రైతులను వ్యాపారులు అవమానిస్తున్నారు
జేసీకి టమాటా రైతుల ఫిర్యాదు
గుర్రంకొండ: మార్కెట్యార్డులో టమాటా రైతులను వ్యాపారులు అవమానిస్తున్నారని జాయింట్కలెక్టర్ శివనారాయణకు రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ ముగ్గురు మండీల యజమానుల లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని మార్కెట్ కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే వ్యాపారులు హేళనగా మాట్లాడడంపై రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక మార్కెట్యార్డులో జాయింట్ కలెక్టర్ శివనారాయణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా వేలం పాటలు నిర్వహిస్తున్న టమాటా మండీలలో పరిస్థితిని గమనించారు. టమాటా క్రీట్లపై ఎత్తుగా టమాటాలు పోసి ఉండడాన్ని గమనించి ఇదేమిటని మండీల యజమానులను ప్రశ్నించారు. దీంతో రైతులు మండీలలో ఇదంతా మాములుగా జరిగే తంతు అని ఇలా వేయకపోతే వేలం పాటల్లో ఇష్టానుసారం కోతలు వేస్తారని రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే కొంతమంది మండీల యజమానులు రైతులను అవమానిస్తూ జాక్పాట్పై హేళనగా మాట్లాడడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. మీ సమక్షంలోనే తమను అవమానించడం ఎంత వరకు సబబని రైతులు జేసీని ప్రశ్నించారు. మార్కెట్యార్డులోని ఆన్నిమండీలలో జేసీ తనిఖీలు నిర్వహించారు. మండీల యజమానుల తీరు సరిగ్గాలేదని వెంటనే ముగ్గు రు మండీయజమానుల లైసెన్స్లు రద్దు చేయాలని జిల్లా మార్కెట్కమిటి ఏడీఏ త్యాగరాజుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక మార్కెట్యార్డు ఉపకార్యాలయంలో మండీల యజమానులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్యార్డులో ప్రభుత్వ నిబంధనల మేరకే మండీలు నిర్వహించుకోవాలన్నారు. కమీషన్ నాలుగుశాతం మాత్రమే తీసుకోవాలన్నారు. 25కేజీల క్రీట్ల బదులు 15కేజీల క్రీట్ల విధానం వెంటనే అమలు చేయాలన్నారు. జాక్పాట్లు తీసుకొంటే లైసెన్స్లు రద్దు చేసి చట్టపరంగా క్రిమినల్కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతుల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా మార్కెట్కమిటీ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మార్కెట్కమిటీ ఏడీఏ త్యాగరాజు, మార్కెట్కమిటీ కార్యదర్శి సునీల్, సూపర్వైజర్ నయిబ్ఆలీ,సిబ్బంది పాల్గొన్నారు.


