కమలాపురం: కమలాపురంలో పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రీ, హజరత్ దస్తగిర్ షా ఖాద్రీ, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రీ, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రీ ఖుద్దస సిర్రహుం వార్ల గంధోత్సవం ఘనంగా జరిగింది. దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో గంధోత్సవం వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన సందోహం తరలిరాగా.. గురువారం రాత్రి గంధోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. పీఠాధిపతి నివాసం నుంచి గంధం సామగ్రిని బస్టాండు సమీపంలోని గంధం ఇంటికి మేళతాళాలతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో గంధంను ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన డప్పు వాయిద్యాలు అలరించాయి. గంధోత్సవం ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా దర్గా చేరుకుంది. పీఠాధిపతి దర్గాలోని స్వామి వార్ల మజార్లపై పూల చాదర్ సమర్పించి గంధం ఎక్కించారు. అనంతరం భక్తులందరికీ గంధం పంచి పెట్టారు. గంధోత్సవం ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు గగుర్పొడిచాయి. తలలోకి పెద్ద ఇనుప కడ్డీని గుచ్చుకొని దానిపై టెంకాయలు పగులగొట్టి అబ్బుర పరిచారు. ఈ విన్యాసాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
అలరించిన ఖవ్వాలి ఫోటీ
కమలాపురం గఫార్ షా ఖాద్రీ ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ పోటీ అలరించింది. బెల్గాంకు చెందిన ప్రఖ్యాత ఖవ్వాల్ ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీకి చెందిన రాజా సర్ఫరాజ్ల మధ్య రాత్రంతా ఖవ్వాలీ పోటీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా ఉరుసు మహోత్సవాలకు తరలివచ్చారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం పొందారు. కాగా ఉరుసు మహోత్సవానికి వచ్చిన భక్తులకు మోహన్ బీడీ కంపెనీ యాజమాన్యం అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో దర్గా– ఏ– గఫారియా
గంధమహోత్సవం
నేడు ఉరుసు


