..15ఏళ్లు దాటిపోయేలా కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. కడప–బెంగళూరు రైలుమార్గం నాలుగుఫేజ్ల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటిదశలో రూ.153కోట్లు కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేశారు. 21.8కిలోమీటర్ల మేర కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్న, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయం చేశారు.పెండ్లిమర్రి లైన్ వేశారు. అక్కడితో లైన్ ఆగిపోయింది. ఈలైన్ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. గత బడ్జెట్లో రూ.21లక్షలు కేటాయించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు.ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి పార్లమెంట్లో ఆదివారం కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రైల్వేపరంగా కేటాయింపులు జరిగేనా అని ఉభయ వైఎస్సార్జిల్లా ప్రయాణికులు ఆశగాఎదురుచూస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కలికిరి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని మహల్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మహల్ సీహెచ్సీని ఆయన శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓ.పీ.రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్, సిబ్బంది హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తారు.. ఎలా నమోదు చేస్తున్నారు.. టీకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విధానాలు తదితరాలపై సిబ్బందిని నేరుగా విచారించారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు, వారి ఆరోగ్య వివరాలపై సిబ్బందిని విచారించారు. ఇంకా ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, సిబ్బంది కొరత ఉంటే అవసరమైన సిబ్బందిపై నివేదిక పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ఇతర వార్డులను పరిశీలించి, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అన్ని వసతులు ఉండాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, ఎంపీడీఒ భానుమూర్తిరావు, ఆసుపత్రి వైద్యాధికారులు మహేశ్వరరాజు, ప్రశాంతి..ఎంఈఒ–2 నాగార్జున, వీఆర్ఓలు ప్రసాద్రెడ్డి, ఆదిలక్ష్మి, షంషాద్, శ్రీనివాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ సన్నిధిలో డీఐజీ
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మను డీఐజీ కోయప్రవీణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి , డీఎస్పీ మహేంద్రలకు ఈఓ ఏకాంబరం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టత, అమ్మవారి మహత్యాన్ని ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ అధికారులకు వివరించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి శేష వస్త్రం కప్పి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేదపండితులచే ఆశీర్వచనం చేయించారు. ఈ సంధర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలు చేరడంతో బోయకొండ విశిష్టతతో పాటు అవగాహన కోసం పర్యటించినట్లు చెప్పారు. బోయకొండలో భధ్రత విషయమై ఈఓ పలు అంశాలు చర్చించారని, పూర్తిస్థాయిలో సిబ్బంది కేటాయింపు అనంతరం పటిష్టమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఆయన వెంట సీఐలు సాయి ప్రసాద్, సుబ్బరాయుడు, ఎస్ఐ నాగేశ్వరరావు తదితరులున్నారు. -
కేంద్రీయ విద్యాలయానికి భూ కేటాయింపు
● ఫలించిన ఎంపీ మిథున్రెడ్డి కృషి ● వచ్చే ఏడాది తరగతుల ప్రారంభంపై ఆశలు మదనపల్లె : మదనపల్లెలో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యా కేంద్రం ప్రారంభించాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి పలుమార్లు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నోసార్లు వినతిపత్రాలను ఇవ్వడమేకాక ప్రత్యక్షంగా మంత్రులు, అధికారులను కలిసి విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. నిరుపేద విద్యార్థులు అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయం ఆవశ్యకతను వివరించారు. దీనితో కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వానికి, అన్నమయ్యజిల్లా కలెక్టర్కు లేఖలు రాశారు. 2026–27 విద్యా సంవత్సరం దగ్గరపడుతోంది, మాకు కేటాయించిన భూమిని అప్పగించండి అంటూ విన్నవించారు. తర్వాత ఇదే విషయంపై గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ను మిథున్రెడ్డి కలిశారు. కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ పరిస్థితుల్లో భూమి అప్పగింత వ్యవహారంపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఫలితంగా ఈనెల 28న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్రీయ విద్యాలయానికి ఉచితంగా 6.09 ఎకరాలను అప్పగించేందుకు తీర్మానించారు. ఇక మదనపల్లె–పుంగనూరు రహదారిలో వలసపల్లె వద్ద సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో 6.09 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి అప్పగించేందుకు చర్యలు వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అవుతాయన్న ఆశలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. -
కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ
మదనపల్లె : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు చెప్పారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన వీబీజీ రాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకొస్తోందని చెప్పారు. ప్రజలకు తెలిసేలోపు వీటిని అమలులోకి తీసుకువస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు, కార్మికులు దీన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతిందని, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి కొత్త చట్టంలో కూలీల అవసరాల మేరకు కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి లేబర్కోడ్లు అమల్లోకి వస్తాయని దీనివల్ల కార్మికులు కనీస హక్కులతో పాటు సమ్మె హక్కునూ కోల్పోతారని తెలిపారు. ఈ చట్టాలను అత్యంత వేగంగా బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని, వీటిపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎం నాయకులు నాగరాజు, నరసింహ, ఆఫ్రిది పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మదనపల్లె రూరల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఆమెతో సహజనం చేస్తున్న ప్రియుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుమారుడు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలం, కొత్తవారిపల్లి పంచాయతీ గుడిసివారి పల్లెకు చెందిన శాంసన్ భార్య ఎలిజా ప్రేమకుమారి (45)కి నాలుగేళ్ల క్రితం భర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆమెకు కుమారుడు విల్సన్ విజయ్ కుమార్ ఉన్నాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. భర్త మరణానంతరం ఎలిజా ప్రేమకుమారి స్థానికంగా ఉన్న చలపతి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గత కొంతకాలంగా ప్రేమ కుమారి, చలపతిల మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవ పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం చలపతి ఆమె ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నాడు. అయితే విధులు ముగించుకుని రాత్రి వచ్చిన కుమారుడు విల్సన్ విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే తల్లి అపస్మారక స్థితిలో ఉండడంతో లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు.ఈ విషయమై ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడు చలపతిని విచారించగా, తాను మూడు గంటల వరకు ఇంట్లోనే ఉన్నానని ఆమె ఉరి వేసుకొని చనిపోవడంతో తానే కిందకు దింపి ఇంటికి వెళ్లిపోయానని బదులు చెప్పాడు. అనంతరం తన తల్లి మృతి పై తాలూక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం మాలపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని ఆమెతో సహజీవనం చేస్తున్న చలపతి చంపేసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. -
హుండీ ద్వారా రూ. 5,93,203 ఆదాయం
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ. 5,93,203 ఆదాయం వచ్చింది. గురువారం స్థానిక ఆలయ ప్రాంగణంలో జిల్లా దేవదాయశాఖా అధికారి విశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులు రెండునెలలకు సంబందించిన హుండీ ఆదాయాన్ని లెక్కించారు.అలాగే కానుకల కింద 23 గ్రాముల బంగారు, 422 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చాయి. వీటితోపాటు మొదటిసారిగా 30 అమెరికన్ డాలర్లు అమ్మవారి హండీలో రావడం గమనార్హం. ఈ మొత్తాన్ని వాయల్పాడు సప్తగిరి గ్రామీణబ్యాంకులో జమచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల, సిబ్బంది బాలకృష్ణ, వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు తలనీలాల వేలం శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయంలో ఈనెల31న తలనీలాల వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించే తలనీలాలను సంవత్సరం పాటు సేకరించుకొనేందుకుగానూ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో జిల్లా దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలం పాటలు జరుగుతాయన్నారు. వేలం పాటలకు సంబంధించి ఈ టెండెర్,సీల్డ్టెండెర్లు వేయదలిచిన కాంట్రాక్టర్లు శనివారం 10.30 గంటల లోగా వేసుకోవాలన్నారు. వేలం పాటల్లో నేరుగా పాల్గోనేవారు ముందుగా రూ. 5లక్షలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు ఉద్యమం
మదనపల్లె : ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలని కోరుతూ ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు గ్రామాల్లో ప్రచారాలను నిర్వహిస్తున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్, సహాయ కార్యదర్శి కృష్ణప్ప అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కలిసి ఆందోళన కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ప్రతి కూలీకి పని కల్పించాలని ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్నారు. ఇప్పుడు కూలీలకు నష్టం చేసే వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మిగులు భూములు ప్రజలవని అది పేదలకు దక్కాలని అన్నారు. మంత్రి లోకేష్ ఆస్తులను ఎకరా 99 పైసలకే ఇచ్చుకోవచ్చని, ప్రభుత్వ భూములు ఇవ్వరాదని అన్నారు.రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళ ఉద్యోగి చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు మురళి, రెడ్డిశేఖర్ పాల్గొన్నారు. -
ప్రవేశాలకు వేళాయె
● గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ● 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణమదనపల్లె సిటీ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు.. పేద విద్యార్థుల ఆశా కిరణాలు. సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఈ ఏడాది 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి,ఇంటర్లో నూతన ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖా స్తుల స్వీకరణ ప్రారంభించారు. ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు విధానం ఇలా.. ● గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు www.apbragcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాస్పోర్టు ఫొటో, స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్తో వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 19వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ● 5వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునేవారికి 11 ఏళ్లలోపు ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి అడ్మిషన్ నాటికి 17 ఏళ్లకు మించకూడదు. ● తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు. ● 5వ తరగతిలో ఆడ్మిషన్లకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గురుకుల పాఠశాలలు ఇవే? జిల్లాలో బాలికల కోసం మదనపల్లె, రాయచోటి, సంబేపల్లి, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట, బురకాయలకోట, లక్కిరెడ్డిపల్లెల్లో 9 చోట్ల గురుకులాలున్నాయి. ప్రతి పాఠశాలలో ఎంపీసీ 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన నిర్వహిస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలున్నాయి. తాజాగా వచ్చే విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –మల్లీశ్వరి, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ, మదనపల్లె -
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పై జనసేన నాయకుడు దాడి
మదనపల్లె రూరల్ : ములకలచెరువు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి (65)పై జనసేన నాయకుడు, ఏపీ ఐసీసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్, అతని సోదరుడు మై ఫోర్స్ సంస్థ అధ్యక్షుడు ఉమేష్ దాడి చేశారు. గురువారం సాయంత్రం మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ ఎంజి గ్రాండ్ హోటల్ ఎదురుగా సంఘటన జరిగింది. ఈ విషయమై బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన మేరకు వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లెకు చెందిన ములకలచెరువు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం బి.కొత్తకోటలో నివాసం ఉంటున్నారు. గురువారం వ్యక్తిగత పనులపై కారులో మదనపల్లెకు వచ్చాడు. గొల్లపల్లి సర్కిల్ సమీపంలోని ఎంజీ గ్రాండ్ హోటల్ ఎదురుగా రోడ్డు పక్కన కారు పార్కింగ్ చేసి, హోటల్ పక్కనే ఉన్న లాడ్జీలోకి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు. ఈలోపు ఎంజీ హోటల్ నిర్వాహకులు, జనసేన నాయకుడు, ఏపీ ఐసీసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్,అతని సోదరుడు ఉమేష్ లు చంద్రశేఖర్ రెడ్డి కారు చక్రాలను లాక్ చేశారు. కిందికి దిగి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చంద్రశేఖర్రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. మహేష్ సోదరుడు ఉమేష్, కత్తితో దాడికి ప్రయత్నించడంతో చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు జిల్లా ఆసుపత్రికి చేరుకొని చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కాగా, జనసేన నాయకుడి దాడిలో గాయపడిన మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డిని, జనసేన పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు గంగారపు రాందాస్చౌదరి, మార్కెట్కమిటీ చైర్మన్ జంగాల శివరాం, కాంగ్రెస్ నాయకులు రెడ్డిసాహెబ్, వైఎస్సార్ సీపీ నాయకులు సీపీ.సుబ్బారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారు. -
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత
రాయచోటి : శాంతి భద్రతలతోపాటు వాటిని పర్యవేక్షించే పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ మొబిలైజేషన్ సందర్భంగా గురువారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఏఆర్ పోలీసులకు సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీసు యంత్రాంగం, సిబ్బంది సంక్షేమం దిశగా మరో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. సిబ్బందికి భరోసా ఇస్తూ ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకోవాలన్నారు. సమాజానికి మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ డి.లక్ష్మీప్రసాద్తో కలిసి ఏఆర్ డీఎస్పీ ఏడు కొండలరెడ్డి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీసు అధికారి హెల్త్ ప్రొఫైల్ను ట్రాక్ చేస్తున్నామని, విధి నిర్వహణలో అలసత్వానికి తావులేకుండా సిబ్బందిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వీజే రామకృష్ణ, ఆర్ఎస్ఐ జి రవి తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
పాఠశాలలో క్షుద్రపూజలు తెచ్చిన తంటా
● రెండురోజులుగా బడికి గైర్హాజరైన పిల్లలు ● తమ పిల్లలను పంపేది లేదన్న తల్లిదండ్రులు ● ఇళ్లవద్దకెళ్లి చైతన్యం కల్పిస్తున్న టీచర్లుచౌడేపల్లె : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోని కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసింది. పూజలు చేసిన స్థలంలో నడిచి వెళ్లిన ఓ విద్యార్థి వారం రోజుల్లో మృతిచెందడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ పాఠశాలకు కరణంవారిపల్లి, పలగార్లపల్లి, యనమసామనపల్లె, అన్నిపల్లి,పొన్నిపెంట, కాగతి నుంచి 96 మంది విద్యార్థులు వచ్చేవారు. ఈ ఘటనతో గత రెండు రోజులుగా పిల్లలు గైర్హాజరవ్వడంతో ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎంఈఓ లు కేశవరెడ్డి, తిరుమలమ్మలు చేరుకొని గ్రామస్తులు, తల్లిదండ్రులతో ఇంటిటికీ వెళ్లి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చారు. ఏమి జరిగిందంటే: కాగతి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పుష్పల కుమారుడు బి. జయదీప్ ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈనెల 18వతేదీ ఆదివారం మౌళి అమావాస రోజున అదే గ్రామానికి ఓ మహిళ మరో మహిళ సహాయంతో పాఠశాల ఆవరణలో ముగ్గు పోసి నిమ్మపండ్లు కోసి అక్షింతలు వేసి క్షుద్రపూజలు చేసింది. 19వతేదీ న పాఠశాలకు వెళ్లిన జయదీప్ మధ్యాహ్న భోజనసమయంలో క్షుద్రపూజలు చేసిన స్థలంలో పడి ఉన్న నిమ్మపండు, పూజా సామగ్రిని తొక్కడం, ఇంటికి వెళ్లిన చిన్నారి భయాందోళనకు గురై అస్వస్థతకు లోనయ్యాడు. పాఠశాలలోని సీసీ పుటేజీ ఆధారంగా ఉపాధ్యాయులు క్షుద్రపూజలు చేయడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాధు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడవకముందే వారం రోజులు గడవక ముందే ఈనెల 25న ఆదివారం జయదీప్ అకస్మాత్తుగా మృతిచెందాడు. తమ బిడ్డ క్షుద్రపూజలు చేసిన స్థలంలో దాటినందుకే మరణించాడని విద్యార్థి తల్లితండ్రులు శ్రీనివాసులు, పుష్పలు ఆరోపించారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో రెండు రోజులుగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు బంధువులు పట్టుబట్టారు.గ్రామంలో పెద్ద ల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోవడంతో గ్రామంలోని యువకులు, బంధువులు న్యాయం జరిగేవరకు పాఠశాలకు వెళ్లొద్దంటూ దారికి అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకొన్న ఎంఈఓలు కేశవరెడ్డి, తిరుమలమ్మలు కాగతికి చేరుకొన్నారు. గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. మూఢనమ్మకాలపై అపోహలు వీడాలని, పిల్లలను పాఠశాలకు పంపాలని అవగాహన కల్పించారు. 91 మందికి కేవలం 46 మంది మాత్రమే పాఠశాలకు హజరైనట్లు హెచ్ఎం దామోదర్ తెలిపారు. ఈ దారుణానికి యత్నించిన మహిళపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు జరిగిన పుత్ర శోకం మరే తండ్రికి జరగరాదంటూ జయదీప్ తల్లి తండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.తమకు న్యాయం చేయాలని డిమాండు చేస్తున్నారు.పాఠశాలకు చుట్టూ ప్రహరీ, మౌలిక వసతులుంటే ఈ ఘటన జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో కూడా పలుమార్లు పాఠశాల వరండాలో కొందరు మలమూత్ర విసర్జన చేయడం, మద్యం సీసాలు పగులకొట్టడం చేశారని, ఉన్నతాధికారులు, పాలకులు దృష్టిసారించాలని కోరుతున్నారు. -
భూముల మార్కెట్ విలువ పెంపు
మదనపల్లె రూరల్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న భూముల మార్కెట్ విలువలు పెంచుతూ మార్కెట్ రేట్స్ రివైజ్డ్ కమిటీ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఉత్తర్వులు ఇచ్చారని సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల మార్కెట్ విలువలు 10 నుంచి 20 శాతం వరకు పెంచారన్నారు. కట్టడాల విలువలు పెరుగుతాయన్నారు. పెరిగిన విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ భూములకు సంబంధించి గతంలో గజం ధర రూ.32,700 ఉంటే, ప్రస్తుతం రూ.36 వేలకు పెంచారన్నారు. మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో రెసిడెన్షియల్ భూములకు సంబంధించి గతంలో గజం ధర రూ.11వేలు ఉంటే, ఇప్పుడు రూ.13,200 కు పెంచినట్లు వివరించారు. మదనపల్లె రూరల్ మండలం పొన్నూటిపాళ్యంలో గతంలో రూ.3,900 ఉంటే, కొత్త ధర రూ.5,500 గా నిర్ణయించారన్నారు. బసినికొండ పంచాయతీలో గతంలో గజం ధర రూ.6,500 ఉంటే కొత్త ధర రూ.7,500 గా ఖరారు చేశారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటలో భూముల మార్కెట్ విలువల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువలు పెరగనున్న నేపథ్యంలో భూముల కొనుగోలుదారులు, అమ్మకందారులతో రిజిస్ట్రార్ కార్యాలయం, పరిసరాల్లో జనసందడి కనిపించింది. సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి -
మండల అధికారిపై పచ్చనేతల వీరంగం !
● అనుకూల కార్యదర్శికి మెమోనే కారణం ● కార్యాలయంలో విస్తుపోయిన సిబ్బంది ● మైనార్టీ అధికారిపై నేతల తీరు వివాదాస్పదంరాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ మండల అధికారిపై గురువారం రాజంపేట పచ్చనేతలు నానా దుర్భాషలాడి వీరంగం సృష్టించిన సంఘటన సర్వ త్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది విస్తుపోయారు. టీడీ పీ నేతల తీరు సిబ్బందిలో అసహనానికి దారితీసింది. తమపై టీడీపీ నేతల దర్పమేమిటని అధికారులు, సి బ్బంది మనోవేదన పడుతున్నారు. మైనార్టీకి చెందిన మండలస్థాయి అధికారిని పట్టుకొని కార్యాలయంలో టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు దూషించడంతో తోటి సిబ్బంది, ఉద్యోగులు మనసులు చివుక్కుమ న్నాయి. నేతల వైఖరిపై అదే పార్టీలో విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ముస్లిం అధికారి పట్ల టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఆ కార్యదర్శికి మెమో ఇవ్వడమే కారణమా? రూరల్ పరిధిలోని ఓ పంచాయతీ హద్దులోకి వచ్చే రైల్వేకోడూరు రహదారిలోని ఒక కమర్షియల్ భవనాన్ని రెసిడెన్సీగా చూపిన ఆరోపణలపై విజయవాడలోని సంబంధితశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అక్కడి నుంచి విచారణ చేయాల్సిందిగా సదరు మండల అధికారికి ఆదేశం వచ్చింది. ఈ విషయంపై సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మోమో ఇచ్చారు. ఈ కార్యదర్శి గత కొన్నేళ్లు ఆ పంచాయతీని పట్టుకొని వేలాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల పదోన్నతి వచ్చినా నిరాకరించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆమెకు అధికారపార్టీ నేతలు అండగా నిలిచారనే విమర్శలున్నాయి. ఈమెకు మెమో రావడంతో పచ్చనేతలకు కోపం వచ్చింది. అంతే తడవుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి, ఆ అధికారిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఆ మైనార్టీ అధికారి నిశ్చేష్టుడయ్యారు. గతంలో దళిత కమిషనరుపై.. రాజంపేట మున్సిపాలిటిలో దళిత కమిషనరు రాంబాబుపై కూడా పచ్చనేతలు గతంలో వీరంగం సృష్టించా రు. బాత్రూంలో పెట్టి గడియ వేశారు. ఆయన ఏకంగా పచ్చనేతలపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే ఈ లోపే అనారోగ్యం పాలుకావడంతో దీర్ఖకాలిక మెడికల్ లీవ్లో వెళ్లిపోయారు. ఇప్పుడు రాజంపేటలో అధికారులపై టీడీపీ నేతల పెత్తనం పెరిగిపోవడంతో, అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. కాగా, టీడీపీ నేతల దౌర్జన్యాలు జరుగుతున్న క్రమంలో అధికారులకు అండగా నిలబడే సంఘాలు కూడా కనుచూపు మేరలో లేవన్నది నిష్ఠూర సత్యం. -
రోడ్లపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు
కలెక్టర్ నిశాంత్ కుమార్మదనపల్లె రూరల్ : అన్నమయ్యజిల్లా కేంద్రం మదనపల్లె పట్టణంలో ప్రధాన రహదారుల్లో ఆక్రమణలు గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లెలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గురువారం కలెక్టరేట్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణితో కలిసి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యపై అధికారులతో చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల ప్రతిపాదన, బస్స్టాండ్లు మార్పు, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రదేశాలు, ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులు, బస్రూట్లు, పార్కింగ్ సమస్యలు, ఆక్రమణలు, వన్ వే సిస్టం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పాటయ్యాక, వాహనాలు, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో ట్రాఫిక్, రోడ్డు భద్రతా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీ వేళలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి అధికారులు సరైన ప్రణాళిక రూపొందించాలన్నారు. బెంగళూరు రోడ్డు నెహ్రూ స్కూల్ ఉంచి సొసైటీ కాలనీ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాలు మళ్లించేందుకు ముఖ్య రహదారుల్లో ఆక్రమణలు, విద్యుత్ స్తంభాలు, తీగలు తొలగింపుకు మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ శాఖలు సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ డైవర్షన్.... చిత్తూరు బస్టాండ్ను పుంగనూరు రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఏర్పాటుకు ప్రభుత్వభూములను గుర్తించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కడప, అనంతపురం వైపునకు వెళ్లే వాహనాలను రద్దీ వేళల్లో పట్టణంలోకి అనుమతించకుండా, చౌడేశ్వరి కల్యాణమండపం నుంచి రామారావు కాలనీ, గొల్లపల్లె క్రాస్ మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. మల్లికార్జున సర్కిల్ నుంచి ఎంఎస్ఆర్ థియేటర్ రోడ్డు మీదుగా బెంగళూరు బస్టాండ్ వరకు, చిత్తూరు బస్టాండు నుంచి హెచ్పీ గ్యాస్ ఆఫీసు మీదుగా చెంబకూరు రోడ్డు వరకు, సీటీఎంరోడ్డు మంజునాథ స్వామి ఆలయం నుంచి బర్మావీధి, కలెక్టరేట్ మీదుగా చిత్తూ రు బస్టాండ్కు వన్ వేగా నిర్ణయించారు. సీటీఎం రో డ్డు, బెంగళూరు బస్టాండ్, సొసైటీ కాలనీ నో పార్కింగ్ జోన్లుగా గుర్తించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, ఆర్అండ్బీ ఈఈ అరవిందాదేవి, టూటౌన్ సీఐ రాజారెడ్డి, ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఆర్టీసీ డీఎం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకాసురుడు !
రాజంపేట : చెయ్యేరు నదిలో ఇటాచీల జోరు ఊపందుకుంది. ఇసుక కోసం చెయ్యేరును చెరబెడుతున్నారు. టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుకరీచ్ల కొనసాగే విధంగా ముందుకెళుతున్నారని ఆరోపణలున్నాయి. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాలైన మందరం, ఎంజీ పురం, ఆడపూరు, కుమరనపల్లె ఇసుక రీచ్లు నిర్వహించనున్నారు. వీటిలో మందరం, కుమరనపల్లెలో రీచ్లు ప్రారంభమయ్యాయి. ఎంజీ పురంలో హద్దులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో ప్రజలకు, తనకు సంబంధం లేదన్నట్లు ఆ ముఖ్యనేత ముందుకెళుతున్నారు. అయితే పెట్టుబడి లేకుండా 30 శాతం ఇసుకరీచ్లో ఆయనకు భాగస్వామ్యం కల్పించారని సమాచారం. తనతో పాటు నెల్లూరు, రైల్వేకోడూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల వారిని భాగస్వామ్యులుగా చేసి చెయ్యేరును నిట్టనిలుపునా దోపిడీ చేస్తున్నారు. చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్లు సదరు రాజంపేట టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లో కొనసాగుతున్నాయి. ఆయన తెరవెనుక ఉండి రీచ్లను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంజీ పురం ఇసుకరీచ్ వివాదం చెయ్యేరు నదీ పరివాహక ప్రాంతమైన ఎంజీపురం(మదనగోపాలపురం)వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఇసుకరీచ్ వద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మైన్స్, అధికారులు ఎంజీపురం ఇసుకరీచ్ వద్దకు చేరుకొని హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేశారు. అయితే గ్రామస్తులు ఇసుక రీచ్ వల్ల తామంతా ఇబ్బంది పడతామని తెలిపారు. అయినా అధికారులు పై అధికారుల ఆదేశం మేరకు ఎంజీపురం ఇసుక రీచ్ వద్దకు వచ్చామని తెలిపారు. ఇసుకరీచ్ వల్ల తమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోతాయని, ఇసుక రవాణా వల్ల గ్రామస్తులు అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఇసుకరీచ్ను తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన ఒకరు ఇసుక రీచ్లోకి దిగారు. ఈ క్రమంలోనే ఎంజీపురం క్వారీ విషయంలో రైల్వేకోడూరు చెందిన వారిని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పచ్చనేత చేతిలో చెయ్యేరు ఇటాచీలతో ఇసుక తోడివేత ఎంజీపురంలో ఇసుకరీచ్ వివాదం ముఖ్యనేతకు పెట్టుబడి లేకుండా వాటా రీచ్ ఆదాయంలో 30శాతం భాగస్వామ్యం ఇసుక దోపిడీకి సిద్ధమైన రీచ్లు -
శభాష్.. సురేష్ !
● 9 ఏళ్ల నుంచి మంచంపైనే .. ● ఇంట్లోనే ఉంటూ ప్రిపేరై గ్రూప్–2కు ఎంపిక ప్రొద్దుటూరు : ఒకటి ..రెండు కాదు.. తొమ్మిదేళ్లుగా మంచానికే పరిమితమైన మోతుకూరి సురేష్బాబు గ్రూప్–2 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి శభాష్ అనిపించాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట వీధికి చెందిన సురేష్బాబు 2016లో ఆటో ఇమ్యూ న్ డిజార్డర్తో మంచానికే పరిమితమయ్యా డు. అనేక చోట్ల ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచే మంచానికే పరిమితమైన సురేష్బాబు 2018లో గ్రూప్–2 రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి ఈసారి పట్టు వదలని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో చదివాడు. ప్రస్తుతం సురేష్బాబు గ్రూప్–2 ఫలితాల్లో ఏపీ సెక్రటరీయేట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించాడు. పోలియోతో బాధపడుతున్న యూపీఎస్సీ ర్యాంకర్ బాలాలత స్ఫూర్తితో రోజుకు ఆరు గంటల పాటు చదివానని సురేష్ సాక్షికి తెలిపారు. -
హార్సిలీ హిల్స్ అభివృద్ధికి నీళ్లొదిరారు !
● మూతపడిన మినరల్ వాటర్ప్లాంట్ ● పడకేసిన పారిశుధ్య పనులు ● హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ సమావేశాల ఊసేలేని వైనం బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్లో అభివృద్ధి ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కటంటే ఒక్క హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ సమావేశం కూడా జరగలేదు. అసలు కమిటీని అధికారులు మరచిపోయారా అనే స్థితి నెలకొంది. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు మూతబడ్డాయి, పారిశుద్ధ్య నిర్వహణ, పాలనాపరమైన చర్యలు కనుమరుగయ్యాయి. కొండపై ఆక్రమణలు, అక్రమాలపై కన్నెత్తి చూసే పరిస్థితి కరువైంది. హార్సిలీహిల్స్ టౌన్షిప్ 2000లో ఏర్పాటైంది. దీనికి మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్, ఇతర డివిజన్ స్థాయి అధికారులు సభ్యులు, స్థానికులకు ముగ్గురు సభ్యులుగా చోటు కల్పించారు. ఈ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహించి ఇక్కడి సమస్యలు, అభివృద్ధిపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి. సభ్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా ఏర్పడ్డాక హార్సిలీహిల్స్ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మదనపల్లె ఆర్డీఓ, కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించడంతో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కూటమి పాలన వచ్చి 18 నెలలైనా ఇప్పటిదాక ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. వాటర్ ప్లాంట్ మూత స్విమ్మింగ్పూల్ వద్ద పర్యాటకులకు ఐదు రూపాయాలకే మినరల్ వాటర్ అందించేలా 2022లో అప్పటి కలెక్టర్ గిరీషా హార్సిలీహిల్స్పై మినరల్ వాటర్ప్లాంట్ను ప్రారంభించారు. నిర్వహణ బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగిస్తూ ఆదేశించారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఎంతో ఉపయోగంగా ఉండేది. తర్వాత గాలికి వదిలేయడంతో మూతపడింది. పర్యాటకులకు నీళ్లులేక బాటిల్ నీటిని రూ.20 పెట్టి కొంటున్నారు. పారిశుధ్య నిర్వహణ లేదు సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా 2022లో గత కలెక్టర్ గిరీషా, ఆర్డీఓ, మురళీలు చెత్త, ఖాళీబాటిళ్లు వ్యర్థాలను తొలగించేలా పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ప్రతిరోజూ కొండపై చెత్త, చెదారాన్ని సేకరించి తరలించేవారు. కూటమిపాలన మొదలయ్యాక పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. చెత్త, చెదారం..మద్యం బాటిళ్లు రోడ్లపై, ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. తొలగించేందుకు కార్మికులు లేకపోవడంతో నిర్వహణ పూర్తిగా పడకేసింది. వెలగని లైట్లు గత ప్రభుత్వంలో రూ.14 లక్షల ఖర్చుతో హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వారి భధ్రత కోసం గాలిబండ, జిడ్డు సర్కిల్, రెవెన్యూ అతిథిగృహం, ఏనుగుమల్లమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కూడా కరువైంది. లైట్లు వెలగక చీకట్లు నెలకొంటున్నాయి. గాలిబండపై వ్యూ పాయింట్, షాపింగ్ కాంప్లెక్స్, సందర్శకులకు ప్రమాదం జరగకుండా ఫెన్సింగ్ పనులకు రూ.30 లక్షల అంచనాతో పనులు పర్యావరణ పరిరక్షణకు కొండపై సందర్శకులు తిరిగేందుకు త్వరలో ఐదు ఈవీ కార్లు, 50 బైక్లు కొండపై టూరిజం శాఖ సరఫరా చేస్తున్న తాగునీటికి మీటర్ల ఏర్పాటు, వినియోగం బట్టి చార్జ్ వసూలు హార్సిలీహిల్స్పై పర్యవేక్షణ, విధుల నిర్వహణకు ప్రత్యేకంగా ఒక పరిపాలనా అధికారి నియామకం సామూహిక మరుగుదొడ్లు నిర్మాణం, స్పోర్ట్స్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటుకు టెండర్లు రూ.42 లక్షలతో ఉద్యానవనం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు, పూలమొక్కల పెంపకం. రోడ్లపై ఆక్రమణల తొలగింపులో నష్టపోయిన బాధితులకు 10 గదులతో వాణిజ్య సముదాయం నిర్మాణం కొండపై ఏపని చేపట్టాలన్న కమిటీ ఆమోదం తప్పనిసరి లేదంటే కఠినచర్యలు రెవెన్యూశాఖ కేటాయించిన భూములు సద్వినియోగం చేసుకోనిపక్షంలో తిరిగి స్వాధీనం కోర్టుకేసుల్లోని భవనాలకు మినహా మిగిలిన అన్నిశాఖల భవనాలు, అతిథిగృహలు, టూరిజం భవనాలకు ఆస్తిపన్ను విధించి ఇంటి నంబర్లు కొండపై సందర్శకుల భధ్రత కోసం సీసీ కెమరాల ఏర్పాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం నిత్య పారిశుధ్య పనుల కోసం 8 మంది సిబ్బంది నియామకం, ప్లాస్టిక్ వాడకం నిషేధం శని, ఆదివారాల్లో హార్సిలీకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఘాట్రోడ్డులో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, సురక్షిత చర్యలు. టౌన్షిప్ కమిటీ సమావేశాలను నిర్వహించి హార్సిలీహిల్స్పై ఏమి జరుగుతోంది, ఇక్కడి పరిస్థితులు ఏమిటి అన్నదానిపై సమీక్షించాల్సి ఉంది. తద్వారా ఇక్కడ చేపట్టాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారంపై కృషి చేయాలి. గతంలోని కఠిన నిబంధనలు కొనసాగించి ఆక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. -
ఘనంగా రామయ్య గ్రామోత్సవం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం టీటీడీ అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని మూల విరాట్కు ఆరాధన, విశేష సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణము, చతుర్వేద పారాయణము నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పీఠంపై ఆశీనులు చేసి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి.. తులసి గజమాలలతో సుందరంగా అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో అడుగడుగునా భక్తులు స్వామి వారికి కాయ, కర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, మనోజ్ పాల్గొన్నారు. రామయ్య సన్నిధిలో ఏపీఆర్ఈఆర్ఏ సభ్యులు ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిలుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఏపీఆర్ఈఆర్ఏ) గౌరవ సభ్యులు ఇ. రాజశేఖర రెడ్డి, యు.ఎస్.ఎల్.ఎన్ కామేశ్వర రావు దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
అక్క కల నెరవేర్చిన తమ్ముడు
పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన యాదసంద్రం సురేష్ గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించాడు. గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన తన సోదరి మాధవి సహకారం, ప్రోత్సాహంతో గ్రూప్ 2 పరీక్షలు రాసి డిప్యూటి తహశీల్దార్గా ఎంపికయ్యాడు. కాగా అంతకుముందు తిరుపతి సమీపంలోని గాజులమండ్యం వద్ద ఉన్న మల్లాడి డ్రగ్స్ ఫార్మాసిటికల్స్లో కెమికల్ ఇంజనీర్గా పని చేసేవాడు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మిషన్ బ్లాస్ట్ కావడంతో సురేష్ కుడిచేయి దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకు గాయాలను చూసి చలించిపోయిన తండ్రి సిద్దప్ప తనకున్న ఎకరా పొలాన్ని అమ్మి కొడుకుకు వైద్య పరీక్షలు చేయించి గాయాలను మాన్పించాడు. కాగా 2020లో తన సోదరి మాధవి భర్త నాగరాజు, 2022లో తండ్రి సిద్దప్ప మృతి చెందారు. ఈ క్రమంలో సోదరి మాధవి తమ్ముడిని చిన్న ఉద్యోగం కాకుండా ఉన్నత స్థాయిలో చూడాలనుకుంది. దీంతో ఆమె మదనపల్లిలోని ఓ హోటల్లో పని చేస్తూ సోదరుడు సురేష్ ఉన్నత చదువులకు అన్ని విధాలా ప్రోత్సహించింది. సురేష్ కూడా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సెలవు పెట్టి గ్రూప్ 2కు ప్రిపేరై విజయం సాధించాడు. తాను ఈ విజయం సాధించడానికి తన సోదరి మాధవి కారణమని సురేష్ కంటతడితో చెప్పారు. -
చెయ్యేరులో ఇసుక‘రాజు’ల రచ్చ!
● ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుకదందా ● ఠాణాను తాకిన గొడవ ● ముఖ్య నేతపై పార్టీలో తిరుగుబావుటారాజంపేట : చెయ్యేరు నది ఇప్పుడు ఇసుకాసురుల చేతిలో చిక్కి శల్యమవుతోంది. అధికారపార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఇసుక చిచ్చురేపుతోంది. చెయ్యేరు నదిలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యనేత బ్యాక్రౌండ్తో ఇసుక అక్రమదందా కొనసాగుతోందన్న విమర్శలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.గత కొద్ది రోజుల నుంచి క్వారీలో ఇసుక తరలింపు అంశం తమ్ముళ్ల మధ్య చిచ్చురేపుతోంది.చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతమైన ఎంజీపురానికి చెందిన ఇసుక క్వారీ ఒకే సామాజికవర్గానికి చెందిన ఒకరికి ముఖ్యనేత అనుకూలం కాగా, మరోనేత దానిని వ్యతిరేకించారు. ● మందరం, కిచ్చమాంబపురం, శేషామాంబపురం ప్రాంతాల్లో ఇసుక రీచ్లు గతంలో కొనసాగిన సంగతి తెలిసిందే. మందరం, అత్తిరాల, ఎంజీపురం, కిచ్చమాంబపురం గ్రామాలు చెయ్యేరు రివర్బెడ్లో ఉండటం వల్ల ఏ రూట్లో అయినా ఇసుకను అక్రమంగా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. చెయ్యేరు నదీపరీవాహక ప్రాంతంలో ఏటిసాలు పొరంబోకులో తోటలు ఉన్నాయి. ఈ తోటలు కూడా ఇసుకాసురులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక తోటలో ఇసుక తరలింపును క్షత్రియ సామాజికవర్గానికి చెందిన నేత అనుచరులు మంగళవారం అడ్డుకున్నారు. అక్కడ క్వారీకి సంబంధించిన సిబ్బందిపై చేయిచేసుకున్నట్లు తెలిసింది. ఇసుక తరలింపును సెల్లో వీడియో తీస్తుండగా.. స్ధానికుడైన ఒకరి తోటలో ఇసుక తరలింపు వ్యవహారాన్ని తన మొబైల్లో వీడియో తీస్తుండగా క్వారీ సిబ్బంది అడ్డుకొని లాక్కోవడం ఘర్షణకు దారితీసింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం ఇసుక క్వారీ బ్యాక్రౌండ్లో నడిపిస్తున్న టీడీపీ ముఖ్యనేతకు చేరింది. వెంటనే రంగంలోకి దిగారు. పోలీసు అధికారికి సమాచారం ఇచ్చారు. అక్కడున్న వారిని తీసుకొచ్చి కేసు పెట్టి లోపల వేయాలని ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు. సంఘటన స్థలంలో అప్పటికే ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మరో ముఖ్యనేత ఫోన్లో ఇసుకరచ్చపై టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేతతో సంభాషించారు. వారిద్దరి మధ్య ఫోన్లో వాదోపవాదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. నీవెంత..అంటే నీవెంత అంటూ సవాల్ చేసుకున్నారు. తన మంది మార్బలంతో క్షత్రియసామాజికవర్గానికి చెందిన రాష్ట్ర నాయకుడు పోలీసుప్టేషన్కు చేసుకున్నారు. మాపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానం దృష్టికి ఇసుక రవాణా వ్యవహారం వెళుతుందనే భావనతో ముఖ్యనేత తన వైఖరిని మార్చుకున్నట్లు సమాచారం. ముఖ్యనేత ఆదేశంతో పట్టణానికి చెందిన టీడీపీ నేతలు ఇద్దరిని స్టేషన్ వద్దకు పంపించారు. అప్పటికే స్టేషన్ వద్ద కేసులు పెట్టడానికి, పెట్టించుకోవడానికి సిద్ధమై వచ్చిన క్షత్రియ నేత, తన అనచరులతో పట్టణ దూతలు భేటీ అయ్యారు. మా అంతర్గత సమస్య మేము పరిష్కరించుకుంటామని పోలీసు అధికారికి నచ్చచెపుకున్నట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. ● చెయ్యేరు నదీలో ఇసుక రీచ్లు ఎన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయనేది ఇంతవరకు అధికారులు తెలియచేయలేదు. గతంలో ఇసుక క్వారీలు చెయ్యేరులో ఎక్కడెక్కడున్నాయనే విషయాన్ని పత్రికల ద్వారా రీచ్ల ప్రారంభసమయంలో సంబంధిత అధికారులు తెలిపేవారు. వైఎస్సార్సీపీ పాలనలో మందరం, కిచ్చమాంబపురం తదితర ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ సైతం సందర్శించి, డంప్, తరలింపును పరిశీలించారు.. అయితే ఇప్పుడు ఆ రీచ్ల వద్ద ఏ అధికారులు, ఏ శాఖ పర్యవేక్షిస్తుందో కూడా జనానికి తెలియని పరిస్ధితి. అనుమతులు ఎక్కడ నుంచి వస్తాయో, ఎవరికి కేటాయించారో కూడా అధికారికంగా తెలియడంలేదు. నెల్లూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వేకోడూరుకు చెందిన ప్రాంతాలకు చెందిన వారు క్వారీలు రన్ చేస్తున్నారని చెపుతారు. ఎదీ ఎమైనప్పటికి ఇసుక క్వారీల విషయంలో స్పష్టత అయితే లేదన్న తమ్ముళ్లే మదనపడుతున్నారు. క్వారీ నిబంధనలు ఎప్పుడో గాలిలో కలిసిపోయాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుకు తరలించాలనే నిబంధన ఉన్నప్పటికి రాత్రి, తెల్లవారుజాము అనే తేడా లేకుండా లక్షలాది క్యూబిక్మీటర్ల ఇసుకను మింగేశారు.అడిగే నాథుడు కరుమయ్యారు. పర్యవేక్షణ చేసే అధికారులు జాడ కనిపించడంలేదు. -
ప్రాజెక్టులపై కనికరిస్తారా !
మదనపల్లె : సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికి చంద్రబాబు సర్కార్ సహకరిస్తుందా, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్కడప, చిత్తూరుజిల్లాలో కీలకమైన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, ఇతర ప్రాజెక్టుల పనులౖపై, దానికవసరమయ్యే నిధులు, పెండింగ్ బిల్లులు, బకాయిలు తదితర వాటిని లెక్కిస్తూ 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు ఎంతకావాలో కోరుతూ ప్రాజెక్టుల ఉన్నతస్థాయి అధికారులు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఈ నివేదికలపై గురువారం అమరావతిలో ఆర్థికశాఖ కార్యదర్శులు, జలవనరులశాఖ ఈఎన్సీ, సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక అంశాలపై చర్చించి ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు ప్రతిపాదించారు, ఎంత నిధులు అవసరం తదితర విషయాలు బడ్జెట్ కేటాయింపు ప్రకటనలో తేలనున్నాయి. హెచ్ఎస్ఎస్కు రూ.2,500 కోట్లు హంద్రీ–నీవా మొదటి, రెండోదశ పనులకు రూ.2,500 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానకాలువ వెడల్పు, లైనింగ్ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.695 కోట్ల పనులు దాదాపుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీనికి రూ.150 కోట్ల బిల్లులు, రెండోదశలో ఉమ్మడిచిత్తూరుజిల్లాలో పీబీసీ లైనింగ్ పనులకు రూ.130 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్అండ్ఆర్కు రూ.80 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇవికాక హంద్రీ–నీవా ఎత్తిపోతల పథకాలు వినియోగించినందుకు విద్యుత్ బకాయిలే రూ.1,800 కోట్లదాక ఉన్నట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఈ లెక్కన అధికారులు రూ.2,500 కోట్లు కావాలని ప్రతిపాదించినా ఆస్థాయిలో నిధులు కేటాయింపు అవసరమైతే ఉంది. మొదటిదశ పనుల పరిస్థితి ఎలా ఉన్నా, రెండో దశ ప్రాజెక్టు సాగే ఉమ్మడిచిత్తూరు, వైఎస్సార్కడప జిల్లాల్లో జరగాల్సిన ప్రధానకాలువ, నీవా ఉపకాలువ పనులకు రూ.925 కోట్లు కావాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ఇవికాక ఉమ్మడిచిత్తూరుజిల్లాలో అసంపూర్తిగా మిగిలిన ఉపకాలువలు, డిస్ట్రీబ్యూటరీ పనులకు ప్రతిపాదనలు ఇవ్వలేదు. వీటిని కలిపితే ప్రాజెక్టు పనుల విలువ పెరిగిపోతుంది. మొత్తం ప్రాజెక్టులో సాగుతున్న పనుల పూర్తికి రూ.5వేల కోట్లదాక అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిన నిధులు కేటాయింపు జరక్కపోతే పనులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మొక్కుబడి నిధులు ఇస్తే బకాయిలు, వేతనాలు, ఖర్చులకే సరిపోతాయి. నిధుల కేటాయింపులపైనే ప్రాజెక్టు పనులు ఆధారపడి ఉన్నాయి. గాలేరు–నగరికి రూ.2,460 కోట్లు గాలేరు–నగరి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కార్ ప్రస్తుత బడ్జెట్లో రూ.307 కోట్లు కేటాయించగా అంతటితోనే పనులు ముగించారు. దీనికి బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్కడప, చిత్తూరుజిల్లాలకు కీలకమైన ఈ ప్రాజెక్టు పనులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే బడ్జెట్లో రూ.2,460 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ నిధులతో ప్రాజెక్టు పనులు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే జూన్లో చిత్తూరుకు కృష్ణాజలాలను ఈ ప్రాజెక్టు ద్వారానే తరలిస్తామని నగరిలో జరిగిన సభలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ తరహాలో నిధులు కేటాయింపు జరిగితే ప్రాజెక్టు పనులు అడుగుకూడా ముందుకు పడే పరిస్థితులు ఉండవు. హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చాలంటే ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించాల్సిందే. దీనికితోడు గండికోట రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు పనులు పెండింగ్లో పెట్టారు. వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో మొక్కుబడి నిధులిస్తే ప్రాజెక్టును అటకెక్కించినట్టే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి హంద్రీ–నీవా ప్రాజెక్టు అనుసంధాన పనులు ఆపివేయించిన ఫలిత ప్రభావం కనిపిస్తోంది. కాగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం రూ.146 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. అనుసంధానం ఏమౌతుందో ఉమ్మడి వైఎస్సార్కడప, చిత్తూరుజిల్లా కరువురైతుల తలరాతలను మార్చే గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల అనుసంధానం పనులపై బడ్జెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. వచ్చే బడ్జెట్లో కేటాయింపుల కోసం ఆర్థికశాఖకు నివేదన నేడు ఆర్థికశాఖ కార్యదర్శులు, ఈఎన్సీ, సీఈల సమావేశంలో కేటాయింపులపై చర్చలు ప్రాజెక్టుల పూర్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు -
వీహెచ్ఏ అధికారి రంగనాథ్ సస్పెన్షన్
● అర్హులైన రైతులకు పరిహారం అందించాలి ● అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు తొండూరు : ఖరీఫ్లో ఉల్లి పంట నష్టపోయిన చాలా మంది రైతులకు నష్ట పరిహారం అందలేదు. అర్హులైన రైతుల పేర్లను జాబితాలో నమోదు చేయకుండా వీహెచ్ఏ రంగనాథ్ పంట సాగు చేయని రైతులతో డబ్బులు తీసుకుని వారి పేర్లు చేర్చి అవకతవకలకు పాల్పడ్డారు. ఈ అంశంపై సాక్షిలో ‘పరిహారం – పరిహారం’శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించి వీహెచ్ఏ రంగనాథ్ను సస్పెండ్ చేయాలని జిల్లా ఉద్యాన శాఖ డీడీ సతీష్కు ఫిర్యాదు చేశారు. దీనికి సతీష్ స్పందిస్తూ వీహెచ్ఏను విధులనుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉల్లి రైతుల సమస్యకు సంబంధించి బుధవారం పులివెందులలో ఉన్న ఉద్యాన శాఖ కార్యాలయంలో ముద్దనూరు హార్టికల్చర్ అధికారి మల్లేశ్వరరెడ్డి, తొండూరు వ్యవసాయాధికారి రాజులతో వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు రామమునిరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్ బాలగంగిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి కలిశారు. సంతకొవ్వూరు, ఎస్.చెర్లోపల్లె, గంగనపల్లె గ్రామాల్లో సాగు చేసిన ఉల్లి పంట అవకతవకలపై అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్లో సాగు చేసిన ఉల్లి పంట పరిహారం అర్హులైన రైతులకు అందించాలన్నారు. -
నీటి నిల్వ పనులకే ప్రాధాన్యత
– డ్వామా పీడీ వెంకటరత్నం పెద్దమండ్యం : జీరామ్జీ పథకం ద్వారా వర్షం నీరు నిల్వ చేసుకునే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. మండలంలోని కలిచెర్లలో జరుగుతున్న కందకాల పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేపడుతున్న పనులు, వేతనాలపై కూలీలకు అవగాహన కల్పించారు. వర్షం నీటి నిల్వకోసం పనులు విరివిగా చేపట్టాలన్నారు. ప్రతి రోజు 5 గంటల పాటు పని చేసి రూ.300 లు వేతనం పొందాలని కూలీలకు సూచించారు. అలాగే 5 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు పండ్లతోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాడి రైతులు పశుగ్రాసం పెంచుకొనేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. వాటర్షెడ్ పథకంలో చేపట్టిన ఫారంపాండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూలీలకు సకాలంలో పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నందకుమార్రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్రావు, ఏపీవో సురేంద్రనాఽథ్రెడ్డి, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. నేడు భీష్మ ఏకాదశి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో గురువారం ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి, వైభవంగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కడప రాయుడికి ఘనంగా పుష్పయాగం
భక్తుల సమక్షంలో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహిస్తున్న అర్చకులుకడప సెవెన్రోడ్స్ : తిరుమల తొలిగడపలో వెలిసిన కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారంతో సమాప్తమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి పుష్పయాగం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం భక్తులను పరవశింపజేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజూ కస్తూరి, కర్పూర, చందన పరిమళాలతో నిండి ఉండే ఆ ప్రాంగణంలో నేడు పలు రకాల సుమ సుగంధాలు మరింత సమ్మోహన పరిచాయి. నల్లనయ్య అందాన్ని చూసి తెల్లబోయిన మల్లెలు, ఆయన నాజూకుతనం చూసి సిగ్గుల మొగ్గలైన సన్నజాజులు, ఎంత చక్కని రూపమంటూ రేకులు విప్పార్చుకుని చూసిన సంపెంగలు, ఆ సుకుమారుడిని తాకి మరింత మృదువుగా మారిన గులాబీలు, ఆ దివ్య సన్నిధిలో చోటు లభించినందుకు అంబరాన్ని అంటిన సంబరంతో కనకాంబరాలు, అదే భాగ్యమని పరవశిస్తున్న బంతులు, చామంతులు ఇంకా...ఇంకా...ఎన్నోన్నో పూలు, ఎన్నెన్నో సువాసనల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. కడప రాయుడిని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఇరువైపులా దేవేరులతో కొలువుదీరిన వీరికి ప్రత్యేక పూజలు చేసి యాగాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, కలువలు, కనకాంబరాలు, బంతులు, చామంతులు తదితర పుష్పాలు, తులసి, మరువం, దవనం లాంటి పరిమళ దళాలు యాగం కోసం ప్రత్యేకంగా బుట్టల కొద్దీ తీసుకొచ్చారు. మంత్రోచ్ఛారణల మధ్య ఒక్కో రకం పూలతో స్వామి, అమ్మవార్లను అభిషేకిస్తూ ఎదురుగా, వరుసగా ఆ వేదికపై వాలుగా ఆ పూలను పేర్చారు. పలువురు భక్తులు కూడా ఈ యాగానికి భక్తితో పువ్వులు సమర్పించారు. సేగు, ద్రాక్ష, బత్తాయిలు, కమలాలు, దానిమ్మ తదితర ఫలాలతో పూల మధ్య తిరునామాన్ని తీర్చిదిద్దారు. వాద్య విద్వాంసులు సప్త స్వరాలను ఆలపిస్తుండగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయ అధికారులు, మాజీ చైర్మన్లు, పాతకడప, దేవునికడప గ్రామాల పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు -
ఫెయిల్ భయంతోనే వెళ్లిపోయారు
● చలికి తట్టుకోలేక, ఇంటివద్ద ఉండాలని గురుకులం నుంచి అదృశ్యమయ్యారు ● కౌన్సెలింగ్ ఇచ్చిన ఎంఈఓ, ప్రిన్సిపాల్బి.కొత్తకోట : బి.కొత్తకోట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి అదృశ్యమైన 8 మంది ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు..దీనికి వివిధ కారణాలను వెల్లడించారు. ఏడుగురు బుధవారం గురుకులానికి చేరుకోగా ఒకరు రావాల్సి ఉంది. తిరిగి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎంఈఓ–2 భీమేశ్వరాచారీ, ప్రిన్సిపాల్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. గురుకులం నుంచి ఎందుకు వెళ్లిపోయారు అన్న అంశంపై వారినుంచే వివరాలను రాబట్టారు. వీరిలో నలుగురు విద్యార్థులు బాగా చదివేవారే అయినప్పటికి పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్న భయంతో వెళ్లారు. ఇద్దరు విద్యార్థులు సడ్డీ అవర్లో చలిలో నిద్రలేవడానికి ఇబ్బందులు పడుతున్నామని అందుకనే వెళ్లిపోయినట్టు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు పాఠశాలలో ఉండి చదువుకోలేనని, ఇంటి వద్ద ఉండి చదువుకుంటానని కారణాలు చెప్పగా మరోక విద్యార్థి సాయంత్రం వరకు గురుకులం చే రలేదు. ఏడుగురితో సమావేశమైన అధికారులు..ఇలా చేయడం సరైన పద్దతి కాదని ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి లేదా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిందని చెప్పారు. ఉన్నపళంగా అదృశ్యమైతే దీనికి ఎవరు బాధ్యులెవరైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సి వచ్చిందన్నారు. ఇలా ఇకపై వ్యవహరించ వద్దనిసూచించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని, పరీక్షలంటే భయంవల్ల, వాతావరణ ఇబ్బందులుంటే ఉపాద్యాయులతో చెప్పుకుంటే వాటికి తగిన విధంగా సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల విడుదల రాణించిన జిల్లా యువత
పేదరికం వెక్కిరిస్తున్నా.. కష్టాలు ఎక్కిళ్లు తెప్పిస్తున్నా వారు వెనకడుగు వేయలేదు.. ‘పుస్తకాన్నే’ సమస్తంగా మార్చుకుని.. అందులోని పాఠాన్నే ఇష్టంగా మలుచుకుని రాత్రింబవళ్లు మనసు పెట్టి చదివారు... సాధనే సోపానంగా చేసుకుని.. విజయమే లక్ష్యంగా పైకెదిగారు. సంకల్ప బలం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన విజేతలు వారు.. బుధవారం విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ‘కొలువులు’ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. కడప సెవెన్రోడ్స్/కడప ఎడ్యుకేషన్: పట్టుదల, ప్రణాళికబద్ధమెన కృషి ఉంటే ఎంతటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించగలమని జిల్లా యువత మరోమారు రుజువు చేసింది. బుధవారం విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. పలువురు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో చాలామంది సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఇతర చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉండడం విశేషం. జిల్లాలోని కడప, ఖాజీపేట, జమ్మలమడుగు, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ పరీక్షలో తమ ప్రతిభ చాటారు. -
గ్రామీణ బ్యాంక్లో చోరీకి యత్నం
రొంపిచెర్ల : రొంపిచెర్ల సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో సోమవారం రాత్రి చోరీ యత్నం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని బజారువీధిలోని ఓ.వెంకటరత్నం భవనంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి దొంగలు బ్యాంక్ లాకర్ల వైపు ఉన్న కిటికీలు పగలగొడుతుండగా శబ్దం విని పక్కనే ఉన్న బాల సుబ్రమణ్యం కేకలు వేయడంలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. మంగళవారం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో బుధవారం విధులకు వచ్చిన బ్యాంకర్లు విషయం తెలుసుకుని రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీఎస్టీ కేసులో ఆంధ్రజ్యోతి విలేకరికి నాలుగేళ్ల జైలు!
రాజంపేట : రాజంపేటపురపాలికసంఘంలో స్వీపర్గా పనిచేస్తున్న చెవూరి సురేష్(మాదిగ)పై చేయిచేసుకున్నందుకు రాజంపేట ఆంధ్రజ్యోతి టౌన్ విలేకరికిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన నేపథ్యంలో నేరం రుజువు కావడంతో నాలుగేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ1000 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ –4 ఎడీజె న్యాయమూరి జీ.దీనబాబు తీర్పు ఇచ్చారు. ఈ మేరకు పట్టణ పోలీసుస్టేషన్ బుధవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. రాజంపేట పురపాలికసంఘంలో స్వీపర్గా పనిచేస్తున్న చెవూరి సురేష్ (రాజంపేట పట్టణ ఈడిగపాలెం), మస్తాన్ అనే వ్యక్తికి రూ.1000 బాకీ ఉన్నాడు. 25.07.2021న మధ్యాహ్నం తన విధులు ముగించుకొని ఇంటికిపోతున్న క్రమంలో మస్తాన్ సెల్షాపు వద్దకు పోగా, అక్కడ మస్తాన్ తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వమని అడిగారు. రేపు లేదా ఎల్లుండి ఇస్తానన్నారు. అక్కడే ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరి ఉదయగిరి కళ్యాణ్ (రాజంపేట టౌన్ సాయినగర్) వాడితో ఎందీ మాట్లాడేది మోటారు సైకిల్ తీసుకొమని చెప్పారు. అందుకు సురేష్ నా మోటారు సైకిల్ తీసుకుంటారా అడిగారు. కళ్యాణ్ తన చేత్తో సురేష్ చెంపపై కొట్టాడు. కులంపేరుతో దూషించాడు. బాధితుడు రాజంపేట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి రాజంపేట టౌన్ ఎస్ఐ ప్రసాద్రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి రాజంపేట డీఎస్పీ శివభాస్కర్రెడ్డి కేసు విచారణ చేపట్టారు. నిందితుడు కళ్యాణ్ ను అరెస్టు చేసి, చార్జీషీటును కోర్టులో దాఖాలు చేశారు. ఎస్సీ ఎస్టీ కోర్టు –4 ఏడీజె కోర్టు న్యాయమూర్తి దీనబాబు సాక్షులను విచారించారు. నేరం నిరూపణ కావడంతో నిందితుడు ఉదయగిరి కళ్యాణ్కు 4 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ ఎల్.బాలాజీ, అప్పటి డీఎస్పీ శివభాస్కర్రెడ్డి, కోర్టులో సాక్షులను సక్రమంగా హాజరుపరిచి, నిందితుడికి శిక్ష పడడానికి కారణమైన కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్కానిస్టేబుల్ ఎం.సుబ్బరాయుడు, వెంకటేశ్వరరెడ్డి, తిరుపతయ్యలను ప్రస్తుత రాజంపేట ఎఎస్పీ మనోజ్రామ్నాఽథ్హెగ్డే, రాజంపేట సీఐ నాగార్జునలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్లు సిబ్బందిని అభినందించారు. -
రోడ్డుప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు
పుంగనూరు : మండలంలోని సుగాలిమిట్ట అంగన్వాడీ కేంద్రం సమీపంలో వస్తున్న బాలుడిని బుధవారం బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.సుగాలిమిట్టకు చెందిన నరేష్నాయక్ కుమారుడు అన్వేష్(4) బాలుడిని అవ్వ లక్ష్మమ్మ అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా మదనపల్లె నుంచి చిత్తూరుకు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు బాలుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కోలారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనం ఢీకొని.. కలకడ : బొలెరో పికప్ పాల వాహనం ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని కోన పంచాయతీ, బంగారువాండ్లపల్లె సమీపంలో జరిగింది. క్షతగాత్రుడి తండ్రి షేక్.అక్బర్బాషా తెలిపిన వివరాలమేరకు బంగారువాండ్లపల్లె గ్రామానికి చెందిన షేక్.బాబ్జీ మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో కోన గ్రామానికి ద్విచక్రవాహనంలో వచ్చి తిరిగి వెళుతుండగా క్రిష్ణారెడ్డి మామిడితోపు వద్ద వెనుక వైపు నుంచి కోన గ్రామం నుంచి గుర్రంకొండ వైపు వెళుతున్న బొలెరో పికప్ పాలవాహనం ఢీ కొంది. దీంతో షేక్.బాబ్జి తల, శరీరంపై తీవ్ర అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కలికిరి మండలం, మహల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పీలేరు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు.షేక్ బాబ్జీ తండ్రి బుధవారం కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్షాక్తో రైతుకు.. మదనపల్లె రూరల్ : విద్యుత్షాక్తో రైతు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లెకు చెందిన రైతు పాండు(45) రాత్రి కరెంటు ఉండటంతో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్ ఆన్చేసేందుకు ప్రయత్నించగా విద్యుత్షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితుడిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు, బైక్ ఢీ:వ్యక్తికి గాయాలు చిన్నమండెం : మండల పరిధిలోని బెంగళూరు–కడప జాతీయ ప్రధాన రహదారిపై వండాడి క్రాస్ వద్ద కారు ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు ప్రొద్దుటూరుకు చెందిన గుర్రప్ప అనే వ్యక్తి రాయచోటి నుంచి బైక్లో చిన్నమండెం వస్తుండగా చిన్నమండెం నుండి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొనడంతో గుర్రప్ప కాలికి గాయాలయ్యాయి.అతన్ని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు సమాచారం రాలేదు. నాటు బాంబు పేలి పాడి ఆవుకు తీవ్ర గాయాలు చౌడేపల్లె : నాటు బాంబు (నల్లమందు ఉంట) పేలి పాడి ఆవుకు తీవ్ర గాయాలైన సంఘటన దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బుటకపల్లెకు చెందిన ఆర్. వెంకటరమణ పాడి ఆవులను మేతకోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లాడు. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఆవు కొరకడంతో పేలి శబ్దం వచ్చింది. పశువుల కాపరులు గుర్తించగా పాడి ఆవు తీవ్రంగా గాయపడింది. ఇటీవల కాలంలో అటవీప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో వేటగాళ్లు వన్యమృగాలను వేటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. అక్కపై తమ్ముడి దాడినిమ్మనపల్లె : ఆస్తి వివాదాల కారణంగా అక్కపై తమ్ముడు దాడిచేసిన ఘటన బుధవారం సాయంత్రం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. రాచవేటివారిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప భార్య రెడ్డెమ్మ(50)కు తన తమ్ముడైన మంజునాథతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం కూలిపనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన రెడ్డెమ్మను మంజునాథ భార్య అకారణంగా తిట్టడం మొదలుపెట్టింది. ఈ విషయమై రెడ్డెమ్మ మధ్యవర్తికి ఫిర్యాదుచేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇంతలో అక్కడకు వచ్చిన మంజునాథ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న కర్ర తీసుకుని విచక్షణారహితంగా రెడ్డెమ్మపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో రెడ్డెమ్మ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని తిరుపతికి రెఫర్ చేశారు. -
వాహనం ఢీకొని జింక మృతి
పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని బాంబే ఎస్టేట్ సమీపంలో బుధవారం ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. రోడ్డు దాటే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. భార్యగొంతుకోసిన భర్తపుంగనూరు : భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంగళం గ్రామంలో నివాసం ఉన్న అశోక్, మౌనికలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇలా ఉండగా మౌనిక పై అశోక్ అనుమానం పెంచుకుని నిత్యం ఆమెను వేదించేవాడు. ఇలా ఉండగా ఉదయం మౌనిక ఇంట్లో పనులు చేసుకుంటుడగా అశోక్ కత్తి తీసుకుని భార్య మెడపై నరికాడు. మౌనిక కేకలు వేయగా పొరుగున వారు వచ్చి ఆమెను కాపాడారు. దాడిలో మౌనిక మెడ తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్ పరారీలో ఉన్నాడు. సీఐ సుబ్బరాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమతీ శతకం సినీ ప్రమోషన్కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సుమతీ శతకం సినిమా ప్రమోషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. చిత్ర బృందం విద్యార్థులతో ఉత్సాహంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. చిత్ర హీరో అమరదీప్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా అన్నారు. నటీనటులు అనుభవాన్ని పంచుకున్నారు. మిట్స్ యూనివర్సిటీ ప్రో చాన్స్లర్ ఎన్. ద్వారకనాఽథ్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర నటులు నృత్యాలతో అలరించారు. సినిమాను ఆదరించాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికపులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.గీత జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైందని హెచ్ఎం రవిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్ర కాశం జిల్లా సింగరాయకొండలో గతనెలలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్–19 హ్యాండ్బాల్ పోటీల్లో గీత ప్రతిభ కనబరిచిందన్నారు. ఫిబ్ర వరి 1 నుంచి హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ
గాలివీడు : ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో కరువు పారదోలేందుకు జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వెలిగల్లు రిజర్వాయర్ ప్రాజెక్టు 2008లో రూపుదిద్దుకుంది. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తెప్పించి పంట పొలాలు పచ్చగా ఉండాలని, రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలని వైఎస్సార్ సంకల్పించారు. అప్పుడు రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత లక్ష్యాన్ని ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో హంద్రీ–నీవా పనులు పూర్తి చేశారు. తద్వారా నేడు కృష్ణా జలాలు వెలిగల్లు రిజర్వాయర్లోకి పరవళ్లు తొక్కుతున్నాయి. 100 క్యూసెక్కుల నీరు వెలిగల్లు ప్రాజెక్టులోకి రావడంతో 4.64 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు దాదాపు 80 వరకు 1.37 టీఎంసీల నీటితో నింపడం జరిగింది. ప్రస్తుతం వెలిగల్లు ప్రాజెక్టులో 3.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. రాయచోటి–గాలివీడు ప్రాంతాలకు శుద్ధి జలాలతో తాగునీటికి వరప్రసాదంగా మారింది. రైతుల్లో హర్షం వెలిగల్లు ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్త చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుకు చేసుకుంటూ పంట పొలాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంవత్సరానికి మూడు పంటలు వేరుశనగ, కూరగాయలు, వరి చేతికి అందుతుండటంతో.. వైఎస్సార్ను మరో మారు తలచుకుంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నారు. ఇప్పటికే కుడి కాలువ దాదాపు 7 నెలలు నీటితో పరవళ్లు తొక్కుతోంది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం తండ్రి, తనయుడి కృషి అప్పటి లక్కిరెడ్డిపల్లి, ప్రస్తుత రాయచోటి నియోజకవర్గాల అభివృద్ధి కోసం లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విశేషంగా కృషి చేశారు. వారు చేపట్టిన ప్రగతి పనులు, సంక్షేమాన్ని ప్రజలు మరవలేకపోతున్నారు. వారి హయాంలో పులివెందుల తర్వాత ఆయా నియోజకవర్గాలలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాయచోటి పట్టణానికి తాగునీటిని వెలిగల్లు ప్రాజెక్టు పంపింగ్ ద్వారా తీసుకువచ్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. ఆయా నియోజకవర్గాలలో తాగునీరు, రోడ్డు సౌకర్యం, పక్కా గృహాలు, సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, నాడు– నేడు విద్యాలయాలు, దేవాలయాలు ఇలా చెప్పుకొంటూ పోతే అంతు లేని విధంగా అభివృద్ధి చేశారు. నీటితో కళకళలాడుతున్న వెలిగల్లు ప్రాజెక్టు సాగులో ఉన్న పంట సాగు, తాగునీటికి వరప్రదాయిని వెలిగల్లు ప్రాజెక్టు వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం జగన్ హయాంలో కృష్ణా జలాలు రాక పచ్చగా కళకళలాడుతున్న పంటలు సంవత్సరానికి మూడు పంటలు రైతులకు అందుతున్నాయంటే అది రాజన్న పుణ్యమే. ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న రైతులు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి పుణ్యాన వెలిగల్లు నీటితో పంటలు పండించుకుంటున్నాము. – మోపురి సతీష్, యువ రైతు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని 14 ఎకరాల్లో పంటను సాగు చేశా. ఈ పంట సాగుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఎప్పుడూ వైఎస్సార్ను గుండెల్లో పెట్టుకుంటాం. నియోజకవర్గ ప్రజలందరం ఆయనకు రుణపడి ఉంటాం. – ఉప్పు బాలాజీ, యువ రైతు -
ద్విచక్ర వాహనదారుడికి గాయాలు
పుంగనూరు : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో వ్యక్తి గాయపడిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం సింగంవారిపల్లెకి చెందిన రెడ్డెప్ప(55) ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా పట్టణంలోని తాటిమాకులపాళెంలో ఎదురుగా మరో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రెడ్డెప్పకు తీవ్రగాయాలుకావడంతో స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైపులు ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే దౌర్జన్యం నిమ్మనపల్లె : పొలంలోకి పశువులు తోలి పంట నష్టం చేయడమే కాకుండా పైపులు ధ్వంసం చేయడంతో ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేసి కొట్టి బెదిరించారని తవళం పంచాయతీ ఎగువపల్లెకు చెందిన ఆదెన్న కుమారుడు భరత్కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... ఈ నెల 25న ఎగువపల్లెకు సమీపంలో భరత్కుమార్ తన భార్యతో కలిసి పొలం వద్ద పనులు చేసుకుంటుండగా, పక్క గ్రామమైన పారేసివారిపల్లెకు చెందిన నరసింహులు, మణికంఠకు చెందిన పశువులు పొలంలో ప్రవేశించి అల్లనేరేడు చెట్లు, పైపులు ధ్వంసం చేయగా, వాటిని బయటకు తోలారు. అంతలోనే మణి, నరసింహులు అక్కడకు రాగా పశువులను ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తే.. కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడి కొట్టారన్నారు. చంపేస్తామంటూ బెదిరించారన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. మాలమహానాడు నాయకులు మాణిక్యం, గుండామనోహర్, రమణ, సుధాకర్, దళిత నాయకులు మునిరత్న తదితరులు బాధితుడికి అండగా స్టేషన్కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. గ్రామకంఠం భూమి ఆక్రమణకు యత్నం మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిపల్లెలో గ్రామకంఠం భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. మంగళవారం బెంగళూరు రోడ్డు పప్పిరెడ్డిగారిపల్లె రామాలయం పక్కన ఓవర్హెడ్ ట్యాంక్ సమీపంలోని గ్రామకంఠం భూమిని కొందరు వ్యక్తులు జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్వో కల్యాణి, అక్కడకు చేరుకుని చదును చేస్తున్న వ్యక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సర్వేనెం.3/6లోని 0.79 సెంట్లు భూమి 22ఏ నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తూ రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఆ స్థలంలో ఓవర్హెడ్ ట్యాంక్ పైప్లైన్ ఉన్నందున, దాని పక్కన ప్రభుత్వ స్థలం అయిన సర్వే నెంబర్. 3/8లోని గ్రామకంఠం భూమిలోకి మార్చేందుకు భూమిని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై వీఆర్వో స్పందిస్తూ, ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా చదును చేయకూడదని, తక్షణమే పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. మండల తహసీల్దార్ను కలిసి అనుమతులు తీసుకోవాల్సిందిగా తెలిపారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు మదనపల్లె సిటీ : క్రీడల్లో రాణిస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం కాలేజీలో జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ జట్టు శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఎంపికై న విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. గెలుపోటములు సహజమని తెలియజేశారు. జట్టు ఈ నెల 29 నుంచి మైసూర్లోని జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ రాయుడు, స్పోర్ట్సు కౌన్సిల్ బోర్డు సభ్యులు సతీష్కుమార్, కోచ్లు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్ : పంజాబ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో యోగి వేమన విశ్వవిద్యాయానికి చెందిన నీలమ్ సోపిన్ అనే విద్యార్థి 60 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈయన స్నాచ్ విభాగంలో 1/2 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 125 కేజీలు మొత్తంగా 237 కేజీల బరువు ఎత్తి విశ్వవిద్యాలయానికి బంగారు పతకం సాధించాడు. ఇదే విద్యార్థి ఈస్ట్ సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కాంస్య పతాకాన్ని పొందారు. విశ్వవిద్యాలయం వారు హర్షం వ్యక్తం చేశారు.


