కొండకు నిప్పు.. చారిత్రక సంపదకు ముప్పు
కాలిపోతున్న కొండ
కొండలో చెలరేగుతున్న మంటలు
గుర్రంకొండ : చారిత్రాత్మక గుర్రంకొండ కొండకు నిప్పు పెట్టడంతో.. చారిత్రక సంపదకు ముప్పు ఏర్పడింది. ఈ కొండలోనే చారిత్రాత్మక కట్టడాలతోపాటు పురాతన భవనాలు, కోటగోడలు ఉన్నాయి. సుమారు 500 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండుగులు కొండకు వెనుకవైపు నిప్పు అంటించారు. దీంతో కొండలో సగానికిపైగా కాలిబూడిదైంది. కొండ ముందు భాగంలో ఉన్న కోటగోడలు, కొండపై భాగం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో చెట్లు మొత్తం కాలిపోయాయి. మంటల్లో చిక్కుకొని అడవి జంతులు, పక్షులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొండ పరిసరాల్లో ఉన్న కొత్తపేట వీధి, పోలేరమ్మ వీధుల్లో దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. మంటలు అదుపు చేయడానికి పురావస్తు శాఖ సిబ్బంది, అధికారులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కనీసం అగ్నిమాపక వాహనమైనా వస్తుందేమోనని గ్రామస్తులు ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించారు. ఆయితే కొండలు, గుట్టల్లో చెలరేగే మంటలను తాము అదుపుచేయలేమని వారు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీలేక మంటలను అలాగే వదిలేశారు. దీంతో దాదాపు కొండ మొత్తం కాలిబూడిదయ్యింది. గత కొన్ని రోజులుగా దుండుగులు కావాలనే గుర్రంకొండ పట్టణం చుట్టూ ఉన్న కొండలకు నిప్పు అంటిస్తుండడంతో.. కొండలు, గుట్టల్లో ఉన్న వృక్ష, జంతు సంపద కాలిబూడిదవుతోంది.
కొండకు నిప్పు.. చారిత్రక సంపదకు ముప్పు


