ఉపాధ్యాయుడి తీరుపై డీవైఈవో విచారణ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ తీరుపై మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి విచారణ చేశారు. తదుపరి చర్యల కోసం ఆయన డీఈవోకు నివేదిక పంపారు. కాగా ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జాకీర్ కొంత కాలంగా బయాలజీ సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం షీటీమ్ సభ్యులు స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్టచ్, బ్యాడ్టచ్లపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. దీంతో హైస్కూల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థినులు సదరు ఉపాధ్యాయుడి తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్మాస్టర్ రామచంద్ర జరిగిన సంఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను విచారణ చేశారు. విచారణ నివేదికను డీవైఈవో, డీఈవోకు అందజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్కు మదనపల్లె డీవైఈవో లోకేశ్వర్రెడ్డి వచ్చారు. ముందుగా ఎంఈవో సురేంద్రబాబుతో కలిసి హెడ్మాస్టర్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రవర్తన, తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులతో వేర్వేరుగా విచారించారు. ఓ ప్రత్యేక గదిలో విద్యార్థినులకు తెల్లకాగితాలు ఇచ్చి సదరు ఉపాధ్యాయుడి తీరుపై లిఖిత పూర్వకంగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. మరో గదిలో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెల్లకాగితాలు ఇచ్చి ఉపాధ్యాయుడి తీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఈ మొత్తం విచారణ నివేదికలను డీఈవోకు సమర్పిస్తామని డీవైఈవో పేర్కొన్నారు. జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ అధికారులు, మహి ళా పోలీసులు, మండల విద్యా శాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరపడం గమనార్హం.
పోక్సో కేసు నమోదు
మండలంలోని తరిగొండ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు జాకీర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుడు జాకీర్ పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తమకు శుక్రవారం ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
చర్యలకు డీఈవోకు నివేదిక


